ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు రెండవ గ్రంధము 18వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. దావీదు తన సైన్యములను లెక్కించి వేయి మందికి, నూరుమందికి అధిపతులను నియమించెను.

2. అతడు సేనలను మూడుభాగములుచేసి యోవాబును ఒక భాగమునకు, అతని తమ్ముడు అబీషయిని ఇంకొక భాగమునకు, గిత్తీయుడు ఇత్తయిని వేరొక భాగమునకు నాయకులను చేసెను. తానుగూడ దండులతో పోరునకు పోవ సమకట్టెను.

3. కాని అతని దళములు "నీవు రావలదు. మేము ఓడిపోయినచో ఎవరికిని బాధ కలుగదు. మాలో సగముమంది గతించినను ఎవరికిని దిగులు పుట్టదు. కాని నీ వాక్కడివే మాబోటివాండ్రు పదివేలమందికి సరిసమానుడవు. పైగా నీవు పట్టణముననే ఉన్నచో ఎప్పటికప్పుడు మాకు క్రొత్తదళములను పంపుచుండవచ్చును” అని అనిరి.

4. రాజు “సరియే, మీరు చెప్పినట్లే కానిండు” అనెను. అంతట వందలమందితో, వేలమందితో సైన్యములు కదలి పోవుచుండగా దావీదు నగరద్వారమువద్ద నిలుచుండి వీక్షించెను.

5. అతడు యోవాబు, అబిషయి, ఇత్తయిలతో “నా మొగము చూచియైన ఆ పడుచువాడు అబ్షాలోముపై చేయిచేసికొనకుడు” అని ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేనానాయకులకు ఇట్టి ఆజ్ఞ ఇచ్చెనని సైనికు లందరును తెలిసికొనిరి.

6. దావీదు సైన్యములు యిస్రాయేలీయుల మీదికిపోయెను. ఎఫ్రాయీము అడవిలో ఇరువైపులవారికి పోరుజరిగెను.

7. దావీదు దండులు యిస్రాయేలీయులను తునుమాడెను. వారి పక్షమున ఇరువదివేలమంది కూలిరి.

8. అడవియందంతట పోరునడచెను. కత్తివాదర కెరయైన వారికంటె ఆ కారడవిలో చిక్కి మడిసిన వారే ఎక్కువ.

9. అడవిలో దావీదు అనుచరులకు అబ్షాలోము ఎదురుపడెను. అతడు ఒక కంచర గాడిదనెక్కి వచ్చు చుండెను. ఆ కంచరగాడిద దట్టముగా ఎదిగియున్న పెద్ద సింధూరపు చెట్టు కొమ్మల క్రిందుగా సోగిపోయెను. అబ్షాలోము తల గజిబిజిగా ఎదిగియున్న సింధూరము కొమ్మలలో చిక్కుకొనెను. అతడు మింటికి మంటికి మధ్య వ్రేలాడ జొచ్చెను. అతడెక్కిన కంచరగాడిద కదలిపోయెను.

10. అపుడొక సైనికుడు అబ్షాలోమును చూచి యోవాబుతో “అబ్షాలోము సింధూరము నుండి వ్రేలాడుచున్నాడు” అని చెప్పెను.

11. యోవాబు అతనితో “నీవు అబ్షాలోమును చూచి చావబొడిచి నేలమీద కూలద్రోయకేల విడిచితివి? నేను నీకు పదివెండినాణెములు, నడికట్టు బహూకరించి యుండెడివాడనుగదా” అనెను.

12. కాని ఆ సైనికుడు “పదిగాదుగదా వేయివెండికాసుల నిచ్చినను నేను రాజకుమారునిపై చేయిచేసికొనను. మేము వినుచుండగనే రాజు నిన్ను, అబీషయిని, ఇత్తయిని పడుచువాడైన అబ్షాలోమును ముట్టుకోవలదని ఆజ్ఞాపించెనుగదా?

13. కపటబుద్ధితో నేను అతనిని పొడిచియుందునేని, రాజు తప్పక తెలిసికొనెడివాడు. అపుడు రాజు దగ్గర నీవుకూడా నాకు విరోధివియగుదువుకదా!” అని పలి కెను.

14. యోవాబు ఇపుడు నీతో కాలయాపనము చేయనేల అని పలికి మూడు బల్లెములను గైకొని చెట్టున ప్రాణములతో వ్రేలాడెడి అబ్షాలోము గుండెలో పొడిచెను.

15. వెంటనే యోబు అంగరక్షకులు పదిమంది అబ్షాలోముపై పడి అతనిని మట్టుపెట్టిరి.

16. అంతట యోవాబు బాకానూది పోరు చాలింపుడని తన అనుచరుల నాజ్ఞాపించెను. వారు యిస్రాయేలీయులను వెన్నాడుటమానిరి.

17. యోవాబు భటులు అబ్షాలోము శవమును అడవిలో ఒక లోతైన గోతిలో పడవేసిరి. దానిమీద పెద్ద రాళ్ళగుట్ట నిలిపిరి. యిస్రాయేలీయులు పారిపోయి తమతమ గుడారములలో జొరబడిరి.

