ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు రెండవ గ్రంధము 2వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. అటుపిమ్మట దావీదు యావేను సంప్రతించి “ప్రభూ! నన్ను యూదా పట్టణములకు వెడలి పొమ్మందువా” అనియడిగెను. ప్రభువు పొమ్మనెను. దావీదు మరల, 'ఏ పట్టణమునకు పొమ్మందువు' అని అడుగగా, యావే 'హెబ్రోనునకు పొమ్ము' అని చెప్పెను.

2. కనుక దావీదు తన ఇద్దరు భార్యలతో అనగా యెస్రెయేలునుండి వచ్చిన అహీనోవముతో, కర్మేలునకు చెందిన నాబాలు భార్యయగు అబీగాయీలుతో హెబ్రోను చేరెను.

3. అతడు తన అనుచరులను కూడ వారివారి కుటుంబములతో వెంట గొనిపోయెను. వారందరును హెబ్రోనుననే వసించిరి.

4. యూదా జనులు అచటికి వచ్చి దావీదును యూదాకంతటికి రాజుగా అభిషేకించిరి.

5. యాబేషుగిలాదు పౌరులు సౌలు శవమును పాతి పెట్టిరి. కనుక దావీదు యాబేషుగిలాదునకు దూతలనంపి “మీరు సౌలురాజును ఖననము చేయించి పుణ్యముకట్టుకొంటిరి. యావే మిమ్ము దీవించుగాక!

6. ప్రభువు మిమ్ము కరుణించి మీకు ప్రత్యుపకారము చేయుగాక! నేను మీకు మేలు చేసెదను.

7. మీరందరు ధైర్యముపూని వీరులవలె మెలగుడు. మీ ప్రభువైన సౌలు గతించెను. యూదా ప్రజలందరు నన్ను రాజుగా అభిషేకించిరి” అని కబురు పెట్టించెను.

8. సౌలు సైన్యాధిపతియు నేరు కుమారుడునగు అబ్నేరు సౌలు పుత్రుడైన ఈష్బోషెతును మహనాయీమునకు కొనివచ్చెను.

9. అతనిని గిలాదు, ఆష్షేరు, యెస్రెయేలు, ఎఫ్రాయీము, బెన్యామీను మండలములకును యిస్రాయేలుకు అంతటికిని రాజును చేసెను.

10. సౌలు కుమారుడగు ఈష్బోషేతు యిస్రాయేలీయులకు ఏలిక అగునప్పటికి నలువదియేండ్ల వాడు. అతడు రెండేండ్లు ఏలెను.

11. కాని యూదీయులు దావీదును ఎన్నుకొనిరి. అతడు హెబ్రోనున రాజై ఏడేండ్లు ఆరుమాసములు యూదీయులను పరిపాలించెను.

12. నేరు కుమారుడగు అబ్నేరు, ఈష్బోషెతు అనుచరులును మహనాయీము నుండి గిబ్యోనునకు వచ్చిరి.

13. సెరూయా కుమారుడు యోవాబు, దావీదు అనుచరులు దండులతో వచ్చి గిబ్యోను నీటిగుంట దగ్గర వారినెదిరించి నిల్చిరి. కొలనుకు ఆ వైపున ఒకపక్షము ఈ వైపున ఒక పక్షము శిబిర ములు నిలిపిరి.

14. అబ్నేరు “ఇరువైపుల నుండి యవ్వనస్తులు ముందుకు వచ్చి బలాబలములు ప్రదర్శింతురుగాక!” అనెను. యోవాబు దానికి అంగీకరించెను.

15. కనుక సౌలు కుమారుడైన ఈష్బోషెతు పక్షమున పన్నిద్దరు బెన్యామీనీయులు పందెమునకు వచ్చిరి. దావీదు పక్షమున పన్నిద్దరు ప్రోగై ముందుకువచ్చిరి.

16. కాని ఆ మల్లులలో ప్రతివాడు తన పగవాని జుట్టు పట్టుకొని కత్తితో ప్రక్కలో పొడువగా అందరు ఒక్క మారే పందెమున కూలిరి. కావుననే గిబ్యోనులోనున్న ఆ తావుకు “హెల్కత్ హస్సూరీము” అనగా “కత్తుల పొలము” అని పేరు వచ్చెను.

17. ఆ రోజున పోరు ముమ్మరముగా సాగెను. అబ్నేరు, యిస్రాయేలీయులును దావీదు దళముల ముందు నిలువజాలక కాలికి బుద్ధి చెప్పిరి.

