ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు రెండవ గ్రంధము 10వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. అమ్మోనీయుల రాజు చనిపోయెను. అతని కుమారుడు హానూను రాజ్యమునకు వచ్చెను.

2. దావీదు “నాహాషు నన్నాదరించినట్లే, నేను  నాహాషు కుమారుడైన హానూనును ఆదరింతును” అనుకొని “నీ తండ్రి మృతి నొందినందులకు మిక్కిలి సంతాపము చెందుచున్నాను” అని దూతలద్వారా వార్తనంపెను.

3. కాని దావీదు రాయబారులు రాగానే అమ్మోనీయ నాయకులు తమ రాజును చేరి “దావీదు దూతలతో సంతాపవార్తలు పంపినది నీ తండ్రి పట్లగల గౌరవము చేతనే అనుకొంటివా? వేగు నడపి మన నగరమును ముట్టడించుటకే అతడు చారులను పంపెనని నీకు అనిపించుటలేదా” అనిరి.

4. హానూను వారి మాటలు నమ్మెను. దావీదు రాయబారులను పట్టుకొని వారి గడ్డములనొకచెంప పూర్తిగా గొరిగించి, ఉడుపులను నడిమికి పిరుదుల వరకు కత్తిరించి పంపివేసెను.

5. దావీదు ఈ సంగతిని వినెను. సిగ్గున మ్రగ్గిపోవు తన రాయబారులను కలిసికొనుటకై దూతలనంపి “మీరు గడ్డములు పెరిగినదాక యెరికో నగరముననే ఉండి అటుపిమ్మట మరలిరండు" అని వార్త పంపెను.

6. అమ్మోనీయులు దావీదును రెచ్చగొట్టితిమని గ్రహించి బెత్రేహోబు, సోబా మండలముల నుండి అరామీయుల కాలిబంటులను ఇరువది వేలమందిని జీతములిచ్చి పిలిపించుకొనిరి. మాకా రాజు వేయి మందిని పంపెను. టోబు నుండి పండ్రెండువేలమంది వచ్చిరి.

7. దావీదు ఈ సంగతి తెలిసికొని తన తాత్కాలిక సైన్యముతో, స్థిర సైన్యములతో యోవాబును అమ్మోనీయుల మీదకు పంపెను.

8. అమ్మోనీయులు నివాసములు వెడలివచ్చి నగరద్వారము వద్ద వరుసలు తీరిరి. సోబా, రెహోబు, మాకా, టోబు రాజ్యముల నుండి వచ్చిన వీరులు అమ్మోనీయుల ఊరికి కొంచెము దూరముగా బయలున వ్యూహము పన్నిరి.

9. ఆ తీరు చూచి యోవాబు ముందు వెనుకల కూడ పోరు నడపవలయునని గ్రహించెను. అతడు యిస్రాయేలీయులలో శూరులనెన్నుకొని అరామీయులకు ఎదురుగా నిలిపెను.

10. మిగిలిన వారిని తన తమ్ముడైన అబీషాయికి అప్పగించెను. అతడు వారిని అమ్మోనియులకు ఎదురుగా నిలిపెను.

11. యోవాబు తమ్మునితో “అరామీయులు మమ్ము మించి గెలువజూతురేని నీవు వచ్చి నాకు సాయపడుము. అమ్మోనీయులు నిన్ను గెలువజూతురేని నేను వచ్చి నీకు తోడ్పడెదను.

12. ధైర్యముతో నుండుము. మన ప్రజలకొరకు మన దేవుని పట్టణముల కొరకు పరాక్రమముతో పోరాడుదము. అటుపిమ్మట యావే తన యిచ్చవచ్చిన రీతిని చేయునుగాక!” అని పలికెను.

13. యోవాబు తన వీరులతో అరామీయులను ఎదుర్కొనగా వారతని ముందు నిలువజాలక పారిపోయిరి.

14. అరామీయులు పారిపోవుట చూచి అమ్మోనీయులు కూడ అబీషాయి ఎదుటినుండి పలాయనమై నగరమున జొరబడిరి. అంతట యోవాబు అమ్మోనీయులను వీడి యెరూషలేమునకు మరలెను.

15. అరామీయులు యిస్రాయేలీయులకు ఓడిపోయితిమిగదా అని వగచి తమ వారినందరను ప్రోగుచేసికొనిరి.

16. హదదెసెరు దూతలనంపి యూఫ్రటీసు నదికి ఆవలిదరినున్న అరామీయులను కూడ విలువనంపెను. వారందరు ప్రోగైవచ్చి హదదె సెరు సైన్యాధిపతి షోబాకు నాయకత్వమున హేలాము నొద్దదిగిరి.

17. దావీదు ఈ ఉదంతము విని యిస్రాయేలీయులనందరను సమకూర్చుకొని యోర్దానునది దాటి హేలాము చేరుకొనెను. అరామీ యులు బారులుతీరి దావీదు నెదుర్కొనిరి.

18. కాని వారు దావీదు దెబ్బలకు తాళలేకపోయిరి. అతడు వారి రథికులను ఏడు వందలమందిని, అశ్వికబలము నలువదివేల మందిని మట్టుపెట్టెను. వారి సైన్యాధిపతి షోబాకు గాయపడి రణరంగముననే మడిసెను.

19. ఈ రీతిగా హదదెసెరుసామంతులెల్ల యిస్రాయేలీయు లకు లొంగిపోయిరి. వారితో సంధిచేసికొని కప్పము కట్టిరి. అటుతరువాత అరామీయులు అమ్మోనియులకు సాయపడుటకు జంకిరి.