ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు రెండవ గ్రంధము 17వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. అహీతోఫెలు అబ్షాలోముతో “నేను ఈ రాత్రియే పండ్రెండువేల మంది సైనికులను వెంట నిడుకొని దావీదు మీదపడెదను.

2. అతడలసిసొలసి శక్తివోయి ఉండును. కనుక నన్ను చూచి భయపడును. అనుచరులును అతనిని వీడి పారిపోవుదురు. నేను రాజును మాత్రమే చంపెదను.

3. వధువును వరుని చెంతకు తరలించుకొని వచ్చినట్లే దావీదు అనుచరుల నందరినీ నీ చెంతకు తోడ్కొని వచ్చెదను. నీవొక్కని ప్రాణము మాత్రమే కోరుకొందువు. అతడు తప్ప మిగిలిన వారెవ్వరును నశింపరు” అనెను.

4. ఈ ఉపదేశము అబ్షాలోమునకు యిస్రాయేలు పెద్దలకును మిగులనచ్చెను.

5. తరువాత అబ్షాలోము “అర్కీయుడైన హూషయిని గూడ పిలువుడు. అతడేమి చెప్పుతో విందము” అనెను.

6. హూషయి కొలువులోనికి రాగానే అబ్షాలోము “అహీతో ఫెలు మాకిట్లు ఉప దేశించెను. ఈ ఉపదేశము చొప్పున నడుచుకొందమా; లేక నీవేమైన ఆలోచన చెప్పెదవా?” అని అడిగెను.

7. హూషయి అబ్షాలోముతో "అయ్యా! అహీతో ఫెలు చెప్పిన ఉపాయము ఈ పట్టున పాటింపదగినది కాదు.

8. నీ తండ్రియు, అతని అనుచరులును వీరులే గాని వట్టి దద్దమ్మలు కారు. వారిపుడు పిల్లలను కోల్పోయిన అడవిఎలుగు బంటువలె కోపస్వభావులె చెలరేగి ఉందురు. నీ తండ్రి పోరున కాకలుతీరిన యోధుడు. అతడు సైన్యముల చెంత నిద్రించును అనుకొంటివా?

9. ఈ క్షణముననే ఏ గుంతలోనో, బొరియలోనో దాగికొనియుండును. ప్రథమ ప్రయత్నము ననే వారు మనవారిపై దెబ్బతీసెదరేని, ఈ వార్తలు విన్న వారెల్ల అబ్షాలోము అనుచరులకు తగిన శాసి జరిగినదని నవ్విపోదురు.

10. అపుడు సింగపు గుండెగల మన మహావీరులు కూడ శక్తిచెడి అధైర్య పడరా? నీ తండ్రి మహావీరుడని, అతని తోడివారు పేరుమోసిన శూరులని యిస్రాయేలీయులందరును ఎరుగుదురు.

11. కనుక నా మట్టుకు నేనీ ఉపాయము చెప్పెదను. దానునుండి బేరైబావరకు గల యిస్రాయేలీయులందరును ప్రోగై కడలి ఒడ్డునగల ఇసుక రేణువులవలె లెక్కకందని రీతిగా నిన్ను అనుసరించి రావలయును. నీవే స్వయముగా నాయకుడవై వారిని పోరునకు కొనిపోవలయును.

12. ఈ రీతిగా పోయి దావీదు ఎక్కడ కనుపించిన అక్కడనే అతనిమీద పడు దము. వేయేలమంచు నేలపై దిగివచ్చునట్లుగా శత్రువు మీద పడెదము. అతడుగాని, అతని అనుచరులుగాని ఒక్కడును మిగులకుండునట్లు ఎల్లరను కండతుండె ములు చేయుదము.

13. దావీదు పారిపోయి ఏదేని పట్టణమున తలదాచుకొనెనేని, యిస్రాయేలీయులు అందరు త్రాళ్ళుకొనివచ్చి ఆ నగరమును రాయిరప్ప గూడ మిగులకుండునట్లు క్రింది నదిలోనికి లాగివేయ వలయును” అని పలికెను.

14. ఆ మాటలు ఆలించి అబ్షాలోము, యిస్రాయేలీయులు, “అహీతో ఫెలు ఉప దేశముకంటె అర్కీయుడైన హూషయి ఆలోచనయే బాగుగానున్నది” అనిరి. యావే అబ్షాలోమును నాశ నము చేయనెంచి అహీతో ఫెలు చెప్పిన ఉపాయమే మేలైనదైనను దానిని భంగపరచెను. -

15. అంతట హూషయి యాజకులగు సాదోకు అబ్యాతారులతో "అహీతో ఫెలు నా కంటే ముందు ఈ రీతిగా ఉపాయము చెప్పెను. నేనీరీతిగా చెప్పితిని.

