ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తోబీతు 1వ అధ్యాయము || Telugu catholic bible online

 1. తోబీతునైన నా గాథ యిది. మా తండ్రి, తాతలు క్రమముగా తోబియేలు, అనానీయేలు, అదూవేలు, గబాయేలులు. వారు నఫ్తాలి తెగకు చెందిన అసీయేలు సంతతివారు.

2. నేను అస్సిరియా రాజైన షల్మనేసరు కాలమున తిష్బేనుండి బందీగా కొనిరాబడితిని. ఈ నగరము గలిలీయసీమ ఉత్తర భాగముననున్నది. మరియు అది నఫ్తాలి మండలములోని కాదేషునకు దక్షిణమున హాసోరునకు ఎగువగా, షేపటునకు ఉత్తరమున ఉన్నది.

3. తోబీతునైన నేను నా జీవితమందు ఎల్లపుడును ధర్మమును పాటించుచు సత్కార్యములు చేయుచు వచ్చితిని. నా వలెనె నీనెవె పట్టణమునకు ప్రవాసులుగా కొనిరాబడిన తోటియూదులకు, మా బంధువులకు నేను మిక్కిలిగా దానధర్మములు చేసితిని.

4. నేను బాలుడనుగా ఉండినపుడు మా యిస్రాయేలు దేశమున వసించితిని. అప్పుడు మా నఫ్తాలి తెగవారందరును యెరూషలేము నగరమును, దావీదు వంశరాజులను తిరస్కరించిరి. కానీ ప్రభువు యిస్రాయేలు నగరములన్నిటిలో ఆ యెరూషలేము  నగరముననే తన శాశ్వత నివాసమునకుగాను పవిత్ర మందిరమును నిర్మింపగోరెను. యిస్రాయేలీయులు ఎల్లరును ఏ తావుననే బలులను అర్పింపవలెను.

5. అయినను నఫ్తాలి తెగకు చెందిన ఎల్లప్రజలవలె, మా కుటుంబము వారును, గలిలీయలోని ప్రతి కొండకు ఎగువన యిస్రాయేలు రాజు యరొబాము దాను నగరమున నెలకొల్పిన దూడ విగ్రహములకు బలులు అర్పించెడివారు. ధర్మశాస్త్రము ప్రకారము యిస్రాయేలీయులెల్లరు పండుగలలో పాల్గొనుటకు యెరూషలేమునకు పోవలెను. ఇది నిత్యవిధి.

6. కాని తరచుగా నేనొక్కడినే అచటికి యాత్ర చేసెడివాడను. మా పొలమున పండిన ప్రథమపంటను, మా గొడ్లు ఈనిన తొలిచూలు పిల్లలను, మా పశువులలో పదియవవంతును, మా గొఱ్ఱెల నుండి కత్తిరించిన ప్రథమఉన్నిని తీసుకొని నేను త్వరత్వరగా యెరూషలేమునకు ప్రయాణము చేసెడివాడను.

7. అచటి దేవాలయమునందు, బలిపీఠము ముందట నిలిచి ఈ కానుకలనెల్ల అహరోను వంశజులైన యాజకులకు అర్పించెడివాడను. యెరూషలేమున దేవుని సేవించు లేవీయులకు నా ధాన్యమునందు, ద్రాక్షసారాయము నందు, ఓలివు తైలమునందు, దానిమ్మలు, అంజూరములు మొదలైన ఫలములందు పదియవవంతు సమర్పించెడివాడను. ఒక్క యేడవయేడు తప్ప, ప్రతి ఆరేండ్లు నాకు పండిన పంటలో ఇంకొక పదియవవంతు గూడ విక్రయించి ఆ సొమ్మును యెరూషలేమున ఉత్సవభోజనమునకు వినియోగించెడివాడను.

8. ప్రతి మూడవయేడు నా పంటలో వేరొక పదియవ వంతును గూడ గొనివచ్చి యెరూషలేమున వితంతువులకు, అనాథలకు యిస్రాయేలీయుల మధ్య వసించు విదేశీయులకు కానుకగా ఇచ్చెడివాడను. వారును, నేనును కలిసే ఉత్సవ భోజనము భుజించెడివారము. నేను మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈ కార్యములెల్లచేసితిని. మా తండ్రి అనానీయేలును, తల్లి దెబొరాకూడ ఇట్టి కార్యములు చేయవలెనని నాతో చెప్పెను. (చిన్ననాడే మా తండ్రి చనిపోయినందున నేను అనాథనైతిని)

9. నేను పెరిగి పెద్దవాడనైన పిదప అన్నా అను మా తెగపిల్లనే పెండ్లియాడితిని. మాకొక బిడ్డడు కలుగగా వానికి తోబియా అని పేరు పెట్టితిమి.

