ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1 Maccabees chapter 10 in Telugu మక్కబీయులు మొదటి గ్రంధము 10వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. గ్రీకుశకము నూట అరువదియవ యేట నాలుగవ అంతియోకసు కుమారుడైన అలెగ్జాండరు ఎపిఫానె ప్టోలమాయిసును చేరుకొని ఆ నగరమును పట్టుకొనెను. ఆ పట్టణ పౌరులు అతనిని ఆహ్వానింపగా అతడచట రాజయ్యెను.

2. ఆ సంగతిని విని దెమేత్రియసు పెద్ద సైన్యముతో పోయి అలెగ్జాండరును ఎదిరించెను.

3. ఆ సమయముననే దేమెత్రియసు యోనాతానుకు స్నేహపూర్వకముగా జాబు వ్రాసెను. అది పొగడ్తలతో నిండియుండెను.

4. అలెగ్జాండరు యోనాతానుతో సఖ్య సంబంధములు కుదుర్చుకొనకముందే దెమేత్రియసు తాను యోనాతానుతో సంధిచేసికొనుట మేలని తలంచెను.

5. ఆ రాజు తాను యోనాతానునకు, అతడి సోదరులకును, అతడి జాతికి చేసిన అపకారములను ఆ వీరుడు మరచిపోడని తలంచెను.

6. కనుక దెమేత్రియసు యోనాతానుని తన పక్షమున కలుపుకొనెను. సైన్యమును ప్రోగుజేసికొనుటకును, ఆ సేనకు ఆయుధములను సరఫరా చేయుటకును అతనికి అధికారములను ఇచ్చెను. యెరూషలేము దుర్గమున బంధింప బడియున్న బంధీలను విడుదల చేయించి యోనాతాను వశము గావించెను.

7. యోనాతాను రాజు లేఖను యెరూషలేమునకు కొనిపోయి ప్రజలకును, దుర్గముననున్న వారికిని చదివి వినిపించెను.

8. సైన్యమును ప్రోగుజేసికొను టకు రాజు యోనాతానునకు అధికారమిచ్చెనని విని దుర్గములోని వారెల్లరును భయభ్రాంతులైరి.

9. వారు కోటలో బంధింవబడియున్న బందీలను యోనాతానుకు అప్పగింపగా అతడు వారిని తమ తల్లిదండ్రులకు ఒప్పజెప్పెను.

10. యోనాతాను యెరూషలేముననే మకాము పెట్టి నగరమును పునర్నిర్మాణము చేసి సురక్షితము చేయమొదలిడెను.

11. అతడు నగరప్రాకారమునకును, సియోనుకొండ చుట్టును కట్టు గోడకు చతుర్భుజములుగల రాళ్ళు వినియోగింపుడనిపనివారిని ఆజ్ఞాపించగా వారు అటులనే చేసిరి.

12. బఖిడసు నిర్మించిన దుర్గమునుండి అన్యజాతివారు వెడలిపోయిరి.

13. వారు ఒకరి తరువాత ఒకరు దుర్గము వీడి స్వీయదేశమునకు వెళ్ళి పోయిరి.

14. మోషే ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను విడనాడిన యూదులు కొందరు మాత్రము బేత్సూరు దుర్గమునుండి కదలరైరి. ఆ తావు వారికి చిట్టచివరి ఆశ్రయమయ్యెను.

15.అలెగ్జాండరు రాజు దెమేత్రియసు యోనాతాను నకు చేసిన ప్రమాణముల గూర్చి వినెను. యోనాతాను అతడి సోదరులు సాధించిన విజయములను గూర్చియు, వారి వీర కృత్యములను గూర్చియు, వారు పడిన శ్రమలను గూర్చి తెలిసికొనెను.

16. ఆ రాజు యోనాతాను వంటివాడు ఇంకొకడు దొరకడని నిశ్చయించుకొని అతడిని తన పక్షమున చేర్చుకొని తనకు మిత్రుని చేసికోగోరెను.

17. కనుక యోనాతానుకు ఈ క్రింది రీతిగా కమ్మవ్రాసెను:

18. “అలెగ్జాండరు రాజు తన సోదరుడు యోనాతానునకు వ్రాయునది. నీకు శుభములు కలుగుగాక!

19. నీవు పరాక్రమవంతుడవనియు రాజునకు మిత్రుడవు కాదగినవాడవనియు వింటిని.

