ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Maccabees chapter 8 in Telugu మక్కబీయులు రెండవ గ్రంధము 8వ అధ్యాయము || Telugu Catholic Bible 2 Maccabees chapter 9 in Telugu మక్కబీయులు రెండవ గ్రంధము 9వ అధ్యాయము || Telugu Catholic Bible

1. యూదా మక్కబీయుడు, అతని అనుచరులు రహస్యముగా గ్రామగ్రామము తిరిగి యూదమతమును నిష్ఠతో పాటించువారిని ఆరువేల మందిని ప్రోగుజేసి కొనిరి.

2. వారు వివిధ జాతులచే పీడింపబడు యూద జాతిని, అన్యజాతులు అమంగళము చేసిన దేవాలయమును, పాడుపడి నేలమట్టమైయున్న యెరూషలేము నగరమును కరుణతో చూడుమని దేవునికి మనవి చేసిరి.

3. మరియు ప్రభువు హత్యకు గురియైన వారి మొరను ఆలింపవలెననియు,

4. అన్నెముపున్నెము ఎరుగని పసిబిడ్డలను చంపినవారిని, తనను దూషించిన వారిని దండింపవలెననియు వేడుకొనిరి.

5. యూదా మక్కబీయుడు తన జనమును ప్రోగుజేసికొనిరాగా, అన్యజాతివారు అతనిని ఎదిరింపజాలరైరి. ప్రభువు పూర్వము యూదులమీద కోపము చూపెను. కాని ఇప్పుడు ఆ కోపము కరుణగా మారెను.

6. యూదా తలవని తలంపుగా నగరముల మీదను, పల్లెలమీదను, దాడిచేసి వానిని కాల్చివేయ మొదలిడెను. కీలకమైన దుర్గములను పట్టుకొని శత్రువులను తరిమికొట్టెను.

7. అతడు మామూలుగా రాత్రులలో ఈ దాడులు చేసెడివాడు. ప్రజలెల్లరు అతడి పరాక్రమమును గూర్చి చెప్పుకొనసాగిరి.

8. యెరూషలేమునకు పాలకుడుగానున్న ఫిలిప్పు మక్కబీయుడు నానాటికి బలము పుంజుకొని విజయములు సాధించుచున్నాడని గ్రహించెను. కనుక అతడు పెద్దసిరియాకు అధిపతిగానున్నప్టోలమీకి కమ్మ వ్రాసెను. అతడు సేనలను పంపి రాజునకు సహాయము చేయకోరెను.

9. ప్టోలమీ, నికానోరును సైన్యాధిపతిగా ఎన్నుకొనెను. అతని తండ్రియగు పట్రోక్లసు రాజమిత్రులలో అగ్రగణ్యుడు, షోల యూద జాతినంతటిని తుడిచిపెట్టుటకుగాను నానాజాతులనుండి ఇరువది వేలమంది సైనికులనెన్నుకొని, వారిని నికానోరు వెంట పంపెను, నికానోరునకు తోడుగా రణరంగమున కాకలు తీరిన గోరియాసును కూడ పంపెను.

10. అంతియోకసు రాజు రోమీయులకు రెండువేల వీసెల వెండి అప్పు బడియుండెను. పోరున బందీలైన యూదులను బానిసలుగా అమ్మి ఆ అప్పులను తీర్పవచ్చునని నికానోరు ఆశించెను.

11. కనుక అతడు వెంటనే సముద్రతీర నగరములకు మనుష్యులను పంపి తాము వీసె వెండికి తొంబదిమంది యూద బందీలను బానిసలుగా అమ్ము చున్నామని ప్రకటనము చేయించెను. కాని సర్వోన్నతుడైన ప్రభువు నికానోరునకు ఎట్టి తీర్పు విధింపనున్నాడో అతడికి తెలియదయ్యెను.

12. నికానోరు సైన్యముతో తన మీదికి దండెత్తి వచ్చుచున్నాడని యూదా వినెను. అతడు తన అనుచరులకు ఆ సంగతి తెలియజేసెను.

