ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Maccabees chapter 13 in Telugu మక్కబీయులు రెండవ గ్రంధము 13వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. నూటనలుబదితొమ్మిదవయేట యూదా మక్కబీయుడును, అతని అనుచరులును అంతియోకసు యూపతోరు పెద్ద సైన్యముతో యూదామీదికి దండెత్తి వచ్చుచున్నాడని గ్రహించిరి.

2. ఆ రాజు సంరక్షకుడు అతని మంత్రియు లీసియాసు కూడ అతనితో వచ్చుచున్నాడని వినిరి. మరియు ఆ రాజు గ్రీకు పదాతులు లక్షయిరువది వేల మందిని, రౌతులు ఐదువేల మూడువందల మందిని, ఏనుగులు ఇరువది రెండిటిని, చక్రములకు వాడియైన కత్తులను అమర్చిన రథములు మూడు వందలను ప్రోగుజేసికొని వచ్చుచున్నాడనియు వినిరి.

3. మెనెలాసు కపటముతో శత్రువుల కోపు తీసికొని వారిని ప్రోత్సహింప మొదలిడెను. అతనికి కావలసినది తాను ప్రధాన యాజకుడుగా కొనసాగుటయే గాని మాతృదేశపు మేలు కాదు.

4. కాని రాజాదిరాజైన ప్రభువు, అంతియోకసును మెనెలాసు మీద విరుచుకొని పడునట్లుచేసెను. విపత్తులన్నిటికి కారణము ఆ దుర్మార్గుడేయని లీసియాసు రాజునకు ఎరిగించెను. కనుక రాజు మెనెలాసును బెరియాకు కొనిపోయి. ఆ పట్టణ సంప్రదాయము ప్రకారము అతనిని వధింపుడని ఆజ్ఞయిచ్చెను.

5. ఆ నగరమున డెబ్బదియైదు అడుగుల ఎత్తు గోపురము కలదు. దాని లోపలి భాగమును బూడిదతో నింపిరి. దానిపై అంచు గుండ్రముగా నుండి క్రింది బూడిదవైపు వంగియుండెను.

6. దేవాలయము సొమ్మును అపహరించిన వారినిగాని, ఇతరములైన పెద్ద తప్పులు చేసిన వారినిగాని ఆ గోపురము మీదికి తీసికొని వెళ్ళి, క్రింది బూడిద మీదికి పడద్రోసి చంపెడివారు.

7. దుర్మార్గుడు మెనెలాసును అదే చావుచచ్చెను. అతని శవమునకు ఖనన సంస్కారము కూడ లభింపదయ్యెను.

8. అట్టి చావు న్యాయసమ్మతమైనదే. అతడు చాలసారులు దేవాలయములోని పవిత్రమైన పీఠాగ్నిభస్మమును అపవిత్రము చేసెను. కనుక కడన బూడిదలోనే పడిచచ్చెను.

9. అంతియోకసు తన దండయాత్రను కొనసాగించెను. అతడు యూదులను తన తండ్రికంటె గూడ ఘోరతమముగా శిక్షింపవలెనన్న క్రూరబుద్ధితో వచ్చెను.

10. ఈ వార్త విని యూదా తన ప్రజలను పిలిచి రేయింబవళ్ళు ప్రభువునకు మనవిచేయుడని చెప్పెను. పూర్వముకంటెగూడ అదనముగా ఆ ఆపత్కాలమున ప్రభువు తమ్ము ఆదుకోవలెనని విన్నపములు చేయుడని చెప్పెను.

11. వారి ధర్మశాస్త్రము, దేశము, పవిత్ర మందిరము నాశనము కానున్నవని నుడివెను. నూత్నముగా స్వాతంత్య్రము పొందిన తమ దేశము మరల భక్తిహీనులైన అన్యజాతివారి స్వాధీనము కారాదని పలికెను.

12. ఎల్లరును యూదా ఆ పాటించి మూడు నాళ్ళపాటు ఉపవాసముండిరి. వారు నేలమీద బోరగిలబడి కన్నీళ్ళు కార్చుచు కరుణాళువైన ప్రభువును ప్రార్థించిరి. అంతట యూదా వారికి ప్రోత్సాహము కలుగునట్లు మాటలాడి యుద్ధమునకు సన్నద్ధులుకండని చెప్పెను.

13. అతడు యూదనాయకులను వ్యక్తి గతముగా సంప్రతించెను. ఆంటియోకసు యూదయా మీదికెత్తివచ్చి యెరూషలేమును ముట్టడించువరకు తాము యుద్ధమునకు తలపడకుండ మెదలకుండ ఉండుట మంచిది కాదని నిర్ణయించుకొనెను. దైవబలముతో పోయి త్రోవలోనే రాజును ఎదుర్కొనుట శ్రేయస్కరమని తలంచెను.

