ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సోలోమోను జ్ఞానగ్రంధము 17వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. ప్రభూ! నీ నిర్ణయములు మహత్తరమైనవి, విశదీకరింపశక్యము కానివి, కనుకనే వానియందు శిక్షణ పొందనివారు పెడత్రోవబట్టిరి.

2. ఆ దుర్మార్గులు నీ పవిత్ర ప్రజలను బందీలను జేసితిమనుకొనిరి. కాని వారే సుదీర్ఘమైన రాత్రి కల్పించిన చీకటిలో బందీలైరి. వారు తమ ఇండ్లలోనే యుండినను నీ నిత్యరక్షణను కోల్పోయిరి.

3. వారు తమ పాపములు , రహస్యముగానున్నవని భావించిరి. మతిమరుపు అను తెర వానిని కప్పివేసినది అని అనుకొనిరి. కాని ఇప్పుడు వారు ఘోర భయమున చిక్కిరి. భీకర దృశ్యములను గాంచి భీతిజెందిరి.

4. వారు దాగుకొనిన చీకటి మూలలు వారిని భయమునుండి కాపాడవయ్యెను. వారికి నలువైపుల భీషణఘోషణములు విన్పించెను. విచారవదనములతో గూడిన భయంకరపిశాచములు దర్శనమిచ్చెను.

5. ఎట్టి అగ్నియు వారికి వెలుగును ప్రసాదింపజాలదయ్యెను. ఉజ్జ్వలముగా ప్రకాశించు నక్షత్రములుకూడ ఆ భయానక రాత్రిలో కాంతిని ప్రసరింపజాలవయ్యెను.

6. స్వయముగా మండు ఒక భీకరాగ్ని మాత్రము వారికి కన్పించెను. వారు భయభ్రాంతులై యుండిరి కనుక తాము చూచినట్లు భ్రాంతిపడిన మిథ్యావస్తువులకంటె గూడ వాస్తవిక జగత్తు ఇంకను ఘోరముగానుండునేమో అనుకొని వెరగొందిరి.

7. వారి మాంత్రికవిద్యలన్నియు వమ్మయ్యెను. వారికి గర్వకారణమైన విజ్ఞానమంతయు వ్యర్ధమయ్యెను.

8. రోగుల భయములు, జబ్బులు తొలగింపబూనిన వారే హాస్యాస్పదములైన భయములకు లొంగిపోయిరి.

9. ప్రమాదకరమైన సంఘటనలేమియు జరుగకున్నను వారు పాములు బుసకొట్టుచున్నవనియు, మృగములు తమ మీదికి దుముకుచున్నవనియు తలంచి భయమొందిరి.

10. ఆ రీతిగా వారు భయభ్రాంతులై నేలమీద కూలిరి. కన్నులు తెరచి చూచుటకు భయపడిరి. అయినను నేత్రములువిప్పి చూడకుండ ఉండజాలరైరి.

11. దుష్టత్వము పిరికిది, తన శిక్షను తానే కొనితెచ్చుకొనునది. అంతరాత్మ తనను నిందింపగా అది ఆయా సంఘటనలు యథార్థముగా చూపట్టిన దానికంటె ఘోరముగానున్నట్లు తలచును.

12. బుద్ధిశక్తి దయచేయు సాయమును వినియోగించుకొనకపోవుటయే భయకారణము.

13. బుద్ధిశక్తిమీద ఆధారపడు ధైర్యములేని నరుడు అజ్ఞానము తెచ్చిపెట్టు భయమునకు లొంగిపోవును.

14. ఆ జనులు ఆ రాత్రియెల్ల నిద్రపట్టక వెతజెందిరి. అసలారాత్రికి వారిని బాధించు శక్తి ఏమియు లేదు. శక్తి ఏమాత్రము లేని పాతాళమునుండియే ఆ రేయి పుట్టినది.

15. అపుడు భయంకరాకృతులు ఆ దుర్మార్గులను వెన్నాడెను. వారు తలవని తలంపుగా గలిగిన భయమునకు లొంగి బలముడిగి నిశ్చేష్టులై పోయిరి.

16. వారు నేలమీద కొరిగి, కేవలము తమ భయమే సృజించిన గోడలులేని చెరలో బందీలై యుండిపోయిరి.

17. రైతులు, కాపరులు, శ్రామికులు ఎల్లరును తప్పించుకోజాలని దుర్గతికి జిక్కిరి. ఒక్క అంధకార శృంఖలమే ఎల్లరిని బంధించెను.

18-19. రెపరెప గాలివీచినను, చెట్టు కొమ్మలలోనుండి పక్షులుకూసినను, నీరు జలజల ప్రవహించినను, కొండచరియ విరిగిపడినను, ఏవేవో జంతువులు తమకు కన్పింపకుండనే అటునిటు పరుగెత్తినను, వన్యమృగములు భయంకరముగా అరచినను, పర్వతమునుండి ప్రతి ధ్వనులు వినవచ్చినను వారు భయభ్రాంతులై నిశ్చేష్టులైరి.

20. అపుడు ప్రపంచమంత పగటి వెలుగుతో తళతళలాడుచుండెను. ప్రజలు తమ పనులు తాము నిరాటంకముగా చేసికొనుచుండిరి.

21. ఆ దుష్టులను మాత్రమే గాఢాంధకారము కమ్ముకొనెను. అది వారు ప్రవేశింపనున్న పాతాళ అంధకారమునకు చిహ్నముగానుండెను. కాని ఆ ప్రజలు తమకు తామే భారమైపోయిరి. అది ఆ అంధకారముకంటెను భారముగానుండెను