ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

2 Maccabees chapter 1 in Telugu మక్కబీయులు రెండవ గ్రంధము 1వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. “యెరూషలేములోను, యూదయాలోను నివసించు యూదులు ఐగుప్తునందలి సోదర యూదులకు శుభము పలికి వ్రాయునది. మీకు శాంతియు, అభ్యుదయము సిద్ధించునుగాక!

2. ప్రభువు తన విశ్వాస దాసులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులతో చేసికొనిన నిబంధనమును స్మరించుకొని మీకు మేలు చేయునుగాక!

3. ప్రభువు మీకు తనను ఆరాధించు బుద్ది పుట్టించునుగాక! ఆయన మీరు హృదయపూర్వకముగను, ఉత్సాహముగను తన చిత్తమును పాటించునట్లు చేయునుగాక!

4. తన ధర్మశాస్త్రమును, తన ఆజ్ఞలను అర్థము చేసికొను శక్తిని మీకు ప్రసాదించి మీకు శాంతిని దయచేయునుగాక!

5. మీ ప్రార్ధనలు ఆలించి మీ తప్పిదములను మన్నించును గాక! ఆపత్కాలమున మిమ్ము చేయి విడువకుండును గాక!

6. ఇచట మేము మీ కొరకు ప్రార్థనలు అర్పించుచున్నాము.

7. గ్రీకుశకము నూట అరువది తొమ్మిదవ యేట (క్రీపూ 143) దెమేత్రియసు పరిపాలనాకాలమున మేము మీకొక లేఖను వ్రాసి ఇట్లు తెలియజేసితిమి: 'యాసోను అతని అనుచరులు మన పరిశుద్ధ దేవాలయము మీద తిరుగబడిన తరువాత మేము మతహింసలకును, ఉపద్రవములకును గురియైతిమి.

8. వారు దేవాలయ ద్వారములను తగులబెట్టి, నిర్దోషులైన ప్రజలను వధించిరి. అంతట మేము ప్రభువునకు మొరపెట్టగా ఆయన మా వేడికోలును ఆలించెను. మేము పశుబలులు, ధాన్యబలులు అర్పించితిమి. దేవాలయమున దీపములు వెలిగించితిమి. సాన్నిధ్యపు రొట్టెలను అమర్చితిమి.

9. కనుక మీరును కీస్లేవు నెలలో గుడారముల పండుగ జరుపుకొనుడు. ఈ కమ్మ గ్రీ.శ. నూట ఎనుబది ఎని మిదవ (క్రీ.పూ 124) వ యేట వ్రాయబడినది.”

10. “యెరూషలేములోను, యూదయాలోను వసించు యూదులును, యూదుల పరిపాలన సభయు, యూదాసు కలిసి యాజకుల తెగకు చెందినవాడును ప్టోలమీ రాజునకు, గురువునగు అభిషిక్తుడైన అరిష్టోబులసునకును ఐగుప్తులోని యూదులకును నమస్కరించి వ్రాయునది. మీకెల్లరికిని శుభాకాంక్షలు, ఆరోగ్యము సిద్ధించునుగాక!

11. ప్రభువు మమ్ము పెద్ద ఆపదనుండి కాపాడెను గనుక మేము ఆయనకి వందనములు చెల్లించుచున్నాము. మేము రాజు నెదిరించి పోరాడవలసి వచ్చెను.

12. కాని ప్రభువు పరిశుద్ధ నగరమునకు వ్యతిరేకముగ పోరాడిన వారిని పారద్రోలెను.

13. అంతియోకసు రాజు పారశీకమున ప్రవేశించినపుడు అతని సైన్యము అజేయముగానుండెను. కాని నానెయా దేవతను అర్చనచేయు యాజకులు మోసముతో అతని సైన్యమును తమ దేవళములోనే చిత్రవధ చేసిరి.

14. ఆ రాజు తన స్నేహితులతో నానెయా దేవళమునకు వెళ్ళెను. అతడు ఆ దేవతను పెండ్లియాడి ఆమె దేవళము నందలి నానావిధ నిధులను వరకట్నము పేరుతో అపహరింప చూచెను.

15. యాజకులు ఆ నిధులను దేవాలయమున ప్రదర్శింపగా రాజు వానిని స్వాధీనము చేసికొనుటకుగాను కొద్దిమంది మిత్రులతో దేవాలయములోనికి వెళ్ళేను, గాని యాజకులు వెంటనే గుడి తలుపులు మూసిరి.

16. వారు పైకప్పులోని రహస్య తలుపు తెరచి రాజును అతని మిత్రులను రాళ్ళతో కొట్టి చంపిరి. వారి తలలను నరికివేసి దేవాలయము వెలుపల నిలిచియున్న ప్రజల చెంతకు విసరివేసిరి.

