ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1 Maccabees chapter 5 in Telugu మక్కబీయులు మొదటి గ్రంధము 5వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. యూదులు దేవాలయమును ప్రతిష్ఠించి, బలిపీఠమును పునర్నిర్మాణము చేసిరని విని, చుట్టు పట్లనున్న అన్యజాతివారు ఆగ్రహము చెందిరి.

2. కనుక వారు తమచెంత వసించు యూదులను నాశనము చేయనెంచి వారిని హత్యచేయసాగిరి.

3. ఇదూమీయులు తమ దేశమందలి ఆక్రబాట్టేనే అను తావునుండి యూదులపై దాడి చేయుచుండిరి. కనుక యూదా ఇదూమీయుల మీదికి యుద్ధమునకు పోయెను. వారిని ఓడించి కొల్లగొట్టెను.

4. అతడు క్రూరులైన బెయానీయులతో కూడ పోరాడెను. వారు పొదలలో దాగుకొనియుండి యిస్రాయేలు ప్రయాణీకులను నిరంతరము దోచెడివారు.

5. యూదా వారిని వారి దుర్గములలోనే ఉంచి వాని తలుపులు మూయించెను. వారిని సర్వనాశనము చేయుదునని ఒట్టుపెట్టుకొనెను. ఆ కోటలను, వానిలోని ప్రజలతో పాటు నిలువున తగుల బెట్టించెను.

6. తరువాత అతడు అమ్మోనీయుల మీదికి పోయెను. వారు తిమొత్తి అనువాని నాయకత్వము క్రింద బలమైన మహాసైన్య మును ప్రోగుజేసికొనియుండిరి.

7. అతడు వారితో అనేకమారులు పోరాడి వారిని నాశనము చేసెను.

8. యాసేరును, దాని ప్రాంతములోని పల్లెలను స్వాధీనము చేసికొని యూదయాకు తిరిగివచ్చెను.

9. గిలాదులోని అన్యజాతివారందరును ఏకమై తమ మండలమున నివసించు యూదులను ఓడించి సంహరింపబూనిరి. యూదులు దిట్టమైన లాసెదాతేమా దుర్గమున దాగుకొని,

10. యూదాకు, అతని సోదరులకు ఈ క్రింది రీతిగా వర్తమానము పంపిరి. తన "మా చుట్టుపట్లనున్న అన్యజాతుల వారు తిమొతి నాయకత్వము క్రింద ఒక్క బృందముగా ఏకమైరి.

11. మేమీ దాతేమా దుర్గమున దాగుకొంటిమి. శత్రువులు ఈ కోటను ముట్టడించి మమ్ము నాశనము చేయనున్నారు.

12. మా వారు చాల మంది ఇది వరకే ప్రాణములు కోల్పోయిరి. మీరు మమ్ము రక్షించుటకు వెంటనే రావలయును.

13. తోబుమండలమున నివసించు యూదులను ఇంతకు ముందే చంపివేసిరి. వారి భార్యలను, పిల్లలను చెరగొనిరి. వారి ఆస్తి పాస్తులను అపహరించిరి. అచట వేయి మంది సైనికులు చనిపోయిరి.”

14. యిస్రాయేలీయులు ఆ జాబును ఇంకను చదువుచుండగనే గలిలీయనుండి కూడ దూతలు వార్తలతో వచ్చిరి. వారు విచారముతో బట్టలు చించుకొనియుండిరి.

15. ప్టోలమాయిసు, తూరు, సీదోను, గలిలీయ సైన్యములన్ని ఏకమై మమ్ము నాశనము చేయుచున్నవని ఆ దూతలు చెప్పిరి.

16. యూదులు ఈ వార్తలువిని తమ జనులనెల్ల ప్రోగుచేసిరి. శత్రువుల దాడికి గురియైన సోదర ప్రజనెట్లు ఆదుకోవలయునో నిర్ణయించుటకుగాను ఈ సమావేశము ఏర్పాటు చేసిరి.

17. యూదా తన సోదరుడైన సీమోనుతో “నీవు కొందరు సైనికులతో గలిలీయకు వెళ్ళి అచటి యూదులను కాపాడుము. నేను మన సోదరుడు యోనాతాను గిలాదునకు వెళ్ళెదము” అని చెప్పెను.

18. అతడు తన సైన్యమున మిగిలిన వారిని యూదయాను కాపాడుటకు నియమించెను. అజరియాను, జకరియా కుమారుడగు యోసేపును ఆ దండుకు నాయకులను గావించెను.

19. వారితో “నేను మిమ్మిచట నాయకులుగా నియమించి పోవుచున్నాను. కాని మేము తిరిగివచ్చువరకు మీరు అన్యజాతుల మీదికి యుద్ధమునకు పోవలదు” అని చెప్పెను.

