ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Maccabees chapter 5 in Telugu మక్కబీయులు రెండవ గ్రంధము 5వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. ఈ కాలముననే అంటియోకసు ఐగుప్తు మీదికి రెండవసారి దాడిచేసెను.

2. అప్పుడు నలువది రోజుల పాటు యెరూషలేము నగరమంతటను ప్రజలు దర్శనములను చూచిరి. ఆ దర్శనములలో రౌతులు బంగారు ఆయుధములను ధరించి ఆకసమున స్వారిచేయుచున్నట్లు కనిపించిరి. ఈటెలను పట్టుకొని, కత్తులు ఝళిపించుచున్నట్లు చూపట్టిరి.

3. బారులు తీరి ఒకరితో ఒకరు పోరాడుచున్నట్లు అగుపించిరి. వారి డాళ్ళు ఒకదానితో ఒకటి ఒరసికొనుచుండెను. ఎల్లెడల ఈటెలు కనిపించెను. ఆకసమంతట బాణములు ఎగురుచుండెను. పలు విధములైన ఆయుధములును, గుఱ్ఱములకు పెట్టిన బంగారు కళ్ళెములును తళతళమెరయుచుండెను.

4. ఈ దర్శనములు శుభములనే కొనిరావలెనని పురజనులెల్లరును ప్రార్థించిరి.

5. అంతలో అంటియోకసు చనిపోయెనని వదంతులు పుట్టగా, యాసోను వేయిమంది సైనికులతో వచ్చి హఠాత్తుగా యెరూషలేమును ముట్టడించెను. ఆ సైనికులు నగర ప్రాకారములకు కావలి కాయు వారిని ఓడించి వెనుకకు తరిమి పట్టణమును స్వాదీనము చేసికొనిరి. మెనెలాసు పారిపోయి కొండ చెంతనున్న దుర్గమున దాగుకొనెను.

6. యాసోను అతని సైనికులు నిర్దయతో తోడి యూదులను ఊచకోత కోసిరి. తన జాతిని జయించుట మహాపరాజయమని యాసోను తలపడయ్యెను. అతడు తన ప్రజను తానే ఓడించుచున్నానని గుర్తింపక ఎవరినో శత్రువులను జయించుచున్నాననుకొని పొంగిపోయెను.

7. కాని యాసోను నగరముమీద అధికారమును మాత్రము కైవసము చేసికోజాలడయ్యెను. కనుక అతడు రెండవ సారి కూడ అమ్మోనీయుల దేశమునకు పారిపోవలసి వచ్చెను. అతని కుట్ర అతడికి అవమానమునే తెచ్చి పెట్టెను.

8. చివరన అతడు నీచమైన చావు చచ్చెను. అరబ్బుల రాజైన అరేటసు యాసోనుని చెరలో నుంచెను. తరువాత అతడు నగరమునుండి నగరమునకు పారిపోయెను. ఎల్లరును అతడిని వెన్నాడిరి. నీతినియమములు మీరినవాడనియు, తన జాతిని దేశమును నాశనము చేసినవాడనియు ఎల్లరతడిని అసహ్యించు కొనిరి. పిమ్మట యాసోను ఐగుప్తునకు పారిపోయెను. అచటినుండి మరల గ్రీసు దేశమునకు పలాయితు డయ్యెను. యూదులకు బంధువులైన స్పార్టా పౌరులు తనకు ఆశ్రయమిత్తురనుకొనెను గాని వారును అతనిని ఆదరింపరైరి.

9. తన మాతృదేశమునుండి చాలమంది పారిపోవుటకు కారకుడైన యాసోను కాందిశీకుడై పరదేశమున చచ్చెను.

10. అతడు చాలమందిని చంపివారి శవములను ఖననము చేయకుండనే వదలివేసెను. అతనికిని ఆ రీతినే జరిగెను. యాసోను చచ్చినప్పుడు కంటతడిబెట్టువారు లేరైరి. అతని పీనుగును ఖననము చేయువారుకాని, దానిని అతని పితరుల సమాధిలో పాతి పెట్టువారుగాని లేరైరి.

11. యెరూషలేమున జరిగిన పోరాటము గూర్చి విని అంటియోకసు యూదయా అంతయు తనపై తిరుగుబాటు చేయుచుచున్నదని ఎంచెను. అతడు వన్యమృగమువలె కోపము తెచ్చుకొని ఐగుప్తునుండి సరాసరి వచ్చి యెరూషలేమును ముట్టడించెను.

12. ఆ రాజు తన సైనికులతో తమ కంటబడినవారిని, ఇండ్లలో దాగుకొనియున్నవారిని చిత్రవధ చేయుడని చెప్పెను.

13. అట్లే వారు పెద్దలనక, పిన్నలనక, స్త్రీలనక, పిల్లలనక, కన్యలనక, చంటి బిడ్డలనక ఎల్లరిని ఊచ కోతకోసిరి.

14. మూడు రోజులలో యెరూషలేమునుండి ఎనుబది వేలమంది అదృశ్యులైరి. నలుబది వేలమంది ముట్టడిలో హతులైరి. మరియొక నలువదివేల మందిని శత్రువులు బానిసలుగా అమ్మివేసిరి.