10. తరువాత మమ్ము అస్సిరియా ప్రవాసమునకు కొనివచ్చినపుడు నన్ను నీనెవెకు తీసికొని వచ్చిరి. అచట మా బంధువులు, తోటి యూదులు ఆ దేశీయులు భుజించు ఆహారమునే తినెడివారు.

11. కాని నేను మాత్రము వారి కూడు ముట్టుకొనలేదు.

12. నేను సర్వోన్నతుడైన ప్రభువు ఆజ్ఞలను నిండు హృదయముతో పాటించితిని.

13. కనుక ఆ ప్రభువు నేను షల్మనేసరు దయకు నోచుకొనునట్లు చేసెను. ఆ రాజు తనకు వలసిన వస్తుసంభారములు కొనుటకు నన్ను నియమించెను.

14. అతడు చనిపోవువరకు నేను మాదియా దేశమునకు ప్రయాణము చేయుచు, అచట అతనికి కావలసిన పదార్థములు కొనెడివాడను. ఒకసారి నేను మాదియాలోని రాగీసు పట్టణమునకు పోయినపుడు గాబ్రియాసు సోదరుడైన గబాయేలు ఇంట పదిసంచుల వెండినాణెములు దాచితిని.

15. షల్మనేసరు చనిపోయిన పిదప అతని కుమారుడు సన్హరీబు రాజయ్యెను. తరువాత మాధియాకు ప్రయాణముచేయుట సులభము కానందున నేనచటికి వెళ్ళనే లేదు.

16. షల్మనేసరు బ్రతికియున్న కాలమున నేను మా జాతివారికి పెక్కుదానధర్మములు చేసితిని.

17. వారు ఆకలిగొని వచ్చినపుడు నేను వారికి భోజనము పెట్టెడివాడను. బట్టలు లేనివారికి బట్టలు ఇచ్చెడివాడను. నీనెవె పౌరులు మా జాతివారి శవములను పట్టణ ప్రాకారము వెలుపల పడవేసినపుడు నేను వానిని పాతి పెట్టెడివాడను.

18. సన్హరీబు యూదా మీదికి దాడి చేసినపుడు ఆకాశమందలి ప్రభువును దూషింపగా, ఆయన ఆ రాజును శిక్షించెను. కనుక సన్హరీబు యూదాను విడిచి రావలసి వచ్చెను. అట్లు తిరిగివచ్చినపిదప అతడు కోపావేశముతో చాలమంది యిస్రాయేలీయులను సంహరించెను. నేను వారి శవములను రహస్యముగా కొనిపోయి పాతి పెట్టితిని. అటు తరువాత రాజు ఆ శవముల కొరకు గాలింపగా అవి అతనికి దొరకలేదు.

19. అప్పుడు నీనెవె పౌరుడొకడు రాజు చంపించిన వారి శవములను రహస్యముగా పాతి పెట్టినది నేనేయని అతనితో చెప్పెను. నేను ఆ సంగతి తెలిసికొంటిని. రాజభటులు నా ప్రాణములు తీయుటకు నా కొరకు గాలించుచుండిరి. కనుక నేను భయపడి నీనెవెనుండి పారిపోతిని.

20. వారు నా సొత్తునంతటిని స్వాధీనము చేసికొని, రాజు కోశాగారమునకు అప్పజెప్పిరి. ఇక నా భార్య అన్నా నా కుమారుడు తోబియా తప్ప నాకేమియు మిగులలేదు.

21. తరువాత ఏబది దినములు గడువకముందే సన్హరీబు కుమారులిద్దరు తమ తండ్రిని హత్యచేసి అరారతు కొండలకు పారి పోయిరి. సన్హరీబు తనయుడు ఏసర్హద్ధోను తండ్రికి బదులు రాజయ్యెను. ఆ రాజు నా సోదరుడైన అనాయేలు కుమారుడగు అహీకారును, తన రాజ్యమున ఆర్ధిక వ్యవహారములను పరిశీలించు అధికారిగా నియమించెను.

22. అతడు సన్హరీబునకు గూడ గృహ నిర్వాహకుడు, కోశాధికారి, లేఖకుడు, ముద్రాధికారి. కనుక ఏసర్హద్ధోను గూడ అతనిని పూర్వ పదవిలో కొనసాగనిచ్చెను, నా సోదరుని తనయుడు ఈ అహీకారు నా తరపున రాజునకు మనవిచేయగా నన్ను తిరిగి నీనెవెకు రానిచ్చిరి.