ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తోబీతు 11వ అధ్యాయము || Telugu catholic bible online

 1. వారు ప్రయాణము చేయుచు నీనెవె చెంతగల కసెరీను నగరము దాపులోనికొచ్చిరి.

2. అప్పుడు రఫాయేలు తోబియాతో “మనము బయలుదేరినప్పుడు నీ తండ్రి ఎట్టి దీనస్థితిలో ఉండెనో నీకు తెలియునుగదా!

3. కనుక ఇప్పుడు మనము నీ భార్య కంటే ముందుగా పోయి ఇంటిని సిద్ధము చేయుదము. ఆమె తోడి ప్రయాణీకులతో నిదానముగా వచ్చును.

4. నీవు ఆ చేపపిత్తమును తెచ్చుట మాత్రము మరువకుము” అని చెప్పెను. అటుల వారు ముందు నడువగా తోబియా కుక్క వారివెంటబోయెను.

5. అక్కడ అన్నా కుమారుని కొరకు ఎదురు చూచుచు త్రోవవైపు పారజూచుచు కూర్చుండెను.

6. ఆమె తటాలున తోబియా వచ్చుటను చూచి పెనిమిటితో “అదిగో! మన బిడ్డ నేస్తునితో వచ్చుచున్నాడు” అని చెప్పెను.

7. తోబియా తన తండ్రి చెంతకు వెళ్ళకమునుపే రఫాయేలు అతనితో “నీవు నా మాట నమ్ముము. నీ తండ్రికి మరల చూపువచ్చును.

8. నీవు ఈ చేప పిత్తమును మీ నాయన కన్నులకు పూయవలయును. ఆ మందువలన అతని కంటిలోని పొరలు కుదించు కొనిపోవును. వెంటనే మీ నాయనకు చూపువచ్చును” అని చెప్పెను.

9. అప్పుడు అన్నా పరిగెత్తుకొనివచ్చి కుమారుని కౌగలించుకొనెను. “నాయనా! నిన్ను కన్నులార చూచితిని గనుక ఇక నిశ్చింతగా ప్రాణములు విడుతును” అనుచు సంతోషముతో కన్నీరుగార్చెను.

10. తోబీతు తడవుకొనుచు ముంగిలి తలుపుగుండ వెలుపలికి నడచివచ్చెను.

11. తోబియా చేపపిత్తముతో తండ్రి ఎదుటికి వచ్చెను. అతడు తండ్రి కన్నులమీద ఊది అతనిని తన చేతితో పట్టుకొని “నాయనా! ధైర్యము తెచ్చుకొనుము” అని చెప్పెను.

12-13. అంతట అతడు చేప పిత్తమును తండ్రి కనులకుపూసెను. ఆ వృద్ధుని కన్నులలోనుండి కంటికొనలతో మొదలు పెట్టి తెల్లని పొరలను పెరికివేసెను.

14. తోబీతు కుమారుని మెడ మీద చేతులు ఆనించి సంతోషముతో కన్నీరు కార్చెను. “నాయనా! నా కంటికి దీపమువైన నీవు ఇపుడు నాకు కన్పించుచున్నావుసుమా!" అని పలికెను. అతడు ఇంకను: “ప్రభువును స్తుతింపుడు. అతని మాహాత్మ్యమును కొనియాడుడు. పవిత్రులైన అతని దూతలను కీర్తింపుడు. అతని మాహాత్మ్యమును కలకాలము స్తుతింపుడు.

15. అతడు నన్ను గ్రుడ్డితనముతో శిక్షించెను. కాని ఇప్పుడు నన్ను కరుణించెను. కనుకనే ఇప్పుడు నేను నా కుమారుని చూడగలిగితిని” అని అనెను. అంతట తోబియా సంతోషముతో దేవుని బిగ్గరగా స్తుతించుచు ఇంటిలోనికి వెళ్ళెను. తరువాత అతడు తండ్రికి తన సంగతి అంతా చెప్పెను. తన ప్రయాణము సఫలమైనదనియు, తాను సొమ్మును కొనివచ్చితిననియు, అంతమాత్రమే కాక రగూవేలు కుమార్తె అయిన సారాను గూడ పెండ్లియాడితిననియు, ఆమె గూడ వెనువెంటనే వచ్చుచున్నదనియు, అప్పటికే ఆమె నీనెవె నగర ద్వారములను చేరియుండును” అని వివరించెను.

16. తోబీతు కోడలిని కలసికొనుటకై పట్టణ ద్వారమువద్దకు బయలుదేరెను. అతడు దారి పొడవున ప్రభువును స్తుతించుచు వెళ్ళెను. అతడు తోడు లేకుండ గబగబనడచుట జూచి నేనెవె పౌరులు విస్తుపోయిరి.

17. దేవుడు తనను కరుణించి తనకు దృష్టి దయచేసెనని తోబీతు పురజనులతో చెప్పెను. అంతట అతడు తన కోడలు సారాను కలసికొని ఆమెకిట్లు స్వాగతము చెప్పెను: “కుమారీ! నీకు స్వాగతము. దేవుడు నిన్ను మా ఇంటికి కొనివచ్చెను గనుక, ఆ ప్రభువునకు స్తోత్రములు. అతడు నీ తండ్రిని, నిన్ను, నా కుమారుని దీవించునుగాక! ఇప్పుడు నీ సొంత ఇంటిలో అడుగిడుము. నీకు ఎల్లవేళల ఆరోగ్యము, సంతోషము, దీవెనలు సిద్ధించునుగాక! కుమారీ! నీకు స్వాగతము.” తోబీతు ఆ రోజు నేనెవెలోని యూదులు అందరికి విందు చేసెను.

18. అతని సోదరుని కుమారులైన అహీకారు, నాదాబు అనువారు కూడ ఆ విందుకు వచ్చిరి.