16. కనుక మీరు శీఘ్రముగా దావీదునకు కబురంపి 'నేటి రేయి యేరు దాటు స్థలములలో మసలవలదు. వెంటనే అవలకు సాగిపొండు. లేదేని రాజు తన సైన్యములతో సర్వనాశనమగును' అని చెప్పింపుడు" అని వక్కాణించెను.

17. యోనాతాను, అహీమాసు ఎర్డోగీలు చెలమ వద్దనుండిరి. పట్టణమునకు వచ్చుటకు వారికి ధైర్యము చాలలేదు. కనుక ఒక పనికత్తె పోయి వారికి వార్తలు ఎరిగింపవలయుననియు, వారు పోయి దావీదును హెచ్చరింపవలెననియు నిర్ణయించిరి.

18. అయినను ఒక పనివాడు ఆ వేగువాండ్రను చూచి అబ్షాలోమునకు తెలియజేసెను. కనుక వారిరువురు పరుగుపరుగున పోయి బహూరీమున ఒక గృహస్తుని ఇంట జారబడిరి. ఆ ఇంటి పెరటిలో ఒక బావి కనిపింపగా దానిలోనికి దిగి దాగికొనిరి.

19. ఆ ఇంటి ఇల్లాలు గోనె గైకొని బావి పై కప్పి దానిమీద దంచిన ధాన్యమును ఎండబోసెను. కనుక వారి జాడెవరికిని తెలియలేదు.

20. అబ్షాలోము భటులు ఆ గృహిణి వద్దకు వచ్చి "అహీమాసు, యోనాతాను ఏరి?” అని అడిగిరి. ఆమె “అల్లదిగో! ఆ మడుగు మీదుగా వెళ్ళిపోయిరి” అని చెప్పెను. భటులు వారిని గాలించి, కనుగొన జాలక యెరుషలేమునకు తిరిగిపోయిరి.

21. వారు వెడలిపోగానే అహీమాసు, యోనాతాను బావి వెడలి వచ్చి దావీదు వద్దకు పోయి “నీవు శీఘ్రమే బయలుదేరి నది దాటుము. అహీతో ఫెలు నిన్ను గూర్చి ఈ లాగున ఉపదేశము చెప్పెను” అని హెచ్చరించిరి.

22. కనుక దావీదు సైన్యములతో కదలి యోర్దాను నదిదాటెను. ప్రొద్దుపొడుచునప్పటికి నదికీవలి ఒడ్డున ఒక్క పురుగు కూడ మిగులలేదు.

23. అచట యెరూషలేములో అబ్షాలోము అహీతోఫెలు ఉపాయమును పాటింపలేదు. అది చూచి అహీతోఫెలు మనసునొచ్చుకొని గాడిదకు జీనువేసి పయనము కట్టెను. నేరుగా స్వీయనగరము చేరుకొని ఇంటికిపోయెను. తన ఇల్లు చక్కపెట్టుకొని ఉరివేసికొని చనిపోయెను. అతనిని తండ్రి సమాధిలోనే పాతి పెట్టిరి.

24. దావీదు మహనాయీము చేరుకొనెను. అబ్షాలోము యిస్రాయేలుదండుతో వచ్చి యోర్దాను నది దాటెను.

25. అతడు యోవాబునకు బదులుగా అమాసా అనువానిని సైన్యాధిపతిని చేసెను. ఈ అమాసా యిష్మాయేలీయుడైన యిత్రి కుమారుడు. అతని తల్లి అబీగాయీలు. ఆమె నాహషు కూతురు, యోవాబు తల్లియగు సెరుయా చెల్లెలు.

26. అబ్షాలోము యిస్రాయేలీయులతో గిలాదున గుడారములెత్తెను.

27. దావీదు మహనాయీము చేరగనే అమ్మోనీయుల రబ్బా నగరమున నుండి నాహాషు కుమారుడు షోబి, లోదెబారు నుండి అమ్మయేలు కుమారుడు మాఖీరు, రోగెలీము నుండి గిలాదీయుడు బర్సిల్లయి అతనిని చూడవచ్చిరి.

28. వారు పరుపులు, కంబళ్ళు, పళ్ళెరములు, గిన్నెలు, గోధుమలు, యవలు, వేగించిన ధాన్యములు, పిండి, చిక్కుడు గింజలు, ఆకు కూరలు, తేనె, పెరుగు, వెన్న, గొఱ్ఱెలు, ఎడ్లను కొనివచ్చి దావీదునకును, అతని అనుచరులకును సమర్పించిరి.

29. దావీదు జనులు ఎడారిలో ఆకలిదప్పులవలన అలసిసొలసి ఉందురు గదా అని వారు ఆ కానుకలు కొనితెచ్చిరి.