ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Maccabees chapter 2 in Telugu మక్కబీయులు రెండవ గ్రంధము 2వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. ప్రజలు ప్రవాసమునకు వెళ్ళినపుడు యిర్మీయా వారిని పీఠము మీది అగ్నిని కొంత తమతో తీసికొని వెళ్ళుడని ఆదేశించినట్లుగా దస్తావేజులలో చదువు చున్నాము. ఈ అగ్ని గూర్చి మేమిప్పుడే చెప్పియుంటిమి.

2. అతడు వారికి ధర్మశాస్త్రమును ఉపదేశించెను. వారు ప్రభువు ఆజ్ఞలు పాటింపవలెనని చెప్పెను. వారు ప్రవాసదేశములలో తమ కంటబడు వెండిబంగారు విగ్రహములను, వాని అలంకరణములను చూచి ప్రలోభము చెందకూడదని కూడ హెచ్చరించెను.

3. ధర్మశాస్త్రము వారి హృదయములనుండి విడిపోకూడదని చెప్పెను.

4. పై దస్తావేజులనుండి ఇంకొక విషయము కూడ తెలియుచున్నది. పూర్వము మోషే కొండ ఎక్కి ప్రభువు తన ప్రజకీయనున్న భూమిని పరిశీలించెను గదా! యిర్మీయా కూడ ఈ కొండమీదికి వెళ్ళెను. అటుల వెళ్ళినపుడు అతడు దైవప్రేరితుడై గుడారమును, మందసమును తనవెంట రమ్మని ఆజ్ఞాపించెను.

5. ఆ కొండమీద యిర్మీయాకు పెద్ద గుహ ఒకటి కనిపింపగా అతడు గుడారమును, మందసమును, సాంబ్రాణి పొగవేయు పీఠమును ఆ గుహలో భద్రపరచి దాని ద్వారమును మూసివేసెను.

6. యిర్మీయా అనుచరులు కొందరు ఆ గుహకు పోవు మార్గమును గుర్తుపట్ట జూచిరిగాని, ఆ గుహ వారి కంటబడలేదు.

7. వారి ప్రయత్నము నెరిగి యిర్మీయా వారిని మందలించుచు ఇట్లనెను: “ప్రభువు తన ప్రజను మరల ప్రోగుచేసి వారికి కరుణ జూపినదాక ఈ ప్రదేశమెవరికి తెలియక రహస్యముగా నుండును.

8. ఆ సమయము వచ్చినపుడు ప్రభువు ఈ ప్రదేశమును ఎల్లరికిని తెలియజేయును. అప్పుడు మేఘములో ఆయన తేజస్సు కనిపించును. పూర్వము మోషే కాలమున, సొలోమోను దేవాలయమును ప్రతిష్టించి దానిని వైభవోపేతముగా పవిత్రము చేయుమని ప్రభువునకు మనవిచేసినపుడు కనిపించిన దివ్య తేజస్సే అప్పుడును కనిపించును."

9. పై దస్తావేజులనుండి ఈ అంశముకూడ విదితమగుచున్నది. విజ్ఞానియైన సొలోమోను దేవాలయ నిర్మాణము ముగించి దానికి ప్రతిష్ఠ చేయుచు బలిని అర్పించెను.

10. అప్పుడతడు ప్రార్థనచేయగా ఆకాశము నుండి అగ్ని దిగి బలిపశువును దహించెను. పూర్వము మోషే ప్రార్థించినపుడును అటులనే జరిగినది.

11. ఆ సమయమున బలినర్పించువారు పాపపరిహార బలిని భుజింపలేదు కనుక అగ్నియే దానిని దహించినదని మోషే నుడివెను.

12. అదే విధముగ సొలోమోను దేవాలయమును ప్రతిష్ఠించినపుడు ఎనిమిదినాళ్ళ పాటు ఉత్సవము చేసెను.

13. పై అంశములు రాజుల దస్తావేజులలోనే గాక నెహెమ్యా చరిత్రలోనూ కాననగును. ఈతడొక గ్రంథాలయమును నెలకొల్పియుండెను. మరియు అతడు దావీదురాజు రచనలను, బలులనుగూర్చిన రాజుల లేఖలను, రాజులను ప్రవక్తలను గూర్చిన గ్రంథములను సేకరించియుంచెను.

14. యూదా కూడ గ్రంథములను సేకరించెను. అవి గత యుద్దమున చెల్లాచెదరైపోయినవి. కొన్ని మాత్రమిప్పటికిని మిగిలియున్నవి.

15. మీకు ఈ పుస్తకములలో ఏవైన కావలసివచ్చినచో మాయొద్దకు మనిషిని పంపుడు.

16. మేమిపుడు దేవాలయ శుద్దీకరణోత్సవమును చేసికోబోవుచున్నాము. మీరు కూడ ఆ ఉత్సవము జరుపుకోవలెనని చెప్పుటకే ఈ కమ్మ వ్రాయుచున్నాము.

