ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యోవేలు 2వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. దేవుని పవిత్రపర్వతమైన సియోను మీద బాకాను ఊది హెచ్చరిక చేయుడు. ప్రభుదినము త్వరలోనే వచ్చును గాన యూదా ప్రజలారా! మీరు గడగడ వణకుడు.

2. అది అంధకార బంధురము, విషాదపూరితమునైన రోజు ఈ మేఘావృతము, తమోమయమునైన దినము. కొండలపై గాఢాంధకారము క్రమ్మును. బలమైన మహాసైన్యమువలె మిడుతలదండు కదలి వచ్చుచున్నది. అట్టి దండు పూర్వమెన్నడును కనిపించి ఎరుగదు. ఇక కనిపింపబోదు.

3. ఆ శలభముల ముందు వెనుకల అగ్ని ప్రజ్వరిల్లుచున్నది. అవి రాకముందు భూమి ఏదెను తోటవలె కళకళలాడుచుండెను. కాని అవి పోయిన పిదప నేల ఎడారి అగును. అవి దేనిని వదలిపెట్టుట లేదు.

4. ఆ శలభములు అశ్వములవలె నున్నవి. యుద్ధాశ్వములవలె పరుగిడుచున్నవి.

5. అవి పర్వతములపైన ఎగురుచు రథధ్వానము చేయుచున్నవి. ఎండుగడ్డి కాలినట్లుగా పుటపుటమను నాదము చేయుచున్నవి. యుద్ధమునకు సన్నద్ధమైన సైన్యమువలె బారులు తీరుచున్నవి.

6. అవి దగ్గరకు రాగానే ఎల్లరును భీతి చెందుదురు. ఎల్లరి మోములు వెలవెలపోవును.

7. అవి రణవీరులవలె వచ్చి, మీద పడుచున్నవి. శూరులవలె గోడలు ఎక్కుచున్నవి. ప్రక్కకు ఏమాత్రమును తొలగక ఒకదాని కొకటి అడ్డురాక ప్రతి శలభమును తిన్నగా ముందునకు సాగిపోవుచున్నది.

8. అవి ఒకదానిమీద ఒకటి తొక్కులాడక అన్నియు చక్కగా పోవుచున్నవి. ఆయుధములు మీదపడినను అవి త్రోవ విడువవు.

9. నగరము మీదికి ఉరుకుచున్నవి. గోడలమీదుగా దూకుచున్నవి. ఇండ్లమీదికి ప్రాకి దొంగలవలె కిటికీల గుండ లోపల జొరబడుచున్నవి.

10. ఆ మిడుతలు సమీపించుచుండగా నేల దద్దరిల్లుచున్నది, ఆకాశము కంపించుచున్నది. సూర్యచంద్రులకు చీకట్లు క్రమ్ముచున్నవి. నక్షత్రములు కాంతిని కోల్పోవుచున్నవి.

11. ప్రభువు గర్జన రూపమున తన సైన్యమునకు ఆజ్ఞలిచ్చుచున్నాడు. ఆయన ఆజ్ఞలు పాటించు సైన్యములు అనంతములు, మహాశక్తిమంతములు. ప్రభువుదినము మహత్తరమైనది, భీకరమైనది. దానిని తట్టుకోగలవాడు ఎవడు?

12. ప్రభువు ఇట్లనుచున్నాడు: “ఇప్పుడైనను మీరు పూర్ణహృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతోను, సంతాపముతోను, ఏడ్పులతోను నా వద్దకు తిరిగిరండు.

13. మీ బట్టలు చించుకొనుటచాలదు. మీ గుండెలను వ్రయ్యలు చేసికొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగిరండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు సులభముగా కోపపడువాడుకాడు. అనంతమైన ప్రేమకలవాడు తాను నిశ్చయించుకొన్నట్లు శిక్షింపక మన్నించి వదలివేయువాడు.

14. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలు అనెడు దీవెననీయవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము, ద్రాక్షాసారాయమును అర్పింపవచ్చును.

15. సియోను కొండపై బాకానూదుడు. ఉపవాసము చేయవలెనని ప్రజలకాజ్ఞనిండు. వారిని సమావేశపరపుడు.

16. పవిత్రసభకు జనులను ప్రోగుచేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటిబిడ్డలనుకూడ కొనిరండు. నూత్నముగా పెండ్లియాడిన దంపతులు కూడ తమ గృహములను వీడిరావలెను.

