ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 29వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. ఫిలిస్తీయులు ఆఫెకు వద్ద మోహరించి యుండిరి. యిస్రాయేలీయులు యెస్రెయేలు నీటిబుగ్గ దగ్గర సైన్యమును చేర్చిరి.

2. ఫిలిస్తీయ దొరలు నూరు మందితో, వేయిమందితో వ్యూహపరిచి వచ్చియుండగా, దావీదును, అతని బలగమును ఆకీషుతో కలిసి అందరికంటె వెనుకవచ్చిరి.

3. దొరలు దావీదు పరివారమును చూచి ఈ హెబ్రీయులు ఇచట ఏమి చేయుచున్నారు అని అడిగిరి. ఆకీషు “ఇతడు యిస్రాయేలు రాజగు సౌలు సేవకుడైన దావీదు. ఏడాదికి పైగా నా కొలువున ఉన్నాడు. నా పంచ చేరినప్పటినుండి నేటివరకు ఇతనియందు దోషమేమియు చూపట్టదు” అని చెప్పెను.

4. కాని ఫిలిస్తీయ దొరలు ఆకీషు పై ఆగ్రహించి “వీనిని వెంటనే పంపివేయుము. ముందుగా నీవు చెప్పిన తావునకు వెడలిపోనిమ్ము. దావీదు మనతో రాతగదు. పోరాటము ఆరంభమైన పిదప ఇతడు మనపై తిరుగబడును. తన యజమానుని అనుగ్రహము వడయుటకై వీడు మనవారి తలలు తెగ నరకకుండునా?

5. ఈ దావీదును గూర్చియేకదా నాడు స్త్రీలు నాట్యమాడుచు- సౌలు వేయిమందిని సంహరించెను, కాని దావీదు పదివేలమందిని సంహరించెను అని గానము చేసినది?” అని అనిరి.

6. ఆకీషు దావీదుతో “సజీవుడైన యావే తోడు! నా కొలువున చేరినప్పటినుండి నేటివరకును నీయందు నేరమేమియు కనబడలేదు. నీవు ఉత్తముడవు కనుక దండున నాతోనుండుట మేలు. అయినను ఈ దొరలకు నీవనిన గిట్టదు.

7. నీవిక నిశ్చింతతో వెడలిపొమ్ము. వీరిని చిఱ్ఱుబుఱ్ఱులాడింపనేల?” అనెను.

8. కాని దావీదు ఆకీషుతో “నేను ఏ దుష్కార్యము చేసితిని? నీ కొలువున చేరిన నాటినుండి నేటివరకు నా వలన దోషమేమైన దొరలినదా? నేను యుద్ధమున నా దొర కొమ్ముకాచుకొని శత్రువులతో పోరాడవలదా?” అని అడిగెను.

9. ఆకీషు అతనితో “నా కంటికి నీవు దేవదూతవలె నిర్దోషివి. అయినను అధికారులు నిన్ను యుద్ధమునకు రానీయమనిరి.

10. కావున నీవు, నీ యజమానుని సేవకులు వేకువనే లేచి నేను చెప్పిన తావునకు వెడలిపొండు. నా కంటికి నీవు మంచివాడవే. నీవు మరొకలాగున భావింపవలదు. వేకువనే లేచి వెలుతురు చూపట్టగనే ఇంటికి వెడలిపొమ్ము " అని ఆజ్ఞ ఇచ్చెను.

11. కనుక దావీదు, అతని అనుచరులు ప్రాతఃకాలముననే లేచి తెల్లవారక మునుపే ఫిలిస్తీయ దేశమునకు మరలిపోవ ప్రయాణమైరి. ఫిలిస్తీయుల దండు యెస్రెయేలునకు పయనమై పోయెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services