ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 16వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. యావే సమూవేలుతో “నేను సౌలును రాజుగా నుండనీయలేదని ఎంతకాలము ఇట్లు దుఃఖింతువు? కొమ్మును తైలముతో నింపుకొని పయనమై పొమ్ము. బేత్లెహేము వాసియైన యిషాయి కడకు నిన్ను పంపె దను. అతని కుమారులలో ఒకనిని రాజుగా ఎన్ను కొంటిని” అని చెప్పెను.

2. సమూవేలు "నేను పోజాలను. ఈ మాట విన్నచో సౌలు నన్ను చంపివేయును” అనెను. యావే “నీవొక ఆవు పెయ్యను తోలుకొని పొమ్ము. ఆ ఊరి వారితో యావేకు బలి అర్పించుటకై వచ్చితినని నుడువుము.

3. యిషాయినిగూడ బల్యర్పణమునకు ఆహ్వానింపుము. పిమ్మట నీవేమి చేయవలయునో అచ్చట వివరించెదను. నీవు మాత్రము నేను నిర్ణయించిన వానిని అభిషేకింపవలెను” అనెను.

4. సమూవేలు యావే నుడివిన రీతినే బేత్లెహేము వెళ్ళెను. ఆ ఊరి పెద్దలతనిని చూచి మిక్కిలి భయపడి “నీవు మా మేలెంచి వచ్చితివా లేక కీడెంచి వచ్చితివా” అని అడిగిరి. 

5. అతడు “మీ మేలు కోరియే వచ్చితిని. నేను యావేకు బలి అర్పించెదను. కనుక మీరెల్లరు శుద్ధిచేసికొని నాతోపాటు బలి అర్పించుటకు రండు” అని చెప్పెను. యిషాయిని అతని కుమారులను తానే శుద్ధిచేసి బలికి ఆహ్వానించెను.

6. వారు బలికి వచ్చిరి. అప్పుడు సమూవేలు ఎలీయాబును చూచి ప్రభువు ఎన్నుకొనిన రాజు నిక్కముగా యావే ఎదుటికి రానే వచ్చినాడుగదా అను కొనెను.

7. కాని యావే “ఇతని రూపమును, ఎత్తును చూచి భ్రమపడకుము. నేను ఇతనిని నిరాకరించితిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును. కాని దేవుడు హృదయమును అవలోకించును” అని చెప్పెను.

8. అంతట యిషాయి అబీనాదాబును సమూవేలు ముందట నిలిపెను. కాని అతడు “యావే ఇతనిని గూడ ఎన్నుకోలేదు” అని చెప్పెను.

9. యిషాయి మరల షమ్మాను సమూవేలుచెంత నిలిపెను. కాని సమూవేలు “యావే ఇతనినిగూడ ఎన్నుకోలేదు” అని చెప్పెను.

10. ఈ రీతిగా యిషాయి తన ఏడుగురు కుమారులను సమూవేలు ఎదుట నిలిపెను. కాని అతడు “యావే వారిని ఎన్నుకోలేదు” అని చెప్పెను.

11. సమూవేలు “నీ కుమారులందరు వీరేనా?” అని యిషాయిని అడిగెను. అతడు “కడగొట్టువాడు ఇంకొకడున్నాడు. వాడు పొలమున గొఱ్ఱెలు కాయుచు ఉన్నాడు” అనెను. సమూవేలు “ఎవరినైన పంపి కుఱ్ఱవానిని పిలుపింపుము. అతడు వచ్చువరకు నేను భోజనమునకు కూర్చుండను” అని పలికెను.

12. యిషాయి చిన్నకొడుకును పిలువనంపెను. అతని మేను బంగారమువలెనుండెను. కండ్లు మిలమిల మెరయుచుండెను. ఆకృతి సుందరముగానుండెను. అప్పుడు యావే “నేను కోరుకొనినవాడు ఇతడే. ఇతనిని అభిషేకింపుము” అనెను.

13. సమూవేలు తైలపు కొమ్ము పుచ్చుకొని అన్నలెదుట అతనికి అభిషేకము చేసెను. ఆ రోజు మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవహించి అతనిలో ఉండిపోయెను. అంతట సమూవేలు రామాకు వెడలిపోయెను.

14. యావే ఆత్మ సౌలును వదలి వెళ్ళిపోయెను. కాని యావే నుండి వచ్చిన వేరొక దుష్టాత్మ అతనిని పట్టి బాధింపదొడగెను.

15. సౌలు సేవకులు “యావే నుండి వచ్చిన దుష్టాత్మ నిన్ను పట్టి బాధించుచున్నది.

16. ప్రభువుల వారు ఆనతిచ్చినచో మీ సేవకులు నేర్పరియైన సితార వాద్యనిపుణుని ఒకనిని కొని వత్తురు. యావే వద్దనుండి వచ్చిన దుష్టాత్మ నిన్ను పీడించునపుడు వాద్యకారుడు సితార పుచ్చుకొని వాయించును. నీకు నెమ్మది కలుగును” అని చెప్పిరి.

17. సౌలు “చక్కని వాద్యకారుని వెదకి ఇటకు కొని రండు” అని పలికెను.

18. అపుడొక కొలువుకాడు సౌలుతో "బేత్లెహేము వాసియైన యిషాయి పుత్రుని నేనెరుగుదును. అతడు సితార చక్కగా వాయింప గలడు. మగసిరిగల యోధుడు. మాటనేర్పరి. రూప వంతుడు. యావే అనుగ్రహము వడసినవాడు” అని విన్నవించెను.

19. ఆ మాటలువిని సౌలు యిషాయి వద్దకు భటులనంపి “గొఱ్ఱెలమందలు కాయుచున్న నీ కుమారుడు దావీదును నా యొద్దకు పంపుము” అని వార్త పంపెను.

20. యిషాయి రొట్టెలను, తిత్తెడు ద్రాక్ష సారాయమును, మేకపిల్లను కానుకగా ఇచ్చి దావీదును పంపించెను.

21. ఈ రీతిగా దావీదు సౌలు కడకువచ్చి అతని కొలువున చేరెను. సౌలు అతనిని మిక్కిలి ఆదరించి అతనిని తన అంగరక్షకుని చేసికొనెను.

22. అంతట సౌలు "దావీదును నాకు కొలువు సేయనిమ్ము. అతడు నా మన్ననకు పాత్రుడయ్యెను” అని యిషాయిని ఆజ్ఞాపించెను.

23. యావే ఆత్మ సౌలును సోకినపుడెల్ల దావీదు సితార చేతపట్టి పాటవాయించెడివాడు. అతడు ఉప శాంతిపొంది నెమ్మదినొందెడివాడు. దుష్టాత్మ సౌలును విడిచి వెళ్ళెడిది.