ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Maccabees chapter 7 in Telugu మక్కబీయులు రెండవ గ్రంధము 7వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. మరియొకమారు శత్రువులు ఏడుగురు సోదరులను, వారి తల్లిని బంధించిరి. రాజు వారిని కొరడాలతో కొట్టించెను. ధర్మశాస్త్రము నిషేధించిన పందిమాంసమును తినవలెనని వారిని నిర్బంధము చేసెను.

2. అపుడు ఆ ఏడుగురిలో ఒకడు తన సోదరుల తరపున మాటలాడుచు “రాజా! నీవు మమ్ము ప్రశ్నించి ఏమి తెలిసికోగోరెదవు? మేము ప్రాణములను విడనాడుటకైన అంగీకరింతుముగాని, మా పూర్వుల చట్టములను మీరము” అనెను.

3. ఆ మాటలకు రాజు ఆగ్రహము తెచ్చుకొని గంగాళమును పెనములను నిప్పులమీద కాల్చి వేడిచేయుడని సేవకులను ఆజ్ఞాపించెను. వారట్లే చేయగా ఆ పరికరములు ఎఱ్ఱగా కాలి గనగన మండెను.

4. తల్లి, సోదరులు చూచుచుండగనే ఆ మాటలాడిన యువకుని నాలుక కోసి అతని తలమీది చర్మము ఒలిచి, కాలుసేతులు నరికివేయుడని రాజు సైనికులను ఆజ్ఞాపించెను.

5. వారు రాజు చెప్పినట్లే ఆ యువకుని అవయవములను నరికి అతనిని మొండెముగా చేసిరి. అతడింకను ఊపిరి మాత్రము పీల్చుకొనుచుండెను. రాజు అతడిని కొనిపోయి గనగన మండుచున్న పెనముమీద పడవేయుడని ఆజ్ఞయిచ్చెను. ఆ యువకుడు పెనముమీద మాడిపోగా పొగలు పైకి లేచెను. అప్పుడు ఆ ఆరుగురు సోదరులు వారి తల్లియు ఒకరినొకరు హెచ్చరించుకొనుచు మనము ధైర్యముగా చనిపోవుదమని ఒకరితోనొకరు చెప్పుకొనిరి.

6. ఇంకను వారు “ప్రభువు మనలను గమనించుచునే ఉన్నాడు. అతడు మనలను ఆదరముతో చూచును. పూర్వము మోషే ప్రభువును విడనాడినవారిని గూర్చి పాట కట్టినపుడు ఈ సంగతియే చెప్పెను. ప్రభువు తనను సేవించువారిని తప్పక కరుణించునని అతడు పేర్కొనెను” అని అనుకొనుచు ఒకరినొకరు ప్రోత్సహించుకొనిరి.

7. ఈ రీతిగా మొదటి సోదరుడు చనిపోయిన పిమ్మట సైనికులు రెండవవాని ప్రాణములతో చెలగాటమాడ నారంభించిరి. వారు అతని తలమీది వెండ్రుకలను చర్మమును పెరికివేసిరి. “నీవు పంది మాంసము భుజింతువా లేక మమ్ము నీ శరీరమును ఖండలుగ నరికి వేయమందువా” అని అడిగిరి.

8. అతడు తన మాతృభాషలో “నేను ఆ మాంసమును ముట్టుకోను” అని చెప్పెను. కనుక సైనికులు మొదటి వానినివలె అతనినికూడ హింసించిరి.

9. అతడు చివరి సారిగా ఊపిరి పీల్చుకొని రాజుతో “రాక్షసుడా! నీవు మమ్ము చంపిన చంపవచ్చుగాక, కాని విశ్వాధిపతియైన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతముగా జీవించునట్లు చేయును. ఆయన ఆజ్ఞలకు బద్దులమై మేము ప్రాణములు కోల్పోవుచున్నాము” అని అనెను.

10. అటు తరువాత సైనికులు మూడవ సోదరుని బాధింపసాగిరి. అతడు సైనికులు ఆజ్ఞాపింపగనే నాలుకను తెరచి, చేతులు చాచెను.

11. మరియు అతడు ధైర్యముతో “దేవుడే నాకు ఈ అవయవములను దయచేసెను. కాని వీనికంటె ప్రభువు ఆజ్ఞలు విలువైనవి. ప్రభువు వీనిని నాకు మరల దయచేయును” అనెను.

12. అతని సాహసమును, అతడు హింసలను లెక్క చేయకపోవుట చూచి రాజు, అతని పరివారము విస్తు పోయెను.

