ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 2వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. హన్నా ఇట్లు ప్రార్ధించెను: “నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించెదను. నేను శత్రువులను అపహసించెదను. ప్రభూ! నేను నీ రక్షణమునుగాంచి సంతసించెదను.

2. ప్రభువు వలె పరిశుద్ధుడెవడును లేడు. ప్రభూ! నీవు తప్ప ఇక ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దురము వేరే లేదు.

3. గర్వముతో విఱ్ఱవీగుచు మాటలాడకుడు. అహంకారోక్తులు నోటరానీయకుడు. ప్రభువు సమస్తమును ఎరిగినవాడు. సమస్త కార్యములు పరీక్షించువాడు.

4. బలశాలుల విల్లులు తుత్తునియలయ్యెను. బలహీనులు బలాఢ్యులైరి.

5. కలవారు కూటికై కూలికిపోయిరి. ఆకలిగొనిన దరిద్రులు అన్నము బడసిరి. గొడ్రాలు ఏడుగురు బిడ్డలను కనెను. సంతానవతి బిడ్డలను కోల్పోయెను.

6. చంపువాడు, ప్రాణమిచ్చువాడు ప్రభువే. పాతాళమునకు కొనిపోవువాడు, పైకి కొనివచ్చువాడు ప్రభువే.

7. ధనికుని చేయువాడు, దరిద్రుని చేయువాడు ప్రభువే! అణగదొక్కువాడు, అతిశయింపజేయువాడు ప్రభువే.

8. దరిద్రులను నేలమీది నుండి లేవనెత్తి, బిచ్చగాండ్రను పెంటప్రోగుల మీదినుండి పైకి లేపి, గౌరవముగల ఆసనములొసగి గొప్పవాండ్ర సరసన కూర్చుండబెట్టునది ప్రభువే. జగత్తు పునాదులు ఆయన వశము, లోకమును ఆ పునాదులపై నిల్పినది ప్రభువే.

9. ప్రభువు తన భక్తుల పాదములు తొట్రిల్లక కాపాడును. దుష్టులు చీకటిలో మటుమాయమగుదురు. సొంతబలము వలన ఎవడును బాగుపడడు.

10. ప్రభువు ఆకాశము నుండి గర్జించుచుండ అతని శత్రువులెల్ల చెల్లాచెదరగుదురు. ప్రభువు నేల నాలుగుచెరగుల తీర్పులు తీర్చును. తన రాజునకు తేజ మొసగును, తన అభిషిక్తుని అతిశయింపజేయును.”

11. హన్నా రామాకు వెడలిపోయెను. సమూవేలు దేవాలయముననే ఉండి యాజకుడైన ఏలీ పర్యవేక్షణలో యావేకు పరిచర్యచేయుచుండెను.

12. ఏలీ కుమారులు పరమదుర్మార్గులు. వారు యావేను లెక్క చేసెడివారుకారు.

13. ఎవరైనా బలి అర్పించుటకు షిలోకు వచ్చినయెడల యాజకుని పనివాడు మూడు చీలికల పెద్దగరిటను చేతబట్టి మాంసములు వండుచోటికి వచ్చును.

14. మాంసము ఉడికెడి కుండ, బాణలి, కాగు మొదలైన పాత్రలలో గరిటెను గ్రుచ్చగా వచ్చినంత మాంసమును తీసికొనిపోయి యాజకునకిచ్చును. బలులు అర్పించుటకై షిలోకు వచ్చిన యాత్రికులందరిపట్లను వీరు ఇట్లే ప్రవర్తించెడివారు.

15. పైగా యాత్రికులు బలిపశువు క్రొవ్వును పీఠముపై దహింపకముందే యాజకుని పనివాడు వచ్చి “మా యాజకునికి వడ్డించుటకై మాంసము మాకిండు. మాకు పచ్చిమాంసము కావలయును. ఉడుకబెట్టిన మాంసము మాకక్కరలేదు” అని చెప్పును.

16. అందులకు బలియర్పించువారు "అయ్యా! ఇదిగో క్రొవ్వు వేల్వబోవుచునే యున్నాము. కొంచెము ఆగుడు. ఆ పిమ్మట మీకు వలసినంత మాంసము తీసికొనిపొండు” అని అనినచో పనివాడు “కాదుకాదు, మీరిప్పుడే ఈయవలెను. లేనిచో నేనే బలవంతముగా తీసికొందును” అని బెదిరించును.

17. ఈ రీతిని యాజకులు యావే ఎదుట బహుగా పాపము మూటకట్టుకొనిరి. వారివలన యావేకు సమర్పించుబలికి గౌరవముకూడ పోయెను.

18. సమూవేలు యావేకు పరిచర్య చేయు చుండెను. ఆ బాలుడు యాజకులు ధరించు నార బట్టతో చేయబడిన ఎఫోదు తొడుగుకొని యావేకు పరిచర్య చేయుచుండెను.

19. సమూవేలు తల్లి ఏటేట బలి అర్పించుటకు భర్తతో కలసి వచ్చినపుడెల్ల అట్టి ఒక చిన్నఅంగీని కుట్టుకొని వచ్చి బాలునకు తొడిగెడిది.

20. అప్పుడు ఏలీ ఆ దంపతులను దీవించి ఎల్కానాతో “ఈమె తన బిడ్డను ప్రభువునకు కానుక ఇచ్చినది. దానికి బదులుగా ప్రభువు ఈమెవలన నీకు బిడ్డలను ప్రసాదించునుగాక!” అని చెప్పుచుండును. ఆ మీదట వారు తమ ఇంటికి తిరిగిపోయెడివారు.

