ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యూదితు 16వ అధ్యాయము || Telugu catholic bible online

1. అప్పుడు యూదితు ప్రజలందరు వినుచుండగా ఈ క్రింది కృతజ్ఞతాగీతము పాడగా ప్రజలా పాటనందుకొని పాడిరి.

2. తంబురతో నా దేవుని కీర్తింపుడు. చిట్టితాళములతో ఆయనను కొనియాడుడు. స్తుతిగీతములతో ఆయనను వినుతింపుడు. ఆ ప్రభువు నామమును సన్నుతింపుడు.

3. మన ప్రభువు యుద్ధములను రూపు మాపువాడు. ఆయన నన్ను శత్రువుల బారినుండి కాపాడి , మరల మన ప్రజల మధ్యకు కొనివచ్చెను.

4. ఉత్తరదేశ పర్వతములనుండి అస్సిరీయులు వచ్చిరి. వేలకొలది సైనికులతో శత్రువులు వచ్చిరి. లోయలలోని నదులు వారి సైన్యములతో నిండిపోయెను. కొండలు వారిగుఱ్ఱములతో క్రిక్కిరిసిపోయెను.

5. శత్రువులు మన దేశమును తగుల బెట్టుదుమని, మన పడుచువారిని వధింతుమని, మన చంటిబిడ్డలను నేలపై విసరికొట్టుదుమని, మన పిల్లలను బందీలనుగా కొనిపోవుదుమని, మన ఆడపడుచులను చెరపట్టుదుమని బెదరించిరి.

6. కాని సర్వోన్నతుడైన ప్రభువు వారికి అడ్డువచ్చి, ఒక ఆడుపడుచు ద్వారా వారి యత్నమును వమ్ముచేసెను.

7. వారి నాయకుడు యువ సైనికులకుగాని మహావీరులకుగాని బలాఢ్యులకుగాని చిక్కి చావలేదు. మెరారి పుత్రిక యూదితు తన సౌందర్యముతో అతనిని మట్టు పెట్టెను.

8. ఆమె యిస్రాయేలు బానిసత్వమును తొలగింపగోరి, వైధవ్య సూచకములైన ఉడుపులను తొలగించి, పరిమళ తైలమును పూసికొని, శిరోజములకు పట్టీని కట్టుకొని, పట్టుబట్టలు తాల్చి శత్రువును మోసగించెను. ఆమె పాదరక్షలను చూచి అతడు భ్రమసిపోయెను.

9. ఆమె అందమును చూచి సమ్మోహితుడయ్యెను. కడన ఆమె కత్తి అతని మెడను తెగనరికెను.

10. పారశీకులు ఆమె ధైర్యమును చూచి వెలవెలబోయిరి. మాదియా దేశీయులామె పరాక్రమమునకు విస్మయము చెందిరి.

11. దీనులైన మన ప్రజలు యుద్ధనాదము చేయగా శత్రువులు భయపడిరి. దుర్బలులైన మన జనులు విజయనాదము చేయగా విరోధులు భయకంపితులై పారిపోయిరి.

12. బానిసల బిడ్డలైన మనవారు విరోధులను, పారిపోవు బానిసలను పొడిచినట్లుగా పొడిచిరి. ప్రభువు సైన్యము వారిని సర్వనాశనము చేసెను.

13. ప్రభువునకు నేనొక క్రొత్తపాట పాడెదను. ప్రభూ! నీవు ఘనుడవు, మహిమాన్వితుడవు, బలాఢ్యుడవు, అజేయుడవు.

14. నీవు కావించిన ఈ సృష్టి అంతయు నిన్ను సేవించుగాక! నీవు ఆ ఈయగా సమస్తమును కలిగినది. నీవు ఊపిరిపోయగా ప్రాణులన్నియు పుట్టినవి. నీ ఆజ్ఞనెవరును జవదాట జాలరు.

15. నిన్ను చూచి పర్వతములు, సముద్రములు కంపించిపోవును. నీయెదుట బండలు మైనమువలె కరిగిపోవును. కాని నీ పట్ల భయభక్తులు చూపువారిని మాత్రము నీవు కరుణతో ఆదరింతువు.

16. కమ్మని వాసనలొలుకు బలికంటె, దహనబలిలో వేల్చిన క్రొవ్వుకంటె, నీ పట్ల భయభక్తులు చూపువారు, నీకు అధిక ప్రీతి కలిగింతురు.

17. నా ప్రజలమీద పోరు తలపెట్టువారు నాశనమయ్యెదరు. న్యాయనిర్ణయము చేయునాడు ప్రభువు వారిని శిక్షించును. ప్రభువు వారి దేహములను అగ్నికి, క్రిములకు ఆహుతి చేయగా వారు సదా బాధతో అలమటింతురు.”

18. అంతట ఆ భక్తులు యెరూషలేము చేరి శుద్ధిచేసికొని ప్రభువును ఆరాధించిరి. దేవునికి దహన బలులు, స్వేచ్చా పూర్వకమైన బలులు, కానుకలు అర్పించిరి.

19. యూదితు ప్రజలు తన పరము చేసిన హోలోఫెర్నెసు సొత్తు నంతటిని దేవాలయమున సమ ర్పించెను. ఆమె స్వయముగా హోలోఫెర్నెసు మంచము మీదినుండి తీసికొని వచ్చిన తెరనుగూడ దేవుని కర్పించి తన వ్రతము తీర్చుకొనెను.

20. ఆ భక్తులెల్లరు మూడునెలల పాటు యెరూషలేముననే ఉండి దేవాలయము ఎదుట ఉత్సవము చేసికొనిరి. యూదితు కూడ అంతకాలము వారితోపాటు అచటనే ఉండెను.

21. యెరూషలేమున ఉత్సవమును ముగించు కొనిన పిదప ఎల్లరును తమతమ ఇండ్లకు వెళ్లిపోయిరి. యూదితు కూడ బెతూలియాలోని తన ఇంటికి వెడలి పోయెను. ఆమె బ్రతికియున్నంతకాలము యిస్రాయేలు దేశమంతట ఆమె పేరు మారుమ్రోగెను.

22. యూదితును పెండ్లి ఆడుటకు చాల మంది వరులు వచ్చిరి. కాని ఆమె తన భర్త మన షేగతించిన తరు వాత మరల పెండ్లియాడదయ్యెను.

23-24. ఆ పుణ్యాంగన తన భర్త ఇంటనే వసించెను. రోజురోజు నకు ఆ ధీరవనిత కీర్తి వృద్ధి చెందెను. ఆమె చనిపోక ముందు తన ఆస్తిని తన దగ్గరి చుట్టములకును తన పెనిమిటి బంధువులకును పంచియిచ్చెను. తన బానిసకు స్వేచ్ఛను ప్రసాదించెను. ఆ పుణ్యాత్మురాలు తననూట ఐదవయేట బెతూలియా నగరముననే పర మపదించెను. ఆమెను తన భర్త మనష్షే సమాధిలోనే పాతి పెట్టిరి. యిస్రాయేలీయులు ఆమె మృతికి ఏడు రోజులపాటు సంతాపము తెలిపిరి.

25. యూదితు జీవించియున్నంతకాలమును, ఆమె చనిపోయిన తరువాత చాలనాళ్ళ వరకును గూడ శత్రువులు ఎవరును యిస్రాయేలీయులను మరల బాధింపలేదు.