17. ఆ దుర్మార్గులను తగిన రీతిగా శిక్షించినందులకు గాను మన దేవుని స్తుతింతముగాక! అన్ని కార్యములకు గాను అతనిని కీర్తింతముగాక!

18. మేము కీస్లేవు నెల ఇరువది ఐదవ తేదీ గుడారముల పండుగవలె దేవాలయ శుద్ధీకరణ పండుగను గూడ జరుపుకొందుము. మీరును ఈ పండుగను చేసికోవలెనన్న కోర్కెతో, మేము ఈ క్రింది సంఘటనను గూర్చి మీకు వ్రాయుచున్నాము. ఈ పండుగను చేసికొనుటద్వారా, పూర్వము నెహెమ్యాకు దేవాలయమును, బలిపీఠమును పునర్నిర్మాణముచేసి బలులు అర్పించునపుడు అగ్ని ఎట్లు ప్రత్యక్షమైనదో మీరు గుర్తుంచుకొందురు.

19. మన పూర్వులు పారశీకమునకు బందీలుగా వెళ్ళినపుడు భక్తిమంతులైన యాజకులు కొందరు బలిపీఠము మీదినుండి అగ్నిని తీసికొని వచ్చి ఎండిపోయిన ఒక బావిలో రహస్యముగా దాచియుంచిరి. వారు ఆ నిప్పును నేర్పుతో దాచిరి. కనుక అది ఎవరి కంటను పడలేదు.

20. చాల యేండ్లు కడచిన తరువాత దేవునికి అనుగ్రహము కలుగగా పారశీక ప్రభువు నెహెమ్యాను యెరూషలేమునకు పంపెను. నెహెమ్యా పూర్వము నిప్పును దాచిన యాజకుల వంశజులను పిలిచి, మీరు వెళ్ళి ఆ అగ్ని ఎచటనున్నదో కనుగొనుడని చెప్పెను. వారు అగ్ని కాదు గాని ఏదో చిక్కనైన ద్రవపదార్ధము తమ కంట బడినదని మాతో చెప్పిరి. నెహెమ్యా ఆ ద్రవపదార్ధమును కొంత తనయొద్దకు తీసికొనిరండని చెప్పెను.

21. బలికి అవసరమైన వస్తువులన్నిటిని బలిపీఠముపై అమర్చిన పిదప నెహెమ్యా వేదికమీది కొయ్యలమీదను, బలిపశువు మీదను ఆ ద్రవపదార్థమును పోయుడని యాజకులను ఆజ్ఞాపించెను. వారటులనే చేసిరి.

22. కొన్ని క్షణములు కడచిన తరువాత అంతవరకు మబ్బు చాటుననుండిన సూర్యబింబము మరల వెలుపలికి వచ్చి ప్రకాశించెను. వెంటనే బలిపీఠము మీదినుండి పెద్దమంట యెగసెను. ఎల్లరును ఆశ్చర్యచకితులైరి.

23. ఆ అగ్ని బలిపశువును దహించుచుండగా యాజకులు ప్రార్థనలు జపించిరి. యోనాతాను నడిపింపగా, నెహెమ్యా, ఇతర ప్రజలు ఆ ప్రార్థనలకు బదులు పలికిరి.

24. ఆ ప్రార్ధనము ఇట్లుండెను: “ప్రభూ! నీవు సర్వమును సృజించినవాడవు, భయంకరుడవు, శక్తిసంపన్నుడవు. అయినను నీవు కరుణామయుడవు, న్యాయము తప్పనివాడవు. నీవొక్కడవే రాజువు నీవొక్కడవే దయామయుడవు.

25. నీవొక్కడవే ప్రాణి పోషకుడవు, న్యాయవంతుడవు. నీవు సర్వశక్తి మంతుడవు, శాశ్వతుడవు. యిస్రాయేలీయులను సకల ఉపద్రవములనుండి కాపాడువాడవు. నీవు మా పితరులను నీ జనముగా ఎన్నుకొని, వారిని పవిత్రపరచితివి.

26. యిప్రాయేలీయుల తరపున మేము సమర్పించు ఈ బలిని అంగీకరింపుము. నీ ప్రజలమైన మమ్ము రక్షించి పవిత్రుల చేయుము.

27. అన్యదేశములలో బానిసలుగా మ్రగ్గుచున్న నీ ప్రజను దాస్యమునుండి విడిపింపుము. చెల్లాచెదరైపోయిన నీ జనమును మరల ప్రోగుచేయుము. అన్యుల అవమానమునకు గురియైన నీ ప్రజను కరుణింపుము. నీవే మా ప్రభుడవని అన్యజాతులెల్ల గుర్తించునుగాక!

28. మమ్ము పీడించు గర్వాత్ములను శిక్షించుము.

29. మోషే నుడివినట్లే నీ ప్రజ ఈ పవిత్ర దేశమున స్థిరపడునట్లు చేయుము.”