ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Maccabees chapter 6 in Telugu మక్కబీయులు రెండవ గ్రంధము 6వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. తరువాత రాజు అథేనియను శాసనసభ పౌరుడు ఒకనిని యూదయాకు అధికారిగా పంపెను. యూదులు తమ ఆచారములను మతమును విడనాడునట్లు అతని ద్వారా నిర్బంధము చేయించెను.

2. ఆ అధికారి యెరూషలేము దేవళమును ఒలింపియా పర్వతాధిపతియైన సేయసు దేవునకు అంకితము చేసి దానిని అపవిత్రము చేయవలెనని ఆజ్ఞాపించెను. ఆ రీతినే గిరిజీము కొండమీదనున్న దేవళమును అతిథ్యమునకు అధిపతియైన సేయసు దేవునకు అంకితము చేయవలెనని కట్టడచేసెను. ఆ కొండచెంత వసించు ప్రజలే రాజునట్లు చేయింపుమని కోరిరి.

3. ఈ చర్యను యూదులు భరింపజాలరైరి.

4. అన్యజాతివారు దేవళమును మద్యపానముతోను, వ్యభిచారముతోను నింపిరి. వారు దేవాలయ పరిసరములలోనే వేశ్యలను కూడిరి. నిషిద్ధములైన వస్తువులను మందిరములోనికి కొనివచ్చిరి.

5. ధర్మశాస్త్రము నిషేధించిన బలిపశువులను బలిపీఠముపై సమర్పించిరి.

6. యూదుడు ఎవడును విశ్రాంతి దినమును గాని, సాంప్రదాయికమైన ఉత్సవములను గాని పాటింపకూడదు. కడకు తాను యూదుడనని చెప్పుకొనుటగూడ నేరమయ్యెను.

7. ప్రతినెల రాజు పుట్టినరోజు పండుగ చేసికొనునపుడు యూదులను బలిపశువుల ప్రేవులను తినుడని ఒత్తిడి చేసిరి. డయొనీససు పండుగ వచ్చినపుడు యూదులు కూడ రెమ్మల కిరీటములు తాల్చి ఊరేగింపులో పాల్గొనవలసివచ్చెను.

8. ప్టోలమీ ప్రోత్సాహముపై చేరువలోని గ్రీకు పట్టణములలోనున్న యూదులును అచటి గ్రీకు ప్రజలవలె బలి నైవేద్యములను భుజింపవలెనని ఆజ్ఞాపించిరి.

9. గ్రీకు సంప్రదాయములను పాటింపనొల్లని యూదులను వధింపవలెనని కట్టడచేసిరి. కనుక శత్రువులు యూదులను నాశనము చేయనున్నారని ఎల్లరికిని విదితమయ్యెను.

10. ఉదాహరణనకు తమ శిశువులకు సున్నతి చేసిరన్న నెపముతో ఇరువురు తల్లులను బంధించిరి. శిశువులను ఆ తల్లుల రొమ్ములపై వ్రేలాడగట్టి వారిని నగరము చుట్టు త్రిప్పిరి. అటుపిమ్మట వారిని నగర ప్రాకారము మీదినుండి క్రిందికి పడద్రోసిరి.

11. మరియొక మారు కొందరు యూదులు ఒక కొండగుహలో ప్రోగై రహస్యముగా విశ్రాంతిదినమును జరుపుకొనిరని అధికారి ఫిలిప్పునకు తెలియవచ్చెను. అతడు వారిని సజీవముగా దహనము చేయించెను. వారు విశ్రాంతిదినముపట్ల గల గౌరవముచే ఆత్మరక్షణ కొరకు పోరాడరైరి.

12. ఈ గ్రంథమును చదువు వారిట్టి ఉపద్రవములను గూర్చి విని నిరుత్సాహపడనక్కరలేదు. మన ప్రజలను నాశనము చేయుటకు కాదుగాని, వారికి క్రమశిక్షణ నేర్పుటకొరకు ప్రభువు ఈ హింసలను కల్పించెను.

13. పాపిని చాలకాలమువరకు శిక్షింపకుండ వదలివేయుటకంటె వెంటనే శిక్షించుట భగవంతుని కరుణకు నిదర్శనము.

14. ప్రభువు అన్య జాతుల వారిని వెంటనే శిక్షింపడు. వారి పాపము పండువరకును సహనముతో వేచియుండును. కాని మన విషయమున అటులకాదు.

15. అతడు మన పాపము పండకమునుపే మనలను శిక్షించును.

16. ప్రభువు తన ప్రజలమైన మనపట్ల నిరంతరము కరుణ చూపును. అతడేదో విపత్తు పంపి మనల శిక్షించినను అంతటితో మనల చేయివిడువడు.

17. పాఠకులను హెచ్చరించుటకుగాను ఇచట నేనీ సూచన చేసితిని. ఇంతటితో ఈ విషయమును ముగించి మరల మన కథకు వత్తము.