20. నేను నేటినుండి నిన్ను మీ ప్రజలకు ప్రధాన యాజకునిగా నియమించుచున్నాను. మరియు రాజమిత్రుడన్న బిరుదముతో నిన్ను సత్కరించుచున్నాను. నీవు నా పక్షమున చేరి నాకు సహాయము చేయుచుండుము.” ఆ రాజతడికి రాజవస్త్రమును, బంగారు కిరీటమును గూడ పంపెను.

21. యోనాతాను నూట అరువదియవ యేట ఏడవనెలలో గుడారముల పండుగనాడు ప్రధాన యాజకుని ఉడుపులు తాల్చెను. అతడు సైన్యమును ప్రోగుజేసికొని పెక్కు ఆయుధములు చేకూర్చుకొనెను.

22. ఈ సంగతులెల్ల తెలిసికొని దెమేత్రియసు రాజు బాధపడెను.

23. అతడు "నా చేతగానితనము వలన అలెగ్జాండరును యూదులతో సఖ్యము చేసి కోనిచ్చితినిగదా! ఇప్పుడు అతడి బలము పెరిగి పోయినది.

24. నేను కూడ యూదులకొక కమ్మవ్రాసి వారికి ఉన్నత పదవులను బహుమతులను ప్రసాదింతునని చెప్పుదును. అప్పుడు వారు నాకు సహాయము చేయుదురు” అనుకొనెను. కనుక అతడిట్లు వ్రాసెను:

25. “దెమేత్రియసు రాజు యూద జాతికి వ్రాయునది. మీకు శుభములు కలుగునుగాక!

26. మీరు నాతో చేసికొనిన సంధికి కట్టువడి నాకు స్నేహితులైయుంటిరనియు, మా శత్రువుల పక్షమును అవలంభింపకుంటిరనియు విని నేను మిగుల సంతసించితిని.

27. మీరు నా స్నేహితులుగా కొనసాగుదురేని మిమ్ము ఉచితరీతిని సత్కరింతును.

28. నేను మీరు కట్టవలసిన పన్నులను చాలవరకు తొలగించి మీకు పెక్కు సదుపాయములను కలిగింతును.

29. నేటినుండి యూదులెవరును మామూలు కప్పములు, ఉప్పు పన్నులు, ప్రత్యేకమైన పన్నులను చెల్లింపనక్కరలేదు.

30. నేటినుండి మీరు మీ పొలమున పండిన పంటలో మూడవవంతు, మీ తోటలలో పండిన ఫలములలో అర్ధభాగము నాకు ఇచ్చుకోనక్కరలేదు. నేటినుండి యూదయా, సమరియా, గలిలియా సీమలనుండి, యూదయాలో చేర్పబడిన మూడు మండలములు పై కప్పములు చెల్లింపనక్కరలేదు.

31. యెరూషలేము దాని పరిసర భూములు పరిశుద్ద నగరములుగా గుర్తింపబడును. ఆ నగరవాసులు ఎట్టి కప్పములు కట్టనక్కరలేదు.

32. నేను యెరూషలేము దుర్గముపై నా ఆధిపత్యమును వదలుకొందును. ఇక మీదట అది ప్రధాన యాజకుని అధీనములో ఉండును. అతడు తన ఇష్టము వచ్చిన సైనిక దళమును అచట కాపు పెట్టవచ్చును.

33. నా రాజ్యమున ఎచటైన యూదులు బంధీలుగానున్నచో వారిని వెంటనే ఉచితముగనే విడిపింతును. వారు తలపన్నులుగాని, పశువుల పన్నులుగాని చెల్లింపనక్కరలేదు.

34. నా రాజ్యముననున్న యూదులనుండి పండుగ దినములలోను, విశ్రాంతి దినములలోను, అమావాస్య దినములలోను కప్పములు వసూలు చేయరు. ఈ ఉత్సవదినములకు ముందు మూడు నాళ్లు, తరువాత మూడునాళ్ళు కూడ పన్నులు వసూలు చేయరు.

35. ఈ దినములలో యూదులను ఎట్టి పన్నులనైన చెల్లింపమనుటకుగాని, వారిని ఎట్టి బాధలకైన గురిచేయుటకుగాని ఎవరికి హక్కులేదు.

