ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు రెండవ గ్రంధము 21వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. దావీదు పరిపాలన కాలమున మూడేండ్ల పాటు కాటకము సంభవించెను. దావీదు ప్రభువును సంప్రదించెను. అందుకు ప్రభువు “సౌలు, అతని కుటుంబమువారు గిబియోనీయులను వధించి పాపము కట్టుకొనిరి. ఆ పాపము మిమ్ము వేధించుచున్నది” అని వక్కాణించెను.

2. గిబియోనీయులు యిస్రాయేలీయుల సంబంధులుకారు. అమోరీయుల జాతిలో శేషించినవారు. వీరిని రక్షింతుమని యిస్రాయేలీయులు మొదట బాసచేసిరి. కాని సౌలు యూదా, యిస్రాయేలీయులయందు ఆసక్తి గలవాడై గిబియోనీయులను రూపుమాపనెంచెను.

3. కనుక రాజు గిబియోనీయులను పిలువనంపి “నన్నిపుడేమి చేయమందురు? కోపము చల్లారి మరల మీరు ఈ యిస్రాయేలీయులను దీవింపవలెనన్న నేనేమి ప్రాయశ్చిత్తము చేసికొనవలయునో చెప్పుడు” అని అడిగెను.

4. గిబియోనీయులు “అయ్యా! సౌలు కుటుంబము వారికి, మాకు వెండి బంగారములతో సమస్య పరిష్కారము కాదు. ఈ యిస్రాయేలీయులను మా కొరకు బలిపెట్టవలయునని మేము కోరుకొనము” అనిరి. రాజు “అటులయిన నన్నేమిచేయుమందురో చెప్పుడు. మీ కోరిక తప్పక తీర్చెదను” అని పలికెను.

5. వారతనితో “మమ్ము యిస్రాయేలు నేలపై నుండి తుడిచివేయవలెనని మమ్ము సర్వనాశనము చేయుటకు పాల్పడినవాడే మాకు జవాబుదారి కావలయును.

6. కనుక అతని సంతతివారిని ఏడుగురిని మాకు పట్టి యిమ్ము. వారిని మాత్రము యావే ఎన్నుకొనిన గిబియా పట్టణములో యావే సన్నిధిని మేము ఉరి తీసెదము" అని అనిరి. దావీదు "సరియే, ఆ ఏడుగురిని మీకు అప్పగింతును” అనెను.

7. అతడు యావే ఎదుట యోనాతానుతో చేసికొనిన ఒడంబడికను అనుసరించి యోనాతాను పుత్రుడును, సౌలు మనుమడును అయిన మెఫీబోషెతును వదలివేసెను.

8. కాని అతడు అయ్యా పుత్రిక రిస్పా సౌలునకు కనిన ఇద్దరు కుమారులు ఆర్మోని, మెఫీబోషెతులను, సౌలు కూతురు మేరబు మహోలతీయుడును బర్సిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన ఐదుగురు పుత్రులను గిబియోనీయుల వశము చేసెను.

9. గిబియోనీయులు వారిని కొండ మీద యావే ఎదుట బలిఇచ్చిరి. ఆ ఏడుగురు ఒక్కుమ్మడి గనే ప్రాణములు విడిచిరి. పంటకారు తొలినాళ్ళలో, యవధాన్యము కోతకు వచ్చియున్నపుడు వారిని యావేకు బలిఇచ్చిరి.

10. యవపంట కోయుకాలము నుండి వానలు కురిసి శవములను తడుపు నాటివరకు అయ్యా పుత్రికయగు రిస్పా గోనెపట్ట పరచుకొని కొండమీద కాపు ఉండెను. ఆమె పగటిపూట ఆకాశపక్షులనుగాని, రాత్రివేళ అడవి మృగములను గాని శవముల మీదికి రానీయలేదు.

