ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1 Maccabees chapter 9 in Telugu మక్కబీయులు మొదటి గ్రంధము 9వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. నికానోరు, అతని సైన్యము సర్వనాశనమయ్యెనని దెమేత్రియసు వినెను. అతడు బఖిడసును ఆల్కిమోసును రెండవసారి యూదయాకు పంపెను. వారివెంట సిరియా సైన్యమును గూడపంపెను.

2. వారు గిల్గాలు మార్గముగుండ ప్రయాణము చేసి అర్బేలా మండలములోని మెసాలోతును ముట్టడించిరి. ఆ నగరమును జయించి చాలమంది ప్రజలను వధించిరి.

3. వారు నూట ఏబది రెండవయేటి మొదటి నెలలో యెరూషలేమునెదుట దండు విడిసిరి.

4. అచటినుండి రెండు వేల మంది పదాతులతోను, రెండువేల మంది ఆశ్వికులతోను బెరెయాకు వెళ్ళిరి.

5. అపుడు యూదా మూడువేల మంది వీరులతో ఎలాస శిబిరమున నుండెను.

6. కాని అతడి సైనికులు బ్రహ్మాండమైన శత్రుసైన్యమును చూచి భయపడి శిబిరము నుండి పారిపోయిరి. కడకు ఎనిమిది వందల మంది మాత్రము మిగిలియుండిరి.

7. ఆ రీతిగా తన సైన్యము తగ్గిపోవుటయు, యుద్ధమాసన్న మగుటయు చూచి యూదా విచార మనస్కుడయ్యెను. తన సైన్యమునంతటిని ప్రోగుజేయుటకు అతనికి కాలవ్యవధి లేదు.

8. అట్లు నిరుత్సాహముచెంది కూడ అతడు తన అనుచరులతో “మనము యుద్ధము చేయుదము. బహుశ మనమే విజయము పొందవచ్చును” అనెను.

9. కాని యూదా అనుచరులు అతనిని వారించుచు “ఇప్పుడు మనకు బలము చాలదు. కనుక ప్రస్తుతము రణము నుండి వైదొలగి ప్రాణములు కాపాడుకొందము. తరువాత మనవారిని ప్రోగుచేసికొనివచ్చి శత్రువులను ఎదిరింపవచ్చును. ఇప్పుడు మన పక్షమున ఎక్కువ మందిలేరు” అని చెప్పిరి.

10. యూదా "నేను యుద్ధము నుండి పారిపోవుట మాత్రము ఎన్నడును జరుగదు. మనకాలము వచ్చెనేని మన ప్రజల కొరకు ధైర్యముతో ప్రాణములు అర్పింతము. మన కీర్తికి మాత్రము కళంకము కలుగకూడదు” అని అనెను.

11. అంతట బఖిడసు సేనలు శిబిరమునుండి వెలుపలికి వచ్చి యూదులతో పోరునకు తలపడిరి. వారి అశ్వబలము రెండు దళములుగా విభాగింపబడెను. విల్లమ్ములను, ఒడిసెలను వాడువారు సైన్యమునకు ముందుండిరి. ప్రత్యేకముగా ఎన్నుకొనబడిన వీరులు వారికి ముందట మొదటి వరుసలలో ఉండిరి.

12. బఖిడసు కుడివైపుననుండెను. అంతట ఇరువైపుల నుండి అశ్వికులు కదలిరాగా పదాతిదళము ముందుకు వచ్చి బాకాలనూదెను. యూదా సైనికులును కూడ బాకాలనూదిరి.

13. ఉభయ సైన్యములు తారసిల్లి పోరు ప్రారంభింపగా రణధ్వనివలన భూమి దద్దరిల్లెను. ఉదయమునుండి సాయంకాలము వరకును పోరు జరిగెను.

14. సిరియా సైన్యమున బలాడ్యులైనవారును బఖిడసును కుడిప్రక్కన ఉన్నారని యూదా గుర్తించెను. బఖిడసు వీరులందరును అతని దాపుననే నిలిచియుండిరి.

15. కనుక యూదాబృందము కుడి ప్రక్కన నున్న సిరియనుల బృందము మీద పడెను. దానిని చిందరవందర చేసి కొండల అంచులవరకు తరిమికొట్టెను.

16. కాని ఎడమప్రక్కననున్న సిరియనులు కుడిప్రక్కన నున్న తమనైనికులు ఓడిపోవుచున్నారని గ్రహించిరి. వారు వెనుక తట్టునుండి వచ్చి యూదాబృందము మీదపడిరి.

