1. దెమేత్రియసు రాజు గ్రీకుశకము నూటడెబ్బది రెండవ యేట (అనగా క్రీ.పూ. 140లో) సైన్యములను ప్రోగుజేసికొని మేదియాకు వెళ్ళెను. అక్కడ ఇంకా ఎక్కువ సైన్యమును చేకూర్చుకొని త్రూఫోనుతో పోరాడవలెనని అతడి సంకల్పము.
2. కాని మేదియా పారశీకముల ప్రభువు అర్సాకెను తన దేశమున దెమేత్రియసు కాలు పెట్టెనని విని అతడిని ప్రాణములతో పట్టుకొని రమ్మని తన సైన్యాధిపతిని పంపెను.
3. ఆ సేనాపతి దెమేత్రియసును ఓడించి బందీని చేసి అర్సాకెను వద్దకు కొనివచ్చెను. ఆ రాజు అతడిని చెరలో పెట్టించెను.
4. సీమోను బ్రతికియున్నంత కాలము యూదయా దేశమున శాంతి నెలకొనెను. సీమోను తన జీవితాంతము ప్రజల మేలెంచి పరిపాలించెను. అతని ఆధిపత్యమును జనులు మిగుల మెచ్చుకొనిరి.
5. అతడి అనేక వీరకృత్యములకు జీవిత కాలమంతయు అతడిని ఆదరించిరి. ప్రతీకగా యొప్పాను జయించి ఓడరేవుగా మార్చి, ఆవలి ద్వీపములకు రాకపోకలు ఏర్పరచెను.
6. అతడు తన రాజ్యమునంతటిని వశము చేసికొని, తన దేశపు పొలిమేరలను విస్తరింపజేసెను.
7. బందీలైన తన వారిని అనేకులను మాతృభూమికి కొనివచ్చెను. గేసేరు, బేత్పూరులను యెరూషలేము కోటను జయించెను. వాని నెల్లను శుద్ధిచేయింపగా అతనిని ఎదిరించు వారు లేరైరి.
8. యూదులు నిశ్చింతగా సేద్యము చేసికొనిరి. వారి పొలములలో పంటపండెను, చెట్లు కాయలు కాసెను.
9. పెద్దలు రచ్చబండ వద్ద కూర్చుండి, తమకు ప్రాప్తించిన లాభములను గూర్చి ముచ్చటించుకొనిరి. యువకులు సైనికుల దుస్తులు, ఆయుధములు ధరించిరి.
10. సీమోను నగరములకు భోజనపదార్థములు, రక్షణాయుధములు సమృద్ధిగా సరఫరా చేసెను. అతని పేరు ఎల్లెడల మారుమ్రోగెను.
11. అతడు దేశమున శాంతి నెలకొల్పగా యిస్రాయేలీయుల ఆనందము మిన్నుముట్టెను.
12. ప్రతివాడును తన ద్రాక్షతోటలో, అంజూరపు తోటలో భయమనునది లేకయే సంతోషముగా కాలము వెళ్ళబుచ్చెను.
13. ఆ రోజులలో శత్రురాజులెల్ల ఓడిపోయిరి. కనుక యూదులతో పోరాడువారే లేరైరి.
14. అతడు పేదసాదలనెల్ల ఆదుకొనెను. ధర్మశాస్త్రమును శ్రద్ధగా పాటించెను. దాని నియమములను అనుసరింపని వారినెల్ల మట్టుపెట్టెను.
15. దేవాలయమును వైభవోపేతముగా అలంకరించి, పూజాసమయమున వాడు పాత్రములు అనేకములు సరఫరా చేసెను.
16. రోము, స్పార్టా నగరముల పౌరులు యోనాతాను చనిపోయెనని విని మిగుల చింతించిరి.
17. వారు యోనాతానునకు బదులుగా సీమోను ప్రధానయాజకుడయ్యెనని వినిరి. యూదయా దేశ మును దాని నగరములు అతని అధీనములోనున్నవని తెలిసికొనిరి.
18. వారు సీమోను సోదరులైన యూదా యోనాతానులతో పూర్వము తాము చేసికొనిన సంధి షరతులను కొనసాగించుటకు అంగీకరించుచున్నామని ఇత్తడిపలక మీద వ్రాసి ఆ పలకను సీమోను వద్దకు పంపిరి.
19. ఆ లేఖను యెరూషలేము పౌరుల యెదుట చదివి వినిపించిరి.
20. స్పార్టా ప్రజలు వ్రాసిన లేఖ యిది: ఆ “యూదుల ప్రధానయాజకుడగు సీమోనుకును, వారి యాజకులకును, ప్రజలకును శుభములు పలికి స్పార్టా ప్రజలు, పాలకులు వ్రాయునది.