14. అతడు జయాపజయములను సర్వసృష్టికర్తయైన ప్రభువునకే వదిలివేసెను. తన సైనికులు మాత్రము శౌర్యముతో పోరాడవలెనని చెప్పెను. వారు తమ ధర్మశాస్త్రము, దేవాలయము, నగరము, దేశము తమ ప్రత్యేక జీవితవిధానము మొదలైనవానికొరకు ప్రాణములర్పించుటకు కూడ సిద్ధముగానుండవలెనని హెచ్చరించెను. యూదులు మోదెయిను చేరువలో శిబిరము పన్నిరి.

15. యూదా తన అనుచరులు “దేవునినుండి విజయము" అను వాక్యమును యుద్ధనాదముగా వాడుకోవలెనని చెప్పెను. అతడు ఆ రాత్రి తన సైన్యమున మహాశూరులైన యువకులను వెంటబెట్టుకొనిపోయి శత్రుశిబిరము నందు రాజు గుడారమునకు చేరువలోనున్న దళము మీదపడి రెండువేలమందిని వధించెను. అతని అనుచరులు శత్రువుల ఏనుగులన్నిటిలో పెద్దదానిని, దాని మావటి వానితోపాటు చంపిరి.

16. యూదా అతని వీరులు శత్రు శిబిరమునందెల్ల భయము, కలవరము పుట్టించి విజయము చేపట్టి తిరిగివచ్చిరి.

17. అప్పుడే తెలతెలవారుచుండెను. ప్రభువు శత్రువు నుండి యూదాను రక్షించుటవలన ఈ విజయము సిద్ధించెను.

18. రాజు యూదుల పరాక్రమమును చవిచూచెను కనుక యుక్తితో వారి దుర్గములను పట్టుకో చూచెను.

19. అతడు యూదుల బలమైన దుర్గమగు బేత్సూరును ముట్టడించెను. కాని యూదులు అతనిని ఓడించి తరిమికొట్టిరి.

20. యూదా ఆ దుర్గమును రక్షించువారికి ఆహారపదార్థములను పంపెను.

21. కాని రోడోకసు యూదసైనికుడు శత్రువులకు రహస్య సమాచారము అందించెను. వారు అతనిని గుర్తుపట్టి బంధించిరి.

22. రాజు బేత్సూరు దుర్గరక్షకులతో సంధి చేసికొనుటకు రెండుసారులు యత్నము చేసెను. ఆ సంధి కుదిరిన తరువాత అతడు తన సైన్యమునచటి నుండి మరలించుకొనిపోయెను. అటు తరువాత అతడు యూదా మీదికి దాడిచేసెనుగాని మరల ఓడిపోయెను.

23. అంతలో అంటియోకియాలో రాజ్య వ్యవహారములను పర్యవేక్షించుచున్న ఫిలిప్పు రాజు మీద తిరుగుబాటు మొదలు పెట్టెనని వార్తలు వచ్చెను. ఈ సమాచారము విని అంతియోకను దిగ్బ్రాంతి చెందెను. అతడు యూదులతో సంధి చేసికొనగోరెను. వారు నిర్ణయించిన షరతులకు అంగీకరించెను. వారి హక్కులను న్యాయబుద్ధితో మన్నింతునని మాట ఇచ్చెను. యూదులతో సంధి కుదుర్చుకొని బలినర్పించెను. దేవాలయమునకు ఉదారముగా కానుకలు అర్పించి దానిపట్ల గౌరవము ప్రదర్శించెను.

24. తనను దర్శింపవచ్చిన మక్కబీయుని యెడల దాక్షిణ్యము చూపెను. ప్టోలమాయిసునుండి గెరారువరకుగల దేశమునకు హెగెమోనిషెసును రాష్ట్రపాలకునిగ నియమించెను.

25. తరువాత రాజు ప్టోలమాయిసునకు వెళ్ళిపోయెను. అచటి ప్రజలు రాజు యూదులతో చేసికొనిన సంధినిగూర్చి ఆగ్రహముచెందిరి. ఆ సంధిని రద్దు చేయవలెనని కోరిరి.

26. కాని లీసియాసు వేదికమీదికెక్కి సంధిని సమర్ధించుచు మాటలాడి ప్రజలను ఒప్పించెను. కడన వారు సంధిని అంగీకరించి అలజడిని మానుకొనిరి. అటుపిమ్మట అతడు అంతియోకియాకు వెడలిపోయెను. రాజు యూదా మీదికి దాడిచేసి వెనుదిరిగి పోయిన వృత్తాంతమిది. రాజు యూదా మీదికి దాడిచేసి వెనుదిరిగి పోయిన వృత్తాంతమిది.