36. యూదులు ముప్పదివేలమందివరకు మా సైన్యమున చేరవచ్చును. వారికి యితర సైనికులవలెనే జీతము బత్తెము ముట్టును.

37. ఆ సైనికులలో కొందరు మా ప్రధానదుర్గములలో ఉండవచ్చును. కొందరికి మా రాజ్యమున పెద్ద పదవులు కూడ ఇత్తుము. పై యూద సైనికులకు వారి జాతివారే నాయకులు, అధికారులు కావచ్చును. యూదయా వాసుల వలెనే వారు తమ ప్రత్యేక ఆచారములు, నియమములు పాటింపవచ్చును.

38. సమరియా దేశము నుండి యూదియాలో చేర్చబడిన మూడు మండలములు పూర్తిగా ఆ దేశమునకే చెందియుండును. ప్రధాన యాజకుడే వానిమీద సర్వాధికారిగా నుండును.

39. ప్టోలమాయిసు నగరమునుండియు, దాని ప్రాంత భూములనుండియు వచ్చు ఆదాయమును మీ దేవాలయమునకు ధారాదత్తము చేయుచున్నాను. ఆ సొమ్ము మీరు దేవాలయము ఖర్చులకు వాడు కోవచ్చును.

40. ఇంకను మీ దేవాలయమునకు రాజు కోశాగారమునుండి ఏటేట పదిహేనువేల వెండినాణెములు కూడ చెల్లింపబడును.

41.మా ఖర్చులు పోగా మా దేశమున మిగిలియున్న సొమ్మునుండి మేము మీ దేశమునకు చెల్లింపవలసిన నిధులను కొంత కాలమునుండి చెల్లింపమైతిమి. ఆ నిధులను వెంటనే చెల్లింతుము. ఆ సొమ్మును మీరు దేవాలయమునకు వాడుకోవచ్చును.

42. ఇంతకు పూర్వమువలె ఇక మీదట మేము మీ దేవాలయ ఆదాయమునుండి ఏటేట ఐదువేల నాణెములు పుచ్చుకొనము. ఆ సొమ్మును మీరు దేవాలయమున అర్చనచేయు యాజకులకు చెల్లింపవచ్చును.

43. రాజునకుగాని, ఇతరులకుగాని అప్పుబడియున్నవారు యెరూషలేము దేవాలయమునగాని, దాని పరిసరములలోగాని తలదాచు కొందురేని వారినెవరు బంధీలు చేయరు. వారి ఆస్తిని కూడ స్వాధీనము చేసికొనరు.

44. దేవాలయమును కట్టుటకుగాని, మరమ్మతు చేయుటకుగాని అగు ఖర్చులు రాజు కోశాగారమునుండే చెల్లింపబడును.

45. యెరూషలేము ప్రాకారములను, ఆ నగర ప్రాంతములోని దుర్గములను, ఇంకను యూదయాలోని గోడలను కట్టుటకగు ఖర్చులు కూడ రాజుకోశాగారము నుండే చెల్లింపబడును.”

46. యోనాతాను, ప్రజలు దెమేత్రియసు రాజు ప్రమాణములను విశ్వసింపనులేదు, అంగీకరింపను లేదు. అతడు వారికెన్ని అపకారములు చేసెనో, వారినెంతగా పీడించెనో వారు మరచిపోలేదు.

47. ఆ ప్రజలు అలెగ్జాండరు పక్షముననే చేరవలెనని నిర్ణయించుకొనిరి. వారితో మొదట సంధి చేసికొనినది అతడే. కనుక ఆ రాజు బ్రతికియున్నంతకాలము వారతని కోపు తీసికొనిరి.

48. అలెగ్జాండరు పెద్ద సైన్యమును ప్రోగుజేసికొని దెమేత్రియసుతో పోరాడుటకు తలపడెను.

49. ఉభయ సైన్యములు పోరుజరుపగా దెమేత్రియసు సేనలు వెన్నిచ్చి పారిపోయెను. అలెగ్జాండరు వారిని తరిమికొట్టి ఓడించెను.

50. అలెగ్జాండరు వీరావేశముతో మునిమాపువరకు పోరాడెను. ఆ దినమున దెమేత్రియసు యుద్ధమున హతుడయ్యెను.

