ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 14వ అధ్యాయము || Catholic Bible in Telugu

1. ఒకనాడు సౌలు కుమారుడు యోనాతాను తన అంగరక్షకునితో, ఆవలనున్న ఫిలిస్తీయుల కావలి దండుమీదకు పోవుదము రమ్మనెను. కాని అతడు తండ్రికి ఈ విషయము తెలుపలేదు.

2. అప్పుడు సౌలు గిబియా అవతల విగ్రేనులో దానిమ్మ చెట్టు క్రింద విడిది చేయుచుండెను. అతనితోనున్న యోధులు సుమారు ఆరువందలమంది.

3. షిలో యాజకుడగు ఏలీ కుమారుడైన ఫీనెహాసు పుత్రుడు ఈకాబోదు అన్నయైన అహిటూబు కుమారుడైన అహీయా ప్రభుచిత్తము తెలియజేయు ఏఫోదు ధరించుకొని యుండెను. యోనాతాను వెళ్ళిన సంగతెవ్వరికిని తెలియదు.

4. అతడు ఫిలిస్తీయుల పటాలము చేరుటకు ఒక లోయ దాటవలెను. ఈ లోయలో ఇరువైపుల  రెండు కొండకొమ్ములు కలవు. మొదటిదాని పేరు బోసేసు. రెండవదాని పేరు సేనే.

5. మొదటిది మిక్మాషునకు ఎదురుగా ఉత్తర దిక్కున గలదు. రెండవది గిబియాకెదురుగా దక్షిణదిక్కున గలదు.

6. యోనాతాను అంగరక్షకునితో “సున్నతి సంస్కారము లేని ఈ ఫిలిస్తీయుల దండుకాపరుల మీద పడుదము రమ్ము. ప్రభువు మనకు మేలుచేయవచ్చును. కొలది మందివలనైనను లేక అనేకులవలనైనను మనలను రక్షింప యావేకు అడ్డుకాజాలదు గదా!” అనెను.

7. అంగరక్షకుడు “నీ ఇష్ట ప్రకారము కానిమ్ము. నీవు ముందు నడువుము. నేను నిన్ను అనుసరించి వచ్చెదను” అని పలికెను.

8. యోనాతాను అంగరక్షకునితో “మనము ఫిలిస్తీయుల సమీపమునకు పోయి వారి కంటపడుదము.

9. సైనికులు మనలను జూచి 'నిలువుడు, మేము మీ చెంతకు వచ్చేదము' అందురేని, వారి దగ్గరకు వెళ్ళక ఇక్కడనే ఆగిపోవుదము.

10. కాని వారు 'మా చెంతకురండు' అందు రేని వారియొద్దకు వెళ్ళుదము. యావే ఫిలిస్తీయులను మన వశముచేసెననుటకు అదియే గురుతు” అని చెప్పెను.

11. ఫిలిస్తీయులు యోనాతానును చూడగనే “అరుగో! హెబ్రీయులు దాగియున్న గోతులనుండి వెలువడుచున్నారు” అని పలికిరి.

12. అంతట వారు యోనాతానును అతని అనుచరుని పిలిచి “మా యొద్దకురండు, మీకొకమాట చెప్పవలయును” అనిరి. యోనాతాను అంగరక్షకునితో "యావే వీరిని యిస్రాయేలీయుల వశముకావించెను. నీవు నా వెంటరమ్ము” అనెను.

13. యోనాతాను లోయనుండి చేతులతో, కాళ్ళతో కొండకొమ్ము పైకెగబ్రాకెను. ఆ రీతినే అంగరక్షకుడును అతని వెంట ప్రాకిపోయెను. ఫిలిస్తీయులు యోనాతాను చేతబడి మడిసిరి. అంగరక్షకుడు కూడ అతని వెనువెంటనే వచ్చి అక్కడక్కడ మిగిలిన వారిని మట్టుపెట్టెను.