13. వారిలో పిరికివారు, ప్రభువు సహాయమును నమ్మనివారు వెంటనే కాలికి బుద్ధి చెప్పిరి.

14. మిగిలినవారు తమ ఆస్తి పాస్తులను అమ్ముకొనిరి. దుర్మార్గుడు నికానోరు తమను కలువకముందే, అతనిచే బానిసలుగ అమ్మబడినవారిని కాపాడమని వారు ప్రభువును వేడుకొనిరి.

15. వారు ప్రభువు తమకొరకు తమను కాపాడకున్నను, పూర్వము తాను పితరులతో చేసికొనిన నిబంధనను బట్టియు, ఇప్పుడు తమను తన ప్రజగా ఎన్నుకొనుట బట్టియు, తమను కాపాడవలెనని మనవి చేసికొనిరి.

16. యూదా తన ఆరువేల మంది బంటులను ప్రోగుజేసికొనెను. శత్రువులను చూచి భయపడవలదని వారిని హెచ్చరించెను. అకారణముగా తమమీదికి దాడిచేసిన అన్యజాతి వారి బలమును చూచి వెనకంజ వేయవలదని చెప్పెను. ధైర్యముతో పోరాడుడని వారిని ప్రోత్సహించెను.

17. అన్యజాతి వారు దేవాలయమును నాశనము చేసి, యెరూషలేమును పాడుచేసి, యూదుల ఆచారములను మంటగలిపిరని చెప్పెను.

18. “శత్రువులు వారి ఆయుధముల మీదను, సాహసము మీదను ఆధారపడవచ్చుగాక. మనము మాత్రము సర్వోన్నతుడైన దేవుని మీద ఆధారపడు వారలము, ఆయన తల ఊపినంతనే ఈ శత్రుసైన్యములేకాక సర్వప్రపంచము బుగ్గి అగును" అని పలికెను.

19. ఇంకను యూదా పూర్వము ప్రభువు యూదులకు తోడ్పడిన సందర్భములనుగూడ వారికి జ్ఞప్తికి తెచ్చెను. సన్హారీబు కాలమున శత్రువులు లక్ష ఏనుబది ఐదువేల మంది మడిసిరి.

20. బబులోనియా దేశమున జరిగిన గలాతియా యుద్ధమున ఎనిమిది వేలమంది యూదులు ఆపదలోనున్న నాలుగువేలమంది మాసిడోనియనులకు సాయముచేసిరి. ఆ ఎనిమిదివేలమంది దైవబలముతో నూట ఇరువదివేలమంది గలతీయులను ఓడించి కొల్లసొమ్మును దోచుకొనిరి.

21. సైనికులు యూదా మాటలు విని ధైర్యము తెచ్చుకొని తమ దేశము కొరకును, ధర్మశాస్త్రము కొరకును ప్రాణములు అర్పించుటకుకూడ సంసిద్ధులైరి. అతడు తన సైన్యమును నాలుగు భాగములుగా విభజించెను.

22. ఒక్కొక్కదానిలో పదిహేను వందల మంది సైనికులుండిరి. ఆ నాలుగు భాగములకు తాను, తన ముగ్గురు సోదరులగు సీమోను, యోసేపు, యోనాతాను నాయకులైరి.

23. అంతట అతడు ఎలియాసరును పవిత్ర గ్రంథము చదివి వినిపింపుమని ఆజ్ఞాపించెను. “ప్రభువు నుండి మనకు సహాయము లభించును" అను వాక్యమును యుద్ధనాదముగా వాడుకోవలెనని చెప్పెను. తదనంతరము తన దళముతోపోయి నికానోరు సైన్యము మీద పడెను.

24. ప్రభువు వారి తరపున పోరాడగా వారు శత్రు సైన్యమున తొమ్మిదివేలమందిని చంపిరి. చాల మందిని గాయపరచిరి. విరోధి బలగమునంతటిని తరిమికొట్టిరి.