51. అలెగ్జాండరు ఐగుప్తు రాజగు ప్టోలమీ వద్దకు దూతల నంపి ఈ క్రింది సందేశము చెప్పించెను:

52. “నేను నా రాజ్యమునకు మరలివచ్చి మా పూర్వుల సింహాసనమును ఆక్రమించుకొంటిని. ఈ దేశ ప్రభుత్వము నా వశమైనది.

53. దెమేత్రియసును అతని సైన్యమును ఓడించి ఆ రాజు రాజ్యమును హస్తగతము చేసికొంటిని.

54. ఇపుడు నేను నీతో సంధి చేసుకోగోరెదను. నీ కుమార్తెను నాకిచ్చి పెండ్లి చేయుము. అప్పుడు నేను నీకు అల్లుడనగుదును. ఆమెకు నీకు తగిన బహుమతులు అర్పించుకొందును.”

55. ప్టోలమీ రాజు అతనికిట్లు ప్రతిసందేశము పంపెను: “నీవు నీ రాజ్యమునకు తిరిగివచ్చి మీ పూర్వుల సింహాసనమును ఆక్రమించుకొనిన రోజు నిక్కముగా శుభదినము.

56. నేను నీవు చెప్పినట్లే చేయుదును. కాని మొదట నీవు నన్ను ప్టోలమాయిసు వద్ద కలిసి కొమ్ము. అచట మనమిరువురమును సఖ్యము కుదుర్చు కొందము. తరువాత నీవు నా కుమార్తెను పెండ్లి యాడవచ్చును.”

57. నూట అరువది రెండవ యేట ప్టోలమీ అతని పుత్రిక క్లియోపాత్ర ఐగుప్తు నుండి బయలుదేరి ప్టోలమాయిసు నగరమునకు వచ్చిరి.

58. అలెగ్జాండరు ప్టోలమాయిసుకు వెళ్ళి వారిని కలిసికొనెను. ఆ రాజు తన పుత్రికను అలెగ్జాండరునకిచ్చి పెండ్లి చేసెను. ఆ పెండ్లి రాజవైభవములతో జరిగెను.

59. అటు తరువాత అలెగ్జాండరు యోనాతానునకు కమ్మవ్రాసి తనను కలిసికొమ్మని చెప్పెను.

60. యోనాతాను వైభవోపేతముగా ప్టోలమాయిసు నగరమునకు వెళ్ళి ఇరువురు రాజులను సందర్శించెను. వారికి వెండి బంగారు కానుకలర్పించెను. ఆ రాజులతో వచ్చిన అధికారులకును బహుమతులు ఇచ్చెను. అందరికి యోనాతాను పట్ల సదభిప్రాయము ఏర్పడెను.

61. యిస్రాయేలీయులు దేశమునుండి వెళ్ళిన భ్రష్టులు కొందరు అతని మీద నేరములు మోపజూచిరి కాని రాజు వారి మాటలను లెక్కచేయలేదు.

62. రాజు యోనాతానునకు రాజవస్త్రములు కట్టబెట్టెను.

63. అతడిని తన సరసన కూర్చుండబెట్టుకొనెను. అతడు తన అధికారులతో యోనాతానును నగర మధ్యమునకు కొనిపోయి ప్రజలకు చూపింపుడని చెప్పెను. అతడి మీద ఎవరు ఎట్టి నేరము మోపరాదనియు, ఎవరు అతడిని ఏ విధముగ బాధింపరాదనియు ప్రజలకు ప్రకటన చేయుడని పలికెను.

64. యోనాతాను శత్రువులు అతనికి లభించిన గౌరవాదరములు చూచిరి. అధికారులు చేసిన ప్రకటనను వినిరి. అతడు ధరించిన రాజవస్త్రములను పరికించిరి. కనుక వారు కాలికి బుద్ధి చెప్పిరి.

65. ఆ విధముగా అలెగ్జాండరు యోనాతానును రాజమిత్రులలో ప్రథమ వర్గమున చేర్చుకొని అతడిని యూదయాకు సైన్యాధిపతిగను, అధిపతిగను నియమించెను.

66. అటు పిమ్మట యోనాతాను సంతసముతోను, విజయసిద్దితోను యూదయాకు తిరిగి వచ్చెను.

67. నూట అరువది ఐదవయేట మొదటి దెమేత్రియసు కుమారుడు రెండవ దెమేత్రియసు క్రేతు ద్వీపము నుండి తన పితరుల దేశమైన సిరియాకు తిరిగివచ్చెను.