13. మూడవవాడు గతించిన పిమ్మట సైనికులు నాలుగవవానినిగూడ క్రూరహింసలకు గురిచేసిరి.

14. అతడు ప్రాణములు విడచుచు “మీ చేతులలో చచ్చుట మాకు మేలే. ప్రభువు మమ్ము మరల జీవముతో లేపును. కాని మీకు పునరుత్థానము గాని నూత్నజీవము గాని లభింపవు” అనెను.

15. అటుపిమ్మట సైనికులు ఐదవవానిని హింసింప దొడగిరి.

16. అతడు రాజును తేరిపార చూచి "ఓయి! నీవు మావంటి నరుడవే. కాని మమ్ము నీ ఇష్టము వచ్చినట్లు చేయుటకును, మా ప్రాణములు తీయుటకును నీకధికారము కలదు. అయినను నీవు ప్రభువు మా ప్రజను చేయి విడచెననుకోవలదు.

17. కొంచెము వేచియుండుము. ఆయన తన మహాశక్తితో నిన్ను నీ అనుయాయులను ఎట్లు శిక్షించునో నీవే చూతువు” అనెను.

18. అటు తరువాత సైనికులు ఆరవ వానిమీద చేతులు వేసిరి. అతడు చనిపోవుచు శత్రువులను చూచి “మీరు భ్రాంతిపడవలదు. మేము దేవునికి విరోధముగా పాపముచేసి ఇట్టితిప్పలు తెచ్చుకొంటిమి. ఈ ఘోర యాతనలన్నిటికి కారణము మా తప్పిదములే.

19. కాని మీరు దేవునితో పోరాడుచున్నారు. కనుక మీకు శిక్ష ఎంతమాత్రము తప్పదు” అని పలికెను.

20. కాని ఆ యువకులందరికంటె వారి తల్లి ఎక్కువగా ప్రశంసింపదగినది. ఎల్లరును జ్ఞప్తిలో ఉంచుకొని గౌరవింపదగినది. ఒక్కరోజునే ఆమె తన ఏడుగురి కుమారుల మరణము కన్నులార చూచెను. అయినను ఆమె ఆ ప్రభువును నమ్మినది కనుక ఆ వేదననంతటిని ధైర్యముతో భరింపగల్లెను.

21. ఆమె స్త్రీ ప్రేమను, పురుష ధైర్యమును గూడ వ్యక్తము చేయుచు తన కుమారులలో ఒక్కొక్కనిని మాతృ భాషలో ఇట్లు ప్రోత్సహించెను.

22. “నాయనలారా! మీరు నా కడుపునెట్లు ఊపిరిపోసికొంటిరో నేనెరుగను. మీకు జీవమును, ఊపిరిని ఇచ్చినది నేనుకాదు. మీ అవయవములను ఒక్కటిగా అమర్చినది నేను కాదు.

23. ప్రపంచమును సృజించినవాడును, నరులను పుట్టించినవాడును, అన్ని ప్రాణులను చేసినవాడునైన దేవుడే మిమ్ము కలిగించెను. మీరు మీ ప్రాణముల కంటెగూడ ఆ ప్రభువు ఆజ్ఞలను అధికముగా గౌరవించుచున్నారు కనుక ఆ కరుణామయుడైన దేవుడు మీకు మరల జీవమును, ఊపిరిని దయచేయును.”

24. ఆ తల్లి మాటలు విని అంటియోకసు ఆమె తనను ఎగతాళి చేయుచున్నదనుకొనెను. కనుక అతడు ఆమె కడగొట్టు కుమారునికి తన పూర్వుల సంప్రదాయములను విడునాడుమని శక్తికొలది చెప్పిచూచెను. ఆ బాలుడు తన మాటవినినచో తాను అతనిని ధనవంతుని, సుప్రసిద్ధుని చేయుదునని బాసచేసెను. ఇంకను అతనిని గొప్ప అధికారిని చేసి రాజమిత్రుల జాబితాలో చేరునని కూడ చెప్పెను.

25. కాని ఆ బాలుడు రాజు మాటలను లక్ష్యము చేయలేదు. కనుక రాజు ఆ బాలుని ఒప్పించి అతడి ప్రాణములను కాపాడుమని తల్లిని హెచ్చరించెను.

26. అతడు చాలసేపు నచ్చచెప్పిన తరువాత ఆ తల్లి కుమారుని హెచ్చరించుటకు అంగీకరించెను.

