1. మూడేండ్లు కడచిన తరువాత సెల్యూకసు కుమారుడైన దెమేత్రియసు గొప్ప సైన్యముతోను, నౌకాబలముతోను వచ్చి త్రిపోలిసు రేవులో దిగెను. ఈ సంగతి యూదా అతని అనుచరులు వినిరి.
2. దెమేత్రియసు అంతియోకసును, అతడి సంరక్షకుడు లీసియాసును వధించి రాజ్యమును స్వాధీనము చేసి కొనెనని తెలియవచ్చెను.
3. అల్కిమోసు అనునాతడు పూర్వము ప్రధాన యాజకుడుగా పనిచేసియుండెను. అతడు యూదులు తిరుగుబాటుచేసిన కాలమున బుద్ధిపూర్వకముగనే గ్రీకుల ఆచార వ్యవహారములను అనుసరించెను. అతడు తనకు మరల ప్రధానయాజక పదవి లభింపదనియు యూదులు తన్ను శిక్షింతురనియు భయపడెను.
4. కనుక అల్కిమోసు నూట ఏబది ఒకటవ యేట' దెమేత్రియసు రాజును సందర్శింపబోయెను. ఆ సమయమున అతడు రాజునకు బంగారు కిరీటమును, ఖర్జూరపత్రమును, మామూలుగా దేవాలయమున అర్పించు ఓలివు కొమ్మలను బహూకరించెను. అతడు అప్పుడు తన కోరికలేమియు రాజునకు ఎరిగింపడయ్యెను.
5. కాని తరువాత రాజు అల్కిమోసుని తన మంత్రాలోచన సభలోనికి పిలిపించి యూదులు ఏమి చేయగోరుచున్నారని ప్రశ్నించెను. అప్పుడతడు తన వెఱ్ఱి కోర్కెలను తీర్చుకోగోరి రాజుతో ఇట్లు చెప్పెను:
6. "హాసిదీయులు అను తెగకు చెందిన యూదులకు యూదా నాయకుడు. వారు యుద్ధ ప్రియులు, తిరుగుబాటుదారులు, దేశమున శాంతిని భంగపరచువారు.
7. వారు నా జన్మహక్కు అయిన ప్రధానయాజక పదవిని నాకు దక్కనీయరైరి. కనుకనే నేడు నేనిచటికి రావలసివచ్చినది.
8. ప్రభులవారి శ్రేయస్సును కాంక్షించుట నా మొదటి బాధ్యత. మా ప్రజల శ్రేయస్సును గణించుట నా రెండవ బాధ్యత. యూదాబృందము వారి పిచ్చిపోకడలవలన ఇపుడు మా ప్రజలు పడరానిపాట్లు పడుచున్నారు.
9. ప్రభువుల వారు ఈ సంగతులెల్ల పరిశీలించి చూచిన పిదప తమరికి సహజమైన దయాదాక్షిణ్యముల చొప్పున కార్యాచరణనకు పూనుకొనుడు. తమరు మా ప్రజల బానిసత్వమును తొలగించి దేశమును కాపాడవలయును.
10. యూదా బ్రతికియున్నంతకాలము మా రాజ్యమున శాంతి నెలకొనదు.”
11. అల్కిమోసు తన ఉపన్యాసమును ముగింపగానే సభలోని రాజస్నేహితులు రాజును యూదామీదికి పురికొల్పిరి. వారికి యూదా అనిన గిట్టదు.
12. కనుక రాజు అంతకు ముందే తన రాజ్యమున గజాధ్యక్షుడుగానున్న నికా నోరును యూదియాకు అధిపతిగా నియమించి అతడిని అచటికి పంపెను.
13. యూదాను వధించి అతని అనుచరులను చిందరవందరచేసి మందిరములలోకెల్ల శ్రేష్ఠమైన యెరూషలేము మందిరమునకు అల్కిమోసును ప్రధానయాజకునిగా నియమింపుము అని రాజు అతనిని ఆజ్ఞాపించెను.
14. యూదా దాడులకు తట్టుకోలేక యూదయానుండి పారిపోయిన అన్యజాతివారెల్లరును తిరిగివచ్చి నికానోరుతో చేతులు కలిపిరి. యూదుల ఓటమివలన తాము లాభము పొందవచ్చునని వారి ఆలోచనము.
15. నికానోరు తమ మీదికి దండెత్తి వచ్చుచున్నాడనియు, తమ దేశమునందలి అన్యజాతివారు అతనితో చేతులు కలుపనున్నారనియు యూదులు వినిరి. కనుక వారు తలమీద దుమ్ము చల్లుకొని దేవుని ప్రార్థించిరి. ఆ ప్రభువు కలకాలమువరకు వారిని తన ప్రజగా ఎన్నుకొనినవాడు, ఆపదలలో వారిని తప్పక ఆదుకొను వాడునుగదా!
