ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 20వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. అంతట దావీదు రామా చెంతనున్న నావోతునుండి పలాయనమై యోనాతాను వద్దకు వచ్చెను. అతడు యోనాతానును చూచి "నేను ఏ అపరాధము చేసితిని? ఏ దుష్కార్యము చేసితిని? ఏల నీ తండ్రి నన్ను చంపగోరుచున్నాడు?" అని అడిగెను,

2. దానికి యోనాతాను “ఇవి ఏటి మాటలు? మా తండ్రి నిన్ను చంపునను మాట నిజముగాదు. అతడు చిన్నపనిగాని, పెద్దపనిగాని నాతో చెప్పనిదే చేయడు. ఇక నీ చావుమాట ఒక్కటి నాతో చెప్పక దాచునా? కనుక మా తండ్రి నిన్ను చంపగోరుటకల్ల” అని పలి కెను.

3. కాని దావీదు “నేను నీ మన్ననకు పాత్రుడనైతినని నీ తండ్రికి బాగుగా తెలియును. దావీదు హత్యనుగూర్చి విన్నచో యోనాతాను మిక్కిలి విచారించును కనుక అతనికి ఈ సంగతి తెలుపరాదని నీ తండ్రి అనుకొనియుండును. యావే జీవముతోడు! నీ తోడు! నాకును, చావునకును ఒక్క అడుగు ఎడము మాత్రమున్నది” అని ఒట్టుపెట్టుకొని పలికెను.

4. యోనాతాను “ఇప్పుడు నీవు నన్నేమి చేయు మనినను చేసెదను” అనెను.

5. దావీదు “రేపు అమావాస్యగదా! నేను రాజు సరసన కూర్చుండి భోజనము చేయవలయును. నీవు అనుమతింతువేని నేను ఎల్లుండి సాయంకాలము వరకు పొలమున దాగుటకు నాకు సెలవిమ్ము.

6. నీ తండ్రి నేను భోజనమునకు రాకుండుట గుర్తించి దావీడు ఏడీ అని అడిగినచో నీవు, అతడు నన్ను బతిమాలి సెలవుపుచ్చుకొని స్వీయనగరమైన బేత్లెహేమునకు వెళ్ళినాడు. అచట దావీదు కుటుంబమువారందరు కూడి సాంవత్సరిక బలి సమర్పించుకొనుచున్నారు అని చెప్పుము.

7. నీ తండ్రి మంచిదని ఊకొట్టి ఊరకున్నచో మరి చింతింపనక్కరలేదు. కాని నీ జవాబువిని కోపము తెచ్చుకొన్నచో అతడు నాకు కీడెంచెననియే భావింపవచ్చును. ఈ దాసునకు ఈపాటి మేలుచేసి పెట్టుము.

8. నీవు, నేను యావే పేరిట ఒడంబడిక చేసికొంటిమి గదా! నాయందు ఏదేని అపరాధమున్నయెడల నీవే నన్ను చంపివేయుము. నన్ను నీ తండ్రిచే చంపింప నేల?” అని అనెను.

9. యోనాతాను “ఇవి ఏటి మాటలు. నా తండ్రి నీకు కీడు తలపెట్టెనని తెలియ వచ్చినచో నేను నీతో చెప్పకుందునా?” అని ప్రత్యుత్తర మిచ్చెను.

10. దావీదు మరల “నీ తండ్రి నన్నుగూర్చి పరుషముగా మాటాడినచో నాకెట్లు తెలియజేయుదువు?” అని ప్రశ్నించెను.

11. యోనాతాను దావీదుతో పొలమునకు పోవుదము రమ్మనెను. ఇరువురు పొలము వెళ్ళిరి.

12. అంతట యోనాతాను దావీదుతో “యిస్రాయేలీయుల దేవుడైన యావే సాక్ష్యముగా చెప్పుచున్నాను వినుము, రేపు ఈ సమయమున మా తండ్రి లోతుపాతు తెలిసికొందును. అతడు నీపట్ల సుముఖుడై యుండినను, విముఖుడైయుండినను నీకు వార్త పంపెదను.

13. నిన్ను ఈ విపత్తునుండి గట్టెక్కింపనేని ప్రభువు నన్ను ఆపదపాలు చేయుగాక! ప్రభువు నా తండ్రికివలె నీకును తోడైయుండవలయునని నా కోరిక.

14. నేను బ్రతికియున్నచో యావే పేరుమీద నన్ను కరుణింపుము.

15-16. కాని నేను చనిపోవుచో నా వంశము వారిపై దయచూపుము. ప్రభువు దావీదు శత్రువులను ఈ నేలనుండి తుడిచివేసినపుడు యోనాతాను కుటుంబము నాశనము కాకుండుగాక! నాశనమయ్యెనేని దావీదు యావేకు జవాబు చెప్పవలెను” అని పలికెను.

17. యోనాతాను దావీదుపట్ల గల స్నేహముచే అతని ఎదుట మరల ప్రమాణము చేసెను. అతడనిన యోనాతానునకు ప్రాణముతో సమానము.

18. యోనాతాను దావీదుతో “రేపు అమావాస్య. నీ స్థలము ఖాళీగా నుండును గనుక నీవు భోజనమునకు రాలేదని తెలిసిపోవును.

19. మూడు దినములు వేచియుండి, నీవు మునుపు దాగుకొనిన తావునకు వెళ్ళి అచట రాళ్ళకుప్ప వెనుక దాగియుండుము.

20. నేను లక్ష్యముపై గురిపెట్టినట్లు నటించి మూడు బాణములు వేయుదును.