14. యోనాతాను మరియు అతని అనుచరుడును కొట్టిన మొదటి దెబ్బకే సుమారు ఇరువదిమంది కూలిరి. పొలములో ఒక జతఎడ్లు ఒక దినమున దున్ను అరెకరము నేల విస్తీర్ణములో అది జరిగెను.

15. యోనాతాను కావలిదండును కొట్టగనే ఫిలిస్తీయుల శిబిరమునందును, దాని చుట్టుపట్టులందును భయము అలముకొనెను. వారి కావలి దండును, దోపిడిదండును భీతిచే కంపించెను. నేల అదరెను. అది యావే పుట్టించిన వణుకు.

16. సౌలు కావలి బంటులు బెన్యామీనీయుల గిబియా నుండి చూడగా ఫిలిస్తీయుల శిబిరము చెల్లాచెదరగుచుండెను.

17. సౌలు తన అనుచరులతో, మన జనులను లెక్కించి ఎవరు వెళ్ళిపోయిరో తెలిసికొనుడని చెప్పెను. వారు జనుల పేర్లు పిలువగా యోనాతాను, అతని అంగరక్షకుడు కనిపింపరైరి.

18. సౌలు అహియాను పిలిచి యావే మందసము తీసుకొనిరమ్ము అనెను. ఆ దినమున మందసము యిస్రాయేలీయుల మధ్యనుండెను.

19. కాని సౌలు యాజకునితో మాట్లాడుచుండగనే ఫిలిస్తీయుల శిబిరమున కల్లోలము అంతకంతకు హెచ్చయ్యెను. కావున అతడు యాజకునితో అది అక్కరలేదు పొమ్మనెను.

20. అంతట సౌలు అతని అనుచరులు బారులుతీరి యుద్ధరంగమునకువచ్చిరి. అచ్చట శత్రువులు మిక్కిలి కలవరపాటుపడి ఒకరినొకరు గుర్తింపజాలక వారిలో వారే పోరాడుకొనుచుండిరి.

21. అంతవరకు ఫిలిస్తీయులకు దాసులైయుండి వారితోపాటు శిబిరమునకు వచ్చిన హెబ్రీయులు సౌలు, యోనాతానుల ననుసరించి వచ్చిన యిస్రాయేలీయులతో చేరిపోయిరి.

22. ఎఫ్రాయీము కొండలలో దాగుకొనియున్న యిస్రాయేలీయులు కూడ ఫిలిస్తీయులు పారిపోవుచున్నారని విని శత్రువులను వెన్నాడిరి.

23. ఆ రోజు యావే యిస్రాయేలీయులను ఈ విధముగా రక్షించెను. బేతావెను ఆవలివైపు వరకు యుద్ధము వ్యాపించెను.

24. ఆ దినము యిస్రాయేలీయులు చాల అలసి పోయిరి. సౌలు “నేను నా శత్రువులపై పగతీర్చుకొనువరకు, అనగా సాయంకాలమగు వరకును ఎవ్వడైనను భోజనము ముట్టుకొన్నచో శాపము పాలగును” అని ఒట్టు పెట్టెను. కనుక ఎవ్వరును ఆహారము ముట్టుకొనలేదు.

25-26. యిస్రాయేలీయులకు పొలమున ఒక తేనెపట్టు కనిపించెను. దానినుండి తేనె చిప్పిలు చుండెను. కాని ఒట్టు తప్పినట్లగునను భయమువలన తేనెపట్టుపై ఎవ్వడు చేయివేయలేదు.

27. అయినను సౌలు ఒట్టు పెట్టినమాట యోనాతానునకు తెలియదు. అతడు చేతనున్నకఱ్ఱకొనతో పట్టును పొడిచి కొంచెము తేనెను గైకొని ఆరగించెను. దానితో అతనికి సత్తువ కలిగెను.

28. అప్పుడు భటుడొకడు యోనాతానుతో “ఈ దినము భోజనము గైకొనినవాడు శాపమునకు గురియగునని నీ తండ్రి ఒట్టుపెట్టెను. కనుకనే గదా మన జనులు ఇంతగా బడలియున్నారు” అనెను.

