ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యూదితు 14వ అధ్యాయము || Telugu catholic bible online

 1. అంతట యూదితు పురజనులను చూచి “సోదరులారా! నా మాటవినుడు. ఈ శిరస్సును కొనిపోయి నగరప్రాకారముమీద వ్రేలాడదీయుడు.

2. మీరొక నాయకుని ఎన్నుకొనుడు. తెల్లవారగనే మీలో యుద్ధము చేయగలవారందరును ఆయుధములు చేపట్టి పట్టణమునుండి కదలిపొండు. మీరు మన నగరమునకు చేరువలోనున్న అస్సిరియా దండుమీద దాడిచేయుటకు పోయినట్లుగా కన్పింపవలెను. కాని మీరు వారి దగ్గరకు మాత్రముపోరాదు.

3. మిమ్ము చూచి అస్సీరియా సైనికులాయుధములు చేపట్టి శిబిరమునకు పరిగెత్తుకొనిపోయి తమ సైన్యాధిపతులను లేపుదురు. ఆ సేనాపతులు హోలోఫెర్నెసు గుడారములకు పరుగెత్తుదురు. కాని అచట అతడు వారి కంటబడడు. అపుడు వారి సైన్యమంత కలవరపడి పారిపోవును. మీరు వారి వెంటబడవచ్చును.

4. మీరును ఇతర యిస్రాయేలీయులును వారిని వెన్నాడి ముక్కలు ముక్కలు చేయవచ్చును.

5. కాని మీరు మొదట అమ్మోనీయుడయిన అకియోరును ఇచటికి పిలిపింపుడు. హోలోఫెర్నెసు యిప్రాయేలీయులను చులకనచేయుచు మాట్లాడెను.. అకియోరునుగూడ మనతో చంపదలచి అతడిని ముందుగనే యిచటికి పంపెను. అట్టివానిని అకియోరు ఇప్పుడు గుర్తింప గలడేమో చూతము” అనెను. .

6. కనుక వారు ఉజ్జీయా ఇంటి నుండి అకియోరును పిలిపించిరి. అతడు వచ్చి అచట గుమిగూడియున్నవారిలో ఒకనిచేత వ్రేలాడు హోలోఫెర్నెసు శిరస్సును చూచి అక్కడికక్కడే మూర్చపోయి నేలకొరిగెను.

7. జనులు అతనిని పైకి లేవనెత్తిరి. అకియోరు యూదితు పాదముల మీదవ్రాలి ఆమెకు నమస్కారము చేసి: “యూదియాలోని ప్రతి కుటుంబము నిన్ను దీవించునుగాక! నీ పేరు విని ప్రతిజాతియు గడగడ వణకునుగాక!” అని పలికెను.

8. మరియు అతడు ఈ గడచిన దినములలో నీవేమేమి చేసితివో మాకు తెలుపుము అని యూదితునడిగెను. ప్రజలెల్లరును వినుచుండగ యూదితు తాను బెతూలియా నుండి వెడలిపోయిన నాటినుండి ఇప్పటి వరకు నిర్వహించిన కార్యముల నెల్ల పూసగ్రుచ్చినట్లు వివరించి చెప్పెను.

9. ఆమె తన కథను ముగింపగా ప్రజలెల్లరు హర్ష ధ్వానములు చేసిరి. నగరము వారి ఉత్సాహ ధ్వనులతో మారుమ్రోగెను.

10. అకియోరు యిస్రాయేలు దేవుడు చేసిన మహాకార్యములెల్ల చూచి ఆ ప్రభువును విశ్వసించెను. అతడు సున్నతిని పొంది యిస్రాయేలు సమాజమున చేరెను. అతని వంశజులు నేటికిని యూదులుగనే జీవించుచున్నారు.

11. మరునాటి ఉదయము యిప్రాయేలీయులు హోలోఫెర్నెసు శిరస్సును నగరప్రాకారమునకు వ్రేలాడ గట్టిరి. వారెల్లరు ఆయుధములు చేపట్టి గుంపులు గుంపులుగా క్రింది లోయలోనికి దిగిరి.

12. వారిని చూచి అస్సీరియా సైనికులు తమ నాయకులకు వార్త పంపిరి. ఆ నాయకులు సైన్యాధిపతులకు సమాచార మందజేసిరి.

13. .ఆ సైన్యాధిపతులు హోలోఫెర్నెసు గుడారమునకు వెళ్ళి బగోవాసుతో “దొరను నిద్రలేపుము. ఆ యిస్రాయేలు బానిసలకు కొమ్ములు వచ్చినవి. వారు మనమీదికే దాడి చేసిరి. అసలు వారికి పోగాలమువచ్చినది” అని చెప్పిరి.

14. బగోవాసు గుడారములోని శయనాగారపు తెర ముందట నిలుచుండి చప్పట్లు కొట్టి శబ్దము చేసెను. అతడు హోలోఫెర్నెసు ఇంకను యూదితుతో నిద్రించుచు ఉండెననుకొనెను.

15. కానియెంత సేపటికిని లోపలినుండి జవాబు రాకుండుటచే తెరను ప్రక్కకు లాగి లోపలికి వెళ్ళెను. అచట హోలోఫెర్నెసు మొండెము మంచము క్రింద పాదపీఠముమీద పడియుండెను.

16. ఆ దృశ్యమును చూచి బగోవాసు గావుకేకలు పెట్టెను. దుఃఖముతో వెక్కివెక్కి యేడ్చుచు బట్టలు చించుకొనెను.

17. అతడు యూదితు గుడారముకు వెళ్ళి చూడగా ఆమె కన్పింప దయ్యెను. అంతట అతడు హోలోఫెర్నెసు సైన్యాధిపతులయొద్దకు వచ్చి,

18. “ఆ బానిసతొత్తులు మనలను వంచించిరి. ఒక హీబ్రూ ఆడుది నెబుకద్నెసరు సామ్రాజ్యము అంతటికిని తలవంపులు తెచ్చినది.  హోలోఫెర్నెసు మొండెము నేలమీద పడియున్నది. తలలేదు” అని అరచెను.

19. ఆ మాటలు విని సేనాపతులు విచారముతో బట్టలుచించుకొనిరి. వారి శిబిరమున కలవరము పుట్టగా వెట్టియేడ్పులు హాహారావములు విన్పించెను.