20. సీమోనుతో గలిలీయకు వెళ్ళుటకు మూడువేలమంది సైనికులను,యూదాతో గిలాదునకు గాను వెళ్ళుటకు ఎనిమిది వేల మందిని నియమించెను.

21. సీమోను గలిలీయ మండలము ప్రవేశించి అన్యజాతివారితో పెక్కు యుద్ధములు చేసి వారిని చిందరవందర చేసెను.

22. అతడు శత్రువులను ప్టోలమాయిసు నగరమువరకును తరిమికొట్టి మూడు వేలమందిని వధించెను. కొల్లసొమ్ము దోచుకొనెను.

23. గలిలీయయందును, అర్బట్ట యందును వసించు యూదులను వారి భార్యలు, పిల్లలు, ఆస్తిపాస్తులతో పాటు యూదయాకు తీసికొనివచ్చెను. అందుల కెల్లరును సంతసించిరి.

24. ఆ కాలముననే యూదా మక్కబీయుడు, అతని సోదరుడు యోనాతాను యోర్ధానునది దాటి ఎడారిలో మూడునాళ్ళపాటు పయనము చేసిరి.

25. అచట వారు కొందరు నటాతీయులను కలిసికొని వారితో స్నేహము చేసిరి. వారు గిలాదునందలి యూదులకేమి జరిగినదో వివరించి చెప్పిరి.

26. “చాలమంది యూదులను బోస్రా, బోసోరు, అలేమా, ఖాస్పో, మాకెదు, కర్నాయీము అను సురక్షిత నగరములలో బంధించి ఉంచిరి అని తెలియజేసిరి.

27. మిగిలిన యూదులను గిలాదునందలి ఇతర నగరములలో బంధించిరి. శత్రువులు ఆ మరుసటి దినమున ఈ నగర దుర్గములన్నింటిని ముట్టడించి వానిలోని యూదులందరిని మట్టుపెట్టనున్నారు” అనియు తెలియజేసిరి.

28. కనుక యూదా, అతని సైన్యము వెంటనే పోయి ఎడారి త్రోవప్రక్కనగల బోస్రా నగరముమీద పడిరి. ఆ పట్టణమును పట్టుకొని అందలి పురుషులందరిని చంపిరి. దానిని దోచుకొని కాల్చివేసిరి.

29. వారచటినుండి సాగిపోయి రాత్రంతయు ప్రయాణము చేసి దాతేమా దుర్గమును చేరుకొనిరి.

30. అచట వేకువ వెలుగులో ఒక పెద్ద సైన్యము ఆ దుర్గమును ఆక్రమించుకొనబోవుటను చూచిరి. ఆ సైన్యము నిచ్చెనలతో, గోడలను కూల్చు మంచెలతో వచ్చికోటను స్వాధీనము చేసికొన బోవుచుండెను.

31. యూదా యుద్ధనాదమును, బూరల మ్రోతను, గడబిడ ధ్వనిని వినిపోరు అప్పుడే ప్రారంభమైనదని గ్రహించెను.

32. కనుక అతడు తన సైనికులతో “నేడు మీరు మన సోదరులైన తోడి యూదులకొరకు యుద్ధము చేయవలయును” అని చెప్పెను.

33. అతడు తన సైనికులను మూడు బృందములుగా విభజించెను. వారు బాకాలనూదుచు పెద్ద స్వరముతో ప్రార్ధనము చేయుచు వెనుక ప్రక్కనుండి పోయి శత్రువుల మీద పడిరి.

34. తిమొతి నాయకత్వము క్రిందనున్న శత్రుసేనలు యూదా మక్కబీయుడు వచ్చెనని గ్రహించి పారిపోయెను. యూదా వానినోడించి ఆరోజే ఎని మిదివేల మందిని సంహరించెను.

35. తరువాత అతడు పోయి అలేమా నగరమును ముట్టడించెను. అచటి పురుషులనందరిని చంపి, పట్టణమును కొల్లగొట్టి కాల్చివేసెను.

36. పిమ్మట ఖాస్పో, మాకెదు, బోసోరు నగరములను, మరియు గిలాదునందలి ఇతర పట్టణములనుగూడ ముట్టడించి జయించెను.

37. ఈ యుద్ధము తరువాత తిమొతి మరియొక సైన్యము సమకూర్చుకొని వచ్చి రాఫోనునకు ఎదురుగా నదికి ఆవలి ప్రక్కన శిబిరము పన్నెను.

38. యూదా వేగులవారిని పంపగా వారు తిరిగివచ్చి ఆ మండలములోని అన్యజాతి వారెల్లరను తిమొతితో కలిసి పెద్ద సైన్యముగా ఏర్పడిరని తెలిపిరి,

39. అరబ్బు కూలి బంటులు కూడ ఆ సైన్యమున చేరిరనియు, వారెల్లరు నది కావలి ప్రక్కన దండు విడిసి యూదాతో పోరాడుటకు సంసిద్దులుగా ఉన్నారనియు వినిపించిరి. కనుక యూదా వారితో పోరాడబోయెను.

