ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రూతు 2వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. నవోమికి బోవసు అను బంధువు కలడు. అతడామె భర్తయగు ఎలీమెలెకు కుటుంబమునకు దగ్గరివాడు.

2. రూతు నవోమితో “నేను పొలమునకు పోయి పరిగలేరుకొని వత్తును. ఎవరైన నన్ను కరుణించి తమ చేనిలో కోతముగిసిన పిమ్మట జారిపోయిన కంకులు ఏరుకొననీయకపోరు” అనెను. నవోమి వెళ్ళుము అని రూతుకు సెలవిచ్చెను.

3. రూతు పొలమున వెళ్ళి కోతకాండ్ర వెనుక తిరుగాడుచు వారు వదలిపెట్టిన వెన్నులు ఏరుకొనెను. పొలములో ఆమె తిరుగాడిన భాగము ఎలీమెలెకు బంధువగు బోవసునకు చెందినది.

4. కొంత సేపటికి బోవసు బేత్లెహేము నుండి వచ్చెను. అతడు “ప్రభువు మీకు తోడై ఉండునుగాక!” అనుచు కోత కాండ్రను పలుకరించెను. వారు “యావే నిన్ను దీవించునుగాక!” అని బదులు పలికిరి.

5. బోవసు కోతకాండ్ర మీద పెత్తనము చేయునతనిని చూచి “ఆ పడుచు ఎవరిది?” అని అడిగెను.

6. అతడు యజమానునితో “ఆమె మోవాబు నుండి నవోమితో వచ్చిన మోవాబీయురాలు.

7. ఆమె మన కోతకాండ్ర వెంట నడచుచు పరిగలేరుకొందునని నన్ను బ్రతిమాలెను. పాపము ప్రొద్దుటి నుండి ఇప్పటివరకు శ్రమపడినది. ఇప్పుడే కొంచెము నీడపట్టున కూర్చున్నది” అని చెప్పెను.

8. బోవసు ఆమెతో "అమ్మా! నా మాటవినుము. నీవు ఇంకెక్కడికిని వెళ్ళనక్కరలేదు. మా పొలముననే పరిగలేరుకొనుము. మా పనికత్తెల దగ్గర ఉండిపొమ్ము.

9. వారు పంటకోసిన తావున వారి వెను వెంటవచ్చి కంకులేరుకొనుము. నిన్ను బాధింపవలదని మా పనివాండ్రకు ఆజ్ఞయిచ్చితిని. నీకు దప్పిక అయినపుడు వారు చేదుకొని వచ్చిన కుండలనుండి నీరు త్రాగుము” అని చెప్పెను.

10. రూతు శిరస్సు నేలమోపి దండము పెట్టి “అయ్యా! నీవు నా పట్ల ఎంత దయచూపితివి? పరదేశీయురాలనైన నన్ను ఇంతగా కరుణింపవలయునా?" అని అనెను.

11. బోవసు ఆమెతో “నీవు నీ మగడు చనిపోయిన పిదప మీ అత్తకు నీవు ఎంత ఉపకారముచేసితివో నేను వింటిని. నీ తల్లిదండ్రులను, నీ జన్మదేశమును విడనాడి ముక్కుమొగము తెలియని ఈ క్రొత్త ప్రజల చెంతకు వచ్చితివి.

12. నీ మంచితనమునకు గాను ప్రభువు నిన్ను ఆశీర్వదించునుగాక! నీవు యిస్రాయేలు దేవుని నమ్మి ఆయనను శరణుజొచ్చితివి. ఆ ప్రభువు నిన్ను దండిగా దీవించునుగాక!” అని అనెను.

13. రూతు "అయ్యా! నేను నీ దయకు నోచుకొంటిని. నీవు నాతో కలుపు గోలుతనముగా మాటలాడి నాకు ధైర్యము కలిగించితివి. నా మట్టుకు నేను నీ పనికత్తెలలో ఒక్కతెకు గూడ సాటిరాను” అని పలికెను.

14. భోజనసమయమున బోవసు రూతుతో “అమ్మా! నీవు మాతోపాటు అన్నము తినుము. నీ రొట్టెనుగూడ ఈ ద్రాక్షసారాయములో అద్దుకొమ్ము” అనెను. రూతు పనికత్తెలతో భోజనము చేయుటకు కూర్చుండెను. బోవసు ఆమెకుకూడ దోసెడు వేపుడు ధాన్యము పంచియిచ్చెను. రూతు ఆకలి తీరువరకు భుజింపగా ఇంకను కొంత ధాన్యము మిగిలిపోయెను.

15. వెన్నులేరుకొనుటకు ఆమె మరల వెళ్ళిపోయెను. బోవసు పనివాండ్రతో “మన కట్టలున్నచోటగూడ ఆమెను పరిగలేరుకొననిండు. మీరామెను బాధింపవలదు.

16. మరియు మీరు కట్టలనుండి కూడ కొన్ని వెన్నులను లాగి ప్రక్కన పడవేయుడు. ఆమె వానిని ఏరుకొనునపుడు ఆమెను మందలింపవలదు” అని చెప్పెను.

17. ఆ రీతిగా రూతు సాయంత్రము వరకు పరిగలు ఏరుకొని వెన్నులు నలిపిచూడగా కుంచెడు ధాన్యమయ్యెను.

18. ఆమె నగరమునకు వెడలిపోయి తాను సేకరించుకొని తెచ్చిన ధాన్యమును అత్తకు చూపెను. తాను తినగా మిగిలిన వేపుడు ధాన్యమునుగూడ అత్తకిచ్చెను.

19. నవోమి కోడలితో “ఈ దినమెక్కడ పరిగలేరితివి? ఎవరి పొలమున తిరుగాడితివి? నిన్ను లక్ష్యపెట్టిన పుణ్యాత్ముని ప్రభువు దీవించును గాక!” అని అనెను. రూతు తాను ఆనాడు బోవసు అనువాని పొలమున పరిగలేరుకొని వచ్చితినని చెప్పెను.

20. ఆ మాటలకు అత్త “సజీవులను, మృతులను కూడ కరుణించు ప్రభువు బోవసును దీవించునుగాక! అతడు మనకు దగ్గరి చుట్టము. మన సంగతి' చూడవలసినది కూడ అతడే!" అని నుడివెను,

21. మోవాబీయురాలైన రూతు అత్తతో “అతడు కోత ముగియువరకు నేను తన పనికత్తెలతో కలిసి తన పొలముననే వెన్నులేరు కోవచ్చునని చెప్పెను” అని పలికెను.

22. నవోమి కోడలితో “అవును, నీవు బోవసు పనికత్తెలతో చేరుటయే మేలు. ఇతరుల పొలమునకు పోయెదవేని అచట ఎవరైనను నిన్ను పీడింపవచ్చును” అని పలికెను.

23. ఆ రీతిగా రూతు యవపంట, గోధుమ పంట ముగియువరకు బోవసు పనికత్తెలతో కూడి వెన్నులేరుకొనెను. అత్త ఇంటనే వసించెను.