ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1 Maccabees chapter 6 in Telugu మక్కబీయులు మొదటి గ్రంధము 6వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. అచట అంటియోకసు రాజు ఎగువ ప్రాంతములగుండ ప్రయాణము చేయుచు పర్షియాలో ఎలిమాయిసు నగరము కలదనియు, అది వెండి బంగారములకు ప్రసిద్ధిగన్న పట్టణమనియు వినెను.

2. ఆ నగరపు దేవాలయమున బంగారు డాళ్ళు, కవచములు, ఆయుధములు కలవు. మాసిడోనియా రాజు ఫిలిప్పు కుమారుడును తొలిసారిగా గ్రీకు సామ్రా జ్యము నేలిన చక్రవర్తియునగు అలెగ్జాండరు వానిని ఆ దేవళమున భద్రపరచెను.

3. కనుక అంటియోకసు ఆ పట్టణమును ఆక్రమించుకొని, వానిని దోచుకోవలెనని యత్నించెను. కాని నగర పౌరులు ఆ రాజు పన్నాగమును ముందుగనే ఎరిగిరి కనుక అతని యత్నము సిద్ధింపలేదు.

4. వారతనిని ఎదిరించి తీవ్రముగా పోరాడిరి. కనుక అతడు మిగుల నిరాశచెంది వెనుదిరిగి బబులోనియాకు వెడలిపోయెను.

5. అంటియోకసు పారశీకమున నుండగనే తాను యూదయా మీదికి పంపిన సైన్యములు ఓడిపోయిన వని వార్తలు వచ్చెను.

6. లీసియాసు పెద్దదండుతో పోయి పరాజయము చెంది తిరిగివచ్చెను. యూదులు తాము ఓడించిన శత్రుసేనల నుండి ఆయుధములు, భోజన పదార్థములు, కొల్లసొమ్ము దోచుకొని పూర్వము కంటె బలవంతులైరి.

7. వారు పూర్వము అంటియోకసు యెరూషలేము దేవాలయములోని బలిపీఠముమీద నెలకొల్పిన జుగుప్సాకరమైన విగ్రహమును పడగొట్టిరి. దేవళము చుట్టును పూర్వపురీతినే పెద్ద ప్రాకారము నిర్మించిరి. రాజుకు చెందిన బేత్సూరు నగరమును ఆక్రమించుకొని దానిని ప్రాకారములతో బలపరచిరి.

8. అంటియోకసు ఈ వార్తలెల్లవిని దిగ్బ్రాంతి చెంది ధైర్యము కోల్పోయెను. తాను కోరుకొన్నట్లుగా పనులు జరుగలేదు కనుక అతడు గాఢమైన విషాదమునకు గురియై మంచముపట్టెను.

9. తెరలు తెరలుగా పొంగివచ్చు తీవ్రమైన నిరాశవలన చాలకాలము జబ్బుపడియుండెను. కడన తనకు మరణమాసన్నమైన దని గుర్తించెను.

10. కనుక అతడు తాను 'రాజమిత్రుడు” అన్న బిరుదము ఇచ్చిన వారినందరిని చేరబిలిచి “నాకు నిద్దురపట్టుట లేదు. నా హృదయము విచారముతో కుంగిపోవుచున్నది.

11. నేను ఉదార హృదయుడను. ప్రజల అభిమానము చూరగొన్నవాడను. అయినను నావంటివాడు ఈ విషాదసముద్రములో ఇంత లోతుగా మునిగిపోవుటకు కారణమేమని ఆలోచించితిని.

12. ఇపుడు నేను యెరూషలేమున చేసిన దుష్కార్యములు జ్ఞప్తికి వచ్చుచున్నవి. నేనచటి దేవాలయము నుండి వెండిబంగారు వస్తువులు దోచుకొంటిని. నిష్కారణముగా యూదయా నివాసులను నాశనము చేయించితిని.

13. కనుకనే ఇప్పుడీ దురదృష్టములెల్ల నన్ను చుట్టుకొనినవి. నేను విచారమనస్కుడనై ఈ పరదేశమున కన్నుమూయనున్నాను” అని చెప్పెను.

14. అంతట ఆ రాజు తనకు నమ్మిన మిత్రుడైన ఫిలిప్పును తన రాజ్యముకు సర్వాధికారిని చేసెను.

