ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 28వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. ఆ రోజులలో ఫిలిస్తీయులు యిస్రాయేలీయులతో పోరాడుటకై సైన్యమును సమకూర్చుకొనిరి. ఆకీషు దావీదుతో “నీవు నీ అనుచరులు నా పక్షమున పోరాడవలయును సుమా!” అనెను.

2. దావీదు అతనితో “దానికేమి, నీ సేవకుడు ఏమిచేయునో నీవే చూడగలవు” అని బదులుపలికెను. ఆకీషు “ఇకమీద నిన్ను నా అంగరక్షకునిగా నియమించితిని” అని చెప్పెను.

3. సమూవేలు అప్పటికే దివంగతుడయ్యెను. యిస్రాయేలీయులందరు అతనికొరకు శోకించి, అతని మృతదేహమును అతని నివాసనగరమగు రామా యందే పూడ్చిపెట్టిరి. అప్పటికే సౌలు భూతములను, చనిపోయినవారిని ఆవాహకము చేయు మాంత్రికుల నందరిని దేశమునుండి వెడలగొట్టించెను.

4. ఫిలిస్తీయులు దండులు సమకూర్చుకొని షూనేము నొద్దదిగిరి. సౌలు యిస్రాయేలీయులను ప్రోగుచేసికొని గిల్బోవవద్ద వ్యూహము పన్నెను.

5. సౌలు ఫిలిస్తీయుల దళమునుచూచి మిక్కిలి భయపడెను. అతని గుండె దడదడ కొట్టుకొనెను.

6. అతడు యావేను సంప్రదించెనుగాని స్వప్నములోగాని, ఉరీము వలనగాని, ప్రవక్తద్వారా గాని ప్రభువు ఏమియు సెలవియ్యకుండెను.

7. సౌలు పరిజనముతో “చనిపోయిన వారిని ఆవాహకము చేయు మాంత్రికురాలిని ఒకతెను వెదకుడు. నేనామెతో సంప్రదించి చూచెదను” అనెను. వారు “ఎండోరు వద్ద మాంత్రికురాలు ఒకతె కలదు” అని చెప్పిరి.

8. సౌలు బట్టలుమార్చుకొని మారు వేషము వేసికొని ఇద్దరు సేవకులను వెంట గొని రాత్రి వేళ మాంత్రికురాలియొద్దకు వెళ్ళెను. ఆమెతో “మృతులను రప్పించి నాకు సోదె చెప్పింపుము. మృత లోకము నుండి నేను పేర్కొనిన వ్యక్తిని రప్పింపుము” అనెను.

9. ఆమె అతనితో “సౌలు భూతములను చనిపోయిన వారిని రప్పించు మాంత్రికులను అడపొడ గానరాకుండ చేసెను గదా! నీవు నా ప్రాణము తీయుటకేల వలపన్నెదవు?” అనెను.

10. సౌలు “సజీవుడైన యావే తోడు! సోదె చెప్పించిన నీకు ముప్పు వాటిల్లదు” అని ఒట్టు పెట్టుకొనెను.

11. ఆమె పాతాళమునుండి ఎవరిని రప్పింపమందువని అడుగగా, సౌలు సమూవేలును పిలిపింపుమనెను.

12. మాంత్రికురాలు సమూవేలు లేచివచ్చుట చూచి భయపడి కెవ్వున కేకవేసెను. ఆమె సౌలువైపు మరలి “నిక్క ముగా నీవు సౌలువే. నన్నేల ఇట్లు వంచించితివి?” అని అడిగెను.

13. సౌలు మాంత్రికురాలిని భయపడవలదని హెచ్చరించి “నీకెవ్వరు కనబడిరి” అని ప్రశ్నించెను. ఆమె “భూమిలోనుండి దైవములలో ఒకడు లేచి వచ్చుచున్నాడు” అని చెప్పెను.

14. సౌలు, అతని ఆకారమెట్లున్నదో చెప్పుమనగా మాంత్రికురాలు “దుప్పటి కప్పుకొనిన ముసలివదెవడో లేచి వచ్చు చున్నాడు” అనెను. సౌలు వెంటనే సమూవేలు లేచి వచ్చుచున్నాడని గ్రహించి నేలపై సాగిలపడి దండము పెట్టెను.

15. సమూవేలు సౌలుతో “నీవు నన్ను కుదురుగా కూర్చుండనీయక ఇటకేల రప్పించితివి?” అనెను. సౌలు “నేను ఆపదలో చిక్కుకొంటిని. ఫిలిస్తీయులు నాపై యుద్ధమునకు వచ్చిరి. ప్రభువు నన్ను త్రోసి వేసెను. ప్రవక్త ద్వారాగాని, స్వప్నమూలమునగాని నాతో మాట్లాడడయ్యెను. ఇక నేనేమి చేయవలెనో తెలియుటలేదు. దిక్కుతోచక నిన్ను రప్పించితిని” అని చెప్పెను.

16. అందులకు సమూవేలు “యావే నిన్ను విడనాడి, నీకు శత్రువుకాగా ఇక నన్ను సంప్రదించి ప్రయోజనమేమి?

17. యావే నాతో ముందు సెలవిచ్చినట్లే చేసెను. ప్రభువు రాజ్యమును నీ వశము నుండి తొలగించి నీ పొరుగువాడైన దావీదునకు ఇచ్చి వేసెను.

18. నీవు యావేమాట పాటింపవైతివి. ప్రభువు కోపముతో అమాలెకీయులను రూపుమాపుమని చెప్పిన మాటను చెవిన దూరనీయవైతివి. కనుకనే యావే నిన్ను వీడెను.

19. ఇంకను వినుము! ప్రభువు నిన్నును, యిస్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును, నీ తనయులును నాతో ఉందురు. అవును, ప్రభువు యిస్రాయేలు సైన్యములను తప్పక ఫిలిస్తీయుల వశముచేయును” అని నుడివెను.

20. సౌలు సమూవేలు మాటలకు వెరచి నిలువున నేలపై కూలెను. నాటి పగలుగాని, రేయిగాని ఎంగిలి పడకుండుటచే అతనికి సత్తువ తగ్గిపోయినది.

21. అపుడు మాంత్రికురాలు సౌలు వద్దకు వచ్చి అతని భయమును గుర్తించి “నేను ప్రాణములు గుప్పిట బట్టుకొని నీ మాట పాటించితిని.

22. ఆ రీతినే నీవును నా మాట పాటింపవలెను. ఇంత ఆహారము కొనివచ్చెదను, తిని సత్తువనొంది నీ త్రోవన నీవు వెడలి పొమ్ము ” అనెను. 

23. సౌలు మొదట అంగీకరింపలేదు. ఆహారము తిననని పట్టుపట్టెను. కాని సేవకులు, మాంత్రికురాలు బతిమాలుటచే చివరకు నేలపై నుండి లేచి మంచముమీద కూర్చుండెను.

24. మాంత్రికురాలి ఇంట క్రొవ్విన దూడకలదు. ఆమె దానిని కోసి వేగముగ మాంసమును వండెను. పిండి తీసికొని పిసికి పొంగనిరొట్టెలు కాల్చెను.

25. మాంత్రికురాలు సౌలునకు అతని సేవకులకు భోజనము వడ్డించెను. వారు భుజించి ఆ రాత్రియే పయనమై వెళ్ళిపోయిరి.