21. మీరు మా చెంతకు పంపిన దూతలు మీ కీర్తి ప్రతిష్ఠలగూర్చి చెప్పిరి. వారిని చూచి మేము ఆనందభరితులమైతిమి.
22. వారి రాకను గూర్చి మేము మా దస్తావేజులలో ఇట్లు వ్రాయించితిమి. అంటియోకసు కుమారుడు నుమేనియసు, యాసోను కుమారుడు ఆంటిపాతెరును యూదుల దూతలుగా వచ్చి పూర్వము వారు మనతో చేసికొనిన సంధి షరతులను నూత్నీకరించుకొనిరి.
23. మా శాసనసభ సభ్యులు ఈ దూతలను గౌరవాదరములతో ఆహ్వానించిరి. వారు కొనివచ్చిన సందేశమును మా దస్తావేజులలో లిఖించి భద్రపరచితిమి. ప్రధానయాజకుడైన సీమోనునకు ఒక ప్రతిని పంపుటకు ఈ లేఖ నకలు కూడ వ్రాయించితిమి.”
24. అటు తరువాత సీమోను నుమేనియసును రోమునకు కూడ పంపెను. అతడు వేయి తులముల బరువుగల బంగారు డాలును బహుమతిగా కొనిపోయి యూదులు రోమీయులతో చేసికొనిన సంధి షరతులను నూత్నీకరించుకొని వచ్చెను.
25. పై సంగతులెల్ల విని యిస్రాయేలు ప్రజలు “మనము సీమోనును, అతని కుమారులను ఉచిత రీతిని సత్కరించుటెట్లు?
26. అతడు అతని సోదరులు, అతని తండ్రి కుటుంబమంతయు మన ప్రజలను కాపాడుటకు ధైర్యముగా ముందునకు వచ్చిరి. వారు శత్రువులతో పోరాడి మనకు స్వాతంత్ర్యము సంపాదించి పెట్టిరి” అని అనుకొనిరి.
27-28. వారు ఈ క్రింది శాసనమును రాగిరేకుల మీద వ్రాయించి వానిని సియోను కొండపైనున్న స్తంభముల మీద పెట్టించిరి. ఆ శాసనమిది: గ్రీకుశకము నూటడెబ్బది రెండవ యేడు (అనగా క్రీ.పూ. 140లో) ఏలూలు అను పేరుగల నెల పదునెనిమిదవ దినమున సీమోను ప్రధానయాజకుడుగా పనిచేయుచున్న కాలమున మూడవ యేడు యాజకులు, ప్రజలు, అధికారులు, పెద్దలు సమావేశమైన అసారామెల్ అనబడు మహాసభలో ఈ క్రింది విషయములు తెలియజేయబడినవి:
29. “మన దేశమున యుద్ధములు పెచ్చు పెరిగి నప్పుడు యోవారీబు గోత్రమునకు చెందిన యాజకుడగు మత్తతీయ కుమారుడు సీమోను, అతని సోదరులు ప్రాణములకు కూడ తెగించి శత్రువులతో పోరాడి మన దేశమును, ధర్మశాస్త్రమును కాపాడిరి. వారు మన జాతికెనలేని గౌరవమును చేకూర్చి పెట్టిరి.
30. యోనాతాను మన ప్రజలను ఏకము చేసి మనకు ప్రధానయాజకుడైన తరువాత కన్నుమూసెను.
31. యూదుల శత్రువులు వారి దేశము మీద దండెత్తి వారి దేవాలయమును నాశనము చేయబూనిరి.
32. అపుడు సీమోను నాయకుడై తన దేశము కొరకు పోరాడెను. అతడు తన దేశమును రక్షించుటకు పోరాడు సైనికులకు ఆయుధములు సరఫరా చేసెను. జీతము చెల్లించెను. ఇందుకు తన సొంత సొమ్మునే వెచ్చించెను.
33. అతడు యూదయాలోని నగరములను సురక్షితము చేసెను. యూదయా సరిహద్దులో నున్న బేత్సూరు నగరమున పూర్వము శత్రువులు ఆయుధములను పదిలపరచెడివారు. సీమోను ఆ దుర్గమును కూడ సురక్షితముచేసి అచట సైనికదళములను కాపు పెట్టెను.
34. అతడు ఓడరేవగు యొప్పాను సురక్షితము చేసెను. అసోటసు చేరువలోనున్న గేసేరునకు కూడ ప్రాకారములు నిర్మించెను. అంతకు పూర్వము ఆ నగరమున శత్రు సైనికులు వసించెడివారు. మరియు అతడు ఆ తావున యూదులకు నివాసము కల్పించి వారికి కావలసినవన్నియు సరఫరా చేయించెను.