25. తమను బానిసలుగా కొనవచ్చిన వారియొద్దనుండి సొమ్ములాగుకొనిరి. అటుపిమ్మట శత్రువులను చాల దూరమువరకు వెన్నాడి వెనుకకు మరలివచ్చిరి.

26. విశ్రాంతిదినము ప్రారంభము కానున్నది కనుక విరోధులను ఇంకను దూరమువరకు తరుమజాలరైరి.

27. తదనంతరము శత్రువుల ఆయుధములను, కొల్లసొమ్మును ప్రోగుజేసికొని విశ్రాంతి దినమును పాటించిరి. ఆ దినమున ప్రభువు వారిపట్ల తనకుగల కరుణకు మొదటి ఆనవాలు చూపెను గనుక వారతనిని కొనియాడిరి.

28. విశ్రాంతిదినము ముగిసిన పిదప కొల్లసొమ్ములో కొంతభాగమును హింసలకు గురియైనవారికి, వితంతువులకు, అనాథ బాలలకు పంచియిచ్చిరి. మిగిలిన సొమ్మును తామును, తమ పిల్లలును కలిసి పంచుకొనిరి.

29. అటుపిమ్మట బహిరంగ ప్రార్ధనము జరిపి కరుణాళువైన ప్రభువును తమపై దయచూపుమని వేడుకొనిరి.

30. యూదులు తిమోతి, బఖిడసులమీద కూడ యుద్ధముచేసి వారి సైనికులను ఇరువదివేలమందిని హతముచేసిరి. ఎత్తయిన దుర్గములు పట్టుకొని చాల కొల్లసొమ్మును దోచుకొనిరి. ఆ సొమ్మును తామును, వితంతువులును, అనాథ శిశువులును, వృద్ధులును, హింసలకు గురియైనవారు సమానముగా పంచుకొనిరి.

31. వారు శత్రువుల ఆయుధములను ప్రోగుజేసి ఆయా ముఖ్యమైన తావులలో భద్రపరచిరి. కొల్ల సొమ్మును మాత్రము యెరూషలేమునకు కొనిపోయిరి.

32. యూదులు తిమొతి సైన్యముల అధిపతిని మట్టుపెట్టిరి. అతడు పరమ దుర్మార్గుడు. యూదులను చాల తిప్పలు పెట్టినవాడు.

33. ఇంకను వారు యెరూషలేమున విజయోత్సవమును జరుపుకొనుచు దేవాలయ ద్వారములను తగులబెట్టిన వారిని బంధించి సజీవముగా దహించిరి. వారిలో కలిస్తెనీసుకూడ ఉండెను. అతడొక చిన్న ఇంటిలో దాగుకొనియుండి పట్టుబడెను. ఆ రీతిగా వారు తమ దుర్మార్గమునకు తగిన ప్రతిఫలమును అనుభవించిరి.

34. పరమ దుర్మార్గుడైన నికానోరు యూదులను కొనుటకుగాను వేయిమంది బేరగాండ్రను తీసికొని వచ్చెనుగదా!

35. అతడు ఎవరిని చిన్నచూపు చూచెనో వారిచేతనే, దైవబలమువలన ఓడింపబడెను. అతడు తాను తాల్చియున్న వైభవోపేతములైన ఉద్యోగ వస్త్రములను తొలగించి పలాయనము చిత్తగించు బానిసవలె ఒంటరిగా పొలముగుండ పారిపోయెను. తన సైన్యమునంతటిని కోల్పోయెనుగాని అదృష్ట వశమున తాను మాత్రము ప్రాణములతో అంటియోకియా చేరుకొనెను.

36. యెరూషలేము పౌరులను బానిసలుగా అమ్మి రోమునకు బాకీపడియున్న సొమ్మును తీర్పగోరిన ఇతడు కడన యూదులు అజేయులని తెలిసికొనెను. వారు ప్రభువు దయచేసిన ఆజ్ఞలు పాటించిరి కనుక ప్రభువే వారికి రక్షకుడయ్యెను. 

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services