29. యోనాతాను “నా తండ్రి ప్రజలకు కష్టము కలిగించెను. నేను కొంచెము తేనెను పుచ్చుకొనగనే ఏపాటి సత్తువ కలిగినదో చూడుము.

30. ఈ రీతినే మన జనులు కూడ నేడు శత్రువుల నుండి దోచుకొనివచ్చిన పశువులను చంపి భుజించియున్నచో ఎంత మేలయ్యెడిది! ఆ బలముతో మనవారు ఫిలిస్తీయులను ఊచముట్టుగ తునుమాడియుందురుగదా!” అనెను.

31. ఆ రోజు యిస్రాయేలీయులు మిక్మాషు నుండి అయ్యాలోను వరకు శత్రువులను తునుమాడిరి. కాని వారు మిక్కిలి అలసిపోయిరి.

32. అందుచే వారు శత్రువులనుండి దోచుకొని వచ్చిన గొఱ్ఱెలు, ఎడ్లు, దూడలు మొదలైన జంతువులపై ఎగబడిరి. ఎక్కడి వానిని అక్కడనే నేలమీదనే వధించిరి. నెత్తురు తొలగింపకయే మాంసముకాల్చి భుజింపమొదలిడిరి.

33. జనులు నెత్తురుతొలగింపని మాంసము భుజించి యావే యెదుట పాపము కట్టుకొనుచున్నారని సౌలు తెలిసికొనెను. అతడు “ప్రజలు యావే ఆజ్ఞ మీరు చున్నారుగదా!” అనెను. పెద్ద రాతిబండను తన యొద్దకు దొర్లింప ఆజ్ఞయిచ్చెను.

34. చెంతనున్న వారితో “ప్రజలకడకు వెళ్ళి 'మీ ఎడ్లను, గొఱ్ఱెలను కొనివచ్చి ఈ రాతిబండపై కుత్తుకలుకోసి భుజింపుడు. నెత్తురుతో భుజించి యావే ఎదుట పాపము కట్టుకొనకుడు' అని మందలింపుడు” అని చెప్పెను. కావున ప్రజలు ఆ రేయి వారివారి ఎడ్లను కొనివచ్చి రాతి బండపై వధించిరి'.

35. సౌలు ప్రభువునకు ఒక బలిపీఠము కట్టెను. అదియే అతడు నిర్మించిన మొదటి బలిపీఠము.

36. సౌలు “రాత్రికి పోయి ఫిలిస్తీయుల మీదపడి వారిని తరుముదము. వేకువజాము వరకు వారి సొత్తు దోచుకొందము. ఒక్కడుకూడ మిగులకుండ శత్రువులను చంపుదము” అనెను. అనుచరులు నీ ఇష్ట ప్రకారముగనే కానిమ్మనిరి. కాని యాజకుడు మొదట దేవుని చిత్తము తెలిసికొందమనెను.

37. సౌలు ప్రభువును ఉద్దేశించి “ఫిలిస్తీయులను వెన్నాడవచ్చునా? నీవు వారిని యిస్రాయేలు వశము గావించెదవా?" అని అడిగెను. కాని ఆ దినమున యావే ప్రత్యుత్తరము ఈయలేదు.

38. సౌలు ప్రజాధిపతులను చూచి “నాయకులారా! ముందుకురండు. ఈ దినము జరిగిన అపరాధమేమియో తెలిసికొనవలయును.

39. యిస్రాయేలు విమోచకుడైన యావే ప్రభువుతోడు! అపరాధము చేసినవాడు నా తనయుడు యోనాతానే అయినను తప్పక చావవలసినదే” అనెను. అతని పలుకులకు ప్రజలలో ఒక్కడును నోరు మెదప లేదు.