11. అయ్యా పుత్రిక, సౌలు ఉంపుడుగత్తెయునగు రిస్పా యీ రీతిగా శవములకు కావలికాయుచుండెనని దావీదు వినెను.

12. అతడు యాబేషు గిలాదు నాయకులనుండి సౌలు యోనాతానుల అస్థికలను కొనివచ్చెను. ఫిలిస్తీయులు సౌలును గిల్బోవా యుద్ధమున ఓడించినపుడు శత్రువుల మృతదేహములను బేత్ షాను వీధిలో వ్రేలాడగట్టిరి గదా! గిలాదు పౌరులు ఆ దేహములను దొంగలించు కొనివచ్చిరి.

13-14. దావీదు తాను కొనివచ్చిన సౌలు యోనాతానుల అస్థికలను కొండపై బలియైన వారి ఎముకలతో చేర్చి వానినన్నింటిని బెన్యామీను మండలమున సేలా నగరముననున్న సౌలు తండ్రి కీషు సమాధిలో పూడ్పించెను. రాజు ఆజ్ఞాపించినట్లే సర్వకార్యములు నిర్వహింపబడెను. అటుపిమ్మట ప్రభువు ప్రజలమొర ఆలించి దేశమున వానలు కురిపించెను.

15. ఫిలిస్తీయులు మరల యిస్రాయేలీయులపైకి దండెత్తివచ్చిరి. దావీదు తన సేవకులతో పోయి గోబు వద్ద గుడారు పన్ని ఫిలిస్తీయులతో పోరాడెను. అతడు పోరున అలసిపడిపోయెను. ఆ రోజులలో రాఫా వంశీయుడగు

16. ఈష్బిబెనోబు అను ఫిలిస్తీయుడు మొనగాడయ్యెను. అతని యీటె మూడువందల తులముల ఇత్తడితో చేసినది. అతడు క్రొత్త కత్తి ఒకటి చేపట్టి దావీదును చంపెదనని విఱ్ఱవీగుచు వచ్చెను.

17. కాని సెరూయా పుత్రుడు అబీషయి దావీదు తరపున పోరాడి ఫిలిస్తీయుని గెలిచెను. నాడు దావీదు అనుచరులు “నీవిక మాతో యుద్ధమునకు రాదగదు. యిస్రాయేలీయుల దీపము ఆరిపోరాదు' అని ఆన పెట్టిరి.

18. అటుపిమ్మట ఫిలిస్తీయులు మరల చెలరేగి గోబు వద్ద పోరు మొదలిడిరి. హూషా నివాసి సిబేకాయి, రాఫా వంశీయుడు సఫును మట్టుపెట్టినది ఈ యుద్ధముననే.

19. ఫిలిస్తీయులు మరల కయ్యమునకు కాలు దువ్వి గోబు వద్ద పోరు ప్రారంభించిరి. బేత్లెహేము వాసియగు యాయీరు పుత్రుడు ఎల్షానాను, గాతు నివాసియగు గొల్యాతును వధించినది ఈ యుద్ధముననే. ఆ గొల్యాతు ఈటె సాలెవాని చాపు బద్దవలె ఉండెడిది.

20. గాతు వద్ద మరియొక పోరు జరిగెను. అచట ఆజానుబాహుడైన ఫిలిస్తీయుడు ఒకడుండెను. అతని కాలు సేతులకు ఒక్కొక్క దానికి ఆరేసి వ్రేళ్ళ చొప్పున ఇరువదినాలుగు వ్రేళ్ళుకలవు. వీడును రాఫా వంశీయుడే.

21. ఈ ఫిలిస్తీయుడు యిస్రాయేలీయులను సవాలు చేయగా దావీదు సోదరుడు షిమ్యా పుత్రుడు యోనాతాను వానిని వధించెను.

22. ఈ నలుగురు గాతు నివాసియైన రాఫా వంశీయులు. దావీదు, అతని అనుచరులు వీరిని హతమార్చిరి.