ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు మొదటి గ్రంధము 12వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. సమూవేలు ప్రజలతో “మీ మనవులను ఆలించియే రాజును నియమించితిని.

2. ఇకమీదట రాజే మిమ్ము నడిపించును. నేనా ముదుసలిని. నా తల వెంట్రుకలుకూడ నెరసినవి. మీచెంతనున్న నా కుమారులే నా ప్రాయమునకు సాక్ష్యము. చిన్ననాటి నుండి నేటివరకును నేనే నాయకుడనై మిమ్ము నడి పించుచు వచ్చితిని.

3. నేడు మీ ముందటనిలుచుండి మాట్లాడుచున్నాను. నాయందు ఏదేని దోషమున్న యావే యెదుట, యావే అభిషిక్తుడగు రాజు నెదుట నిరూపింపుడు. నేనెవరి ఎద్దునైన తీసికొంటినా? ఎవరి గాడిదనైన పట్టుకుంటినా? ఎవరినైన మోసగించితినా? ఎవరినైనా పీడించితినా? ఎవరి యొద్దనుండైన లంచ ములు పుచ్చుకొని న్యాయము చెరచితినా? నేనిట్లు చేసినయెడల ఋజువుచేయుడు. మీ సొమ్ము మీకు తిరిగి ముట్టచెప్పెదను” అనెను.

4. వారు “నీవు మమ్ము మోసగింపలేదు, పీడింపలేదు. మా యెద్ద నుండి లంచములు పుచ్చుకొననులేదు” అనిరి.

5. అతడు “నాయెడల అపరాధము ఏమియు లేదనుటకు యావే సాక్షి. ప్రభువుచే అభిషిక్తుడగు రాజు సాక్షి” అనెను. వారు “అవును, ప్రభువే సాక్షి” అని బదులు పలికిరి.

6. సమూవేలు ప్రజలతో “అవును, ప్రభువే సాక్షి. మోషే, అహరోనులు అను నాయకులను ఒసగి మీ పితరులను ఐగుప్తునుండి ఈవలకు కొనివచ్చినది ఈ ప్రభువే గదా!

7. కొంచెము సేపిట నిలిచి నా పలుకులు సావధానముగా వినుడు. మీకు, మీ పితరులకు యావే యొనర్చిన రక్షణ కార్యములను ప్రభువు ఎదుటనే మీకు వివరించి చెప్పెదను.

8. యాకోబు తనయులు ఐగుప్తులో స్థిరపడిన తరువాత ఐగుప్తీయులు పెట్టు బాధలు భరింపలేక దేవునకు మొరపెట్టిరి. ప్రభువు మోషే, అహరోనులను పంపెను. వారు మీ పితరులను ఐగుప్తునుండి తోడ్కొనివచ్చి ఈ దేశమున స్థిరముగ నెలకొల్పిరి.

9. కాని యిస్రాయేలీయులు తమ దేవుడైన యావేను విస్మరించిరి. కావున ప్రభువు వారిని హాసోరు సైన్యములకధిపతియైన సీస్రాకు కైవసము చేసెను. ఫిలిస్తీయులకును, మోవాబు రాజునకును బానిసలను గావించెను. కావున మీ పితరులు శత్రువు లతో పోరాడవలసి వచ్చెను.

10. అందుచే వారు 'మేము ప్రభువును విడనాడి బాలు, అష్టారోతు దేవతలను పూజించి పాపము కట్టుకొంటిమి. శత్రువులనుండి మమ్ము విడిపించెదవేని ఇక మీదట నిన్నే కొలిచెదము' అని యావేను వేడుకొనిరి.

11. అప్పుడు ప్రభువు యెరుబాలు, బారాకు, యెఫ్తా, సంసోను అను నాయకులను పంపి చుట్టు పట్లనున్న శత్రువుల బానిసత్వమునుండి మిమ్ము విడిపించెను. మీరును ఇన్నాళ్ళు చీకు చింత లేక బ్రతికితిరి.

