ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సోలోమోను జ్ఞానగ్రంధము 19వ అధ్యాయము || Telugu Catholic Bible

 1.కాని ఆ దుష్టులు వినాశనము చెందు వరకు నీ కఠోర కోపమునకు గురియైరి. వారేమి చేయుదురో నీకు ముందుగనే తెలియును.

2. వారు నీ ప్రజలు వెళ్ళిపోవుటకు అనుమతించి పంపివేసిరి.  కాని వారు వెడలిపోయిన పిదప మనసు మార్చుకొని మరల వారి వెంటబడిరి.

3. ఆ దుష్టులు తమ మృతులను పాతి పెట్టుచు సమాధులచెంత విలపించుచునే వారిని వెన్నాడి పట్టుకోవలెనని బుద్ధిహీనమైన నిర్ణయము చేసికొని, పూర్వము తాము బ్రతిమాలి బలవంతంగా వెళ్ళిపోనిచ్చిన వారివెంట బడిరి.

4. ఆ దుష్టులకు ప్రాప్తింపనున్న శిక్షయే వారు పూర్వము జరిగిన కార్యములెల్ల విస్మరించి ఇట్టి చెయిదమునకు పాల్పడునట్లు చేసెను. కనుక వారు ఆ తరువాత రానున్న శిక్షలనుకూడ అనుభవించుటకు యోగ్యులైరి.

5. కావుననే నీ ప్రజలు అద్భుతవిధమున పయనము చేయగా ఆ దుర్మార్గులు మాత్రము అనూహ్యమైన చావు చచ్చిరి.

6. నీ ఆజ్ఞపై ప్రకృతి మార్పుచెంది నీ ప్రజలకు కీడు వాటిల్లకుండునట్లు చేసెను.

7. వారు తమ శిబిరముమీద మేఘము క్రమ్మియుండుట గాంచిరి. పూర్వము జలము ఆవరించియున్నచోట ఇప్పుడు పొడినేల కన్పించెను. అలలు పొంగిపొరలెడు తావున ఇపుడు గడ్డి మైదానము చూపట్టెను. కనుక వారు ఎఱ్ఱసముద్రమును సునాయాసముగా దాటగలిగిరి.

8. ఆ ప్రజలు నీ అద్భుతములను తిలకించుచు, నీ రక్షణబలముతో కడలిని దాటిరి.

9. వారు మేతకుబోవు గుఱ్ఱములవలె గంతులు వేయుచు బోయిరి. గొఱ్ఱెపిల్లలవలె దుముకుచు బోయిరి. తమను రక్షించు ప్రభుడవైన! నిన్ను కీర్తించుచుబోయిరి

10. పూర్వము తమ దాస్యకాలమున పరిస్థితులెట్టులుండెనో వారు మరచిపోలేదు. ఆ దేశమున భూమినుండి పశువులకు మారుగా దోమలు పుట్టెను. నదినుండి చేపలకు మారుగా కప్పలు విస్తారముగా పుట్టెను.

11-12. అటు తరువాత వారు ఆకలిగొని మంచి భోజనము కొరకు గాలింపగా సముద్రము నుండి పూరేడు పిట్టలు వచ్చి వారి ఆకలిని తీర్చెను. అంతకు ముందెన్నడును వారు ఆ పక్షులను చూచియుండలేదు.

13. ఆ దుర్మార్గులు శిక్షకు గురియైరి. ఆ శిక్ష ప్రాప్తింపక మునుపే భీకరమైన ఉరుములు వారిని హెచ్చరించెను. వారు తమ అపరాధమునకు తగిన దండనను అనుభవించిరి. వారు పరదేశులపట్ల మహాద్వేషము చూపిరి.

14. పూర్వము అన్యజాతివారు, అజ్ఞాత ప్రజలు తమ చెంతకు రాగా వారిని ఆహ్వానింపరైరి. కాని వీరు తమకు మేలుచేసిన అతిథులనే బానిసలను చేసిరి.

15. ఆ అన్యులు పరదేశులను మొదటినుండియు ద్వేషించిరి. ఈ విషయమున వారు కొంచెము మెరుగేనని చెప్పవలయును.

16. కాని ఈ ప్రజలు అటులగాదు, వీరు పూర్వము నీ ప్రజలను ఉత్సవవినోదములతో ఆహ్వానించిరి. వారికి తమతో సరి సమానమైన హక్కుల నొసగిరి. కాని అటుపిమ్మట వారిని వెట్టిచాకిరితో పీడించిరి.

17. పుణ్యపురుషుని ఇంటి తలుపుచెంతకు వచ్చిన అన్యులు గ్రుడ్డివారైరి. అంధకారము వారి చుట్టును క్రమ్మెను. వారిలో ప్రతివాడు తన తలుపును తాను వెదకజొచ్చెను అట్లే వీరికిని అంధత్వము ప్రాప్తించెను.

18. సితారా వాద్యములో ఏ తంత్రి స్వరస్థాయి దానిదే, కాని ఆ స్వరములన్నియు కలిసి వేరువేరు రాగములగును. అట్లే ఇపుడు ప్రకృతి శక్తులు కూడ ఒండొరులతో కలిసి భిన్నరీతుల మార్పుచెందెను. నాడు జరిగిన సంఘటనలు ఈ విషయమును రుజువు చేయును.

19. భూచరములు, జలచరములుకాగా జలచరములు భూచరములాయెను.

20. అగ్ని జలములలో మండెను. నీరు నిప్పును ఆర్పదయ్యెను.

21. అగ్ని జ్వాలలు తమలోనికి ప్రవేశించిన బలహీనపు ప్రాణుల శరీరములను కాల్చివేయవయ్యెను. మామూలు పరిస్థితులలో మంచువలె కరిగిపోవు అమృతాహారమును ఆ నిప్పు మంటలెంత మాత్రమును కరిగింప జాలవయ్యెను.

22. ప్రభూ! నీవు నీ ప్రజలను బహురీతుల అధికులను జేసి సంపన్నులను గావించితివి. నీవు వారిని ఏనాడును అనాదరము చేయక ఎల్లవేళల, ఎల్లతావుల ఆదుకొంటివి.