ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు రెండవ గ్రంధము 5వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. అంతట యిస్రాయేలీయుల తెగలన్ని హెబ్రోనున దావీదు కడకు వచ్చి “మేమందరము నీ ఎముకనంటినవారము, రక్తసంబంధులము.

2. పూర్వము సౌలు పరిపాలించినపుడు యిస్రాయేలు సైన్యములను నడిపించిన వాడవునీవే. యావే 'నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యెదవు' అని నిన్ను గూర్చియే సెలవిచ్చెను” అనిరి.

3. పెద్దలందరు హెబ్రోనుకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసికొనెను. అంతట పెద్దలు అతనిని యిస్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి.

4. దావీదు రాజగునప్పటికి ముప్పదియేండ్లవాడు. అటు తరువాత నలువదియేండ్లు పరిపాలించెను.

5. అతడు హెబ్రోనున ఏడున్నరయేండ్లు యూదీయులను పాలించెను. యెరూషలేమున ముప్పది మూడేండ్లు యిస్రాయేలు యూదా వారలందరిమీద పాలించెను.

6. దావీదు బలగముతోపోయి యెరూషలేమును ముట్టడించి ఆ నగరము నేలుచున్న యెబూసీయుల  నెదుర్కొనెను. యెబూసీయులు దావీదును చూచి “నీవు ఈ నగరమును పట్టుకోజాలవు. కుంటివారును, గ్రుడ్డివారును పట్టణమును కాపాడగలరు” అనిరి. అనగా పురము అతని వశము కాదని వారి భావము.

7. అయినను దావీదు సియోను దుర్గమును పట్టు కొనెను. ఈ పురమునకే దావీదునగరమని పేరు.

8. ఆ రోజున దావీదు తన అనుచరులతో “సొరంగము గుండ పోయి యెబూసీయులను తునుమాడువారందరు నీటికాలువ పైకి వెళ్ళి దావీదునకు అసహ్యమైన గ్రుడ్డివారిని, కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను..” ఈ హేతువునుబట్టి గ్రుడ్డివారును, కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడు అను సామెత పుట్టెను.

9. దావీదు యెరూషలేము దుర్గమున వసింప మొదలిడెను. దానికి దావీదు నగరమని పేరిడెను. అతడు పురముచుట్టు ప్రాకారము కట్టించెను. అది మిల్లో అను చోటినుండి నగరము దిగువవరకు పోవును.

10. సైన్యములకు అధిపతి యగు యావే దావీదునకు చేదోడువాదోడుగా నుండెను గనుక అతడు నానాటికి పెంపుచెందెను.

11. తూరు రాజగు హీరాము దేవదారు కలపతో, వడ్రంగులతో, కాసెపనివాండ్రతో దావీదువద్దకు దూతలను పంపెను. వారు దావీదుకొక ప్రాసాదము నిర్మించిరి.

12. దావీదు యావే తనను యిస్రాయేలీయుల మీద రాజుగా పాదుకొల్పెననియు, ఆయన తన ప్రజల మేలుకొరకు రాజ్యమును వృద్ధిచేసెననియు గ్రహించెను.

13. హెబ్రోను వీడి యెరూషలేమున స్థిరపడిన పిదప దావీదు మరల భార్యలను, ఉంపుడుకత్తెలను స్వీకరించెను. అతనికి ఇంకను కుమారులు, కుమార్తెలు కలిగిరి.

14-16. యెరూషలేమున పుట్టిన బిడ్డలు వీరు: షమ్మా, షోబాబు, నాతాను, సొలోమోను, ఇభారు, ఎలీషువా, నేపెగు, యాఫీయా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫేలెటు.

17. దావీదు యిస్రాయేలీయులమీద రాజుగా అభిషిక్తుడయ్యెనని విని ఫిలిస్తీయులందరు ఒక్కపెట్టున ఎత్తివచ్చి అతనిమీదబడిరి. ఆ సంగతివిని దావీదు కొండదుర్గములోనికి చేరెను.

18. ఫిలిస్తీయులు వచ్చి రెఫాయీము లోయయంతట నిండిరి.

19. దావీదు యావేను సంప్రతించి “నేను వెడలిపోయి ఫిలిస్తీయులను ఎదుర్కొనవచ్చునా? నీవు వారిని నా వశము చేయుదువా?” అనెను. యావే “వెడలిపొమ్ము. నేను ఫిలిస్తీయులను తప్పక నీకప్పగించెదను” అని చెప్పెను.

20. అతడు బాలుపెరాసీము వద్ద ఫిలిస్తీయులను ఎదిరించి వారిని తుడిచినట్టుగ తునుమాడెను. ఏటి పొంగు నదిఒడ్డులనుకోసి కూల్చివేసినట్లే ప్రభువు శత్రువుల మీదబడి వారి సైన్యములను కూల్చివేసెనను కొని దావీదు ఆ చోటికి బాల్పెరాసీము' అని పేరు పెట్టెను.

21. ఫిలిస్తీయులు తొందరపాటువలన తమ గృహదేవతావిగ్రహములను అక్కడే వదలివేసిరి. దావీదు అతని అనుచరులు వానిని అటనుండి తీసి వేసిరి.

22. ఫిలిస్తీయులు మరల దావీదుపై దండెత్తి వచ్చి రెఫాయీము లోయ పొడుగున నిండిరి.

23. దావీదు యావేను సంప్రతింపగా ప్రభువు “ఈమారు ఫిలిస్తీయులనెదురుగా పోయి పోరాడవలదు. వెనుక వైపు నుండి వచ్చి కంబలిచెట్ల తోపు వద్ద వారిమీద పడుము.

24. కంబలిచెట్ల కొనలమీద అడుగుల చప్పుడు వినిపించినపుడు పోయి ఫిలిస్తీయులను తాకుము. శత్రువులను సంహరించుటకై ప్రభువే నీకు ముందుగా నడచుచున్నాడని గ్రహింపుము” అని చెప్పెను.

25. దావీదు యావే ఆజ్ఞాపించినట్లే చేసి శత్రువులను గెబా నుండి గేసేరువరకు తరిమికొట్టెను.