ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1 Maccabees chapter 7 in Telugu మక్కబీయులు మొదటి గ్రంధము 7వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. నూట ఏబది ఒకటవ యేట సెల్యూకసు కుమారుడగు దెమేత్రియసు రోము నుండి తప్పించు కొనెను. అతడు కొద్దిమంది అనుచరులతో మధ్యధరా సముద్రతీరము నందలి ఒకపట్టణము చేరుకొని అచట తనను తాను రాజుగా ప్రకటించుకొనెను,

2. ఒకమారు అతడు తన పూర్వుల రాజభవనమునకు వెళ్ళుచుండగా అతని సైనికులు లీసియాసును, అంతియోకసును బంధించి వారిని అతని ఎదుటికి తీసికొనిరాగోరిరి.

3. కాని దెమేత్రియసు “నేను వారి మొగము చూడ దలుచుకోలేదు” అనెను.

4. కనుక సైనికులే వారిని వధింపగా దెమేత్రియసు సింహాసనమును ఆక్రమించు కొనెను.

5. అప్పుడు యిస్రాయేలీయులలోని దుర్మా ర్డులును, భక్తిహీనులునైన ప్రజలు కొందరు అల్కిమోసు నాయకత్వము క్రింద ప్రోగై దెమేత్రియసును చూడవచ్చిరి. ఈ అల్కిమోసునకు ప్రధాన యాజకుడు కావలయునన్న కోర్కె మిక్కుటముగా నుండెను.

6. వారు మిగిలిన యూదులమీద నేరము మోపుచు "అయ్యా! యూదా అతని సోదరులు నీకు మద్దతు ఇచ్చిన వారినెల్ల సంహరించిరి. వారు మమ్ము మా దేశమునుండి వెడలగొట్టిరి.

7. ఇప్పుడు నీకిష్టమైన ఉద్యోగిని ఒకనిని మా దేశమునకు పంపుము. యూదా మా ఆస్తిపాస్తులను, నీ మండలముల నెట్లు నాశనము చేసెనో అతడే పరిశీలించి చూడగలడు. ఆ సోదరులను వారికి తోడ్పడినవారిని అతడే శిక్షించును” అని చెప్పిరి.

8. రాజు యూఫ్రటీసునదికి ఆవలి మండలములకు అధిపతియు, తనకు మిత్రుడగు బఖిడసు అనునతని పనికి ఎన్నుకొనెను. అతడు రాజుకు నమ్మిన బంటు, ఆ రాజ్యమున ముఖ్యుడు.

9. దెమేత్రియసు భక్తిహీనుడైన అల్కిమోసును ప్రధానయాజకునిగా నియమించి, బఖిడసుతో పాటు అతనిని కూడ యూదియాకు పంపెను. అల్కిమోసు యూదులమీద పగతీర్చుకొనుటకు అధికారము కూడ పొందెను.

10. ఆ ఇరువురు పెద్ద సైన్యముతో వచ్చి యూదయాను చేరుకొనిరి. బఖిడసు 'మనము సంధిచేసికొందము రండు' అని వంచనతో యూదాయొద్దకును, అతని సోదరుల వద్దకును దూతలను పంపెను.

11. కాని అతడు పెద్ద సైన్యముతో వచ్చినందున ఆ సోదరులతని మాటలు నమ్మరైరి.

12. అయినను కొందరు ధర్మ శాస్త్ర బోధకులు బఖిడసును, అల్కిమోసును కలిసికొని న్యాయసమ్మతమైన సంధి సూత్రములను గూర్చి చర్చ జరుపుటకు వచ్చిరి.

13. సంధి కొరకు వారిని మొదట సందర్శించిన వారు హాసిదీయులను భక్తబృందము.

14. వారు “అల్కిమోసు అహరోను తెగకు చెందిన యాజకుడు. కనుక అతడు సేనలతో వచ్చినను తమకెట్టి హానియు తలపెట్టడులే” అని అనుకొనిరి.

15. అల్కిమోసుగూడ తాను సంధి చేసికొనుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పెను. “హాసిదీయులకుగాని, వారి మిత్రులకుగాని ఎట్టి కీడును తలపెట్టను”అని బాసచేసెను.

16. అందుచేత వారు అతనియందు నమ్మకముంచిరి. కాని అతడు వారిని నమ్మించి వారిలో అరువదిమందిని ఒక్కరోజుననే మట్టు పెట్టించెను.