17. పోరు ఘోరముగా జరిగెను. ఇరుప్రక్కల చాల మంది కూలిరి.

18. కడన యూదాకూడ ప్రాణములు కోల్పోయెను. అతని అనుచరులు పారిపోయిరి.

19. యోనాతాను, సీమోను వారి సోదరుడు యూదా శవమును కొనిపోయి మోదెయీనునందలి తమ పితరుల సమాధిలోనే పాతిపెట్టిరి.

20. యిస్రాయేలీయులందరు అతని మృతికి చాలనాళ్ల పాటు సంతాపముచెందిరి.

21. వారు “యిస్రాయేలీయులను రక్షించిన ఈ వీరుడు ఎట్లు కూలెనోగదా!" అని విలపించిరి.

22. యూదా చేసిన యితర కార్యములు, అతని యుద్ధములు, వీరకృత్యములు, విజయములు చాలకలవు. వానినన్నిటిని ఇచట లిఖింపలేదు.

23. యూదా చనిపోయిన తరువాత యూదయాలోని తిరుగుబాటుదారులు మరల తలఎత్తుకొని తిరుగ మొదలిడిరి. దుర్మార్గులెల్లరును వారితో చేతులు కలిపిరి.

24. అప్పుడు దేశమున దారుణమైన కరువు తాండవించెను. ప్రజలెల్లరును తిరుగుబాటుదారుల పక్షమును అవలంభించిరి.

25. బఖిడసు బుద్ది పూర్వకముగనే తిరుగుబాటుదారులను కొందరిని దేశ మునకు అధికారులనుగా నియమించెను.

26. వారు యూదా మిత్రులనెల్ల గాలించి బఖిడసు నొద్దకు తీసికొనివచ్చిరి. అతడు వారిని బాధించి అవమానపరచెను.

27. యిస్రాయేలీయులెల్లరును హింసల పాలైరి. ప్రవక్తలు కనుమరుగైపోయిన తరువాత దేశమున కిట్టి తిప్పలు ఎన్నడును రాలేదు.

28-29. అపుడు యూదా మిత్రులెల్లరు ప్రోగై యోనాతాను వద్దకు వచ్చి "అయ్యా! నీ సోదరుడు యూదా గతించినప్పటి నుండియు శత్రువులను ఎదిరించుటకు మాకు నాయకుడు దొరకలేదు. బఖిడసుతోను, మనజాతినుండే మనలను ఎదిరించు వారితోను పోరాడుటకు నాయకుడెవడును లేడు.

30. కనుక మేము నేడు యూదాకు బదులుగా నిన్ను నాయకునిగా ఎన్నుకొంటిమి. నీవు మాకు పాలకుడవుగా, సైన్యాధిపతిగాయుండి మా పోరాటములను నడిపింపుము” అని అనిరి.

31. ఆనాటినుండి యూదాకు బదులుగా యోనాతాను ప్రజలకు నాయకుడయ్యెను.

32. బఖిడసు యోనాతాను నాయకుడయ్యెనని విని అతడిని చంపుటకు ఉద్యమించెను.

33. కాని ఆ సంగతిని తెలిసికొని యోనాతాను తన సోదరుడగు సీమోనుతోను, అనుచరులతోను తెకోవా ఎడారికి పారిపోయి అస్పారు కోనేటివద్ద విడిది చేసెను.

34. బఖిడసు విశ్రాంతిదినమున ఈ ఉదంతము తెలిసి కొనెను. అతడు సర్వసైన్యముతో పోయి యోర్డాను నదిని దాటెను.

35. యోనాతాను సోదరుడగు యోహాను సైనికుల కుటుంబములకు పెద్దగా నుండెను. నబతీయులు యోనాతానునకు మిత్రులు. కనుక అతడు తన పక్షము వారి సామానులను నబతీయులయొద్ద దాచిపెట్ట గోరి యోహానును వారి చెంతకు పంపెను.

36. కాని యాంబ్రి వంశస్తులైన మేడెబా నగరవాసులు యోహాను మీద దాడిచేసి అతడిని వధించి సామానులన్నిటిని దోచుకొనిపోయిరి.

37. అటుతరువాత కొన్నాళ్ళకు యాంబ్రి వంశస్థుల తెగలో పెద్ద పెండ్లి ఒకటి జరుగనున్నదని యోనాతాను సీమోను వినిరి. పెండ్లి కుమార్తె కనాను దొరలలో ఒకని కూతురు. ఆమెను నదబతు నగరమునుండి మేళతాళములతో ఊరేగించుచు కొనిరానుండిరి.