27. ఆమె పుత్రుని మీదికి వంగి క్రూరుడైన ఆ రాజునకు తలవంపులు కలుగునట్లుగా మాతృభాషలో ఇట్లు చెప్పెను: “నాయనా! నా పైని జాలి చూపుము. నిన్ను తొమ్మిదినెలలు నా కడుపున మోసితిని. మూడేండ్లు పాలిచ్చి పెంచితిని. నిన్ను అన్నపానీయములతో పోషించి ఈ ఈడువానినిగా చేసితిని.

28. బిడ్డా! నీవు భూమ్యాకాశములను, వానిలో కనిపించు సమస్త వస్తువులను పరిశీలించి చూడుము. దేవుడే శూన్యమునుండి వాని నన్నిటిని కలిగించెనని తెలిసికొనుము. ఆయన నరులనుకూడ అట్లే కలిగించెను,

29. నీవు ఈ నరహంతను చూచి భయపడవలదు. ఇపుడు నీ ప్రాణములర్పించి నీవును నీ సోదరులకు తగినవాడివి అనిపించుకొనుము. ఇట్లు చేయుదువేని నేను ప్రభువు అనుగ్రహము వలన, నీ సోదరులతోపాటు నిన్నును మరల స్వీకరింపగలుగుదును.”

30. ఆమె ఈ మాటలను ముగింపక మునుపే బాలుడు “రాజా! నీవింకను దేనికొరకు వేచియున్నావు? నేను నీ ఆజ్ఞను పాటింపను. మోషే మా పితరుల కిచ్చిన ధర్మశాస్త్ర విధులను మాత్రమే అనుసరింతును.

31. నీ మట్టుకు నీవు మా ప్రజలను సకల విధములైన క్రూరహింసలకు గురిచేయ చూచితివి. నీవు ప్రభువు శక్తిని తప్పించుకోజాలవు.

32-33. సజీవుడైన ప్రభువు మా మీద ఆగ్రహముచెందిన మాట నిజమే. ఆయన మా పాపములకుగాను మమ్ము దండించుచున్నాడు. మమ్ము శిక్షించి మాకు బుద్ధిచెప్పవలెనని ఆయన తలంపు. కాని మేమతని దాసులము కనుక అనతి కాలములోనే ఆయన మమ్ము క్షమించును.

34. నీవు మాత్రము నరులందరిలోను మహాక్రూరుడవు. మహా పాపివి. నీవేమో గొప్పవాడవనుకొని భ్రాంతిపడి కన్ను మిన్నుగానక దేవుని ప్రజలను హింసించుచున్నావు.

35. నీవు సర్వశక్తిమంతుడును, సర్వమును పరిశీలించువాడైన దేవుని తప్పించుకోజాలవు.

36. నా సోదరులు ప్రభువు నిబంధనలకు బద్దులై క్షణకాలము శ్రమలనుభవించిరి. కాని ఇప్పుడు వారు నిత్యజీవ మును చూరగొనిరి. నీవు మాత్రము దేవుని తీర్పునకు గురియై, నీ మిడిసిపాటునకు తగిన దండనము అనుభవించి తీరెదవు.

37. నా సోదరులవలె నేనును మా పూర్వుల చట్టముల కొరకు నా శరీరమును, ప్రాణములను బలిగా అర్పించుచున్నాను. కాని దేవుడు మా జాతిమీద శీఘ్రమే దయచూపవలెననియు ప్రభువే దేవుడని అంగీకరించువరకు ఆయన నిన్ను హింసింపవలెననియు నేను ప్రార్థించుచున్నాను.

38. ప్రభువు కోపము మా జాతియంతటి మీదను రగుల్కొనెను. కాని ఆయన ఆగ్రహమునకు గురియైన వారిలో నా సోదరులును నేను కడపటి వారలమగుదుముగాక!" అని పల్కెను.

39. అవమానకరములైన ఆ మాటలు విని రాజు మితిమీరిన ఆగ్రహము తెచ్చుకొని ఆ బాలకుని సోదరులందరికంటె గూడ క్రూరముగా హింసించెను.

40. ఆ రీతిగా కడగొట్టువాడుకూడ గతించెను. అతడు ప్రభువునెంత మాత్రమును శంకింపక పూర్ణ విశ్వాసము కనబరచెను.

41. శత్రువులు కుమారులందరి తరువాత తల్లినిగూడ సంహరించిరి.

42. శత్రువులు యూదులను బలినైవేద్యములు భుజింపవలెనని నిర్బంధ పెట్టుట గూర్చియు, వారిని క్రూరముగా హింసించుటను గూర్చియు ఈ సంగతులు చాలును.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services