35. సీమోను దేశభక్తిని, తన జాతికి కీర్తి ప్రతిష్ఠలను తీసికొని వచ్చుటకుగాను అతడు చేసిన కృషిని చూచి ప్రజలు అతనిని నాయకునిగను, ప్రధానయాజకునిగను నియమించిరి. అతడు చేసిన కార్యములను, ధర్మమును నిలబెట్టిన తీరును, తన జాతికి గౌరవమును చేకూర్చుటలో అతడు చూపిన ఆసక్తిని చూచి ప్రజలతనికి పైపదవులు ఒప్పజెప్పిరి.
36. సీమోను నాయకత్వమున యూదులు అన్యజాతి వారిని తమ దేశమునుండి పారద్రోలిరి. దేవాలయమునకు ఉత్తరభాగమున ఉన్న దుర్గమునుండి శత్రుసైన్యమును వెళ్ళగొట్టిరి. వారు ఆ దుర్గమునుండి వెడలి వచ్చి పవిత్రమైన దేవాలయమును అమంగళము చేసెడివారు.
37. అతడు దుర్గమున యూదులకు నివాసము కల్పించి దానిని సురక్షితము చేయగా అది యెరూషలేము నగరమును, దేశమును గూడ కాపాడగలిగెను. అతడు యెరూషలేము ప్రాకారముల ఎత్తు కూడ పెంచెను.
38. ఈ సేవను మెచ్చుకొని దెమేత్రియసు రాజు సీమోను యాజకత్వమును సుస్థిరము చేసెను.
39. అతనికి రాజమిత్రుడన్న బిరుదమును గూడ ఇచ్చెను. ఇంకనతనిని మిగుల సత్కరించెను.
40. రోమీయులు యూదులను తమ మిత్రులనుగాను, తమ పక్షమువారిగాను, తమ సోదరులుగాను గణించిరి. వారు సీమోను పంపిన రాయబారులను గౌరవాదరములతో ఆహ్వానించిరి. కనుకనే దెమేత్రియసు కూడ సీమోనును సన్మానించెను.
41. నమ్మదగిన ప్రవక్త ఒకడు పొడచూపినవరకు సీమోను అతని కుమారులు తమకు ప్రధానయాజకులు గాను, నాయకులుగాను కొనసాగవలెనని యూద ప్రజలు, వారి యాజకులు నిర్ణయించిరి.
42. సీమోను దేశాధిపతిగను, సైన్యాధిపతిగను, దేవాలయాధిపతిగను పనిచేయును. అధికారులను నియమించును. అతడు సైన్యము వాడు ఆయుధములు సరఫరా చేయును. కోట సంరక్షకుడుగా నుండును. దేశములోని ప్రజోపయోగకరమైన పనులన్నిటిని పర్యవేక్షించును.
43. అందరు అతనిని విధేయించవలెను. ప్రభుత్వపు దస్తావేజులన్నియు అతని పేరు మీదుగా లిఖింపబడును. అతడు రాజవస్త్రములను, బంగారు భుజకీర్తిని ధరింపవచ్చును.
44. ప్రజలు, యాజకులు ఈ నియమములనెల్ల అంగీకరింపవలెను. ఎవరును సీమోను చేసిన నియమములు మీరరాదు. అతని అనుమతి లేనిదే ఎవరును ఎచటను ఎట్టిసభను జరుపరాదు. ఎవరును రాజవస్త్రములను, బంగారు భుజకీర్తిని ధరింపరాదు.
45. ఈ నియమములను పాటింపని వారు శిక్షార్హులగుదురు.”
46. సీమోను ఈ నియమములను అమలు జరిపింపవచ్చునని ప్రజలెల్ల అంగీకరించిరి.
47. సీమోను ప్రధాననాయకుడుగను, సైన్యాధిపతిగను, ప్రజలకును, యాజకులకును అధిపతిగను ఉండుటకు అంగీకరించెను.
48. ప్రజలు ఈ శాసనమును ఇత్తడి రేకులపై వ్రాయించి దానిని దేవాలయ పరిసరములలో ప్రముఖ స్థానమున పెట్టింపవలెనని నిశ్చయించిరి.
49. ఆ శాసనమునకు నకలు వ్రాయించి దేవాలయ కోశాగారమున ఉంచినచో సీమోను అతని కుమారులు అవసరము వచ్చినపుడు దానిని వాడుకోవచ్చునని భావించిరి.