ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1 Maccabees chapter 2 in Telugu మక్కబీయులు మొదటి గ్రంధము 2వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. ఆ రోజులలో యోరీబు తెగకు చెందిన యాజకుడు మత్తతీయ యెరూషలేమును విడనాడి మోదెయీను అను నగరమున నివాసము ఏర్పరచు కొనెను. అతని తండ్రి తాతలు యోహాను, సిమియోను.

2-5. అతనికి ఐదుగురుకుమారులు కలరు. వారు గద్ది అను మారుపేరు కల యోహాను, తస్సి అను మారుపేరు కల సీమోను, మక్కబీయు అను మారుపేరుకల యూదా, అవరాను అను మారుపేరు కల ఎలియాసరు, అప్పూసు అను మారుపేరు కల యోనాతాను.

6-7. మత్తతీయ యూదయాలో, యెరూషలేమున జరుగు అపచారములను చూచి పరితాపము చెంది యిట్లనెను: “అయ్యో! నేనిట్టి ఘోరకార్యములను గాంచుటకే పుట్టితినాయేమి? మన పరిశుద్ధ నగరమును, ప్రజలును నాశనమైరి. ఈ నగరము శత్రువుల పాలై, ఈ దేవళము అన్యజాతుల వశముకాగా, నేనిచట చేతులు ముడుచుకొని కూర్చుండవలసినదేనా?

8. ఈ దేవాలయము కీర్తిని కోల్పోయిన నరునివలె నున్నది.

9. శత్రువులు దాని ఉపకరణములనెల్ల దోచుకొనిరి. మన పిల్లలను వీధులలో చంపివేసిరి. మన యువకులు విరోధుల కత్తివాతబడిరి.

10. ప్రతి జాతియు మన నగరమును ఆక్రమించుకొని, దాని సొత్తు దోచుకొనెను.

11. నగర అలంకారములన్నియు నిర్మూలమయ్యెను. స్వాతంత్య్రము పోయి బానిసత్వము వచ్చినది.

12. సుందరము, వైభవోపేతమైన దేవాలయము పాడుబడెను. అన్య జాతులవారు దానిని అమంగళము చేసిరి.

13. ఇక మనము దేని కొరకు జీవింపవలయును?”

14. మత్తతీయ అతని కుమారులు విచారముతో బట్టలు చించుకొని గోనె కట్టుకొనిరి.

15. యిస్రాయేలీయులను యూదమతము నుండి తిప్పనెంచిన రాజకీయాధికారులు మోదెయీను నగరముకు వచ్చి అచటి ప్రజలను విగ్రహములకు బలి అర్పింపవలెనని నిర్బంధము చేసిరి.

16. చాల మంది యిస్రాయేలీయ ప్రజలు వారి పక్షమును అవలంభించిరి. మత్తతీయ అతని కుమారులు మాత్రము వారితో కలియక ఒక బృందముగా ఏర్ప డిరి.

17. రాజోద్యోగులు మత్తతీయతో “నీవిచట పేరు ప్రతిష్ఠలు గల నాయకుడవు. నీ కుమారులును, బంధువులును నీకు అండగానున్నారు.

18. ఈ నగరమున రాజాజ్ఞను పాటించు వారిలో నీవే మొదటి వాడవు కావచ్చునుగదా? అన్యజాతులు, యూదయా నివాసులు, యెరూషలేమున మిగిలియున్న పౌరులు రాజునకు లోబడిరి. మేము చెప్పినట్లు చేయుదువేని నీవును నీ కుమారులును 'రాజమిత్రులు' అను బిరుదమును పొందవచ్చును. మీకు వెండి, బంగారములు ఇతర బహుమతులు లభించును” అనిరి.

19. కాని మత్తతీయ గొంతెత్తి వారితో “ఈ దేశములోని అన్య జాతి వారెల్లరును రాజాజ్ఞకు లొంగి, వారి పితరుల మతము విడనాడినప్పటికి,

20. నేనును నా కుమారులు మా బంధువులు మాత్రము మా పూర్వుల నిబంధననే పాటింతుము.