18. అబ్షాలోము బ్రతికియుండగనే తన జ్ఞాపకార్దముగా రాజు లోయలో ఒక స్తంభము నిలిపెను, అతడు “నా పేరు నిలబెట్టుటకు కుమారులెవరును లేరుగదా!” అనుకొని ఆ కంబమునకు తన పేరు పెట్టుకొనెను. నేటికిని అది అబ్షాలోము కంబమనియే పిలువబడుచున్నది.

19. సాదోకు కుమారుడగు అహీమాసు యోవాబుతో “నేను పరుగెత్తుకొనిపోయి రాజునకు శుభవార్త వినిపింతును. యావే రాజు శత్రువులను రూపుమాపెనని విన్నవింతును” అనెను.

20. కాని యోవాబు “ఓయి! నేడేమి శుభవార్తలు వినిపింపగలవు? మరియొకనాడు వినిపించిన వినిపింప గలవేమోగాని నేడు మాత్రము శుభవార్తలేమియు లేవు. రాజపుత్రుడు కాలముచేసెనుగదా!” అనెను.

21. ఇట్లని యోవాబు కూషీయుని ఒకనిని పిలిచి “వెళ్ళి నీవు కన్నది రాజునకు ఎరిగింపుము” అనెను. అతడు యోవాబునకు దండము పెట్టి రివ్వున పరుగుతీసెను.

22. సాదోకు కుమారుడు అహీమాసు మరల యోవాబుతో “ఆరు నూరైనను నూరారైనను కూషీయునితో పాటు నేను కూడ పరుగిడవలసినదే” అనెను. యోవాబు “ఓయీ! నీవు ఊరకే పరుగిడనేల. నీ వార్తలకు నేడు ప్రతిఫలమేమియు ముట్టదుసుమా!” అని చెప్పెను.

23. అతడు మరల “ఏమైనను కానిమ్ము. నేనిపుడు దౌడు తీయకతప్పదు” అని పలికెను. యోవాబు “సరియే పొమ్ము” అనెను. అహీమాసు పొలమునకు అడ్డముగాపడి పిక్కబలముతో కూషీయుని కంటె ముందుగా పరుగుతీసెను.

24. దావీదు నగర జంటగుమ్మముల నడుమ కూర్చుండియుండెను. నగరమునకు కావలికాయువాడు గుమ్మము పైబురుజు మీదికెక్కి మోచేయి అడ్డము పెట్టుకొని పారజూడగా, ఒంటరిగా పరుగెత్తుకొనివచ్చు వాడొకడు కంటపడెను.

25. వెంటనే అతడు రాజునకు ఆ సంగతి గొంతెత్తి విన్నవించెను. రాజు “అతడు ఒంటరిగా వచ్చుచుండెనేని మేలివార్త కొని వచ్చుచుండును” అనెను. అంతలో ఆ పరుగిడువాడు దగ్గరకు వచ్చెను.

26. అపుడు కావలివాడు పరుగువెట్టు వానిని వేరొకడును చూచి అదిగో మరియొకడు ఒంటరిగా పరుగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారరక్షకుని తట్టు తిరిగి చెప్పగా, దావీదు "అతడును మేలి వార్తలనే గొనివచ్చుచుండును” అనెను.

27. కావలి బంటు “నేను ముందట ఉరుకు వానిని గుర్తుపట్టితిని. సాదోకు కొడుకు అహీమాసువలె ఉన్నాడు” అనెను. దావీదు “అతడు చాల మంచివాడు కనుక మంచి కబురులే కొనివచ్చుచుండును” అనెను.

28. అహీమాసు దావీదు దగ్గరకు వచ్చి “రాజా! శుభము” అని నేలమీదికి సాష్టాంగ నమస్కారము చేసి “రాజుపై తిరుగబడినవారిని మనవశము చేసిన యావే దేవుడు స్తుతింపబడునుగాక!" అని పలికెను.

29. రాజు “పడుచువాడు అబ్షాలోము క్షేమముగానున్నాడా?” అని అడిగెను. అహీమాసు “యోవాబు నన్నిచటకు పంపుచుండగా అక్కడ కలకలమొకటి వినిపించినది. కాని దాని భావమేమో నాకుతెలియదు” అనెను.

30. రాజు “నీవు ప్రక్కకు తొలగినిలువుము” అనెను. అతడట్లే తొలగినిలచెను.

31. అంతట కూషీయుడును వచ్చి “ప్రభువుల వారికి శుభము. దేవరమీద తిరుగబడినవారిని రూపుమాపి యావే నేడు నీ తరపున శత్రువులపై పగతీర్చు కొనెను” అని పలికెను.

32. రాజు "కుఱ్ఱడు అబ్షాలోము కుశలమేగదా!” అని ప్రశ్నించెను. కూషీయుడు “రాజు శత్రువులకు, రాజుపై తిరుగబడి అతనికపకారము చేయబూనిన దుర్మార్గులకు ఆ పడుచువానికి పట్టిన గతియే పట్టునుగాక!” అనెను.