ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 30వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. దావీదు అనుచరులతో మూడునాళ్ళు పయనము చేసి సిక్లాగు చేరునప్పటికి అమాలేకీయులు దక్షిణదేశమునందలి గ్రామసీమపై దాడిసల్పి సిక్లాగును ముట్టడించి కాల్చివేసిరి.

2. అచ్చటి స్త్రీలందరిని చెరగొనిపోయిరి. కాని ఎవరిని చంపలేదు.

3. దావీదు అనుచరులతో నగరము చేరునప్పటికి అది కాలి బుగ్గియై యుండెను. శత్రువులు వారి భార్యలను, కుమార్తెలను, కొడుకులను చెరపట్టిరి.

4. కనుక దావీదు, అతని అనుచరులు శోకముపట్టలేక పెద్దపెట్టున ఏడ్చిరి. ఓపిక ఉన్నంతవరకు విలపించిరి.

5. దావీదు భార్యలిద్దరు, అనగా యెస్రెయేలు నుండి వచ్చిన అహీనోవము, కర్మేలు నుండి వచ్చిన నాబాలు భార్యయైన అబీగాయీలు బందీలైరి.

6. దావీదు చాలబాధపడెను. కుమార్తెలను, కొడుకులను కోల్పోవుటచే జనులు మిక్కిలి కోపము తెచ్చుకొని దావీదును రాళ్ళురువ్వి చంపజూచిరి. కాని దావీదు తాను కొలుచు యావేవలన ధైర్యము తెచ్చు కొనెను.

7. అతడు అహీమెలెకు కుమారుడును యాజకుడైన అబ్యాతారును చూచి యావేచిత్తము తెలియజేయు ఎఫోదును తెమ్మనగా అతడు దానిని తెచ్చెను.

8. దావీదు "నన్నీదండును వెన్నాడమందువా? నేను వారిని పట్టుకోగలనా?” అని యావే నడిగెను. ప్రభువు “వెన్నాడుము. నీవు వారిని పట్టుకొని నీ జనులనందరను విడిపింతువు” అని సెలవిచ్చెను.

9. కనుక దావీదు తన చెంతనున్న ఆరువందల మందితో బయలుదేరి బేసోరులోయ చేరెను.

10. వారిలో రెండువందల మంది మిక్కిలి అలసి లోయ దాటలేక అక్కడనే ఉండిపోయిరి. మిగిలిన నాలుగు వందల మందితో దావీదు శత్రువులను వెదకబోయెను.

11. దావీదు అనుచరులు పొలమున ఒక ఐగుప్తీయుని కనుగొని తమ యజమాని వద్దకు కొని వచ్చిరి. అతనికి అన్నపానీయములను ఇచ్చిరి.

12. అత్తిపండ్ల కుడుములను, రెండు ఎండుద్రాక్షపండ్ల గుత్తులను వాని ముందు పెట్టిరి. ఐగుప్తీయుడు వానిని తిని తేరు కొనెను. అతడు మూడునాళ్ళనుండి తిండి తినలేదు. గ్రుక్కెడు నీళ్ళయిన త్రాగలేదు.

13. దావీదు వానిని “నీవెవరి సేవకుడవు? ఎక్కడనుండి వచ్చుచున్నావు?” అని అడిగెను. వాడు “నేను ఐగుప్తీయుడను. అమాలెకీయ యజమానునకు ఒకనికి ఊడిగము చేయుచుండువాడను. నేను త్రోవలో జబ్బు పడగా యాజమానుడు మూడునాళ్ళక్రితము నన్నిట వదలి వేసెను.

14. మేము కెరెతీయుల దక్షిణ దేశమునకును, యూదీయుల దేశమునకును, కాలేబీయుల దక్షిణ దేశమునకును వచ్చి పల్లెపట్టులను దోచుకొని సిక్లాగును కాల్చి బూడిదపాలు చేసితిమి” అని చెప్పెను.

15. దావీదు అతనితో “నన్ను నీ దోపిడిగాండ్రయొద్దకు గొనిపోయెదవా?” అని అడిగెను. వాడు “నన్ను చంపవేని, నా యజమానికి అప్పగింపనని దేవుని పేర ఒట్టు పెట్టుకొందువేని నిన్ను వారి చెంతకు కొనిపోయెదను” అనెను.

