ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బారూకు 1వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. ఈ గ్రంథమును బారూకు బబులోనియాలో లిఖించెను. అతడు నేరియా కుమారుడు, మహసేయా మనుమడు. సిద్కియా, హసాదియా, హిల్కియా అనువారు క్రమముగా అతని వంశకర్తలు.

2. బబులోనీయులు యెరూషలేమును ముట్టడించి దానిని తగులబెట్టిన పిమ్మట, ఐదవయేడు, ఆ మాసపు ఏడవనాడు బారూకు దీనిని వ్రాసెను.

3. యెహోయాకీము కుమారుడును, యూదా రాజునగు యెహోయాకీను సమక్షమునను, బబులోనియా దేశమున, సూదు నదిచెంత వసించు యూదుల సమక్షమునను బారూకు ఈ గ్రంథమును పెద్దగా చదివెను.

4. ప్రధానులు, రాజవంశజులైన యువకులు, పెద్దలు, అన్ని తరగతులకు చెందిన ప్రజలెల్లరును ఈ గ్రంథములోని వాక్యములు వినిరి.

5. ప్రజలు ఈ పుస్తకములోని సంగతులను విని, ఏడ్చి ఉపవాసముండి ప్రభువునకు ప్రార్థన చేసిరి.

6. అంతట ప్రతి ఒక్కడును తాను చేయగలిగినంత దానము చేసెను.

7. ఆ సొమ్మును యెరూషలేములోని ప్రధానయాజకుడగు యెహోయాకీము, ఇతర యాజకులు, ప్రజలు మొదలగు వారి చెంతకు పంపిరి. ఈ యెహోయాకీము హిల్కియా కుమారుడు, షల్లూము మనుమడు.

8. సీవాను నెల పదియవనాడు, పూర్వము దేవాలయమునుండి కొనివచ్చిన పాత్రములను బారూకు యూదాకు తీసుకొనిపోయెను. యూదా రాజును, యోషీయా కుమారుడైన సిద్కియా ఈ వెండి పాత్రములు చేయించెను.

9. బబులోనియా రాజగు నెబుకద్నెసరు యెహోయాకీనును, పాలకులను, చేతి పనుల వారిని, ప్రధానులను, సామాన్య ప్రజలను యెరూషలేమునుండి బబులోనియాకు బందీలుగా కొనిపోయిన పిదప వానిని తయారుచేయించిరి.

10. ప్రజలిట్లు లేఖ వ్రాసిరి: “మీరు దహనబలులకును, పాపపరిహార బలులకును, బలిపశువులను కొనుటకును, సాంబ్రాణిని ధాన్య బలులలో వాడు ధాన్యమును కొనుటకును మేము పంపిన ఈ సొమ్మును వినియోగింపుడు. మన దేవుడైన ప్రభువు పీఠము మీద ఆ బలులనెల్ల అర్పింపుడు.

11. బబులోనియా రాజగు నెబుకద్నెసరు, అతని కుమారు డగు బెల్షస్సరును ఆకాశమున్నంత కాలము జీవింప వలెనని ప్రార్థింపుడు.

12. అప్పుడు ప్రభువు మనకు బలమొసగి మనలను నడిపించును. నెబుకద్నెసరు, అతని కుమారుడు బెల్టస్సరు మనలను కాపాడుదురు. మన జీవితకాలమంతయు, మనము వారిపట్ల విశ్వసనీయులముగా జీవింతము. వారును మనలను చూచి సంతోషింతురు.

13. మేము ప్రభువునకు ద్రోహముగా పాపము చేసినందున ఆయన మామీద ఇంకను ఆగ్రహము చెందియున్నాడు. కనుక మీరు మా కొరకు మన ప్రభువైన దేవునికి విన్నపము చేయుడు.

14. మేము పంపు ఈ గ్రంథమును మీరు బిగ్గరగా చదువుడు. నియమించబడిన కాలముల లోను, పండుగ దినములలోను ఆలయములో చదివి, మీ విశ్వాసమును ప్రకటించుచు మీరు ఈ విధముగా పలుకవలయును.

15. మా దేవుడైన యావే నీతిమంతుడు. కాని మేమిప్పటకీ సిగ్గుతో వెలవెలబోవుచున్నాము. యూదా ప్రజలు, యెరూషలేము పౌరులు,

16. మా రాజులు, పాలకులు, యాజకులు, ప్రవక్తలు, పెద్దలెల్లరును సిగ్గుచెందిరి.

17. ఏలయన మేము మా ప్రభువైన దేవునికి ద్రోహము చేసితిమి.

18. ఆయన ఆజ్ఞలను మీరితిమి. ఆయన మాటలను పాటింపమైతిమి. ఆయన చట్టములను లెక్కచేయమైతిమి.

19. ప్రభువు మా పితరులను ఐగుప్తునుండి తోడ్కొని వచ్చినప్పటినుండి నేటివరకు మేము ఆయనకు లొంగక ఆయన ఆజ్ఞలను మీరుచుంటిమి.

20. పూర్వము ప్రభువు మా పితరు లను ఐగుప్తునుండి బయటికి నడిపించుకొని వచ్చి వారికి పాలుతేనెలు జాలువారు నేలను ఇత్తునని ప్రమాణము చేసినప్పుడే తన సేవకుడైన మోషే ద్వారా శాపవాక్యము లను గూడ వినిపించెను. ఆ శాపములు నేడు మా మీదికి దిగివచ్చినవి.

21. మా ప్రభువైన దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికిన పలుకులను మేము వినమైతిమి.

22. మాలో ప్రతివాడును, తన దుష్టహృదయము చెప్పినట్లు చేసెను. మేము అన్యదైవములను సేవించి, ప్రభువు మెచ్చని కార్యములు చేసితిమి.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services