40. సౌలు జనులతో “మీరందరు ఒక ప్రక్క నిలువుడు. నేనును, నా కుమారుడైన యోనాతాను మరియొకప్రక్క నిలచెదము” అనెను. వారు “నీ ఇష్టప్రకారముగనే కానిమ్ము" అనిరి.

41. అంతట సౌలు “యిస్రాయేలు దేవుడవైన ప్రభూ! ఈ రోజు నీ దాసునకు బదులు పలుకవైతివేల? నేనుగాని, నా పుత్రుడైన యోనాతానుగాని లేక ప్రజలుగాని అపరాధము చేసినచో నీవే దీనిని నిర్ణయించుము అని వేడుకొనెను. అప్పుడు ట్లు వేయగా యోనాతాను సౌలుల పేర్లు వచ్చెను. కావున ప్రజలు తప్పించు కొనిరి.

42. మరల సౌలు తనకు, తన కుమారునకు చీట్లు వేయగా యోనాతాను పేరు వచ్చెను.

43. అంతట సౌలు యోనాతానుతో “నీవేమి పాడుపని చేసితివో తెలియజేయుము” అనెను. అతడు “నా చేతనున్న కఱ్ఱకొనతో కొంచెము తేనెనుగైకొని త్రాగితిని. నేను నిక్కముగా చావవలసినదే” అనెను.

44. సౌలు ఇట్లనెను 'యోనాతాను, నీవు నిక్కముగా చావవలసినదే, కానిచో దేవుడు నాకు ఎంతైనా కీడు చేయునుగాక!' అనెను. “యోనాతాను చావవలసినదే” అని గట్టిగా ఒట్టు వేసికొనెను.

45. కాని ప్రజలు మాత్రము “యిస్రాయేలీయులకు ఇంతటి మహావిజయము సాధించి పెట్టిన యోనాతాను చనిపోవలసినదేనా? అది ఎన్నటికిని కూడదు. సజీవుడైన యావే తోడు! యోనాతాను తలపూవువాడకుండుగాక! అతడు ఈ దినము సాధించిన విజయము యావే తోడ్పాటువలననే సిద్ధించినది” అనిరి. ఇట్లనుచు యోనాతానును విడిపించిరి. కనుక అతడు చావును తప్పించుకొనెను.

46. అటుపిమ్మట  సౌలు ఫిలిస్తీయులను వెన్నాడలేదు. కావున వారు తమ స్థలమునకు వెళ్ళిపోయిరి.

47. సౌలు యిస్రాయేలు దేశమున పరిపాలన మును సుస్థిరము చేసికొనెను. చుట్టుపట్లనున్న శత్రువులతో యుద్ధములు చేసెను. మోవాబీయులను, అమ్మోనీయులను, ఎదోమీయులను, సోబా రాజులను, ఫిలిస్తీయులను గెలిచెను. అతడు ఏ వైపు మరలినను విజయము లభించెడిది.

48. సౌలు పరా క్రమముతో అమాలేకీయులను ఓడించి వారి దోపిడి దండుల నుండి యిస్రాయేలీయులను కాపాడెను.

49. సౌలు తనయులు: యోనాతాను, యిష్వీ, మెల్కీ షూవా అనువారు. అతనికి కుమార్తెలు ఇద్దరు. మేరబు పెద్ద కూతురు. మీకాలు రెండవ కూతురు.

50. అహిమాసు కూతురగు అహీనోవము సౌలు భార్య. అతని సైన్యాధిపతి నేరు కుమారుడైన అబ్నేరు. ఇతడు సౌలు పినతండ్రి కుమారుడు.

51. సౌలు తండ్రి అయిన కీషును, అబ్నేరు తండ్రియైన నేరును అబీయేలు తనయులు.

52. సౌలు బ్రతికి యున్నన్ని నాళ్ళు ఫిలిస్తీయులతో హోరాహోరిగా పోరాడెను. అతడు వీరుడుగాని, పరాక్రమవంతుడుగాని కంట బడగనే వానిని తన సైన్యమున చేర్చుకొనెడివాడు.