15. తన కిరీటమును, రాజవస్త్రమును, ముద్రాంగుళీయకమును ఫిలిప్పునకిచ్చెను. తన కుమారుడు ఐదవ అంటియోకసునకు విద్యాబుద్ధులు నేర్పించి అతడిని రాజుగా తయారుచేయవలెనని చెప్పెను.

16. అతడు అచటనే నూటనలుబది తొమ్మిదవ యేట' ప్రాణములు విడిచెను.

17. రాజు చనిపోయెనని లీసియాసు విని రాజు కుమారుడగు ఐదవ అంటియోకసును తండ్రికి బదులుగా రాజును చేసెను. అతడు అంటియోకసును చిన్న నాటినుండియు పెంచి పెద్దచేసినవాడు. ఇప్పుడతనికి యూపతోరు అని పేరు పెట్టెను.

18. యెరూషలేము దుర్గమున వసించు శత్రువులు దేవాలయ పరిసరములలో యిస్రాయేలీయులను ఇబ్బంది పెట్టసాగిరి. వారు అన్యజాతుల వారికి మద్దతునిచ్చుచు యిస్రాయేలీయులను బాధింపసాగిరి.

19. కనుక యూదా వారిని మట్టుపెట్టగోరి ఆ దుర్గమును ముట్టడించుటకుగాను తన ప్రజలందరిని తోడ్కొని వచ్చెను.

20. వారెల్లరు ప్రోగై నూట ఏబదియవ యేట కోటను ముట్టడించిరి. ప్రాకారము చుట్టును దిబ్బలుపోని గోడలనుకూల్చు యుద్ధమంచెలను అమర్చిరి.

21. కాని దుర్గములోని శత్రువులు కొందరు తప్పించుకొనిపోయిరి. యూదులలో తిరుగుబాటు దారులు కొందరును వారితో చేరిరి.

22. వారెల్లరును రాజువద్దకు పోయి అయ్యా! మా వారికి జరిగిన అపకారములకు ప్రతీకారముచేయక నీవింకను ఎంతకాలము వేచియుందువు?

23. మేము నీ తండ్రిని సేవించి అతని యాజ్ఞలు పాటించితిమి,

24.. కాని దాని వలన మాకేమి లాభము కలిగినది? మా దేశప్రజలే మాకు శత్రువులైరి. వారు మాలో చేజిక్కన వారినెల్ల సంహరించి మా ఆస్తిని దోచుకొనిరి.

25. వారు మాకే గాదు మా పొరుగు జాతులకు గూడ కీడు చేయుచున్నారు.

26. ఈ క్షణముననే వారు" యెరూషలేము దుర్గమును ముట్టడించి దానిని పట్టు కోబోవుచున్నారు. ఇంకనువారు దేవాలయముచుట్టును, బేత్సూరు చుట్టును ప్రాకారములు కూడ కట్టిరి.

27. నీవు వెంటనే చేయిజేసికొననిచో శత్రువులు ఇంకనూ విజృంభింతురు. అప్పుడు వారిని అణచుట సాధ్యము గాదు” అని మొర పెట్టుకొనిరి.

28. ఈ వార్త విని రాజు మండిపడెను. అతడు తన సైన్యాధిపతులను, అశ్వదళాధిపతులను, ఆంతరంగిక మిత్రులను ప్రోగుజేసెను.

29. ఇంకను ఇతర దేశములనుండియు, దీవులనుండియు కూలికి వచ్చు బంటులను గూడ ప్రోగు జేసికొనెను.

30. అతని సైన్యము లక్షమంది పదాతులతోను, ఇరువది వేల మంది రౌతులతోను, యుద్దానుభవముగల ముప్పది రెండు ఏనుగులతోను కూడుకొనియుండెను.

31. రాజు ఆ సైన్యముతో ఇదూమియాగుండ పయనమై వచ్చి బేత్సూరును ముట్టడించెను. చాల రోజులపాటు ముట్టడి కొనసాగెను. వారు గోడలచుట్టు దిబ్బలు పోసిరి. ప్రాకారముల కూల్చు మంచెలను అమర్చిరి. కాని కోటలోని యిస్రాయేలీయులు వెలుపలికి వచ్చి ధైర్యముతో పోరాడిరి. శత్రువులమర్చిన మంచెలను కాల్చివేసిరి.