21. దేవుని అనుగ్రహము వలన మేము ధర్మశాస్త్రమును, దాని విధులను ఏ మాత్రము మీరకుందుముగాక.

22. మేము రాజాజ్ఞలు పాటింపదలచుకోలేదు, మా మతనియమములను ఏ మాత్రము మీరదలచుకోలేదు” అని స్పష్టము చేసెను.

23. అతడు తన మాటలను ముగింపగనే అచటి యూదులలో ఒకడు ముందుకు వచ్చి రాజాజ్ఞ ప్రకా రము మోదెయీను పీఠముపై విగ్రహములకు బలిని అర్పింపబూనెను.

24. ఆ సంఘటన చూడగనే మత్తతీయకు ఆవేశము పుట్టెను. అతడు ఆగ్రహమును పట్టజాలక సముచితమైన కోపముతోనే పోయి ఆ యూదుని మీదబడి వానిని ఆ పీఠము మీదనే మట్టు బెట్టెను.

25. ఇంకను అతడు బలినర్పించుటకు ప్రజలను నిర్బంధముచేసిన రాజకీయాధికారిని గూడ సంహరించి పీఠమును కూలద్రోసెను.

26. ఆ సమయమున మత్తతీయ ధర్మశాస్త్రముపట్ల చూపిన అభిమానము పూర్వము సాలు కుమారుడైన సిమ్రీని చంపినపుడు ఫీనెహాసు చూపిన అభిమానము వంటిది. .

27. అటు తరువాత మత్తతీయ “మీలో ధర్మము పట్ల అభిమానముగలవారు, నిబంధనను పాటింప గోరు వారు నా వెంట రండు” అని బిగ్గరగా అరచుచు , నగర వీధులగుండ తిరిగెను.

28. ఆ పిమ్మట అతడును, అతని కుమారులును తమ ఆస్తిపాస్తులను నగరముననే వదలిపెట్టి పర్వతములకు పారిపోయిరి.

29-30. ఆ రోజులలోనే యూదమతమునకు, ధర్మశాస్త్రమునకు కట్టుబడి జీవించు నిష్ఠాపరులు కొందరు శత్రువులు పెట్టు ఘోరబాధలను భరింపజాలక తమ పశువులను, పిల్లలను, భార్యలను తీసి కొని అరణ్యమునకు వెళ్ళిపోయి అచట వసింప మొదలిడిరి.

31. రాజు ఆజ్ఞను ధిక్కరించిన యూదులు కొందరు అరణ్యమునకు పారిపోయి అచట తలదాచు కొనుచున్నారని రాజు ఉద్యోగులకును, యెరూషలేము దగ్గరనున్న సైనికులకును వార్త చేరెను.

32. కనుక వారిని పట్టుకొనుటకు ఒక పెద్ద సైనిక బృందము పోయెను. ఆ సైనికులు యూదులు దాగుకొనియున్న చోటికి వచ్చి వారి చెంత విడిది చేసిరి. విశ్రాంతి దినమున వారి మీదపడ నిశ్చయించుకొనిరి.

33. ఆ సైనికులు యూదులను చూచి “తరుణమింకను మించి పోలేదు, మీరు దాగియున్న తావు నుండి వెలుపలికి వచ్చి రాజాజ్ఞకు తలయెగ్గుడు. మేము మీ ప్రాణము కాపాడుదుము” అని కేకలు పెట్టిరి.

34. కాని ఆ యూదులు “మేము ఇచటినుండి వెలుపలికి రాము. మేము రాజు ఆజ్ఞను పాటింపము. విశ్రాంతి దినమును అమంగళము చేయము” అని బదులపలికిరి.

35. శత్రు సైనికులు వెంటనే వారి మీదపడిరి.