16. అటుపిమ్మట వారు యూదా ఆజ్ఞపై యుద్ధమునకు సన్నద్ధులై శత్రువులను ఎదుర్కొనుటకు గాను డెస్సావు నగరమువద్దకు వచ్చిరి.
17. యూదా సోదరుడైన సీమోను నికానోరుతో పోరు మొదలుపెట్టెను. కాని శత్రువులు తలవని తలంపుగా వచ్చి మీద పడుటచే అతడు ఓడిపోజొచ్చెను.
18. అయినను యూదా అతని అనుచరులు మహా పరాక్రమముతో తమ దేశముకొరకు పోరాడుదురని నికానోరు వినెను. కనుక అతడు యుద్దముద్వారా సమస్యను పరిష్కరింప బూనుట మంచిది కాదని యెంచి,
19. యూదులతో సంధి చేసికొనుటకు పోసిడోనియసు, తెయొడోటసు, మత్తతియాసులను అనువారలను పంపెను.
20. యూదా సంధి షరతులను జాగ్రత్తగా పరిశీలించిన పిదప వానిని తన అనుచరులకు తెలియజేసెను. వారెల్లరును ఏకాభిప్రాయము కలవారు కనుక సంధికి అంగీకరించిరి.
21. ఇరుపక్షముల నాయకులు కలిసికొనుటకు ఒక రోజు నిర్ణయింపబడెను. ఉభయ పక్షములనుండి ఒక్కొక్క రథము వచ్చెను, మరియు గౌరవాసనములు తెచ్చి ఒక తావున అమర్చిరి.
22. శత్రువులు ద్రోహము తలపెట్టవచ్చునన్న భావముతో యూదా ముందుగనే కీలకమైన తావులలో యుద్ధము నకు సన్నుద్దులైన సైనికులను నిల్పెను. కాని ఇరువురు నాయకులును సుహృద్భావముతో మాటలాడుకొని సంధి కుదుర్చుకొనిరి.
23. అటు తరువాత కొంత కాలమువరకు నికానోరు యెరూషలేముననే వసించెను. అతడు యూదులకెట్టి హానియు తలపెట్టలేదు. పైపెచ్చు క్రొత్తగా తన పక్షమును చేరుటకు వచ్చిన వారిని కూడ వెనుకకు పంపివేసెను.
24. నికానోరు తరచుగా యూదాను తన దగ్గర ఉంచుకొనెడివాడు. వారిరువురును ఆప్తమిత్రుల వలె మెలిగెడివారు.
25. యూదాను పెండ్లి చేసికొని గృహస్థ జీవితము గడపుమని అతడు ప్రోత్సహించెను. ఆ రీతిగనే యూదా వివాహమాడి ప్రశాంతముగా జీవింపజొచ్చెను.
26. నికానోరు, యూదా కలిసిమెలిసి ఉండుట చూడగా అల్కిమోసునకు కన్నుకుట్టెను. అతడు వారి సంధి షత్రము నకలును ఒకదానిని తీసికొని దెమేత్రియసు రాజునొద్దకు వెళ్ళెను. నికానోరు రాజ్యమునకు ద్రోహము తలపెట్టుచున్నాడనియు, అతడు రాజద్రోహియైన యూదాను తనకు అనుయాయిని చేయబోవుచున్నాడనియు రాజుతో కొండెములు చెప్పెను.
27. ఆ దుర్మార్గుని మాటలువిని రాజు ఉగ్రుడయ్యెను. కోపముతో నికానోరునకు కమ్మ వ్రాసి అతడు యూదాతో చేసికొనిన సంధి తనకు ఏమాత్రము ఇష్టములేదని తెలియజేసెను. యూదాను వెంటనే బంధించి అంతియోకియాకు పంపుమని ఆజ్ఞాపించెను.
28. ఆ లేఖను చూడగనే నికానోరు వికల మనస్కుడయ్యెను. ఎట్టి అపరాధము చేయని యూదాతో మాటతప్పుటకు అతని మనసు అంగీకరింపదయ్యెను.
29. అయినను రాజాజ్ఞ మీరరాదుకదా! కనుక అతడు యుక్తితో యూదాను పట్టుకోగోరి అనువైన సమయము కొరకు వేచియుండెను.
30. నికానోరు తనతో పరుషముగాను, అనిష్టముగాను మాటలాడుచున్నాడనియు దానికి తగిన కారణముండుననియు యూదా గ్రహించెను. కనుక అతడు చాలమంది అనుచరులను ప్రోగుచేసికొని రహస్యస్థానమునకు వెడలిపోయెను.
31. యూదా తన యెత్తుకు ఎదురెత్తు పన్నెనని గ్రహించి నికానోరు పవిత్రమైన మహా దేవాలయమునకు వెళ్ళి, అచట బలిని అర్పించుచున్న యాజకులను “యూదాను తనకు పట్టి ఈయవలెను" అని ఆజ్ఞాపించెను.
