ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 13వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. సౌలు ముప్పదిఏండ్ల ప్రాయమువాడై రాజుగా పరిపాలన మొదలిడి ఏడాది గడచెను. రెండవ ఏడాది పాలించిన మీదట '

2. సౌలు యిస్రాయేలీయుల నుండి మూడువేలమంది వీరులనెన్ను కొనెను. వీరిలో రెండువేలమంది మిక్మాషునందు, బేతేలు కొండయందు విడిదిచేసిరి. సౌలు వారికి నాయకుడు. వేయిమంది బెన్యామీనీయుల గిబియా యందు మకాము చేసిరి. యోనాతాను వారికి నాయకుడు. మిగిలిన వారిని సౌలు వారి వారిండ్లకు పంపి వేసెను.

3. యోనాతాను గెబా వద్దనున్న ఫిలిస్తీయుల దండును హతము చేసెను. దానితో ఫిలిస్తీయులు హెబ్రీయులు తిరుగుబాటు మొదలిడిరని గ్రహించిరి. సౌలు యుద్ధమునకు గుర్తుగా దేశమంతట హెబ్రీయులు వినవలెనని బాకా ఊదించెను.

4. సౌలు ఫిలిస్తీయుల దండును హతము చేసినందున ఫిలిస్తీయులు హెబ్రీయులనిన పండ్లు కొరుకుచుండిరని యిస్రాయేలీయులు గుర్తించిరి. కనుక వారు సౌలు పిలుపునందుకొని గిల్గాలువద్ద అతనిని కలిసిరి.

5. ఫిలిస్తీయులు కూడ యుద్ధమునకు సన్నద్ధులైరి. వారికి ముప్పదివేల రథములు, ఆరువేలమంది రౌతులు, సముద్రతీరము నందలి ఇసుకరేణువులవలె లెక్కకందని కాలిబంటులు కలరు. ఫిలిస్తీయులు బేతావెనుకు తూర్పుననున్న మిక్మాషువద్ద శిబిరముపన్నిరి.

6. శత్రు సైన్యము యిస్రాయేలీయులచుట్టు క్రమ్ముకొనెను. అదిచూచి యిస్రాయేలీయులు ఆశవదలుకొని కలవరపాటున  గుహలలో, బొరియలలో, రాతినెరియలలో, గోతులలో, నూతులలో దాగుకొనిరి. చాలమంది యోర్దాను రేవుదాటి గాదు, గిలాదు మండలములకు పారిపోయిరి.

7. సౌలు ఇంకను గిల్గాలు వద్దనేయుండెను. జనులందరు భయపడుచు అతనిని వెంబడించిరి.

8. సమూవేలు పెట్టిన గడువు ప్రకారముగా సౌలు ఏడు రోజులు వేచియుండెను. కాని సమూవేలు గిల్గాలునకు రాలేదు. అది చూచి జనులు సౌలును విడనాడి ఎవరి త్రోవను వారు వెడలిపోజొచ్చిరి.

9. సౌలు జనులు చెదరిపోవుట చూచి దహనబలిని, సమాధానబలిని సిద్ధము చేయించెను. తానే దహనబలిని అర్పించెను.

10. సౌలు దహనబలిని అర్పించి ముగింపగనే సమూవేలు వచ్చెను. సౌలు వందనము చేయుటకై సమూవేలునకు ఎదురువోయెను.

11. అతనిని చూడగనే సమూవేలు “ఎంతపని చేసితివి!” అనెను. సౌలు అతనితో “జనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నీవేమో గడువు లోపల రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మాషు వద్ద మోహరించి ఉండుటయు చూచి

12. వారు తప్పక గిల్గాలునకు వచ్చి నా మీదపడెదరు. నేనింకను యావేను మనవి చేయనైతిననుకొంటిని కనుక ఎటులనో గుండెనిబ్బరముతో ఈ దహనబలిని అర్పించితిని” అనెను.

13. సమూవేలు “నీవు పిచ్చి పని చేసితివి. ' నీ దేవుడైన యావే ఆజ్ఞ పాటించి యుంటివేని ప్రభువు కలకాలము నీ వంశము వారినే యిస్రాయేలీయులకు రాజులుగా నియమించియుండెడి వాడు'. ఇక నీ వంశమువారికి రాచరికము లభింపదు. నీవు యావేఆజ్ఞ పాటింపవైతివి.

14. అందుచే ప్రభువు తనకు నచ్చినవానిని వేరొకనిని ఎన్నుకొనును. అతనినే తన ప్రజకు నాయకునిగా నియమించును” అని పలికెను. అటుల పలికి సమూవేలు గిల్గాలు నుండి వెళ్ళిపోయెను.

15. పిమ్మట సౌలు గిల్గాలు నుండి బయలుదేరి శత్రుసైన్యములున్న దిక్కుకువెడలెను. సౌలు అనుచరులు అతని వెంటబోయిరి. బెన్యామీనీయుల గిబియా వద్ద సౌలు తన జనమును లెక్కించి చూడగా ఆరువందల మంది మాత్రము తేలిరి.

16. సౌలు, అతని కుమారుడైన యోనాతాను అనుచరులు బెన్యామీనీయుల గిబియావద్ద విడిది చేసిరి. ఫిలిస్తీయులు మిక్మాషువద్ద బారులు తీరి యుండిరి.

17. ఫిలిస్తీయుల శిబిరము నుండి మూడు దోపిడిదండులు బయలుదేరెను. ఒక దండు షూవాలు రాష్ట్రములోని ఒఫ్రాకు వెళ్ళెను.

18. రెండవది బేత్ హోరోనుకు వెడలెను. మూడవది సెబోయీము లోయకు, దాని ఆవలి ఎడారికి ఎదురుగానున్న కొండ వరుసవైపు నడచెను.

19. ఫిలిస్తీయులు హెబ్రీయులను కత్తులు, ఈటెలు తయారు చేసికొననీయలేదు. కావున యిస్రాయేలు దేశమున ఇనుపపనిముట్లు చేయువారు కరువైరి.

20. అందుచే యిస్రాయేలీయులు కఱ్ఱు, గొడ్డలి, పార, పోటుకత్తి మొదలైన వానికి పదును పెట్టించు కొనుటకు ఫిలిస్తీయుల వద్దకే వెళ్ళెడివారు.

21. ఫిలిస్తీయులు కట్టులను గొడ్డళ్ళను సాగగొట్టుటకు వెండికాసున మూడింట రెండుపాళ్ళు పుచ్చుకొనెడి వారు. పారలకు, పోటుకత్తులకు పదును పెట్టుటకు మూడవపాలు పుచ్చుకొనెడివారు.

22. కావున పోరాటము చెలరేగునప్పటికి సౌలు సైన్యమునగాని, యోనాతాను సైన్యమునగాని ఒకని చేతిలోనైన కత్తి, ఈటె కనబడవయ్యెను. సౌలు, యోనాతాను చేతులలో మాత్రము ఆయుధములుండెను.

23. మిక్మాషు కనుమను కాచుటకై ఫిలిస్తీయులు కావలిదండును పంపిరి.