ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 22వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. దావీదు గాతునుండి పారిపోయి అదుల్లాము గుహ చేరుకొనెను. అచ్చట సోదరులు, బంధువులు అతనిని కలిసికొనిరి.

2. పరపీడకు లొంగినవారును, ఋణము వలన మగువారును, అన్యులవలన అసంతృప్తి చెందినవారు నాలుగుదిక్కుల నుండి వచ్చి దావీదును ఆశ్రయించిరి. వారికందరకు అతడు నాయకుడయ్యెను. ఇట్లు దావీదు నాలుగువందల మందిని చేర్చుకొనెను.

3. అతడు మోవాబు మండల ములోని మిస్పా నగరమునకు వెళ్ళి మోవాబీయుల రాజును దర్శించెను. “దేవుడు నాకొక త్రోవ చూపు నంతవరకు నా తల్లిదండ్రులను నీ అండ చేర్చు కొనుము” అని రాజును వేడెను.

4. ప్రభువు అనుమతి పై వారిని రాజగృహమునకు చేర్చెను. దావీదు కొండబొరియలలో మసలినంతకాలము వారు రాజుకడనే వసించిరి.

5. తరువాత ప్రవక్తయగు గాదు దావీదుతో “నీవిక కొండనెరియలలో ఉండ తగదు. యూదా దేశమునకు వెడలిపొమ్ము ” అని చెప్పెను. కనుక దావీదు అచ్చటి నుండి పయనమై పోయి హారేతు అరణ్యమున వసించెను.

6. సౌలు ఈటె చేపట్టి గిబియా కొండమీది పిచులవృక్షము క్రింద కొలువుతీర్చెను. పరివారము అతనిచుట్టు మూగియుండెను. అప్పుడు దావీదు, అతని అనుచరులును కంటబడిరని వార్తలు వచ్చెను.

7. సౌలు కొలువుకాండ్రతో “బెన్యామీనీయులారా, వినుడు! యిషాయి కుమారుడు మీకు మాన్యములను, ద్రాక్షతోటలను ఈయగలడా? బంటులు వందమందికి, వేయిమందికి మిమ్ము నాయకులనుగా నియమింపగలడా? 

8. దీనికా మీరు నామీద కుట్రపన్నినది? నా కుమారుడు యీషాయి కొడుకుతో ఒడంబడిక చేసికొనినపుడు మీలో ఒక్కడైనను నాకు తెలియచేయలేదే? మీలో నామాట పట్టించుకొనువాడే లేడుగదా! నా కుమారుడు నా కొలువువానినొకనిని నాపై పురికొల్పుచున్నాడని ఒక్కడైనను నా చెవిలో చెప్పలేదే? అతడిపుడు నామీద పడుటకు వేచియున్నాడుగదా?” అనెను.

9. అప్పుడు కొలువుకాండ్రతోనున్న ఎదోమీయుడగు దోయేగు సౌలుతో “యిషాయి కుమారుడు నోబు నగరమునకువచ్చి అహీటూబు పుత్రుడైన అహీమెలెకును కలిసికొనుట నేను చూచితిని.

10. అహీమెలెకు దావీదు పక్షమున దేవుని సంప్రదించెను. అతనికి దారిబత్తెములందించి ఫిలిస్తీయ గొల్యాతు కత్తినిచ్చి సాగనంపెను” అని చెప్పెను.

11. వెంటనే రాజు అహీటూబు కుమారుడైన అహీమెలెకును పిలిపించెను. అహీమెలెకు కుటుంబముల వారందరును నోబు నగర మున ప్రభువును అర్చించు యాజకులు. వారందరు వచ్చి రాజుదర్శనము చేసికొనిరి.

12. రాజు అతనితో “అహీటూబు కుమారుడా! నా పలుకు లాలించుచున్నావా?” అని అడిగెను. అతడు “చిత్తము ప్రభూ!" అనెను.

13. సౌలు అతనితో “నీవును, యీషాయి కుమారుడును నాపై కుట్రపన్ననేల? నీవు అతనికి దారిబతైమును, కత్తిని అందించితివి. పైగా అతని కొరకు దేవుని సంప్రతించితివి. దావీదు తిరుగుబాటు చేసి నేడోరేపో నా పై పడనున్నాడు” అనెను.

14. అహీమెలెకు రాజుతో “ప్రభూ! దావీదువలె విశ్వాసపాత్రుడు నీ పరివారమున ఒక్కడుగలడా? అతడు ప్రభువునకు అల్లుడు. నీ అంగరక్షకులకు అధిపతి. నీ ఇంట మన్ననకెక్కినవాడు.

15. నేను అతని పక్షమున దేవుని సంప్రతించుట ఇదియే మొదటి సారియా యేమి? ఇవి ఏటిమాటలు? ప్రభువు ఈ దాసుని మీదగాని, అతని కుటుంబము వారి మీదగాని నేరము మోపకుండుగాక! నాకు ఈ సుద్దులతో పని లేదు” అని విన్నవించుకొనెను.

16. కాని రాజు అహీమెలెకుతో “నిన్నును, నీ కుటుంబము వారిని తప్పక వధింపవలసినదే" అని పలికెను.

17. అంతట సౌలు తన చెంతనున్న కావలి భటులను పిలిచి “రండు! ఈ యావే యాజకులను పట్టి వధింపుడు. వీరు దావీదుతో పొత్తుకలిసిరి. అతడు పారిపోవుచుండగా కన్నులార చూచియు నాకు మాట మాత్రమైనను తెలుపరైరి” అనెను. కాని రాజభటులలో ఎవ్వడును యావే యాజకులను వధించుటకు సాహసింపలేదు.

18. రాజు దోయేగుతో “నీవు ఇచ్చటి కొచ్చి ఈ యాజకుల తలలు తెగగొట్టుము” అనెను. వెంటనే ఎదోమీయుడగు దోయేగు వారిమీద బడి యాజకవస్త్రములు ధరించిన అర్చకులను ఎనుబది ఐదుగురను నరికివేసెను.

19. సౌలు యాజకనగరము నోబు నందలి స్త్రీ పురుషులను, పిల్లలు, చంటిబిడ్డలు, ఎద్దులు, గాడిదలు, గొఱ్ఱెలును కత్తివాదరకెర చేసెను.

20-21. అయితే అహీటూబు కుమారుడు అహీమెలెకు పుత్రులలో అబ్యాతారు అనువాడొక్కడు మాత్రము తప్పించుకొనెను. అతడు దావీదుకడకు పారిపోయి సౌలు యావే యాజకులను చంపించిన తీరు తెలియపరచెను.

22. దావీదు అతనితో “నాడు అచట నిలిచియున్న ఎదోమీయుడగు దోయేగును చూచి వీడు తప్పక నా గుట్టు సౌలునకు ఎరిగించునను కొంటిని. అనుకున్నంత జరిగినది. నీ కుటుంబము వారి మరణమునకు నేనే కారకుడనైతిని.

23. నీవు మాత్రము నా చెంతనుండవచ్చును. ఇక భయపడనక్కరలేదు. నిన్నును, నన్నును చంపగోరువాడు ఒక్కడే. నాచెంత ఉన్నంతకాలము నిన్ను వేయికన్నులతో కాపాడుదును” అని పలికెను.