15. ఇట్టి పాడుపని చేసినది చాలక అంటియోకసు గర్వముతో ప్రపంచమంతటిలోను మహాపవిత్రమైన యెరూషలేము దేవాలయమునకూడ ప్రవేశించెను. దేశమునకును, మతమునకును ద్రోహముచేసిన మెనెలాసే రాజును దేవాలయములోనికి తీసికొనివచ్చెను.

16. ఆ రాజు తన అపవిత్రములైన హస్తములతో మందిరములోని ఆరాధన పరికరములను తీసికొని పోయెను. దేవాలయ కీర్తిప్రతిష్ఠలను పెంపొందించుటకుగాను రాజులు దానము చేసిన వస్తువులను అతని పాపిష్టి హస్తములు కొల్లగొనిపోయెను.

17. ఆ రాజు తన విజయమును తలంచుకొని పొంగిపోయెనే కాని, ప్రజల పాపమునకుగాను తాత్కాలికముగా కోపము తెచ్చుకొనిన ప్రభువే దేవాలయమును అమంగళము కానిచ్చెనని గుర్తింపడయ్యెను.

18. ప్రజలు బహుపాపములు చేయబట్టి సరిపోయినదికాని, లేకపోయినచో అంటియోకసునకు గూడ వెంటనే శిక్షపడియుండెడిదే. అతని దుడుకుపని వమ్ము అయ్యెడిదే. సెల్యూకసు రాజు పంపగా వచ్చి, దేవాలయ కోశాగారమును పరీక్షించబోయిన హెలియొడోరసువలె అతడు కూడా కొరడా దెబ్బలు తినియుండెడివాడే.

19. ప్రభువు దేవాలయము కొరకు ప్రజలనెన్నుకోలేదు. తన ప్రజల కొరకే దేవాలయమును నిర్మింపచేసెను.

20. కనుక ఆ దేవాలయము గూడ ప్రజలవలె వినాశనమునకు గురియయ్యెను. కాని తరువాత ఆ ప్రజలవలె అదియు అభ్యుదయమును పొందెను. ప్రభువు కోపోద్రిక్తుడై దేవాలయమును విడనాడెను. కాని ఆయన కోపము శాంతించిన తరువాత దానికి మరల కీర్తియబ్బెను.

21. అంతియోకసు దేవాలయమునుండి పదునెనిమిది వందల వీసెల వెండిని దోచుకొని గబగబ అంతియోకియానకు తిరిగిపోయెను. అతనికి మిగుల పొగరెక్కగా మెట్టనేలమీద ఓడలను, సముద్రము మీద సైన్యములను నడిపింతుననుకొనెను.

22. ఆ రాజు యూదులను ముప్పుతిప్పలు పెట్టుటకు వారిమీద అధికారులను నియమించిపోయెను. యెరూషలేము మీద ఫిలిప్పును అధికారిగా నియమించెను. అతడు ప్రుగియా జాతివాడు, అంటియోకసుకంటే దుష్టుడు.

23. ఆ రీతినే గెరిజీము కొండకు అండ్రోనికసును అధికారిగా చేసెను. వీరుకాక మెనెలాసుకూడ అధికారము చెలాయించెను. అసలు అన్యజాతి అధికారుల కంటెగూడ ఇతడు తన జాతివారైన యూదులనధికముగా పీడించెను.

24. పైపెచ్చు అంతియోకసు యూదులను మిగుల ద్వేషించెను. మిసియానుండి కూలికి వచ్చిన సైనికులు ఇరువది రెండువేలమందితో అపోల్లోనియసు అను సైన్యాధిపతిని యూదయా మీదికి పంపెను. యెరూషలేమునందలి మగవారందరిని చంపవలెననియు, స్త్రీలను బాలకులను బానిసలుగా అమ్మి వేయవలెననియు రాజతడిని ఆజ్ఞాపించెను.

25. అపోల్లోనియసు యెరూషలేము ప్రవేశించి మొదట యూదులతో సంధిచేసికొనుటకు వచ్చినవానివలె నటించెను. తరువాత విశ్రాంతిదినము రాగా యూదులు పని విరమించుకొనిరి. ఆ రోజున అతని సైనికులు సాయుధులై నగరము వెలుపలికివచ్చి కవాతు చేయుచుండిరి.

26. అపోల్లోనియసు ఆ సైనిక విన్యాసమును చూడవచ్చిన వారందరిని చంపించెను. మరియు అతని సైనికులు నగరములోనికి ఉరికి పౌరులను చాల మందిని వధించిరి.

27. కాని యూదా మక్కబీయుడు దాదాపు తొమ్మిదిమంది ఇతరులు కొండలలోనికి పారిపోయి అచట వన్యమృగములవలె జీవించిరి. అశుద్ది దోషమునకు గురికాకుండుటకై వారు పర్వతములలో ఎదుగు మొక్కలను మాత్రము భుజించుచు కాలము వెళ్ళబుచ్చిరి.