ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1 Maccabees chapter 15 in Telugu మక్కబీయులు మొదటి గ్రంధము 15వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. గ్రీకు ద్వీపములనుండి దెమేత్రియసు కుమారుడు ఏడవ అంటియోకసు ప్రధానయాజకుడును, నాయకుడునగు సీమోనునకును, యూదజాతి కంతటికిని ఈ క్రింది లేఖ పంపెను:

2. “ప్రధానయాజకుడును, నాయకుడునగు సీమోనునకును, యూదజాతికిని శుభము పలికి అంటియోకసు వ్రాయునది.

3. కొందరు దుర్మార్గులు మా పూర్వుల రాజ్య మును అపహరించిరని మీరెరుగుదురుగదా! నేను మా రాజ్యమును జయించి దానిని పూర్వపు ఔన్నత్య మునకు కొనిరాగోరెదను. నేను చాలమంది సైనికులకును ప్రోగుజేసికొంటిని, నావలను గూడ సిద్ధము చేయించుకొంటిని.

4. ఇక వెంటనే యుద్ధమును ప్రారంభించి మా దేశమును మా నగరములను పాడు చేసిన దుండగులతో పోరాడెదను.

5. మా పూర్వులు మీకు దయచేసిన పన్నుల రాయితీలను, ఇతర రాయితీలను నేనును ధ్రువపరతును.

6. మీకవసరమైన నాణెములను మీరే ముద్రించుకొని మీ దేశమున చెలామణి చేసికోవచ్చును.

7. మీరు యెరూషలేము నగరమునకును, దేవాలయమునకును పన్నులు కట్టనక్కరలేదు, మీరు తయారుచేసిన ఆయుధములు, మీరు స్వయముగా కట్టించి ఉపయోగించుకొనుచున్న కోటలును మీవేయగును.

8. మీరు రాజు కోశాగారమునకు ఇంతకు పూర్వము బాకీపడిన సొమ్మును, ఇక మీదట బాకీపడు సొమ్మునుగూడ ఎప్పటికిని చెల్లింపనక్కర లేదు.

9. నేను నా రాజ్యమును జయింపగనే నిన్నును, మీ జాతిని, మీ దేవాలయమును ఘనముగా సన్మానింతును. అప్పుడు లోకమంతయు మీ వైభవమును గుర్తించును."

10. గ్రీ. శ. నూటడెబ్బదినాలుగవ యేట (అనగా క్రీ. పూ. 138లో) అంతియోకసు తన పూర్వులేలిన రాజ్యము మీదికి దాడిచేసెను. సైనికులందరును అతని పక్షము అవలంబించిరి. కొద్దిమంది మాత్రమే త్రూఫోను పక్షమున ఉండిపోయిరి.

11. అంతియోకసు త్రూఫోనును వెన్నాడగా అతడు పారిపోయి సముద్రతీరమున నున్న డోరు పట్టణమున తలదాచుకొనెను.

12. సైనికులందరు తనను విడనాడిరి కనుక తనకు కీడు మూడినదని త్రూఫోను గుర్తించెను.

13. అంతియోకసు లక్షయిరువదివేల కాలిబంటులతోను, ఎనిమిది వేల రౌతులతోను డోరు నగరమును ముట్టడించెను.

14. ఒకవైపున అతని సైన్యము, మరియొకవైపున సముద్రముననున్న అతని ఓడలు, పట్టణమును చుట్టుముట్టెను. నగరములోనికిగాని నగరమునుండి వెలుపలికిగాని రాకపోకలు ఆగిపోయెను.

15. ఇంతలో నువేనియసు అతని బృందము వారు రోమునుండి తిరిగివచ్చిరి. వారు, రోమీయులు, ఆయా రాజులకు, రాజ్యములకు వ్రాసిన లేఖనుగూడ కొనివచ్చిరి. అందిట్లున్నది:

16. “రోము ప్రజల నాయకుడైన లూసియూసు ప్టోలమీ రాజునకు శుభములు పలికి వ్రాయునది.

17. మాకు యూదయా దేశముతోగల సఖ్య సంబంధములను నూత్నీకరించు కొనుటకుగాను, ఆ దేశపు రాయబారులు మాచెంతకు వచ్చిరి. ఆ దేశీయులు మాకు స్నేహితులు, మా పక్షమువారు. ప్రధాన యాజకుడగు సీమోను యూదప్రజలు ఆ దూతలను మాచెంతకు పంపిరి.

18. వారు వేయి తులముల బరువుగల బంగారు డాలును కొనివచ్చిరి.

19. కనుక యూదులకుగాని, వారి దేశమునకుగాని, నగరములకుగాని, కీడు చేయవలదని మేము వివిధ రాజులకును, రాజ్యములకును వ్రాయుచున్నాము. మీరు యూదులమీదికి దండెత్తరాదు. వారిమీదికి దండెత్తువారితో చేతులు కలుపరాదు.

20. మేము యూదులు పంపిన డాలును స్వీకరించి వారికి భద్రత కల్పించుట మా కోరిక.

21. కనుక యూదయా దేశము నుండి దుర్మార్గులెవరైన పారి వచ్చి మీ మరుగు చొచ్చినచో, మీరు వారిని ప్రధానయాజకుడగు సీమోనునకు ఒప్పగింపవలయును. అతడు వారిని వారి నియమముల ప్రకారము శిక్షించును."

22-23. లూసియూసు ఆ జాబు నకళ్ళను దెమేత్రియసు రాజునకు, అట్టలసునకును, అరియారతెసుకును, అర్సాకెనుకును పంపెను. మరియు సంప్సామెసు, స్పార్టా, డెలోసు, ముండోసు, సిక్యోను, కారియా, సామోసు, పంఫూలియా, లూసియా, హాలికార్నస్ససు, రోడ్సు, ఫసేలిసు, కోసు, సీదె, అరదుసు, గొర్టున, స్నీదు, సైప్రసు, సిరినె అను రాజ్యములకును నకళ్ళను పంపెను.