17. ప్రభువునకు ఊడిగముచేయు యాజకులు బలిపీఠమునకును, మంటపమునకును మధ్య శోకించుచు, 'ప్రభూ! నీ ప్రజలపై దయచూపుము. అన్య జాతులు మీ దేవుడెక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలిచేయకుందురుగాక!' అని ప్రార్థింపవలెను. ప్రభువు ప్రజల మనవిని ఆలించుట

18. అపుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను. తన ప్రజలను కరుణించెను.

19. ఆయన వారితో ఇట్లనెను: “నేను మీకు సంతృప్తి కలుగునట్లుగా ధాన్యము ద్రాక్షాసారాయము, ఓలివుతైలము నిత్తును. అన్య జాతులు మిమ్మిక తృణీకరింపజాలవు.

20. నేను ఉత్తరమునుండి మీమీదికెత్తి వచ్చిన మిడుతల దండును పారద్రోలుదును. వానిలో కొన్నిటిని ఎడారిలోనికి తోలివేయుదును.  ఆ దండులోని ముందటి భాగమును మృత సముద్రములోనికిని, వెనుకటిభాగమును మధ్యధరా సముద్రములోనికిని తోలుదును. ఆ మిడుతలు చచ్చి కంపుకొట్టును. అవి మీకు చేసిన కార్యమునకుగాను నేను వానిని నాశనము చేయుదును.

21. పొలములారా! మీరు భయపడకుడు. ప్రభువు మీకు చేసిన గొప్ప కార్యమునకుగాను మీరు సంతసముతో ఆనందింపుడు.

22. పశువులారా! మీరు భయపడకుడు. గడ్డి బీళ్ళు పచ్చబడినవి. చెట్లు పండ్లు కాయుచున్నవి. ద్రాక్షలు, అంజూరములు సమృద్ధిగా ఫలించుచున్నవి.

23. సియోను ప్రజలారా! ప్రభువు మీకు చేసిన కార్యమునకుగాను మీరు సంతసముతో ఆనందింపుడు. ఆయన మీకు వలసినంతగా శిశిరఋతువు వర్షము నిచ్చెను. పూర్వమువలెననే శీతకాలవర్షమును, వసంతకాల వర్షమును దయచేసెను.

24. మీ కళ్ళములు ధాన్యముతో నిండును. మీ గానుగలచెంతనున్న తొట్లు ద్రాక్షారసముతోను, ఓలివుతైలముతోను నిండిపోవును.

25. మిడుతలదండు మీ పైరులను తినివేసిన కాలమున మీరుకోల్పోయిన పంటను నేను మీకు మరల ఇత్తును. ఆ దండును మీ పైకి పంపినది నేనే.

26. ఇప్పుడు మీరు సమృద్ధిగా భుజించి సంతృప్తి చెందుదురు. మీకు మహోపకారములు చేసిన ప్రభువును మీరు స్తుతించి కీర్తింతురు. నా జనులను ఇకమీదట ఎవరును తృణీకరింపజాలరు.

27. యిస్రాయేలీయులారా! అప్పుడు మీరు నేను మీ మధ్యనున్నాననియు ప్రభుడనైన నేను మీ దేవుడననియు నేను తప్ప మరొక దైవములేడనియు గుర్తింతురు. నా జనులను ఇకమీదట ఎవరును తృణీకరింపజాలరు.

28. అటుపిమ్మట నేను నా ఆత్మను ఎల్లరిపై కుమ్మరింతును. మీ పుత్రులు, పుత్రికలు నా సందేశమును చెప్పుదురు. మీ ముదుసలులు కలలుకందురు. మీ యువకులు దర్శనములు గాంతురు.

29. ఆ కాలమున నేను సేవకులగు స్త్రీపురుషుల మీదను నా ఆత్మను క్రుమ్మరింతును.

30. ఆ దినముగూర్చి భూమిమీదను ఆకాశమునను గుర్తులు చూపుదును, అపుడు నెత్తురు, నిప్పు, ధూమకంభములు కనిపించును.

31. భీకరమైన ప్రభువు మహాదినము సమీపించినపుడు సూర్యుడు చీకట్లు క్రమ్మును. చంద్రుడు నెత్తురువలె ఎఱ్ఱబడును.

32. కాని ప్రభువు తనను శరుణువేడిన వారినందరిని కాపాడును. సియోనుపై కొందరు అపాయమును తప్పించుకొందురనియు, యెరూషలేమున తానెన్నుకొనిన శేషజనులు మిగులుదురనియు ప్రభువే సెలవిచ్చెను. 

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services