ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య మొదటి గ్రంధము 29వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. దావీదు ప్రజాసమూహముతో "ప్రభువు నా కుమారుడు సొలోమోనును ఎన్నుకొనెను. కాని అతడు ఇంకను పసివాడు. అనుభవము లేనివాడు. చేయవలసిన కార్యము చాల గొప్పది. ఇది నరుల కొరకుకాదు, ప్రభువు నివాసముకొరకు నిర్మింపవలసిన మందిరము.

2. నా శక్తి కొలది నేను ముందుగనే వస్తువులు సేకరించి ఉంచితిని.

3. వెండి బంగారములు, ఇత్తడి, ఇనుము, కొయ్య, పలువిధముల రత్నములు, చలువరాయి ప్రోగుచేసి ఉంచితిని. ఇవి మాత్రమేకాక దేవాలయముపట్ల గల మక్కువచేత నా సొంత ఆస్తినుండి, వెండి బంగారములర్పించితిని.

4-5. గోడలకు పూతపూయించుటకును' అయా కళాకారులచే వివిధ వస్తువులను తయారు చేయించుటకును నేను ఆరువేల మణుగుల ఓఫిరు బంగారమును కానుకగా ఇచ్చితిని. ఆయా వెండి పనికి పదునాలుగు వేల మణుగుల వెండిని కూడ సమర్పించితిని. ఇప్పుడు మీలో ప్రభువునకు మనఃపూర్వకముగా కానుకలిచ్చుటకు సిద్ధముగానున్న వారెవ్వరు?” అనెను.

6-7. అపుడు కుటుంబాధిపతులు, ఆయా తెగల నాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, సైన్యాధిపతులు, రాజు ఆస్తిపాస్తులను పరామర్శించువారు దేవాలయ నిర్మాణమునకు ఐదువేల మణుగుల బంగారమును, పదివేల బంగారు నాణెములను, ఇరువదివేల మణుగుల వెండిని, ముప్పది ఆరువేల మణుగుల ఇత్తడిని, రెండు లక్షల మణుగుల ఇనుమును హృదయ పూర్వకముగ సమర్పించిరి.

6-7. అపుడు కుటుంబాధిపతులు, ఆయా తెగల నాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, సైన్యాధిపతులు, రాజు ఆస్తిపాస్తులను పరామర్శించువారు దేవాలయ నిర్మాణమునకు ఐదువేల మణుగుల బంగారమును, పదివేల బంగారు నాణెములను, ఇరువదివేల మణుగుల వెండిని, ముప్పది ఆరువేల మణుగుల ఇత్తడిని, రెండు లక్షల మణుగుల ఇనుమును హృదయ పూర్వకముగ సమర్పించిరి.

8. ఈ సొత్తునంతటిని, అచట ప్రోగైన రత్నములను కలిపి దేవాలయపు ఖజానాలో ముట్టజెప్పిరి. గెర్షోనీయుడైన యెహీయేలు ఈ సొత్తునకు అధికారిగా ఉండెను.

9. ప్రజలు ఈ బహుమతులనెల్ల మనఃపూర్వకముగా సమర్పించిరి. అందుకు ఎల్లరును సంతోషించిరి. దావీదురాజుకూడ మిగుల సంతసించెను.

10. దావీదు ప్రజలందరియెదుట ప్రభువును స్తుతించుచు ఇట్లనెను: “మా పితరుడు యిస్రాయేలుని దేవుడవైన ప్రభూ! నీకు కీర్తి కలుగునుగాక!

11. నీవు ఘనుడవు, శక్తిమంతుడవు, మహిమాన్వితుడవు, తేజస్వివి, ప్రాభవో పేతుడవు. భూమ్యాకాశము లందున్న వస్తుకోటి అంతయు నీదే. నీవు సార్వభౌముడవు. అన్నిటి మీదను సర్వాధికారివి.

12. నరులందరికిని సిరిసంపదలను, గౌరవములను దయ చేయువాడవు నీవే. బలసామర్థ్యములతో నీవు సర్వమును పరిపాలింతువు. ఎల్లరికిని ఘనతను, బలమును ప్రసాదించునదిగూడ నీవే.

13. ప్రభూ! ఇప్పుడు మేము నిన్ను స్తుతించుచున్నాము. మహిమాన్వితమైన నీ నామమును కీర్తించుచున్నాము.

14. నీకు ఉదారబుద్ధితో కానుకలు అర్పించుటకు నేనుగాని, నా ప్రజలుగాని ఏపాటివారము? అన్నియు నీవు ఇచ్చినవేకావా? నీవు మాకు దయచేసిన వానినే మేము నీకు తిరిగి సమర్పించుచున్నాము.

