ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యూదితు 4వ అధ్యాయము || Telugu catholic bible online

1. యూదయాలో వసించు యిప్రాయేలీయులు, అస్సిరియా రాజు సైన్యాధిపతి హోలోఫెర్నెసు ఇతర జాతుల దేవళములను దోచి, వానిని నాశనము చేసెనని వినిరి.

2. కనుక వారు అతనికి వెరచిరి. అతడు యెరూషలేమునకును, అచటి దేవాలయమునకును ఏమి కీడుచేయునోయని మిగులభయపడిరి.

3. ఆ ప్రజలు కొద్దికాలము క్రితమే ప్రవాసమునుండి యూదయాకు తిరిగివచ్చిరి. శుద్ధిని కోల్పోయిన దేవళమును, అందలి బలిపీఠమును, పాత్రములను తిరుగశుద్ధిచేసియుండిరి.

4. కనుక వారు సమరియా, కోనా, బెత్ హోరోను, బెల్మయిను, యెరికో, కోబా, ఎసోరా, సాలెములోయ మొదలగు ప్రాంతములందెల్ల శత్రువు రాకను గూర్చి హెచ్చరికలు చేయించిరి.

5. ఆ ప్రాంతముల ప్రజలు వెంటనే కొండలమీది ప్రదేశములను ఆక్రమించుకొని అచటి నివాసములను సురక్షితము చేసిరి. యుద్ధము జరుగనున్నది కనుక భోజన పదార్ధములను సేకరించుకొనిరి. వారప్పుడే పొలములో నుండి పంటను ప్రోగు చేసికొని ఉండిరి.

6. ప్రధానయాజకుడు అయిన యోయాకీము యెరూషలేమున వసించుచుండెను. అతడు బెతూలియా, బెతోమెస్తాయిము అను నగరములకు లేఖలు పంపెను. ఈ రెండు పట్టణములును దోతాను మైదానమున కెదురుగా ఎస్ట్రలోను ప్రక్కనున్నవి.

7. అతడు ఆ నగరవాసులను శీఘ్రమే కొండలలోని కనుమలను ఆక్ర మించుకొనుడని చెప్పెను. ఆ కనుమల ద్వారాగాని యూదియా దేశములోనికి ప్రవేశములేదు. అవి యిరుకైనవి. ఒక్కొక్కసారి ఇద్దరిద్దరు మాత్రమే వానిగుండ ప్రయాణము చేయగలరు. కనుక ఆ కనుమలను ఆక్రమించుకొనినచో శత్రువుల రాకను సులభముగా అరికట్టవచ్చును.

8. ఆరీతిగా యెరూషలేములోని ప్రధాన యాజకుడు, అచట సభతీర్చిన పెద్దలు జారీచేసిన ఆజ్ఞను యిస్రాయేలీయులు పాటించిరి.

9. అపుడు యిస్రాయేలీయులు ఎల్లరు వినయముతోను, భక్తితోను దేవునికి ప్రార్థన చేసిరి.

10. యిస్రాయేలు పురుషులు, వారి భార్యాబిడ్డలు, వారి పశువులు వారిచెంత వసించు పరదేసులు, వారి బానిసలు, కూలీలు ఎల్లరును గోనెతాల్చిరి.

11-12. యెరూషలేమున వసించు పురుషులు, స్త్రీలు, పిల్లలెల్లరును దేవాలయము ముందట సాష్టాంగపడిరి. వారు తలమీద బూడిద చల్లుకొని ప్రభువు ఎదుట చేతులెత్తి ప్రార్ధించిరి. బలిపీఠమును గూడ గోనెతో కప్పిరి. ఎల్లరును కలిసి గాఢభక్తితో యిస్రాయేలు దేవునికి మొరపెట్టుకొనిరి. తమ బిడ్డలను చంపింపవలదనియు, తమ భార్యలను బందీలను గావింపవలదనియు, తరతరముల నాటి తమ నగరములను నాశనము చేయింప వలదనియు విన్నపము చేసిరి. తమ దేవళమును స్వాధీ నము చేసికొని, దానిని అమంగళపరచి, ఆనందించు అవకాశమును శత్రువులకు కల్పింపవలదని మనవి చేసిరి.

13. ప్రభువు వారి మొరాలించెను. అతడా ప్రజల దురవస్థను చూచి వారిని కరుణించెను. యూదయాలోని ప్రజలు యెరూషలేము పౌరులు చాలనాళ్ళ పాటు దేవాలయమునెదుట ఉపవాసము చేసిరి.

14. ప్రధానయాజకుడైన యోయాకీము ఇతర యాజకులు, దేవాలయమున పరిచారము చేయు వారందరు గోనెపట్ట కట్టుకొని దైనందిన దహనబలులు అర్పించిరి. ప్రజలు స్వేచ్ఛాబలులు వ్రతపూర్వకమైన బలులు అర్పించినపుడు కూడా వారు గోనె తాల్చిరి.

15. ఇంక వారు తమ తలపాగలపై బూడిద చల్లుకొని ప్రభువు తమ జాతిని కరుణింపవలెనని పూర్ణహృదయముతో విన్నపములు చేసిరి.