17. ప్రభువు తన ప్రజలనెల్లరిని రక్షించెను. మన పవిత్రదేశమును, రాచరికమును, యాజకత్వమును, దేవాలయమున ఊడిగముచేయు భాగ్యమును మనకు మరల దయచేసెను.

18. ఇటుల చేయుదు నని ఆయన ధర్మశాస్త్రమునందే వాగ్దానము చేసి యుండెను. ఆయన మనలను మహోపద్రవముల నుండి కాపాడెను. దేవాలయమును శుద్ధిచేసెను. ఆయన మనమీద కరుణకలిగి అనతి కాలముననే మన వారిని సమస్త జాతులనుండియు ప్రోగుజేసి ఈ దేవాలయమునకు తోడ్కొని వచ్చునని మేము ఆశించు చున్నాము.”

19. కురేనియా నివాసియగు యాసోను యూదా మక్కబీయుని గూర్చియు, అతని సోదరులగూర్చియు, మహాదేవాలయమును శుద్ధిచేసి దాని బలిపీఠమును ప్రతిష్ఠించుటను గూర్చియు ఐదు సంపుటముల గ్రంథమును వ్రాసెను.

20. యూదులు అంటియోకసు ఎపిఫానెసుతో, అతని కుమారుడగు యూపతోరుతోను జరిపిన యుద్ధములను ఆ రచయిత వర్ణించెను.

21. దైవదర్శనములు పొంది ధైర్యముతో పోరాడి యూద మతమును నిలబెట్టిన వీరులనుగూర్చి చెప్పెను. మన సైనికులు కొదిమందియేయైనను దేశమును అంతటిని గెలిచి అన్యజాతి వారిని పారద్రోలిరి.

22. ఇంకను వారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మన దేవాలయమును, యెరూషలేము నగరమును శత్రువులనుండి స్వాధీనము చేసికొనిరి. శత్రువులు ధర్మశాస్త్ర నియమములను రద్దుజేయబోవుచుండగా, వారు ఆ నియమములను మరల అమలు జరిపించిరి. ప్రభువు అనుగ్రహము వలననే వారు ఈ కార్యములన్నిటిని సాధింపగల్గిరి.

23. యాసోను వ్రాసిన ఐదుసంపుటముల గ్రంథమును నేను క్లుప్తీకరించి చెప్పితిమి.

24. ఈ చరిత్రను చదువగోరు వారికి ఈ గ్రంథమునందలి వస్తు బాహుళ్య మును, నానావిషయ ప్రస్తావనమును గొప్ప అవరోధములను కలిగించును.

25. కనుక నేను అన్ని తరగతుల పాఠకులను మనసులో పెట్టుకొని ఈ చరిత్రను సులువైన పద్ధతిలో వ్రాసితిని. ఉల్లాసముకొరకు చదువు వారికి ఈ రచన ఆనందమును చేకూర్చును. ఈ చరిత్రలోని సంఘటనలను కంఠతః నేర్చుకోగోరు వారికి ఇది శ్రమను తగ్గించును.

26. ఇట్టి సంక్షేపమును తయారు చేయవలెనన్న మిగుల శ్రమపడవలయును. రాత్రులు నిద్రకూడ మానుకొని కష్టించి పని చేయవలయును.

27. భిన్న రుచులుగల అతిథులను తృప్తిపరచు విందు సిద్ధముచేయుటెంతకష్టమో ఈ పనియు అంత కష్టము. అయినను ఈ గ్రంథమును చదువు పాఠకుల సంతృప్తి నిమిత్తము నేను ఈ శ్రమనంతటినీ సంతోషముతో అనుభవింతును.

28. ఆయా సంఘటనలను సవిస్తరముగా వర్ణించుట అను కార్యమును మూల రచయితకే వదలివేయుదును. నేను మాత్రము ఆ సంఘటనలను సంగ్రహముగానే వివరింతును.

29. క్రొత్తయిల్లు కట్టువాడు గృహ నిర్మాణమున కంతటికి బాధ్యుడు. ఆ ఇంటికి రంగువేయువాడు అలంకరణమునకు మాత్రమే బాధ్యుడు. నా పని ఈ రెండవది మాత్రమే.

30. సంగతులన్నిటిని తెలిసికొని, అయా అంశములను సవిస్తరముగా పరిశీలించి జాగ్ర త్తగా వివరించుట గ్రంథమును వ్రాసిన చరిత్రకారుని పని.

31. కాని ఆ గ్రంథమునకు సంక్షేపమును తయారు చేయు రచయిత, విషయములను సంగ్రహముగా చెప్పినచాలు. విషయ విస్తరణమతని పని కాదు.

32. కనుక ఇక అధికముగా ఏమియు చెప్పక ఈ చరిత్రను ఇంతటితో ప్రారంభింతును. పీఠికను సుదీర్ఘముగా వ్రాసి అసలు చరిత్రను సంగ్రహముగా వ్రాయుట తెలివితక్కువ పని కదా!