ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 27వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. దావీదు “నేడో రేపో నేను సౌలు చేతికి చిక్కుటనిక్కము. కనుక శీఘ్రమే ఫిలిస్తీయుల దేశమునకు పారిపోయెదను. అటులైన సౌలు యిస్రాయేలు దేశము నలుమూలలు గాలించి నన్ను పట్టుకోవలయు నను ప్రయత్నమును మానును. అక్కడ నేను సురక్షితముగా ఉండిపోవచ్చును” అని అనుకొనెను.

2. కనుక అతడు ఆరువందలమంది అనుచరులను వెంటనిడు కొనివచ్చి గాతు రాజును, మావోకు కుమారుడునైన ఆకీషు శరణుజొచ్చెను.

3. దావీదు, అతని అనుచరులు కుటుంబసమేతముగా వచ్చి ఆకీషు నీడలో గాతు దేశమున వసింపమొదలిడిరి.

4. దావీదు తన ఇద్దరు భార్యలతో అనగా యెస్రేయేలు నుండి వచ్చిన అహీనోవముతో, కర్మెలు నాబాలు భార్యయైయుండిన అబీగాయీలుతో అచట కాపురముండెను.

5. దావీదు ఆకీషుతో “నేను నీ మన్ననకు పాత్రుడనైతినేని నీ దేశమున సాగునేలలోనున్న పట్టణమొకటి నాకిచ్చివేయుము. నేనచట స్థిరపడెదను. నీతోపాటు రాజధానిలో వసింపనేల?” అనెను.

6. ఆకీషు దావీదునకు సిక్లాగు పట్టణమునిచ్చెను. కనుకనే సిక్లాగు నగరము నేటికిని యూదారాజుల వశమున నున్నది.

7. ఈ రీతిగా దావీదు పదునారు నెలలు ఫిలిస్తీయ రాజ్యమున వసించెను.

8. దావీదు అనుచరులతో పోయి అమాలెకీయులు, గెషూరీయులు, గెరిసీయులు మొదలైన జాతులపై దాడిసల్పెను. వీరు తేలాము నుండి షూరుమీదుగా ఐగుప్తువరకు నివాసములు ఏర్పరచుకొనియుండిరి.

9. దావీదు ఆ ప్రాంతమును కొల్లగొట్టి స్త్రీలనక పురుషులనక చేతికి చిక్కినవారినందరిని హతమార్చి అచ్చటనున్న గొఱ్ఱెలు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు మొదలగు పశుసంపదను, జనులు తాల్చు బట్టలను దోచుకొని ఆకీషుచెంతకు కొనితెచ్చెడి వాడు.

10. ఆకీషు అతనిని చూచి "నేడు ఏ ప్రాంతములను దోచుకొని వచ్చితివి?” అని అడుగుచుండును. దావీదు అతనితో “నెగేబునందు యూదీయుల గ్రామ సీమనో లేక యెరాహ్మెయేలీయుల పల్లెపట్టునో లేక కేనీయుల పల్లెనో దోచుకొని వచ్చి తిని” అని చెప్పుచుండును.

11. కాని దావీదు ఎన్నడు ఆ ప్రాంతముల నుండి ఆడువారినిగాని, మగవారిని గాని ప్రాణములతో గాతునకు కొనిరాలేదు. వారు తనపైన, తన అనుచరుల పైన లేనిపోని నేరములు మోపుదురేమో అని అతడు శంకించెను. ఫిలిస్తీయ రాజ్యమున ఉన్నంతకాలము అతడు ఈ నియమమునే పాటించెను.

12. ఆకీషు దావీదు మాటలను గట్టిగా నమ్మెను. అతడు “దావీదు చేయు పాడుపనులకు అతనికి ఇష్టులైన యిస్రాయేలీయులు కూడ అతనిని ద్వేషింతురు. కనుక జీవితాంతము అతడు నాకు సామంతుడుగనే ఉండిపోవును” అని అనుకొనెను.