15. మేము కేవలము పరదేశులవలె, అతిథులవలె ఈ జీవితమును కొనసాగించువారలము. మా పితరులు కూడ అట్లే చేసిరి. మా జీవితము నీడవలె క్షణికమైనది. మేము మృత్యువును తప్పించుకోజాలము.

16. ప్రభూ! నీకు దేవళమును కట్టించి, నీ దివ్యనామమును కీర్తించుటకు నేను ఈ సొత్తు నంతటిని ప్రోగుచేసితిని. కాని ఈ సంపదయంతయు నీయొద్దనుండి వచ్చినదే, నీదే.

17. ప్రభూ! నీవు నరుల హృదయములను పరిశీలించువాడవని నేను ఎరుగుదును. చిత్తశుద్ధిగల నరుడు నీకు ప్రియుడగును. చిత్తశుద్ధితోనే నేను ఈ కానుకలన్నిటిని ఇష్టపూర్తిగా నీకు సమర్పించితిని. ఇచట ప్రోగైన ఈ ప్రజలు ఈ బహుమతులన్నిటిని మనఃపూర్వకముగా అర్పించుట చూచి నేనెంతయో సంతసించుచున్నాను.

18. మా పితరులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులు కొలచినదేవా! ఈ ప్రజల హృదయములలో ఈ 'భక్తి భావము కలకాలము నిలచియుండునట్లు చేయుము. వారి హృదయములెల్లపుడు నీపై లగ్నమై ఉండునట్లు చేయుము.

19. నా కుమారుడు సొలోమోను పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించునట్లును, నీకు దేవళమును నిర్మించునట్లును తోడ్పడుము. దానికొరకే నేను ఈ సన్నాహములన్నింటిని చేసితిని.”

20. అంతట దావీదు ప్రజలతో “ఇక మీ ప్రభువును స్తుతింపుడు” అనెను. వెంటనే జనులెల్లరు తమ పితరుల దేవుడైన ప్రభువును కీర్తించిరి. శిరస్సు నేలపై మోపి ప్రభువును స్తుతించిరి. రాజును కూడ గౌరవించిరి.

21. ఆ మరుసటినాడు యిస్రాయేలీయులు వేయికోడెలను, వేయిపొట్టేళ్ళను, వేయి గొఱ్ఱె పిల్లలను వధించి ప్రభువునకు బలులు, దహనబలులు అర్పించిరి, పానీయార్పణములు సమర్పించిరి. ప్రజల తరపున ఎన్నియో బలులర్పించిరి.

22. ఎల్లరు ప్రభువు సమక్షమున భోజనముచేసి, పానీయములు సేవించి పరమానందమునొందిరి. వారు రెండవ మారు సొలోమోనును రాజుగా ప్రకటించిరి. దేవుని పేర అతనిని రాజుగాను, సాదోకుని యాజకునిగాను అభిషేకించిరి.

23. దావీదునకు బదులుగా సొలోమోను ప్రభువు సిద్ధముచేయించిన సింహాసనమును అధి స్థించెను. అతడు నానాటికి వర్ధిల్లుచుండెను. యిస్రాయేలీయులెల్లరు అతని ఆజ్ఞలను పాటించిరి.

24. రాజోద్యోగులు, వీరులు, దావీదు. ఇతర కుమారులు కూడ సొలోమోను రాజునకు నమ్మినబంటులమై ఉందుమని ప్రమాణముచేసిరి.

25. ప్రభువు యిస్రాయేలీయులు ఎల్లరు సొలోమోను వైభవము చూచి ఆశ్చర్యపడునట్లు చేసెను. అతనికి ముందుగా యిస్రాయేలీయులను ఏలిన ఏ రాజునకైనను కలుగని రాజ్యప్రభావమును అతనికి అనుగ్రహించెను.

26. యిషాయి కుమారుడైన దావీదు యిస్రాయేలీయులు అందరికి రాజుగానుండెను.

27. అతడు నలువదియేండ్లు పరిపాలించెను. హెబ్రోనున ఏడేండ్లు, యెరూషలేమున ముప్పది మూడేండ్లు రాజ్యము చేసెను.

28. అతడు సిరిసంపదలతో తులతూగి గౌరవాదరములకు పాత్రుడై పండువంటి నిండు ప్రాయమున మరణించెను. అతని తరువాత అతని తనయుడు సొలోమోను రాజయ్యెను.

29. దావీదు చరిత్ర మొదటినుండి తుదివరకు దీర్ఘదర్శియైన సమూవేలు, ప్రవక్తయగు నాతాను, దార్శనికుడైన గాదు వారల మాటలయందు లిఖింపబడియే ఉండెను.

30. దావీదు పరిపాలనము, అతని శక్తి సామర్థ్య ములు, అతనికి, యిస్రాయేలీయులకు, ఇరుగు పొరుగు రాజ్యములకు సంభవించిన సంఘటనలను పై చరిత్రలు వర్ణించుచునే ఉన్నవి.