12. యావే మీ రాజు అయినను, అమ్మోనీయుల రాజైన నాహాషు మీమీదికి దండెత్తివచ్చుట చూచి, 'మాకు యావే కాక మరియొక రాజు కావలెను' అని పట్టుపట్టితిరి.

13. ఇదిగో ఇతడే మీరెన్నుకొనిన రాజు. ప్రభువు మీకు ఈ రాజును నియమించెను.

14. మీరు ప్రభువుపట్ల భయభక్తులు చూపి ఆయనను కొలిచి, ఆయన మాటవిని ఆయన ఆజ్ఞలను పాటింతురేని, మీరును మిమ్ము పాలించు రాజును ప్రభువు చిత్తానుసారముగా నడుచుకొందురేని మీకు మేలు కలుగును.

15. కాని మీరు ప్రభువుమాట వినక ఆయన ఆజ్ఞలు ధిక్కరింతురేని, యావే మిమ్మును, మీ రాజును ముప్పుతిప్పలు పెట్టును.

16. ఇంకొక క్షణమిచ్చటనే నిలువుడు. మీ యెట్టఎదుటనే యావే చూపబోవు మహాశ్చర్యమును గూడ తిలకింపుడు.

17. ఇది గోధుమపంట కాలముకదా? అయినను నా ప్రార్థనవిని యావే ఉరుములతో వాన కురిపించును. దీనినిబట్టి మీరు రాజు కావలెనని అడుగుట వలన ప్రభువు ఎదుట ఎంత చెడ్డపని చేసితిరో తెలిసి కొందురు” అనెను. 

18. అంతట సమూవేలు ప్రార్థింపగా ప్రభువు ఉరుములతో వాన కురిపించెను. కావున ప్రజలు ప్రభువునకు, సమూవేలునకు జడిసిరి.

19. వారు సమూవేలుతో “ఈ దాసుల తరపున నీ దేవుడైన యావేకు విన్నపము చేయుము. మేము చావు తప్పించుకొని బ్రతికిపోయెదము. రాజును కోరుకొనుట యను ఈ నేరముకూడ మా పాపములపట్టికకు చేర్చితిమి” అని పలికిరి. .

20. అందుకు సమూవేలు ప్రజలను చూచి “భయపడకుడు. మీరింతటి పాపము చేసితిరి అన్నది యదార్ధమే. అయినను ప్రభువును అనుసరించుట మాత్రము మానకుడు. ఆయనను పూర్ణహృదయముతో సేవింపుడు.

21. విగ్రహములు మాయయే. అవి మిమ్ము కాపాడలేవు. వానివలన ప్రయోజనము లేదు. కావున వట్టిబొమ్మలను కొలువకుడు.

22. అయితే యావే తన ఘనమైన నామమును నిలబెట్టుకొనువాడు కనుక మిమ్ము పరిత్యజింపబోడు. అతడు మిమ్ము తన ప్రజగా చేసికోగోరెను.

23. నా మట్టుకు నేను మీ తరపున మనవిచేయుట మానను, ఉత్తమమైన ధర్మమార్గమును మీకు చూపకుండా ఉండను. అటుల చేసినచో ప్రభువునకు ద్రోహము చేసినట్లే అగును. ఇట్టి పాపము నేను ఏనాటికిని కట్టుకొనను.

24. మీరు మాత్రము యావేపట్ల భయభక్తులు కలిగి నడచుకొనుడు. విశ్వాసముతోను, పూర్ణహృదయముతోను ప్రభువును సేవింపుడు. ఆయన మీ కొరకు ఎంతటి అద్భుతకార్యము చేసెనో ఇప్పుడే కన్నులార చూచితిరి గదా!

25. కాని మీరింకను దుష్కార్యములు సల్పుట మానరేని మీరును, మీ రాజును సర్వనాశనమయ్యె దరు” అని పలికెను.