38. యోనాతాను సీమోను తమ సోదరుని హత్యకు ప్రతీకారము చేయగోరిరి. కనుక వారు తమ అనుచరులతో పోయి ఒక కొండమీద దాగుకొని యుండిరి.

39. వారు అట్లు పొంచియుండగా జనసమూహము కోలాహలము చేయుచు వస్తు సామగ్రిని మోసికొనుచువచ్చుచుండెను. పెండ్లి కుమారుడు అతని స్నేహితులు బంధువులు వధువునకు ఎదురేగుచుండిరి. వారు ఆయుధములు తాల్చి సితారలు, డప్పులు వాయించుచు పోవుచుండిరి.

40. అప్పుడు పొదలలో దాగియున్న యూదులు హఠాత్తుగా శత్రువుల మీద పడి చాలమందిని మట్టు పెట్టిరి. మిగిలిన వారు కొండలకు పారిపోయిరి. యూదులు వారి సామగ్రినంతటిని దోచుకొనిరి.

41. ఆ రీతిగా వారి పెండ్లి పండుగ ఏడ్పులతో నిండిపోయెను. వారి సంగీతము శోకగీతమయ్యెను.

42. అట్లు యోనాతాను, సీమోను తమ సోదరుని హత్యకు ప్రతీకారము చేసిన పిదప యోర్దాను తీరమునందలి బురదనేలలకు తిరిగి వచ్చిరి.

43. ఈ సంగతిని విని బఖిడసు పెద్ద సైన్యమును వెంటబెట్టుకొని విశ్రాంతిదినమున యోర్దాను నదీ తీరముకు వచ్చెను.

44. యోనాతాను తన బృందముతో “మనము ప్రాణములకు తెగించి పోరాడ వలయును. ఇప్పుడు మనమేనాడును లేని అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాము.

45. మనకు ముందు శత్రువులున్నారు. వెనుక నది ఉన్నది. ఇరుప్రక్కల బురద గుంటలు, అడవులున్నవి. ఇక మనము ఏ ప్రక్కనుండియు తప్పించుకొనుటకు వీలులేదు.

46. కనుక శత్రువులనుండి మనలను కాపాడుమని దేవునికి మనవిచేయుడు” అనెను.

47. అంతట పోరు మొదలయ్యెను. యోనాతాను బఖిడసును పడగొట్టెడివాడేగాని అతడు తప్పించుకొని దండు వెనుకకు పోయెను.

48. యోనాతాను అతడి సైనికులు నదిలోనికి దూకి అవతలి గట్టుకు ఈదిరి. విరోధులు వారి వెంటబడను లేదు. నదిని దాటను లేదు.

49. ఆ దినము బఖిడసు సైనికులలో వేయిమంది కూలిరి.

50. బఖిడసు యెరూషలేమునకు వెళ్ళిన తరువాత యూదయాలోని చాల పట్టణములలో కోటలు కట్టించెను. ఎత్తయిన ప్రాకారములు, గడెలతో బిగించు ద్వారములను, యెరికో, ఎమ్మావు, బేతోరోను, బేతేలు, తిమ్నాతు, ఫరతోను, తేఫోను పట్టణములలో నిర్మించెను.

51. అతడు యూదులను అణచియుంచుటకుగాను ఈ పట్టణములలో సైన్యములను గూడ ఉంచెను.

52. ఇంకను బెత్సురు, గాసేరు నగరములలోని కోటలను, యెరూషలేము కోటను గూడ బలపరచెను. వానిలో సైన్యములనుంచి ఆహారపదార్థములను నిల్వ జేయించెను.

53. దేశములోని ప్రముఖుల కుమారులను, బందీలనుజేసి వారిని యెరూషలేము దుర్గమున బంధించెను.

54. నూటయేబది మూడవయేడు రెండవ నెలలో అల్కిమోసు దేవాలయము అంతర్భాగములోని గోడను పడగొట్టవలెనని ఆజ్ఞయిచ్చెను. దానిని పడగొట్టినచో ప్రవక్తల కృషియంతయు వ్యర్థమయ్యె డిదే. కాని ఆ గోడను కూల్చివేయుటకు ఉపక్రమింప గానే,

55. అల్కిమోసు పక్షవాతమునకు గురియయ్యెను. పని ఆగిపోయెను. అతని నోరు పడిపోయెను. కనుక అతడు తన ఆస్తిపాస్తులను గూర్చిన వివరములు గూడ తన కుటుంబమునకు తెలుపలేకపోయెను.