36. కాని యూదులు విరోధులనెంత మాత్రము ఎదిరింపక మెదలకుండ ఉండిపోయిరి. వారు శత్రువుల మీద రాళ్ళు విసరనులేదు. తాము దాగియున్న కొండ బిలములను మూసివేయను లేదు.

37. “మేము నిర్ధోషులుగా ప్రాణములు విడుతుము. మీరు మమ్ము అన్యాయముగా సంహరించుచున్నారని భూమ్యాకాశములు సాక్ష్యము పలుకును” అని మాత్రము నుడివిరి.

38. అంతట శత్రు సైనికులు విశ్రాంతి దినమున ఆ యూదులను, వారి భార్యలను, పిల్లలను, పశువులను సంహరించిరి. అచట చనిపోయిన వారు మొత్తము వేయిమంది.

39. మత్తతీయ, అతని అనుచరులు ఆ వార్త విని మిగుల సంతాపము చెందిరి.

40. వారు తమలో తాము 'శత్రువులు వచ్చినపుడు మనమును ఈ యూదుల వలె మెదలకుండ ఉండి పోవుదమేని, మన ప్రాణములను, మతమును కాపాడుకొనుటకుగాను ఈ అన్యజాతులతో పోరాడకుందుమేని, వీరు మనలను అనతికాలముననే నేల మీది నుండి తుడిచి పెట్టుదురు” అని అనుకొనిరి.

41. కనుక వారు అక్కడికక్కడే ఈ క్రింది నిర్ణయము చేసికొనిరి. 'శత్రువులెవరైన విశ్రాంతిదినమున తమ మీదికి దాడి చేసినచో తాము ఆ శత్రువులను ఎదిరింప వలయును. తమ తోటి యిస్రాయేలీయులవలె తాము దాగుకొన్న తావులలోనే నాశనమై పోగూడదు.' .

42. అటు తరువాత యిస్రాయేలీయులలోని హాసిదీయులను భక్తులు మత్తతీయ పక్షమున చేరిరి. వారు మహావీరులు, ధర్మ శాస్త్రమును నిలబెట్ట వలెనను పట్టుదల కలవారు.

43. ఇంకను మతహింసలకు గురియైనవారు కూడ వచ్చి మత్తతీయ బృందముతో చేరిపోగా వారి బలము హెచ్చెను.

44. వీరందరు కలిసి ఒక సైనిక బృందముగా ఏర్పడిరి. ఆ బృందము వారు మహా కోపముతో యూద మతమును విడనాడిన వారిని శిక్షింపగా వారు పారిపోయి అన్యజాతి ప్రజల మరుగుజొచ్చిరి.

45. మత్తతీయ అతని స్నేహితులు దేశమంతట సంచారములు చేసి అన్యదైవముల పీఠములను కూలద్రోసిరి.

46. యిస్రాయేలు దేశమున సున్నతి పొందని పిల్లలందరికి బలవంతముగా సున్నతి చేయించిరి.

47. వారు పొగరుబోతుతనముతో మిడిసిపడు శత్రునాయకులను కూడ హతమార్చి విజయము బడసిరి.

48. ఆ రీతిగా ఆ బృందమువారు అన్యజాతి ప్రజలయు, వారి రాజులయు బెడదనుండి ధర్మశాస్త్రమును కాపాడిరి. దుష్టుడైన ఆంటియోకసు రాజు కోరలను ఊడబెరికిరి.

49. అంతట మతతీయకు కాలముచెల్లి మరణము ఆసన్నముకాగా అతడు కుమారులతో ఇట్లనెను: “నాయనలారా! గర్వాత్ములు అధికారములోనికి వచ్చి మనలను హేళనచేయుచున్నారు. ఇది ద్వేషమునకును, సంతాపమునకును నిలయమైన దుష్టకాలము.

50. కుమారులారా! మీరిపుడు ధర్మశాస్త్రముపట్ల ఎనలేని భక్తి చూపవలయును. ప్రభువు మన పితరులతో చేసి కొనిన నిబంధనమును నిలబెట్టుటకు మీ ప్రాణములను అర్పించుటకైనను వెనుకాడకుడు.