18. సెరూయా పుత్రులు యోవాబు, అబీషాయి, అసాహేలు మువ్వురును యుద్ధమున పోరాడుచుండిరి. వారిలో అసాహేలు అడవి లేడివలె చంగున పరుగిడును.

19. అతడు అబ్నేరును వెన్నాడజొచ్చెను. త్రోవను కుడి ఎడమలకు కదలక పగతుని పట్టుకోవలయునని పూనికతో పరుగెత్తుచుండెను.

20. అబ్నేరు వెనుదిరిగి చూచి "నన్ను వెన్నంటి వచ్చునది అసాహేలేనా?” అని అడిగెను. అతడు “అవును, నేనే” అనెను.

21. అబ్నేరు “నీవు కుడికో ఎడమకో తొలగి బంటును ఎవ్వనినైన పట్టుకొని వాని ఆయుధములు కొల్లగొనుము. నా వెంటబడనేల?” అనెను. కాని అసాహేలు అతనిని విడనాడలేదు.

22. అబ్నేరు మరల అసాహేలుతో “నన్ను తరుముటమాని వెళ్ళిపొమ్ము, లేదేని నిన్ను నేలగూల్తూను. కాని నీవు పడినపిదప నీ అన్న యోవాబు మొగము చూడజాలను గదా?” అనెను.

23. ఎన్ని చెప్పినను అసాహేలు అబ్నేరును విడువలేదు. అందుచే అబ్నేరు ఈటెగొని వెనుకతట్టుగా అసాహేలు పొట్టలో పొడిచెను. అది అతని వీపు చీల్చి వెలుపలికి వచ్చెను. అతడక్కడనే నేలకొరగి విలవిల తన్నుకొని ప్రాణములు విడచెను. దావీదు సైనికులు అసాహేలు పడినతావు చేరగనే దిఢీలున ఆగిపోయిరి.

24. అంతట యోవాబు, అబీషాయి అబ్నేరును వెన్నంటిరి. వారు గిబ్యోను మైదానమునకు పోవు త్రోవ వెంట గియా పట్టణమునకు ఎదుటనున్న 'అమ్మా' అను కొండకడకు వచ్చిరి. అంతలో చీకటి పడెను.

25. బెన్యామీను యోధులు అబ్నేరునంటి వచ్చి కొండ పైకెక్కి ఒక్కటిగా గూమిగూడినిల్చిరి.

26. అబ్నేరు యోవాబును కేకవేసి పిలిచి “ఈ సైనికులందరు కత్తివాదరకు ఎరగావలసినదేనా?మీరీరీతిగా తరుము కొనివచ్చిన చివరకేమగునో తెలియునా? మీ సోదరులను వెన్నాడవలదని నీ జనమును ఆజ్ఞాపింపక ఇంకను జాగుచేయుదువా?” అనెను.

27. యోవాబు "సజీవుడైన యావేతోడు! నీవు వలదంటివిగాని లేకున్న ఆ జనులు ప్రొద్దుపొడిచిన వరకు తమ సోదరులను తరిమికొట్టెడివారే సుమా!” అనెను.

28. అంతట యోవాబు బాకానూదగా యూదీయులు పోరాటమును విరమించి యిస్రాయేలీయులను తరుముటయు, వారితో యుద్ధము చేయుటయు మానిరి.

29. అబ్నేరు అతని బలగము రేయెల్ల యోర్దాను మైదానమున పయనము చేసిరి. నది దాటి ప్రొద్దుటి పూట గూడ నడకసాగించి మహనాయీము చేరిరి.

30. యోవాబు అబ్నేరును తరుముట చాలించి సైన్యమును ప్రోగుచేసికొనెను. దావీదు పక్షమున పందొమ్మిదిమంది వీరులును, అసాహేలును కూలిరి.

31. కాని దావీదు సైనికులు బెన్యామీనీయులైన అబ్నేరు బంటులను మూడువందల అరువది మందిని మట్టుపెట్టిరి.

32. వారు అసాహేలును కొనిపోయి బేత్లెహేమున అతని తండ్రిని పూడ్చివేసిన తావుననే పాతి పెట్టిరి. పిమ్మట యోవాబు అనుచరులను తీసికొని రేయంతయు ప్రయాణముచేసి ప్రొద్దు పొడు చునప్పటికి హెబ్రోను చేరుకొనెను.