32. అప్పుడు యూదా యెరూషలేము దుర్గము నుండి తన సైన్యమును తరలించుకొని వచ్చి రాజు సేనలను ఎదిరించుటకు బేత్సెకరియా తావున శిబిరము పన్నెను.

33. మరునాడు ఉదయముననే రాజు తన సేనలను బేత్సెకరియాకు నడిపించుకొనివచ్చెను. వారు ఆ నగరముచెంత బారులుతీరి పోరునకు బాకాలనూదిరి.

34. ఏనుగుల చేత ద్రాక్షపండ్ల రసమును, మల్బరీపండ్ల రసమును త్రాగించి వాటికి మత్తెక్కించిరి.

35. వారు ఏనుగులను పదాతుల దళ ములకు పంచియిచ్చిరి. ఒక్కొక్క ఏనుగువెంట వేయి మంది పదాతులుండిరి. వారికి గొలుసులతో అల్లిన కవచములు, ఇత్తడి శిరస్త్రాణములు ఉండెను. ఒక్కొక్క ఏనుగువెంట ఐదువందలమంది రౌతులుగూడ ఉండిరి.

36. ఈ రౌతులు ఏనుగులు ఎటుబోయిన అటు పోయెడివారు. ఏనుగులను ఎపుడూ వీడెడివారు కాదు.

37. ఏనుగుల పై దృడమైన చెక్క అంబారీలు గట్టిగా కట్టిపెట్టి కప్పబడెను. ఒక్కొక్క ఏనుగుమీద నలుగురు సైనికులు, ఒక మావటిడు ఉండిరి.

38. రౌతులలో మిగిలినవారిని సైన్యమునకు ఇరువైపుల నిలిపిరి. శత్రువులతో పోరాడునపుడు పదాతుల బారులు వారిని సంరక్షించును.

39. అపుడు ఇత్తడితోను, బంగారముతోను చేయబడిన డాళ్ళమీద పడిన సూర్య కాంతి ప్రక్కనున్న కొండల మీద ప్రతిబింబింపగా అచట మంటలు మెరిసినట్లుండెను.

40. రాజు సైన్యములో కొంత భాగము కొండ మీదను, కొంత భాగము క్రిందనుండెను. కాని ఆ సైనికులెల్లరును ధైర్యముగ, క్రమబద్దముగ ముందుకు నడచివచ్చిరి.

41. ఆ మహాసైన్యపు నడక చప్పుడును వారి ఆయుధముల ఒరపిడివలన పుట్టిన మ్రోతను విని ఎల్లరు భయకంపితులైరి.

42. యూదా అతని వీరులు పోరు ప్రారంభించి శత్రుసైనికులను ఆరువందల మందిని చంపిరి.

43. ఏనుగులలో ఒకటి మిగుల పెద్దదిగను, రాజు ఆయుధములను మోయునదిగ కాన్పింపగా 'అవారన్' అను మారు పేరుగల ఎలియాసరు, రాజు దాని మీద కూర్చుండి యున్నాడనుకొనెను.

44. అతడు తన ప్రజలను రక్షించి శాశ్వతమైన కీర్తిని పొందగోరెను. కనుక తన ప్రాణములనే బలిపెట్టెను.

45. ఆ ఏనుగు పదాతుల మధ్య నుండెను. కనుకతడు ధైర్యముతో కాలిబంటుల వరుసలను చీల్చుకొనుచు తన కుడియెడమల నున్న శత్రు సైనికులందరను వధించుచు ముందుకు పోయెను. ఆ వీరుని చూచి శత్రువులు ప్రక్కకు తొలగిరి.

46. అతడు ఒక్కపెట్టున పోయి ఏనుగు క్రింద దూరి దాని పొట్టను కత్తితో పొడిచెను. ఏనుగు ఎలియాసరు మీద కూలిపడగా దానితో పాటు అతడును చనిపోయెను.

47. కాని రాజు సైన్యము మహాబలమైనదనియు, మహాభీకరముగా పోరాడునదనియు గ్రహించి యూదులు వెనుకకు తగ్గిరి.

48. రాజు యెరూషలేము చెంత యుద్ధము నడుపుటకు సైన్యముతో ముందునకు కదలెను. శత్రువులు యెరూషలేమును యూదియాదేశమంతటిని ముట్టడించిరి.