17. ఆ రీతిగా “వారు నీ భక్తుల నెత్తురు చిందించిరి. వారి శవములు యెరూషలేము చుట్టు కుప్పలుపడి ఉన్నవి. వానిని ఖననము చేయు దిక్కు కూడ లేదయ్యెను” అను దైవవాక్యము నెరవేరెను.

18. ఈ సంఘటనను చూచి ప్రజలెల్లరును మిగుల వెరగొంది. “అల్కిమోసు, బఖిడసు సత్యమునుగాని, ధర్మమునుగాని పాటించువారుకాదు. వారు ప్రమాణము చేసియు మాట నిలబెట్టుకోరైరి” అని అనిరి.

19. అంతట బఖిడసు యెరూషలేమునుండి వెడలిపోయి బేత్సయితున విడిదిచేసెను. అతడు భక్తులగు యూదులను తన పక్షమును అవలంబించిన తిరుగుబాటు యూదులను గూడ బంధించి వధించెను. వారి శవములను పెద్దగుంతలో త్రోయించెను.

20. తరువాత అతడు అల్కిమోసును యూదయాకు అధిపతిని చేసి అతనికి సహాయము చేయుటకు సైన్యమును నియమించి తాను రాజునొద్దకు వెడలిపోయెను.

21. అల్కిమోసు ప్రధాన యాజకుడుగా తన పదవిని సుస్థిరము చేసికొనుటకుగాను నానా ప్రయత్నములు చేసెను.

22. దేశములో శాంతిని భంగపరచు తిరుగుబాటుదారులందరును అతనితో చేరిపోయిరి. వారు యూదయా అంతటిని ఆక్రమించుకొని, యూదులను ముప్పుతిప్పలు పెట్టిరి.

23. అల్కిమోసు అతని అనుచరులు అన్యజాతి వారికంటెగూడ అదనముగా దేశమునకు కీడు చేయుచున్నారని యూదా గ్రహించెను.

24. కనుక అతడు యూదయాయంతట సంచరించి అల్కిమోసు పక్షమును అవలంబించిన వారికి ప్రతీకారము చేసెను. వారిని పట్టణములలోనుండి పల్లెలకు పోనీయకుండ ఆటంకము కలిగించెను.

25. యూదా అతని అనుచరులు బలవంతులగు చున్నారనియు, వారినెదిరించు శక్తి తనకు లేదనియు అల్కిమోసు గ్రహించెను. కనుక అతడు రాజునొద్దకు పోయి వారిమీద పెద్ద నేరములు మోపెను.

26. రాజు తన సైన్యాధిపతులలో ప్రసిద్ధుడును, యూదులకు బద్ధవైరియునగు నికానోరును యూదయాకు పంపెను. యూదులను మొదలంట తుడిచివేయవలె ననియు ఆజ్ఞ ఇచ్చెను.

27. అతడు పెద్ద సైన్యముతో యెరూషలేము చేరుకొని కపటబుద్దితో 'మనము సంధి చేసికొందము రండు' అని యూదాకు అతని సోదరులకు కబురు పంపెను.

28. “మీకును నాకును జగడమేల? నేను చిన్న సైనికదళమును వెంట పెట్టుకొని మీవద్దకు వత్తును. మీతో స్నేహపూర్వ కముగా మాటలాడుదును” అని చెప్పెను.

29. అతడు తాను చెప్పినట్లే వచ్చి యూదాను కలిసికొనెను. వారిరువురు స్నేహపూర్వకముగా పలుకరించుకొనిరి. అయినను అతని పక్షమువారు యూదాను పట్టుకొని పోవుటకు సన్నద్ధులైరి.

30. నికానోరు ద్రోహబుద్దితో తన చెంతకు వచ్చెనని గ్రహించి యూదా భయపడెను. కనుక అతడు నికానోరును మరలకలిసికొనలేదు.

31. శత్రు సైన్యాధిపతి తనగుట్టు బయటపడినదని తెలిసికొని యెరూషలేము నుండి వెడలిపోయెను. అతడు కఫర్సలమవద్ద యుద్ధరంగమున యూదాను కలిసి కొనెను.

32. ఆ రణమున శత్రు సైనికులు ఐదు వందలమంది మడిసిరి. మిగిలినవారు యెరూషలేము దుర్గమునకు పారిపోయి దాగుకొనిరి.

33. తరువాత నికానోరు సియోనుకొండకు వెళ్ళెను. యాజకులు, పెద్దలు ఎదురు వచ్చి అతనికి స్వాగతము చెప్పిరి. తాము రాజు శ్రేయస్సుకొరకు అర్పించుచున్న దహనబలిని దర్శించుటకు అతనిని ఆహ్వానించిరి.