16. వాడు దావీదును దోపిడిగాండ్ర వద్దకు కొనిపోయెను. వారు యూదా నుండి, ఫిలిస్తీయా దేశమునుండి దోచుకొని వచ్చిన సొమ్మును చూచుకొని సంతోషము పట్టజాలక తినుచు, త్రాగుచు తందనా లాడుచు విడివిడిగా చెదరియుండిరి.

17. దావీదు ఉదయమునుండి సాయంకాలము వరకును, సాయంకాలమునుండి మరునాటి ఉదయము వరకును శత్రువులను హతమార్చెను. వారిలో నాలుగు వందల మంది మాత్రము ఒంటెలనెక్కి పారిపోయిరి. మిగిలిన వారెవ్వరును తప్పించుకోలేదు.

18. అతడు అమాలెకీయులు చెరగొనిపోయినవారిని విడిపించెను. తన భార్యలను కూడ విడిపించుకొనెను.

19. పెద్దవారు గాని, చిన్నవారు గాని, కొడుకులుగాని, కుమార్తెలుగాని ఎవరును తప్పిపోలేదు. కొల్లసొమ్ముగాని, శత్రువులు సొంతము చేసికొనిన సొమ్ముగాని ఏమియు తప్పిపోకుండ దావీదు అంతయు ప్రోగుచేసికొని వచ్చెను.

20. దావీదు జనులు గొఱ్ఱెలమందలను, గొడ్లమందలను విడిపించుకొని, అతనికి ముందుగా నడిపించుకొని వచ్చిరి. “ఇది దావీదుకొల్లసొమ్ము" అని కేకలిడిరి.

21. దావీదును అలసటచే అనుసరింపలేని వారు రెండువందలమంది బేసోరు లోయవద్ద నిలిచియుండిరికదా! దావీదు తిరిగివచ్చి వారిని కలిసికొనెను. వారు దావీదును అతని పరివారమును చూచి ఎదురువోయిరి. దావీదు వారిని కుశలమడిగెను.

22. కాని దావీదు పరివారమునందలి దుర్మార్గులు మాత్రము “వీరు మనతో రాలేదు. కనుక మనము కొనివచ్చిన దోపిడి సొమ్ములో వీరికి భాగమీయరాదు. వలయునేని వారు తమతమ భార్యలను పిల్లలను తీసికొని వెళ్ళిపోవచ్చును” అనిరి.

23. దావీదు వారితో “సోదరులారా! ప్రభువు మనలను కాపాడెను. పట్టణము మీదబడిన దోపిడిగాండ్రను మనచేతికి అప్పగించెను. ఇంత సొమ్మును మన వశము చేసెను.

24. ఇపుడా సొమ్ములో వీరికి భాగము లేదనరాదు. మీరు చెప్పిన మాటలు ఎవరొప్పుకొందురు? 'యుద్ధమునకు పోయిన వారికి ఎంతో, సామానులకు కావలి కాచిన వారికిని అంతే' అందరును సమముగనే పంచుకోవలయును” అనెను.

25. నాడు దావీదు ఈ నియమము చేసెను. నేటికిని యిస్రాయేలీయులలో ఈ నియమము చలామణి అగుచునే యున్నది.

26. దావీదు సిక్లాగు చేరిన పిమ్మట దోపిడి సొమ్ములో కొంతపాలు యూదాదేశపు పెద్దలకును, తన స్నేహితులకును పంపించెను.

27. “మేము ప్రభువు శత్రువులనుండి కొనివచ్చిన సొమ్మునుండి మీకు కానుకలు పంపుచున్నాము” అని చెప్పించెను.

28-31. బేతేలు నేగేబులోని రామోతు, యాతీరు, అరోయేరు, సిప్మోతు యెష్టమోవా, రాకాలు యెరాహ్మెయేలు పట్టణములకు, కేనీయ పట్టణములకు, హోర్మా, కోరోషాను, అతాక, హెబ్రోను మొదలైన పట్టణములకు, తాను తన అనుచరులు వసించిన నగరములకు దావీదు కానుకలు పంపించెను.