21. అటుపిమ్మట ఆ బాణములు ఏరితెచ్చుటకు సేవకుని పంపెదను. నేనతనితో 'బాణములు నీకు ఈవలివైపుగా నున్నవి. ఏరితెమ్ము' అందునేని నీవు గుట్ట మరుగుననుండి లేచి రావచ్చును. యావే జీవముతోడు! నీకు ఏ అపాయమును కలుగదు.

22. కాని నేను కుఱ్ఱవానితో 'బాణములు నీకు ముందటివైపుననున్నవి' అని చెప్పుదునేని యావే నిన్ను పంపివేయుచున్నాడని గ్రహించి పారిపొమ్ము.

23. ఇంతకు పూర్వము మనము చేసికొనిన ప్రమాణములకు సదా కాలము యావే సాక్ష్యముగా నుండునుగాక!” అని పలికెను.

24. పైన చెప్పినట్లే దావీదు పొలమున దాగుకొనెను. అది అమావాస్య. రాజు భోజనమునకు వచ్చెను.

25. అతడు యథారీతిని గోడవైపున తన స్థానమున కూర్చుండెను. యోనాతాను రాజునకు ఎదుట, అబ్నేరు రాజునకు ప్రక్కన కూర్చుండెను. కాని దావీదు స్థానము ఖాళీగా నుండిపోయెను.

26. దావీదు మైలపడి శుద్ధిచేసికొనకపోవుటచే భోజనమునకు రాలేదు కాబోలు అనుకొని సౌలు ఆ దినము ఏమియు అనలేదు.

27. కాని రెండవనాడు అనగా అమావాస్యకు మరుసటి రోజున గూడ దావీదు స్థానము ఖాళీగానే నుండిపోయెను,

28. కనుక సౌలు “యిషాయి కుమారుడు నిన్న, నేడు భోజనమునకు రాలేదేమి?” అని యోనాతానును అడిగెను.

29. యోనాతాను “ దావీదు నాతో 'మా కుటుంబమువారు పట్టణమున సాంవత్సరిక బలిని అర్పించుచున్నారు. మా అన్న నన్ను రమ్మని కబురు పెట్టెను. నీవు అనుమతింతువేని వెళ్ళి సోదరులను చూచి వచ్చెదను' అని పలికెను. నన్ను బతిమాలి సెలవుపుచ్చుకొని బేత్లెహేమునకు వెళ్ళెను. కనుకనే నేడు దేవరవారితో భోజనము చేయుటకు రాలేదు" అని చెప్పెను.

30. ఆ మాటలకు సౌలు కోపముతో మండి పోయెను. అతడు యోనాతానుతో “మాట వినని ముష్కరురాలి కొడకా! నీకును, నీ తల్లి దిగంబరత్వమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యీషాయి కొడుకుతో జతకట్టితివను సంగతి నాకు తెలియనది కాదుకదా!

31. యిషాయి కొడుకు జీవించియున్నన్నినాళ్ళు నీవు నిలువవు. నీ రాజ్యము నిలువదు. తక్షణమే వానిని ఇచటికి పిలిపింపుము. ఇకవాడు బ్రతుకతగదు” అని పలికెను.

32. యోనాతాను తండ్రితో “దావీదు చేసిన దుష్కార్యమేమి? అతనిని చంపనేల?” అని అడిగెను.

33. సౌలు క్రోధముతో యోనాతానును పొడవవలెనని ఈటె విసిరెను. దానితో తండ్రి దావీదును మట్టుపెట్ట నిశ్చయించుకొనెనని యోనాతానునకు తెలిసిపోయెను.

34. యోనాతాను అమితకోపముతో భోజనబల్లనుండి వెడలిపోయెను. అమావాస్య పండుగ రెండవనాడు అతడు భోజనము ముట్టుకోలేదు. తండ్రి దావీదును అవమానపరచెను గదాయని యోనాతాను మిక్కిలి చింతించెను.

35. దావీదుతో చెప్పిన రీతిని యోనాతాను మరునాటి ప్రొద్దుట కుఱ్ఱవానిని వెంటబెట్టుకొని పొలమునకు వెళ్ళెను.

36. అతడు కుఱ్ఱవానితో, “పరుగెత్తి పోయి నేను వేసెడు బాణములను కొనిరమ్ము” అనెను. బాలుడు పరిగెత్తుచుండగా అతనికంటే ముందుగా పోయిపడునట్లే యోనాతాను బాణము ప్రయోగించెను.

37. బాలుడు బాణముపడిన తావు చేరగనే యోనాతాను “బాణము నీకు ముందటి వైపుననున్నది” అని కేకవేసెను.

38. అతడు మరల బాలుని “ఆలస్యము చేయకపొమ్ము, ఊరికే నిలచిచూడకుము” అని మందలించెను. బాలుడు యజమానుని యొద్దకు బాణమును తీసుకొనివచ్చెను.

39. యోనాతాను దావీదులకే ఆ మాటలగుట్టు తెలిసెను గాని బాలుడే మియు గ్రహింపలేదు.

40. అంతట యోనాతాను తన ఆయుధములను కుఱ్ఱవానికి అప్పగించి వీనిని పట్టణమునకు కొని పొమ్మనెను.

41. సేవకుడు వెడలిపోగానే దావీదు రాళ్ళగుట్ట చాటునుండి పైకిలేచెను. బోరగిలపడి ముమ్మారులు యోనాతానునకు దండము పెట్టెను. వారిరువురు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చిరి. యోనాతాను కంటె గూడ దావీదు మరింత అధికముగా శోకించెను.

42. యోనాతాను మిత్రునితో “ఇక వెళ్ళిపొమ్ము. మనమిరువురము యావే పేరిట బాసచేసితిమి. నీకును, నాకును; నీ సంతతివారికిని, నా సంతతివారికిని యావే కల కాలము సాక్ష్యముగా నుండునుగాక!”