34. కాని అతడు వారిని ఎగతాళి చేసెను. వారి మీద ఉమ్మివేసి వారిని మైలపరచెను. గర్వముగా మాటలాడెను.

35. “మీరు యూదాను అతని సైన్యమును వెంటనే నా చేతికి అప్పగింపలేని నేను యుద్ధమున విజయమును చేపట్టి తిరిగివచ్చిన తరువాత ఈ దేవళమును నిలువున కాల్చివేసెదను” అని రౌద్రముగా ప్రతిజ్ఞ చేసి నిప్పులు క్రక్కుచు వెళ్ళిపోయెను.

36. అంతట యాజకులు తిరిగిపోయి పీఠమునకును, దేవాలయమునకును అభిముఖముగా నిలచి కన్నీరు కార్చుచు,

37. "ప్రభూ! నీవు ఈ దేవాలయము నీ నామమున వెలయునట్లు చేసితివి. ఇచట నీ ప్రజలు ప్రార్థనలు అర్పింపవలెనని నిర్ణయించితివి.

38.నీవు ఈ దుండగుని,ఇతని సైన్యమును శిక్షింపుము. వీరు కత్తి వాతబడునట్లు చేయుము. వీరు నిన్నెట్లు దూషించిరో జ్ఞప్తికి తెచ్చుకొనుము. వీరిలో ఒక్కని గూడ మిగులనీయకుము” అని మనవి చేసిరి.

39. నికానోరు యెరూషలేమునుండి వెడలిపోయి బేత్హోరోనున దండు విడిసెను. అచట సిరియా నుండి వచ్చిన క్రొత్త దండుకూడ అతని సైన్యమున చేరెను.

40. యూదా మూడు వేలమందితో అడాస వద్ద శిబిరము పన్నెను.

41. అతడు "ప్రభూ! పూర్వము అస్సిరియా రాజుదూతలు నిన్నుదూషింపగా నీ దేవదూత వెళ్ళి వారి సైనికులనునూట ఏనుబది ఐదువేలమందిని సంహరించెను.

42. ఆ రీతినే నీవు నేడు ఈ సైన్యమునుకూడ మట్టు పెట్టుము. అప్పుడు నీ దేవాలయమును అవమానించినందుకుగాను నికానోరు శిక్షను అనుభవించెనని ఎల్లరును గ్రహింతురు. అతని దుష్టత్వమునకు తగినట్లుగా అతనిని శిక్షింపుము” అని ప్రార్థించెను.

43. అదారు నెల పదమూడవ దినమున ఉభయ సైన్యములు తారసిల్లి పోరు జరుపగా శత్రుసైన్యములు పరాజయమునొందెను. అందరి కంటె ముందుగా నికానోరే ప్రాణములు కోల్పోయెను.

44. అతని సైనికులు తమ నాయకుడు కూలుటను చూచి ఆయుధములు విసరివేసి పారిపోయిరి.

45.యూదులు వారిని అడాసనుండి గేసేరు వరకును దినము పొడుగున తరిమికొట్టిరి. వారు బాకాలనూదుచు శత్రువులను వెన్నాడిరి.

46. ఆ మ్రోత విని చుట్టుపట్లగల యూదయా గ్రామముల నుండి ప్రజలు ప్రోగై వచ్చి పారిపోవు శత్రువులను అడ్డగించిరి. కనుక వారు వెనుకకు మరలి తమను వెన్నాడు యూదులవైపు పరుగెత్తిరి. యూద సైనికులు శత్రువులనొక్కరిని కూడ తప్పించుకోనీకుండ ఎల్లరిని కత్తివాతకు ఎరజేసిరి.

47. యిస్రాయేలీయులు శత్రువులనుండి కొల్లసొమ్ము ప్రోగుజేసికొనిరి. నికానోరు తలను అతడంత దర్పముతో ఎత్తి చూపిన కుడిచేతిని తెగనరికిరి. ఎల్లరును చూచుటకు గాను వానిని యెరూషలేమునకు కొనిపోయిరి.

48. ప్రజలు అమితానందము చెంది ఆ దినము గొప్ప ఉత్సవము చేసికొనిరి.

49. ఏటేటా అదారు నెల పదమూడవ దినము ఉత్సవము చేసికోవలెనని శాసనము చేసిరి,

50. అటుతరువాత కొంతకాలముపాటు యూదయా దేశమున శాంతి నెలకొనెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services