18. వయోవృద్ధుడును, ఎల్లరి మన్ననకు పాత్రుడైనవాడునగు ఎలియాసరను ధర్మశాస్త్ర బోధకుడొకడు కలడు. పందిమాంసమును తినిపించుటకుగాను నిర్బంధముతో అతని నోటిని తెరిపించిరి.

19-20. కాని అతడు అవమానకరముగా జీవించుటకంటె గౌరవప్రదముగా చనిపోవుట మేలనియెంచెను. కనుక ఎలియాసరు తన నోటిలోని మాంసమును ఉమిసివేసి తానే స్వయముగా హింసాస్థానమునకు వెళ్ళెను. ప్రజలు ప్రాణములకుగూడ తెగించి ధైర్యముతో నిషిధ భోజనము విడనాడవలయునుకదా!

21. అన్యజాతుల బలులను అర్పించువారు చాలకాలము నుండి ఎలియాసరు స్నేహితులు. కనుక వారు అతనిని ప్రక్కకు తీసికొని పోయి "అయ్యా! నీవు స్వయముగా తయారు చేసికొనిన మాంసమునే తెప్పించుకొని భుజింపుము. కాని రాజాజ్ఞ ప్రకారము ఈ బలి నైవేద్యము భుజించుచున్నట్లు మాత్రము నటన చేయుము. ఈ రీతిగా నీవు చావును తప్పించుకోవచ్చును.

22. నీ చిరకాల మిత్రులమైన మేము చేయు ఈ సహాయమును అంగీకరింపుము" అని బ్రతిమాలిరి.

23. కాని ఎలియాసరు తన పెద్ద ప్రాయమునకును, నరసిన వెండ్రుకలకును కళంకము రాకుండునట్లుగా నిర్ణయము చేసికొనెను. బాల్యమునుండి అతడు ప్రభువు పవిత్రాజ్ఞలకు బద్దుడై జీవించెను. కనుక అతడు “మీకిష్టమైనచో నన్ను చంపివేయుడు,

24. నా ప్రాయమువాడు ఇట్లు నటన చేయుట తగదు. నేనిట్లు చేయుదునేని మన యువకులు చాల మంది తొంబదియేండ్ల ఈడున ఎలియాసరు తన మతధర్మములను విడనాడెనని తలంపరా?

25. కొద్ది యేండ్లపాటు జీవించుటకుగాను ఇప్పుడు ఈ మాంసము భుజించినట్లు నటన చేయుదునేని నేను అపవిత్రుడనై పోయి, నా ముసలితనమునకు మాయని మచ్చ తెచ్చుకొందును. నన్ను చూచి చాలమంది యువకులు పెడ దారిపట్టరాదు.

26. తాత్కాలికముగా నరులనుండి చావు తప్పించుకొనినంత మాత్రమున ఏమి లాభము? బ్రతికియున్నను, చనిపోయినను దేవుని తప్పించుకోజాలము గదా?

27. ఇప్పుడు నేను ధైర్యముగా ప్రాణములు ఒడ్డెదనేని ఇన్ని యేండ్లు బ్రతికిన నా జీవితము సార్థకమగును.

28. అప్పుడు నేను యువకులకును చక్కని ఆదర్శము చూపినవాడనగుదును. పవిత్రములైన మన ధర్మశాస్త్ర విధులకొరకు ఉదారబుద్దితోను, సంతోషముతోను ప్రాణములర్పించినచో అది యోగ్యమైన మరణమగునని వారును నేర్చుకొందురు” అనెను. ఈ మాటలు పలికి ఎలియాసరు హింసాస్థానమును సమీపించెను.

29. హింసకులు అంతవరకు అతనిని ఆదరముతో చూచిరి. కాని ఈ మాటలు విన్న తరువాత వారు ఎలియాసరునకు పిచ్చి పట్టినదనుకొని అతని మీద రుసరుసలాడిరి.

30. అతడు వారి కొరడాదెబ్బలకు ప్రాణములు విడచుచు చివరి గడియలలో పెద్దగా మూలిగి “ప్రభువు సంపూర్ణము, పవిత్రమునైన జ్ఞానము కలవాడు. నేనీ ఘోర యాతనలను, మరణమును తప్పించుకొని ఉండగలిగెడి వాడనని ఆయన ఎరుగును. ప్రభువు పట్లగల భయ భక్తుల చేతనే నేనీ శ్రమలను సంతోషముగా సహించుచున్నాననియు ఆయనకు తెలియును" అని పలికెను.

31. ఈ రీతిగా ఎలియాసరు మరణించెను. ఒక్క యువకులకేగాక యూదజాతికి అంతటికిని అతడి మరణము ఆదర్శప్రాయమును, చిరస్మరణీయమును అయ్యెను.