ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రూతు 1వ అధ్యాయము || Roman Catholic Bible in Telugu

 1. న్యాయాధిపతులు పరిపాలనచేయు కాలమున దేశమున పెద్ద కరువు వచ్చెను. కనుక యూదా రాజ్యమునందలి బేత్లెహేములో నివసించునొకడు తన భార్యను, తన ఇద్దరు కుమారులను తీసికొని మోవాబు దేశమునకు వలసపోయెను.

2. అతని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నవోమి. కొడుకుల పేర్లు మహోను, కిల్యోను. వారు ఎఫ్రాతా తెగవారు. వారు మోవాబు దేశమున వసించుచుండగా

3. ఎలీమెలెకు చనిపోయెను. ఇక నవోమికి మిగిలినది ఇద్దరు కుమారులు మాత్రమే.

4. ఆ ఇరువురు మోవాబు యువతులను పెండ్లాడిరి. వారి పేర్లు ఓర్పా, రూతు. వారు ఆ దేశమున పదియేండ్లపాటు జీవించిరి.

5. ఆ పిమ్మట ఆ ఇద్దరు కుమారులు కూడ మరణించిరి. ఆ విధముగ భర్త, పుత్రులు గతింపగా నవోమి ఒంటరిగా మిగిలిపోయెను.

6. ప్రభువు యిస్రాయేలు ప్రజలను కరుణించి వారి దేశమున పంటలు పండించెనని విని ఆమెయు, ఆమె కోడండ్రును మోవాబు నుండి వెళ్ళగోరిరి.

7. కనుక ఆమెయు, ఆమె కోడండ్రులు పయనమై వారితో పయనమై యూదా రాజ్యమునకు పోవు బాటను పట్టిరి.

8. త్రోవలో ఆమె ఇద్దరు కోడండ్రతో "అమ్మలార! మీరిక తిరిగి మీ పుట్టినిండ్లు చేరుకొనుడు. మీరు నాయెడల, ఆ గతించిన వారియెడల మిగుల దయచూపిరి. ప్రభువు కూడ మిమ్ము కరుణతో చూచును గాక!

9. యావే అనుగ్రహము వలన మీరు మరల పెండ్లియాడి మీ కుటుంబములను నిలబెట్టుకొందురు గాక!” అని పలికి వీడ్కోలు సూచనగా వారిని ముద్దు పెట్టుకొనెను.

10. కాని ఆ కోడండ్రు పెద్దగా ఏడ్చుచు “మేమును నీతో పాటు మీ జనము వద్దకు వత్తుము” అనిరి.

11. కాని నవోమి వారితో “అమ్మ లారా! మీరు నావెంటరానేల? మిమ్ము మరల పెండ్లి యాడుటకు నాకింకను కుమారులున్నారు గనుకనా?

12. మీరిక తిరిగిపొండు. మరల వివాహమాడుటకు నేనా ప్రాయముచెల్లినదానను. ఒక వేళ నేను ఇంకను ఆశ కలదులే అనుకొని పెండ్లి చేసికొని ఈ రేయినే పెనిమిటినికూడి గర్భముతాల్చి కుమారులను కనినను,

13. ఆ పుత్రులు పెరిగి పెద్దవారగు వరకును పెండ్లి యాడకుండ కనిపెట్టుకొని ఉందురా? నాకు కలుగబోవు సుతులను నమ్ముకొని మీరు మరల వివాహమాడకుందురా? అట్లు జరుగరాదు. బిడ్డలారా! మిమ్ము చూడగా నా కడుపుతరుగుకొని పోవుచున్నది. ప్రభువు నన్నిట్లు శిక్షించెను. నేనేమి చేయుదును?” అని పలికెను.

14. ఆ మాటలకు వారు మరల వెక్కివెక్కి ఏడ్చిరి. అంతట ఓర్పా వీడ్కోలు సూచనగా అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయెను. కాని రూతు మాత్రము నవోమిని వదలిపెట్టదయ్యెను.

15. నవోమి కోడలిని "అమ్మా! నీ తోడి కోడలు తన బంధువుల యొద్దకు వెళ్ళిపోయినది. ఆమె తన జాతిజనులదేవుని కొలుచును. మరి నీవుకూడ వెళ్ళి పోరాదా?” అని అడిగెను.

16-17. కాని రూతు అత్తతో, “నీవు నన్ను వెళ్ళిపొమ్మని నిర్బంధ పెట్టవలదు. నేనును నీ వెంటవత్తును. నీవు వెళ్ళుచోటునకే నేనును వత్తును. నీవు వసించుచోటనే నేనును వసింతును. నీ బంధువులు నా బంధువులగుదురు. నీ దేవుడు నా దేవుడగును. నీవు మరణించు చోటుననే నేనును మరణింతును. నిన్ను పాతిపెట్టు చోటుననే నన్నును పాతిపెట్టుదురు. మృత్యువు తప్ప మరియొకటి , మనలను వేరుపరచినచో ప్రభువు నాకు ఎంతటి కీడైనను చేయునుగాక!” అని పలికెను.

18. నవోమి కోడలు తనతోవచ్చుటకు నిశ్చయించుకొన్నదని గ్రహించి ఆమెను వారింపదయ్యెను.

19. ఆ మీదట వారిరువురును ప్రయాణము సాగించి బేత్లెహేము చేరుకొనిరి. నవోమి తిరిగి వచ్చినదని విని ఆ నగరవాసులందరు వారి సంగతులే చెప్పుకొనిరి. ఆ ఊరి స్త్రీలు నవోమిని చూచి “ఈమె నిజముగా నవోమియేనా?" అని విస్తుపోయిరి.

20-21. ఆమె “నన్ను నవోమి అనవలదు, మారా' అని పిలువుడు. సర్వశక్తిమంతుడైన ప్రభువు నన్ను దారుణముగా శిక్షించెను. నేనిచట నుండి పిల్లజల్లలతో వెడలిపోతిని. కాని ప్రభువు నన్ను ఏకాకిని చేసి యిటకు మరల్చుకొనివచ్చెను. యావే నన్ను దోషినిగా నిర్ణయించి ఆపదలపాలుచేయగా మీరిపుడు నన్ను నవోమి అని పిలువనేల?" అనెను.

22. నవోమి, ఆమెకోడలు మోవాబీయుల ఆడపడుచునగు రూతు, తిరిగివచ్చిన వైనమిది. వారు యవపంట కోతకు వచ్చు కాలమున బేత్లెహేము చేరుకొనిరి.