32. కాని యాజకులు యూదా ఎచట దాగియున్నాడో తమకు తెలియదని ఒట్టువేసికొనిరి.
33. నికానోరు తన హస్తమును దేవాలయమువైపు చాచి ఇట్లు శపథము చేసెను: “మీరు నాకు యూదాను పట్టియీయలేని నేను ఈ మందిరమును నేలమట్టము చేసి ఇందలి పీఠమును కూల్చివేయుదును. ఈ తావున డయొనీష్యసు దేవతకు నూత్నముగా వైభవోపేతమైన మందిరము నిర్మింతును.”
34. ఇట్లు పలికి అతడు వెడలిపోయెను. వెంటనే యాజకులు ఆకాశమువైపు చేతులెత్తి యూదాజాతి పక్షమున ఎల్లవేళల పోరాడు దేవునికి ఇట్లు విన్నపము చేసిరి:
35. "ప్రభూ! నీకవసరమైనదేదియు లేదు. అయినను నీ నివాసమునకు గాను మా మధ్య ఒక దేవాలయముండుట నీకిష్టమయ్యెను.
36. కనుక మహాపవిత్రుడవైన ప్రభూ! ఇటీవలే శుద్ధిని పొందిన ఈ మందిరము ఏనాటికిని అపవిత్రము కాకుండునట్లు కాపాడుము."
37. యెరూషలేము నాయకులలో ఒకడైన రాగిసు అనువానిని గూర్చి నికానోరునకు పిర్యాదులు వచ్చెను. ఈ రాగిసు యూదులను గాఢముగా ప్రేమించెను. కనుక ప్రజలతడిని మిగుల గౌరవించి జాతిపితగా కొనియాడెడివారు.
38. యూదులు అన్యజాతి వారి మీద తిరుగుబాటు ప్రారంభించిన మొదటి రోజులలో స్వీయమత అవలంబనకుగాను రాగిసునకు శిక్షపడెను. అతడు ప్రాణములకుకూడ తెగించి యూదమత ఆచారములు పాటించెను.
39. యూదులనిన తనకే మాత్రము గిట్టదని తెలియజేయుటకుగాను నికానోరు ఐదువందలకు పైగా సైనికులను పంపి రాగసును బంధింపుడని చెప్పెను.
40. అతనిని బందీని చేసినచో యూదుల బలము సమసిపోవునని నికానోరు తలంచెను.
41. ఆ సైనికులు రాగిసు ఆశ్రయము పొందియున్న బురుజును ముట్టడించి దానిని వశము చేసికొనుటకు సిద్ధముగా నుండిరి. వారు వెలుపలి మండపములోనికి తెరచుకొను బురుజు ద్వారములను విప్పుటకు యత్నము చేసిరి. తలుపులను తగులబెట్టుటకుగాను అగ్నిని కొనితెండని ఆజ్ఞ ఇచ్చిరి. శత్రువులు తనను చుట్టుముట్టగా రాగిసు తన కత్తిమీదనే తానుపడి ప్రాణములు విడువగోరెను.
42. దుర్మార్గుల చేతికిచిక్కి అవమానములు భరించుటకంటె గౌరవప్రదముగా చనిపోవుటయే మేలనియెంచెను.
43. అతడు తన కత్తిమీదపడెను గాని ఆ గందరగోళములో గురితప్పి కొంచెము ప్రక్కకు పడినందున అది అతని ప్రాణములు తీయదయ్యెను. శత్రుసైనికులు అతడున్న గదిచెంతకు పరిగెత్తుకొని వచ్చుచుండిరి. వారిని చూచి అతడు గబాలున గోడ చెంతకు పరుగెత్తి అచటినుండి ధైర్యముతో క్రింద గుమి గూడియున్న జనసమూహములోనికి దూకెను.
44. కాని ఆ ప్రజలు దిఢీలున వెనుకకు జరుగగా అతడు వారు వదలి పెట్టిన ఖాళీస్థలములో పడెను.
45. అయినను అతడు చనిపోలేదు. సాహసముతో పైకి లేచి గాయములు నెత్తురులు చిమ్ముచుండగా జనసమూహము గుండ పరుగెత్తి ఒక ఎత్తయిన బండ మీదికి ఎక్కెను.
46. అప్పటికి రాగిసు దేహములోని నెత్తురంత కారిపోయెను. అతడు రెండుచేతులతో తన ప్రేగులను పెరికి జనము మీదికి విసరికొట్టెను. అట్లు విసరికొట్టుచు జీవమునకును, శ్వాసమునకును అధిపతియైన ప్రభువునకు ప్రార్థనచేసి ఆ ప్రేవులను ఒక దినమున మరల తనకు ప్రసాదింపుమని వేడుకొనెను. ఆ రీతిగా రాగిసు కన్నుమూసెను.