51. మన పితరులు వారి తరములలో సాధించిన కుమారులారా! మీరు ప్రభువు మన ఏమీ ప్రాణము కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. వాటి మూలమున మీకును శాశ్వతమైన గౌరవము, కీర్తి అబ్బును.

52. ప్రభువు అబ్రహాముని పరీక్షకు గురిచేయగా అతడు తన విశ్వసనీయతను ప్రదర్శించుకొని న్యాయవంతునిగా గణింపబడలేదా?

53. యోసేపు ఆపత్కాలమునకూడ ధర్మశాస్త్ర మును పాటించినందున ఐగుప్తునకు ప్రభువయ్యెను.

54. మన పితరుడైన ఫీనెహాసు మహాభక్తిని ప్రదర్శించుటచే తరతరములదాక యాజకత్వమను ఒడంబడికను బహుమతిగా పొందెను.

55. యెహోషువ ధర్మశాస్త్రమునకు విధేయుడైనందున యిస్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యెను.

56. కాలేబు యిస్రాయేలు సమాజమునకు మంచి వార్తలు కొనివచ్చి, దానిని బలపరచినందున వాగ్దాత్త భూమిలో పాలుపొందెను.

57. దావీదు దయార్ద్రహృదయుడు కనుక అతడు, అతని తనయులు, శాశ్వతముగా రాజ్యము ఏలిరి.

58. ఏలీయా ధర్మశాస్త్రముపట్ల అపారభక్తి ప్రదర్శించినందున పరమునకు కొనిపోబడెను.

59. హననీయ, అజర్యా, మిషాయేలు విశ్వాసము వలన నిప్పుమంటలను తప్పించుకొనిరి.

60. దానియేలు వినమ్రుడు కనుక ప్రభువతనిని సింహము కోరలనుండి విడిపించెను.

61. ఈ రీతిగా ఆయా తరములందు ప్రభువును నమ్మిన భక్తులు తమ శక్తినే ఏమాత్రము కోల్పోరైరి.

62. మీరు దుష్టుల బెదిరింపులకు భయపడవలదు. వారెల్లరును చత్తురు, వారి శవములను పురుగులు తినివేయును.

63. నేడు వైభవోపేతులుగా ఉన్నను రేపటికి వారు మిగులరు. వారెల్లరును మట్టి పాలగుదురు. వారి కుతంత్రములన్ని వమ్మగును.

64. కుమారులారా! మీరు ధైర్యముతో నిలిచి ధర్మశాస్త్రమును కాపాడుడు. దాని మూలమున మీరు కీర్తిబడయుదురు.

65. ఇదిగో మీ సహోదరుడైన సీమోను. ఇతడు తెలివైనవాడు. కనుక మీరు నా మాటవలె ఇతడి మాటను పాటింపుడు. అతడు మీకు తండ్రిలాంటి వాడు.

66.యూదా మక్కబీయుడు బాల్యము నుండియు బలశాలి. ఇతడు మీకు నాయకుడై శత్రువులతో యుద్ధము చేయును.

67. మీరు ధర్మశాస్త్రమును పాటించువారినందరిని మీ పక్షమున చేర్చుకొనుడు. మన ప్రజలకు అపకారము చేసినందులకుగాను శత్రువులను శిక్షింపుడు.

68. అన్యజాతులకు తగిన శాస్తిచేయుడు. ఎల్లపుడు ధర్మశాస్త్రమును జాగ్రత్తగా పాటింపుడు.”

69. ఈ మాటలను చెప్పిన పిదప మత్తతీయ కుమారులను దీవించి ప్రాణములు విడచెను.

70. అతనిని మోయిదెనులోని తమ కుటుంబ సమాధిలో పాతిపెట్టిరి. యిస్రాయేలీయులు అతని మృతికి మిగుల శోకించిరి. ఈ సంఘటనము గ్రీకు శకము 146వ యేట (క్రీ.పూ 166) జరిగెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services