ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 4వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. సమూవేలు మాట యిస్రాయేలీయులందరికిని వెల్లడాయెను. ఆ రోజులలో ఫిలిస్తీయులు యిస్రాయేలీయులపై దాడివెడలి ఆఫెకువద్ద మోహరించియుండిరి. యిస్రాయేలీయులు కూడ వారిని ఎదుర్కొనుటకు ఎబెనెసెరు చెంత విడిదిచేసిరి.

2. ఫిలిస్తీయులు యుద్ధ సన్నద్దులై యిస్రాయేలీయులను ఎదుర్కొనిరి. యిస్రాయేలీయులు ఓడిపోగా వారి వీరులు ఇంచుమించు నాలుగు వేలమంది రణరంగమున ప్రాణములు కోల్పోయిరి.

3. యిస్రాయేలు సైన్యములు శిబిరము చేరగనే వారి పెద్దలు ప్రోగై “ఎందుకు యావే నేడు మనలను ఫిలిస్తీయులచే ఓడించెను. షిలో నుండి దైవమందసము తెప్పింతము. అదియే శత్రువుల బారినుండి మనలను కాపాడగలదు” అని ఆలోచన చేసిరి.

4. కావున సైనికులు షిలోకు మనుష్యులను పంపి సైన్యములకు అధిపతియై, కెరూబు దూతలకు ఎగువ నెలకొనియుండు యావే ప్రభుని మందసము తెప్పించిరి. ఏలీ కుమారులు హోఫ్ని, ఫీనెహాసులు కూడ మందసముతో వచ్చిరి.

5. యావే మందసము శిబిరము చేరగనే యిస్రాయేలీయులు నేల దద్దరిల్లి పోవునట్లు మహానాదము చేసిరి.

6. ఆ నాదమువిని ఫిలిస్తీయులు హెబ్రీయుల శిబిరము నుండి గావుకేకలు వినిపించుచున్నవి ఎందుకోయని విస్తుపోయిరి. యావే మందసము శిబిరము చేరినదని గ్రహించిరి.

7. అప్పుడు ఫిలిస్తీయులకు గుండె చెదరినది. వారు “హా! చచ్చితిమిగదా! దేవుడు వారి శిబిరమునకొచ్చెను. ఇంతవరకెన్నడు ఇట్టిది జరిగియుండలేదు.

8. మహాశక్తిమంతుడైన ఈ దేవుని బారినుండి మనలనెవ్వడు కాపాడగలడు? ఐగుప్తు ప్రజలను మహాఉపద్రవములతో మట్టుపెట్టినది ఈ దేవుడే గదా? హా! చెడితిమి.. చెడితిమి!

9. అయినను ఫిలిస్తీయులారా! ధైర్యమువహింపుడు. మగవారివలె నిలువుడు. లేదేని ఈ హెబ్రీయులు మనకు దాసులైనట్లే మనము వీరికి దాసులమయ్యెదము. కావున మగవారి వలె నిలిచి పోరాడుడు” అనిరి.

10. ఇట్లనుచు ఫిలిస్తీయులు యుద్దమారంభించిరి. యిస్రాయేలీయులు ఓడిపోయి ఎవరి గుడారములకు వారు పారిపోయిరి. ఫిలిస్తీయులు యిస్రాయేలీయులను తునుమాడి ముప్పదివేలమంది కాలిబంటులను కూల్చిరి.

11. పైగా దైవమందసమును పట్టుకొనిరి. ఏలీ కుమారులైన హోప్ని, ఫీనెహాసులను చంపిరి.

12. ఆ దినముననే బెన్యామీను తెగవాడు ఒకడు యుద్ధభూమి నుండి షిలోకు పరిగెత్తుకొని వచ్చెను. అతడు బట్టలుచించుకొని తలపై దుమ్ము పోసికొనెను.

13. అతడు వచ్చునప్పటికి ఏలీ బాటప్రక్క పీటముపై కూర్చుండి యుద్ధవార్తలకై ఎదురుచూచుచుండెను. దైవమందసము ఏమగునోయని అతని హృదయము దడదడ కొట్టు కొనుచుండెను. ఆ వచ్చినవాడు వార్తలెరిగింపగనే పురజనులందరు పెడబొబ్బలు పెట్టిరి.

14. ఏలీ ఆ కేకలు విని “ఈ అంగలార్పులేమి” అని ప్రశ్నించెను.

15. ఏలీ తొంబది ఎనిమిదేండ్ల వయసువాడు. కన్నులకు మసకలు క్రమ్ముటచే చూపు ఆనదయ్యెను.

16. ఆ వార్తాహరుడు ఏలీని సమీపించి “శిబిరము నుండి వచ్చినవాడను నేనే. నేనే మన సైన్యము నుండి పరుగెత్తుకొనివచ్చితిని” అనెను. ఏలీ “నాయనా అచ్చటి వార్తలేమి” అని అడిగెను.

17. అతడు “యిస్రాయేలీయులు ఫిలిస్తీయుల ముందు నిలువలేక పారిపోయిరి. ఫిలిస్తీయులు మన సైనికులను చాలమందిని చంపిరి. నీ ఇరువురు కుమారులైన హోఫ్ని, ఫీనెహాసులును మరణించిరి. వారు దేవుని మందసమును కూడ పట్టుకొనిరి” అని చెప్పెను.

18. దైవమందసము పట్టువడినదని వినగనే ఏలీ ఆసనము మీదినుండి వెనుకకు వెల్లికిలపడి మెడవిరిగి చనిపోయెను. ఏలయనగ అతడు వృద్ధుడై బహుస్థూలకాయుడై యుండెను. ఏలీ నలుబదియేండ్ల కాలము యిస్రాయేలీయులకు తీర్పుతీర్చెను.

19. ఏలీ కోడలు ఫీనెహాసు భార్య నిండు చూలాలు. ఆమెకు ప్రసవ దినములు సమీపించియుండెను. దైవమందసము పట్టువడినదనియు, మామ, మగడు చనిపోయిరనియు వినగానే ఆమెకు నొప్పులు వచ్చెను. ఉన్నది ఉన్నట్లుగనే నేలమీదికి వంగి మోకాళ్ళూని బిడ్డను కనెను.

20. ఆమె చనిపోవు చుండగా చుట్టు గుమికూడియున్న స్త్రీలు “భయపడకుము, నీవు మగబిడ్డనే కంటివి” అనిరి. కాని ఆమె వారి మాటలు వినిపించుకోలేదు.

21. ఏలీ కోడలు మందసము పట్టుపడినదనియు మామ, మగడు చనిపోయిరనియు చింతించి, ఇక దేవుని మహిమ యిస్రాయేలీయులను విడిచిపోయినదని తన కుమారునకు ఈకాబోద్' అని పేరు పెట్టెను.

22. మందసము శత్రువుల చేతబడినది కనుక దేవుని మహిమ యిస్రాయేలీయుల నుండి వెడలిపోయెనని పలికెను.