49. రాజు బేత్సూరులోని యూదులతో సంధి చేసికొనగా వారు పట్టణమును విడిచి వెళ్ళిపోయిరి. శత్రువుల నెదిరించి పోరాడుటకు వలసినంత తిండి వారికి ఆ నగరమున దొరకదయ్యెను. అది విశ్రాంతి సంవత్సరము కనుక పంటలు లేవు.

50. రాజు బేత్సూరును ఆక్రమించుకొని దానిని కాపాడుటకుగాను అచట ఒక సైనికదళమును ఉంచెను.

51. అటు తరువాత అతడు యెరూషలేము దేవాలయమును ముట్టడించి చాలకాలము పోరు కొనసాగించెను. ప్రాకారము చుట్టు బల్లకట్టులను కట్టి, గోడలను కూల్చు మరలను, రాళ్ళను, నిప్పులను రువ్వు యంత్రములను, ఈటెలను, బండలను విసరు పరికరములను అమర్చెను.

52. కాని యూదులు తమ పరికరములను తయారుచేసికొనివచ్చి శత్రు పరికరములను వమ్ము జేసిరి. కనుక యుద్ధము చాలకాలము కొనసాగెను.

53. అది విశ్రాంతి వత్సరము కనుక దేవాలయపు కొట్లలో భోజన పదార్థములు లభింపవయ్యెను. అన్యదేశముల నుండి వచ్చి యూదయాలో తలదాచు కొనిన యూదులు నిల్వయున్న భోజన పదార్ధముల నెల్ల అప్పటికే వినియోగించుకొనిరి.

54. కరువు దారుణముగా ఉండుటచే యిస్రాయేలీయులు చాలమంది తమ యిండ్లకు వెళ్ళిపోయిరి. కొద్దిమంది మాత్రము దేవళమున మిగిలియుండిరి.

55. అంటియోకసు తాను చనిపోకముందు తన కుమారుని రాజును చేయుటకు ఫిలిప్పును నియమించెనుగదా!

56. అతడు పారశీక మాదియా దేశములనుండి రాజు సైన్యములతో తిరిగివచ్చి రాజ్యమును హస్తగతము చేసికోబోయెను.

57. ఆ సంగతి విని లీసియాసు వెంటనే వెనుకకు తిరిగిపోవలెనని నిశ్చయించుకొనెను. కనుక అతడు తన రాజుతోను, సైన్యాధిపతులతోను, సైనికులతోను “మనము నానాటికి బలహీనులమై పోవుచున్నాము. ఇచట తినుటకు వలసినంత తిండి దొరకుటలేదు. ఈ ప్రదేశమందునూ అభేద్యముగానున్నది. మన దేశమునందలి రాజకీయ పరిస్థితులన్ననో అదుపు తప్పుచున్నవి.

58. కావున మనము ఈ ప్రజలతోను, వీరి జాతియంతటితోను సంధి చేసికొందము.

59. వీరు పూర్వమునుండి పాటించుచువచ్చిన ఆచారములను పాటించుటకు సమ్మతింతము. మనము వారి యూద ఆచారములకు అడ్డువచ్చుట వలననే ఈ కలహములన్నియు ప్రారంభమైనవి” అనెను.

60. రాజు, అతని సైన్యాధిపతులు లీసియాసు సూచన నంగీకరించిరి. కనుక లీసియాసు సంధి సూత్రములను వివరింపగా యూదులు వెంటనే ఒప్పుకొనిరి.

61. రాజును, అతని సైన్యాధిపతులును సంధి సూత్రములను పాటింతుమని ప్రమాణపూర్వ కముగా ఒప్పుకొనినందున యూదులుతమ దుర్గమును వీడి వెలుపలికి వచ్చిరి.

62. కాని తరువాత రాజు సియోను దుర్గమును ప్రవేశించి అది అభేద్యముగా నుండుట గమనించి దాని ప్రాకారములను పడగొట్టించెను. ఆ రీతిగా అతడు తన ప్రమాణమును భంగము చేసికొనెను.

63. తరువాత అతడు త్వరత్వరగా అంతియోకియాకు మరలిపోయెను. అప్పటికే ఫిలిప్పు ఆ నగరమును స్వాధీనము చేసికొనియుండెను. కాని రాజు పట్టణమును ముట్టడించి బలవంతముగా తిరిగి స్వాధీనపరచుకొనెను.