ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 19వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. సౌలు తన కుమారుడైన యోనాతానుత, సేవకులతో, దావీదును వధింపవలయునని చెప్పెను.

2. కాని యోనాతానునకు దావీదనిన ప్రాణము. అతడు దావీదును చూచి “నా తండ్రి నిన్నెట్లయినను చంపవలయునని యత్నించుచున్నాడు. కనుక రేపు ప్రొద్దుట జాగ్రత్తతో నుండుము. ఎక్కడనైన రహస్య స్థలమున దాగుకొనుము.

3. పొలములందు నీవు దాగియున్న తావునకు దగ్గరనే నేను నా తండ్రిని కలిసికొని నిన్ను గూర్చి మాట్లాడెదను. ఆ మీదట సంగతులన్నియు నీకు తెలియజెప్పెదను” అని పలికెను.

4. యోనాతాను సౌలునకు దావీదుపై నమ్మిక పుట్టునట్లు మాటలాడెను. “నీ సేవకుడైన దావీదునకు ప్రభువు ద్రోహము తలపెట్టరాదు. అతడు నీకు ఏ ద్రోహమును చేయలేదు. దావీదు చేసిన పనులన్నియు మనకు మేలే చేసినవిగదా!

5. అతడు ఫిలిస్తీయునితో పోరాడి గెలిచినపుడు వెండ్రుక వాసిలో చావు తప్పించుకొనెను. నాడు దావీదు మూలముగా యావే ప్రభువు యిస్రాయేలీయులను అందరిని రక్షించెను. ఈ కార్యమును నీవును కన్నులార చూచితివి. అపుడు మనసార సంతసించితివి. మరి ఇపుడు ఈ నిరపరాధునకు కీడు తలపెట్టనేల? కారణములేకయే దావీదును చంపనేల?" అనెను.

6. సౌలు యోనాతాను పలుకులకు సంతృప్తి చెందెను. “యావే జీవముతోడు! దావీదును చంపను” అని ఒట్టు పెట్టుకొనెను.

7. అంతట యోనాతాను దావీదును పిలిచి జరిగిన సంగతియంతయు వివరించి చెప్పెను. అతనిని సౌలు వద్దకు కొనివచ్చెను. దావీదు వెనుకటి మాదిరిగానే సౌలు ఎదుట నిలిచి పరిచర్య చేయుచుండెను.

8. ఫిలిస్తీయులతో మరల పోరుమొదలయ్యెను. దావీదు ఫిలిస్తీయులతో పోరాడి పెక్కుమందిని కూర్చెను. శత్రువులు వెన్నుజూపి పారిపోయిరి.

9. అపుడు ప్రభువు దగ్గర నుండి దుష్టాత్మ వెడలివచ్చి సౌలును ఆవేశించెను. సౌలు ఈటె చేపట్టి ఇంట కూర్చుండెను. దావీదు సితారపుచ్చుకొని వాయించు చుండెను.

10. సౌలు దావీదుపై ఈటె విసరి అతనిని ఒకే పోటుతో గోడకు గ్రుచ్చవలయునని చూచెను. కాని దావీదు మెలకువతో అతని ఎదుటినుండి తప్పుకొనెను. సౌలు విసరిన బల్లెము పోయి గోడకు గ్రుచ్చుకొనెను. దావీదు ఆ రాత్రియే పారిపోయెను.

11. నాటి రాత్రి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి కావలివారిని పంపెను. మరునాడు ప్రొద్దుట అతనిని చంపవలయునని సౌలు తలంపు. కాని దావీదు భార్య మీకాలు అతనితో “ఈ రాత్రియే పారిపోయి ప్రాణములు కాపాడుకొనుము. లేదేని రేపు నిన్ను చంపివేయుదురు” అని చెప్పెను.

12. ఆమె అతనిని కిటికీ నుండి వెలుపలికి దింపెను. ఆ రీతిగా దావీదు తప్పించుకొని నాటి రాత్రియే పారిపోయెను.

13. అటుపిమ్మట మీకాలు గృహదేవతా విగ్రహమును దావీదు పడుకపై పరుండబెట్టెను. దాని తలకు మేక వెంట్రుకలు చుట్టి మీద దుప్పటికప్పెను.

14. సౌలు సేవకులు దావీదును బంధింపవచ్చిరి. కాని మీకాలు వారితో అతడు జబ్బుపడెనని చెప్పెను.

15. సౌలు మరల సేవకులను పంపి “పడుకమీద ఉన్నవానిని ఉన్నట్లే తీసికొనిరండు, నేను వానిని చంపివేసెదను” అని పలికెను.

16. సేవకులు వచ్చి చూడగా సెజ్జపై ఇలవేల్పు బొమ్మయు దాని తలచుట్టు మేకవెంట్రు కలును కనిపించినవి.

17. అంతట సౌలు మీకాలుతో “నన్నిట్లు వంచించితివేల? నీవలన శత్రువు తప్పించుకొని పారి పోయెనుగదా!” అనెను. ఆమె “నన్ను పారిపోనిమ్ము, లేదేని నీ ప్రాణములు తీసెదనని దావీదు నన్ను భయపెట్టెను” అని చెప్పెను.

18. అటుల పారిపోయి దావీదు రామాయందలి సమూవేలు వద్దకొచ్చి అతనికి జరిగిన సంగతు లన్నియు తెలియజెప్పెను. అతడును, సమూవేలును అక్కడినుండి కదలిపోయి నావోతు చేరి అచట వసించిరి.

19. దావీదు రామాచెంత నావోతున బస చేయుచున్నాడని విని అతనిని పట్టుకొనుటకై సౌలు సేవకులను పంపెను.

20. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రవచించుటయు, సమూవేలు వారిమీద నాయకుడుగా నిలుచుటయు చూడగా, దేవుని ఆత్మ సౌలు సేవకులను ఆవేశింపగా వారును ప్రవచనములు పలికిరి.

21. ఈ సంగతి విని సౌలు మరికొందరు సేవకులను పంపెను. వారును ప్రవచనములు పలుకదొడగిరి. సౌలు మూడవమారు కూడ మరికొందరు సేవకులను పంపెను. కాని వారును ప్రవచనములు చెప్పసాగిరి.

22. అంతట సౌలు స్వయముగా బయలుదేరి రామాకు వచ్చెను. అచట సేకు చెంతనున్న గొప్పబావి వద్ద ప్రోగైన జనులను చూచి “సమూవేలు దావీదులను చూచితిరా?” అని వారినడిగెను. వారు “రామా దగ్గర నావోతున బసచేయుచున్నారు” అని తెల్పిరి.

23. సౌలు అచ్చటికి ప్రయాణము సాగించుచుండగా దేవుని ఆత్మ అతనిని కూడ ఆవేశించెను. కనుక నావోతు చేరువరకు సౌలు ప్రవచనములు పలుకుచుండెను.

24. అతడు ఆవేశమునొంది బట్టలను తొలగించుకొని సమూవేలు ఎదుటనే ప్రవచనములు చెప్పెను. ఆ పగలు రేయి దిగంబరుడై పడియుండెను. కనుకనే “సౌలు కూడ ప్రవక్తలలో కలిసిపోయెనా?" అను సామెత పుట్టెను.