24. ప్రధానయాజకుడు సీమోనునకు ఆ లేఖ ప్రతి ఒకటి చేరెను.

25. అంతియోకసు రెండవసారి డోరు నగరమును ముట్టడించి దానిని అవిరామముగా పీడింప దొడగెను. అతడు ప్రాకారములను కూల్చు మంచెలను కట్టించెను. త్రూఫోను అతని సైనికులను బయటికి రానీయలేదు, లోపలవుండనీయలేదు.

26. అంతియోకసునకు సహాయము చేయుటకు సీమోను, శూరులైన సైనికులను రెండువేలమందిని పంపెను. ఇంకను వెండి బంగారములు ఆయుధములుకూడ పంపెను కాని,

27. అంటియోకసు ఆ సైన్యమునుగాని ఆ వస్తువులనుగాని, అంగీకరింపలేదు. తాను సీమోనుతో కుదుర్చుకొనిన సంధి షరతులన్నిటిని ఉపసంహరించుకొని అతనికి విరోధియయ్యెను.

28. అతడు తన స్నేహితుడైన అతెనోబియసును సీమోనువద్దకు పంపించి ఇట్లు చెప్పించెను: “నీవు నా రాజ్యమునకు చెందిన యొప్పా, గేసేరు, యెరూషలేము దుర్గములను ఆక్రమించుకొంటివి.

29. నీవు ఆ మండలములను పాడుచేసి నా దేశమునకు అపారమైన నష్టము తెచ్చి పెట్టితివి. పైగా నీవు నా రాజ్యమున చాల స్థలములు ఆక్రమించుకొంటివి.

30. ఇపుడు నీవు ఆక్రమించుకొనిన ఈ నగరములు నావశము చేయుము. యూదయా దేశమునకు వెలుపలనున్న స్థలముల నుండి నీవు వసూలు చేసిన కప్పములుగూడ నాకు చెల్లింపుము.

31. లేదేని ఈ నగరములకు బదులుగా నాకు ఐదువందల ఎత్తుల వెండిని చెల్లింపుము. ఇంకను నీవు నా రాజ్యమునకు కలిగించిన నష్టమును తీర్చుటకుగాను, నాకు ముట్టవలసిన కప్పములకుగాను అదనముగ ఐదువందల ఎత్తుల వెండినిగూడ చెల్లింపుము. లేని ఎడల మేము నీ మీదికి యుద్ధమునకు వత్తుము.”

32. అతెనోబియసు యెరూషలేమునకు వచ్చి సీమోను వైభవమును కన్నులార చూచెను. అతని భోజనశాలలోని వెండి బంగారు పాత్రలను పరికించెను. అతని సిరిసంపదలను చూచెను. దానితో అతనికి నోట మాట రాలేదు. అతడు రాజు చెప్పుమన్న మాటలను సీమోనుతో చెప్పెను.

33-34. కాని సీమోను అతనికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను: “మేము ఇతర దేశములలోని ప్రదేశములనుగాని, ఇతర జాతులకు చెందిన స్థలములనుగాని ఆక్రమించుకోలేదు. మా పూర్వులకు చెందిన ప్రదేశములను, మా శత్రువులు కొంతకాలము పాటు అన్యాయముగా తమ స్వాధీనములో నుంచుకొనిరి. ఇపుడు అనుకూలమైన పరిస్థితి రాగా మేము ఆ ప్రదేశములను మరల స్వాధీనము చేసికొంటిమి.

35. యెప్పా, గెసేరు నగరముల ప్రజలు మాకు మిగుల కీడుచేసిరి. అయినను వానికి బదులుగా మేము మీకు వంద ఎత్తుల వెండిని చెల్లింతుము.” ఈ మాటలకు అతెనోబియసు ఏమియు జవాబు చెప్పలేదు.

36. అతడు కోపముతో రాజునొద్దకు వెళ్ళి సీమోను పలుకులను అతనికి విని పించెను. సీమోను వైభవమును తాను కన్నులార చూచిన ఇతరాంశములను రాజునకు తెలియపరచెను. ఆ సంగతి ఎల్ల విని రాజు ఉగ్రుడయ్యెను.

37. ఇంతలో త్రూఫోను ఓడనెక్కి ఒర్తోసియా నగరమునకు పారిపోయెను.

38. రాజుసెండెబేయసును సముద్రతీర ప్రాంతమునకు సేనాధిపతిగా నియమించెను. రౌతులను, పదాతులను అతని వెంటపంపెను.

39. రాజు అతనిని యూదయా మీద దాడిచేయుమని చెప్పెను. కేద్రోను నగరమును పునర్నిర్మాణము చేసి, ప్రాకారములను నిర్మించి అచటినుండి యూదయాను ముట్టడింపవలెనని ఆజ్ఞాపించెను. అంటియోకసు మాత్రము త్రూఫోను పట్టుకొనుటకు పోయెను.

40. సెండెబేయసు యామ్నియాకు వచ్చి యూదులను బాధింపదొడగెను. ప్రజలను బంధించి, వధింప మొదలుపెట్టెను.

41. అతడు రాజు చెప్పినట్లే కేద్రోను నగరమును పునర్నిర్మాణము చేయించి, అచట తన రౌతులను, పదాతులను విడిదిచేయించెను. వారు యూదుల మీదబడి వారిని బంధించి, వారి మార్గములను నిరోధింపమొదలిడిరి.