56. తరువాత అతడు ఘోరమైన బాధతో చచ్చెను.

57. అల్కిమోసు చచ్చెనని విని బఖిడసు దెమేత్రియసు రాజునొద్దకు వెడలిపోయెను. యూదయా దేశమున రెండేండ్ల పాటు శాంతి నెలకొనెను.

58. అంతట తిరుగుబాటు దారులందరు ఏకమై "చూచితిరా! ఇపుడు యోనాతాను, అతని అనుచరులు ఏ చీకుచింతలేకుండ జీవించుచున్నారు. మనము బఖిడసును పిలిపింతుమేని అతడు వీరందరిని ఒక్క రాత్రిలోనే బంధించును” అనుకొనిరి.

59. వారతనియొద్దకు వెళ్ళి ఒప్పందము కుదుర్చుకొనిరి.

60. వెంటనే బఖిడసు పెద్ద సైన్యముతో కదలెను. అతడు యోనాతాను అతని అనుయాయులను పట్టుకొనవలసినదని యూదయాలోని తన పక్షము వారికందరకి రహస్యముగా లేఖలు వ్రాసెను. కాని ఈ పన్నాగము బయటపడినందున బఖిడసు అనుయాయులు అతడు చెప్పినట్లు చేయలేకపోయిరి.

61. యోనాతాను అతని అనుయాయులు పన్నాగమునకు కారకులైన తిరుగుబాటు దారులను ఏబది మందిని పట్టుకొని వధించిరి.

62. అటుపిమ్మట యోనాతాను, సీమోను, వారి సైనికులు ఎడారిలోని బేత్బాసికి వెడలిపోయిరి. అచట శిథిలములైయున్న ప్రాకారములను పునర్నిర్మించి నగరమును సురక్షితము చేసిరి.

63. ఈ సంగతి విని బఖిడసు తన సైన్యమునంతటిని ప్రోగుజేసికొనెను. యూదయాలోని తన పక్షమువారికి తన దాడిని గూర్చి తెలియజేసెను.

64. అతడు బేత్బాసిని చేరుకొని ఆ నగరమును అన్నివైపుల నుండి ముట్టడించెను. ప్రాకారములను కూలద్రోయుటకు మంచెలు కట్టించెను.

65. చాలకాలము పోరు నడచిన పిదప యోనా తాను నగరమును వీడి కొద్దిమంది సైనికులతో వెలుపలి గ్రామములలోనికి వెళ్ళెను. అతని సోదరుడు సీమోను నగరముననేయుండి దానిని రక్షించుచుండెను.

66. యోనాతాను ఓడోమెరా అనువానిని అతని అనుచరులను ఎదిరించి ఓడించెను. అటుతరువాత ఫాసిరోను తెగవారిని ఓడించెను.

67. అతడు దండెత్తి, తన సైన్యముతో యుద్ధమునకు వెళ్ళెను. అంతలోనే సీమోను అతడి సైనికులు నగరమునుండి వెలుపలికి వచ్చి శత్రువులు ప్రాకారములను కూల్చుటకుగాను కట్టిన మంచెలను తగులబెట్టిరి.

68. బఖిడసు పన్నాగములన్ని వమ్మయిపోయెను. అతడు యూదులను ఎదిరింపజాలక వారికి లొంగిపోయెను.

69. తనను పిలిపించిన తిరుగు బాటుదారుల నాయకులపై మండిపడి వారిలో చాలమందిని చంపించెను. అటుపిమ్మట అతడు తన దేశమునకు తిరిగిపోవలెనని నిశ్చయించుకొనెను.

70. ఈ సంగతిని గ్రహించి బఖిడసుతో సంధి చేసికొని తమ వారిని చెరనుండి విడిపించుటకుగాను యోనాతాను అతడియొద్దకు దూతలను పంపెను.

71. బఖిడసు యోనాతాను వేడికోలును అంగీకరించెను. తాను బ్రతికియున్నంతవరకు యోనాతానును మరల బాధింపనని మాటిచ్చెను.

72. అతడు తాను బంధీలను గావించిన యూదయా సైనికులను యోనాతానునకు అప్పగించి తన దేశమునకు వెడలిపోయెను. బఖిడసు మరల యూదుల పొలిమేరలను తొక్కలేదు.

73. యిస్రాయేలు దేశమున యుద్ధము ముగిసెను. యోనాతాను మిక్మాసున స్థిరపడి ప్రజలను పరిపాలించుచు తిరుగు బాటు దారులందరిని అణచివేసెను.