21. యావే అనుగ్రహమువలన హన్నా మరల ముగ్గురు మగ బిడ్డలను, ఇద్దరు ఆడుబిడ్డలను కనెను. ఇంతలో సమూవేలు ప్రభువునెదుట ఎదుగుచుండెను.

22. ఏలీ అప్పటికే ముదివొగ్గు. అతడు తన కుమారులు యిస్రాయేలు ప్రజలకు చేయు దుష్కార్య ములను గూర్చి వినెను. వారు ప్రభుదర్శనము లభించు గుడారపు గుమ్మము వద్ద పరిచర్య చేయు పనికత్తెలను కూడిరనియు తెలిసికొనెను.

23. అతడు "కుమారులారా! ప్రజలందరు మీరు చెడు పనులు చేయుచున్నారని చెప్పుకొనుచున్నారు. ఇట్టి పనులు చేయనేల?

24. నాయనలారా! నేను వినిన వార్తలు మంచివి కావు. ఇది మీకు తగదు.

25. నరుడు నరునిపట్ల అపరాధము చేసినచో దేవుడు తీర్పు చెప్పును. కాని నరుడు దేవునిపట్ల పాపము చేసినచో ఇక వాని పక్షమున విజ్ఞాపన చేయగలవాడెవడు?" అని మందలించెను. అయినను యావే వారిని నాశనము చేయనెంచెను కనుక వారు తండ్రిమాట పెడ చెవిని పెట్టిరి.

26. సమూవేలు మాత్రము పెరిగి పెద్దవాడై దేవుని దయకును, ప్రజల మన్ననకును పాత్రుడయ్యెను.

27. అటుపిమ్మట దైవభక్తుడు యొకడు ఏలీ చెంతకువచ్చి “యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నీ పితరుని ఇంటివారు ఐగుప్తునందు ఫరోకు బానిసలైయుండగా నేను ప్రత్యక్షము కాలేదా?

28. నేను యిస్రాయేలు తెగలన్నింటిలోను లేవీ తెగనే ఎన్ను కొంటిని. వారు మాత్రమే నాకు యాజకులైనా యెదుట ఏఫోదు పవిత్రఅంగీని దాల్చి నా బలిపీఠముపై బలులర్పించి నా సమక్షమున ధూపము వేయవలయునని ఏర్పర్చుకొంటిని. యిస్రాయేలు ప్రజలర్పించు బలి భోజ్యములన్నిటిని నీ పూర్వులకే కైవసము చేసితినిగదా!

29. ' ఇన్ని ఉపకారములు చేసినపిదపగూడ నేను నిర్ణయించిన యీ బలులను మీరు చిన్నచూపు చూడనేల? నా భక్తులైన యిస్రాయేలు ప్రజలు సమర్పించు బలిభోజ్యములను మెక్కి కండలు పెంచుకొని తిరుగు నీ కుమారులను గౌరవించి నన్ను అలక్ష్యము చేయుచున్నావు గదా!

30. నీ తండ్రి కుటుంబమువారు, నీ కుటుంబము వారు కలకాలము నా సన్నిధిని నిలిచి పరిచర్య చేయుదురనెడు ప్రభుని వాగ్దానము ఒకటి కలదు. కాని ఆ వాగ్దానమును నేనిక నిలుపుకొనను. నన్ను గౌరవించువారిని నేను గౌరవింతును, నన్ను తృణీకరించువారిని నేనును తృణీకరింతును.

31. ఇక వినుము, నీ ఇంటి బలమును, నీ తండ్రి ఇంటి బలమును తగ్గింపుచేయు రోజులు దగ్గరకు వచ్చినవి. ఇక నీ కుటుంబములో ముసలివాడు ఒక్కడును ఉండడు.

32. నేను యిస్రాయేలు ప్రజలకు చేయు మేలు విషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగ నీవు చూచెదవు. ఇక నీ సంతతి వారందరును లేత ప్రాయముననే చత్తురు.

33. నీ సంతతివాడు ఎవడైనను మిగిలి నా బలిపీఠము చెంత పరిచర్య చేసెనేని వాని కన్నులకు మసకక్రమ్మును. వాని ఉసురు అణగారిపోవును. వాని బిడ్డలు క్రుళ్ళి కృశించి చత్తురు.

34. నీ కుమారులు ఇద్దరకు ముప్పు వాటిల్లును. అది నీకొక గుర్తుగా నుండును. వారిద్దరు ఒక్కరోజుననే చత్తురు.

35. కాని నేను విశ్వసనీయుడైన యాజకు నొకనిని ఏర్పరచుకొందును. అతడు నా చిత్తము చొప్పున నడచుకొనును. అతని సంతతివారు తరతరములవరకు నా అభిషిక్తుని ఎదుట మన్నన పొందుదురు.

36. ఇక నీ వంశమున మిగిలిన వారందరు అతని చెంతకు వచ్చి సాగిలపడి ఒక వెండికాసునో, లేక పిడికెడు కూటినో యాచింతురు. మాకు యాజక పరిచర్యలో పని కల్పింపుడు, పిడికెడు కూడు తిని బ్రతికిపోయెదము అని ప్రార్థింతురు” అని చెప్పెను.