40. అతడు నదిని సమీపించుచుండగా తిమొతి తన సైన్యాధిపతులతో “యూదా నదినిదాటి వచ్చెనేని మనము అతనిని ఎదిరింపలేము. అతడు మనలనోడించి తీరును.

41. కాని అతడు మనకు జడిసి ఏటికి ఆవలి ప్రక్కనే శిబిరము పన్నెనేని, మనము నదినిదాటి అతనిని జయింపవచ్చును” అని చెప్పెను.

42. యూదా నదియొడ్డుకు రాగానే “మనవారి నెవరిని ఇచట విడిదిచేయనీయవలదు. ఎల్లరును వెంటనే యుద్ధము ప్రారంభింపవలయును” అని తన సైన్యాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.

43. అందరి కంటె ముందుగా అతడే యేరుదాటి శత్రువుల మీదికి పోయెను. యూదా సైనికులెల్లరును అతనిని అనుసరించిరి. వారిని చూచి అన్యజాతి వారెల్లరు బారుల నుండి వైదొలగి తమ ఆయుధములను విసరి పారవేసి కర్నాయీము దేవళమునకు పారిపోయిరి.

44. యూదా అతని అనుచరులు మొదట నగరమును ఆక్రమించుకొనిరి. తరువాత దేవళమును, దానిలో దాగుకొనియున్న వారితోపాటు తగులబెట్టిరి. ఆ రీతిగా కర్నాయీము లొంగిపోయిన పిదప అన్యజాతి వారు యూదాను ఎదిరింపజాలరైరి.

45. తదనంతరము యూదా గిలాదులోని యూదులనెల్ల తనతో యూదయాకు తీసికొనిపోవుటకు సన్నాహములు చేసెను. వారు తమ భార్యలతో, పిల్లలతో, ఆస్తిపాస్తులతో బ్రహ్మాండమైన బృందముగా ప్రోగైరి.

46. ఆ ప్రజలు ఏఫ్రోను అను సురక్షితమైన పెద్ద నగరము వరకు ప్రయాణము చేసిరి. నగరమునకు కుడివైపునుండిగాని ఎడమవైపునుండిగాని పోవుటకు వీలులేదు. మార్గము పట్టణము మధ్య గుండ పోవు చుండెను.

47. ఆ పట్టణ పౌరులు వారిని తమ నగరముగుండ వెళ్ళనీయరైరి. రాళ్లు పేర్చి పురద్వారములను మూసివేసిరి.

48. యూదా “మమ్ము మీ నగరముగుండ మాదేశమునకు వెళ్ళిపోనిండు. మేము మీకెట్టి కీడుచేయము. అవతలికి వెళ్ళిపోవుటయే మా ఉద్దేశము” అని వారికి స్నేహసందేశము పంపెను. అయినను వారు నగర ద్వారములు తెరువలేదు.

49. కనుక యూదా తన జనులలో యుద్ధము చేయువారు తప్ప మిగిలిన వారెల్లరు అచటనే విడిదిచేయవలెనని ఆజ్ఞ యిచ్చెను.

50. యుద్ధవీరులు పోరుకు ఆయత్తపడి పగలు రేయికూడ ముట్టడి కొనసాగించిరి. కడకు ఏఫ్రోను లొంగిపోయెను.

51. యూదా ఆ నగరము నందలి పురుషులనెల్ల మట్టుపెట్టించెను. యూదులు ఆ నగరమును దోచుకొని దానిని నేలమట్టము చేసిరి. నగరముగుండ, చచ్చినవారి శవముల మీదుగా నడచిపోయిరి.

52. వారు యోర్దానునదిని దాటి బేత్షాను ఎదుటగల పెద్ద మైదానము చేరిరి.

53. దారి పొడుగున యూదా వెనుకబడినవారిని నడిపించుచు వచ్చెను. యూదయా మండలము ప్రవేశించినదాక ప్రజలను ప్రోత్సహించుచు వచ్చెను.

54. ఎల్లరును సంతసముతో స్తుతిగీతములు పాడుచు సియోను కొండకు వెళ్లిరి. తమ పక్షము వారిలో ఒక్కరు కూడ చావక తిరిగి వచ్చినందుకుగాను దేవునికి దహనబలులు అర్పించిరి.

55-56. యూదా, యోనాతాను గిలాదునందును వారి సోదరుడైన సీమోను గలిలీయలోని ప్టోలమాయిసు యందును ఉండగనే యూదయాలోని సైన్యములకు అధిపతిగానున్న ఆసరియా మరియు జెకరియా కుమారుడు యోసేపు ఆ వీరుల వీరకృత్యములను, విజయములను గూర్చి వినిరి.

57. వారు 'మనమును అన్యజాతులతో పోరాడి పేరు తెచ్చుకొందము' అని అనుకొనిరి.