68. అలెగ్జాండరు అతని రాకను గూర్చి విని భయపడి రాజధాని నగరము అంతియోకియాకు తిరిగివచ్చెను.

69. దెమేత్రియసు అపోల్లోనియసును సిరియాకు రాష్ట్రపాలకునిగా నియమించెను. అపోల్లోనియసు పెద్దసైన్యము ప్రోగుజేసికొని యామ్నియా వద్ద శిబిరము పన్నెను. అతడు ప్రధానయాజకుడగు యోనాతానునకు ఈక్రింది సందేశము పంపెను:

70. "ఓయి! నీవలన నాకు తలవంపులు వచ్చినవి. ఇపుడు నిన్ను బలపరచు వారెవరునులేరు. అయినను నీవీ కొండలలోనుండి మాపై తిరుగుబాటు సాగింపనేల?

71. నీ సైన్యము మీద నీకు నిజముగా నమ్మకము కలదేని ఇచటి మైదానమునకు వచ్చి మాతో పోరాడుము. అప్పుడు మన బలాబలములను పరీక్షించుకోవచ్చును. పలు నగరములనుండి వచ్చిన సైన్యములు నా పక్షమున నున్నవని నీవు గ్రహింతువు.

72. నేనెట్టి వాడనో నా పక్షముననున్న వారెడ్డివారో ఇతరులనడిగి తెలిసికొనుము. నీవు మాకు ఉజ్జీవి కావని వారే నీకు తెల్పుదురు. అన్యులు మీ పూర్వులను మీ నేల మీదనే రెండు మారులు ఓడించిరి.

73. మరి నీవు నా అశ్వబలమునుగాని, ఈ మైదానమున గుమిగూడిన నా మహా సైన్యమునుగాని ఎట్లు జయింతువు? ఈ మైదానమున నీవు దాగుటకు రాళ్ళు, గుట్టలు లేవు. పారిపోవుటకు మార్గములేదు.”

74. అపోల్లోనియసు పంపిన వార్త విని యోనాతాను ఉగ్రుడయ్యెను. అతడు పదివేల మంది సైనికులను తీసికొని యెరూషలేమునుండి బయలుదేరెను. అతని సోదరుడు సీమోను సైన్యముతో వచ్చి అతడిని కలిసి కొనెను.

75. వారందరును కలిసి యొప్పావద్ద శిబిరము పన్నిరి. అంతకు ముందే ఆ నగరమున అపోల్లోనియసు సైన్యము విడిది చేయుచుండుటచే పురజనులు వీరిని లోనికి రానీయరైరి.

76. కాని యోనాతాను పోరు ప్రారంభింపగా పురజనులు భయపడి నగరద్వారములు తెరచిరి. యోనాతాను యొప్పాను ఆక్రమించుకొనెను.

77. ఈ సంగతి విని అపొల్లోనియసు మూడువేల మంది అశ్వికులను పెద్ద పదాతిదళమును వెంటబెట్టుకొని అసోటసు వైపు వెడలిపోవు వానివలె నటించెను. కాని అతడు తన అశ్వబలమును నమ్ముకొని తన సైన్యములతో మైదానము ప్రక్కకు తిరిగెను.

78. యోనాతాను అసోటసు వరకును శత్రువులను వెన్నాడెను. ఆ నగరము చెంత ఉభయ సైన్యములు తారసిల్లెను.

79. వెనుక తట్టునుండి వచ్చి యిస్రాయేలు సైన్యముమీద పడుటకుగాను అపోల్లోనియసు అంతకుముందే వేయిమంది అశ్వికులను త్రోవప్రక్కన మాటుగానుంచెను.

80. శత్రు సైనికులు తనకు వెనుక తట్టున గూడ ఉన్నారని యోనాతాను తరువాత గ్రహించెను. ఆ రౌతులు యూద సైనికులను చుట్టుముట్టి ఉదయమునుండి సాయంకాలము వరకును బాణములు రువ్విరి.

81. కాని యోనాతాను ఆదేశించినట్లే అతని సైనికులు ధైర్యముగా నిలిచిరి. శత్రుపక్షమువారు మాత్రము అమ్ములు విడువజాలక అలసిపోయిరి.

82. ఆ రీతిగా అశ్వికులు అలసిపోగానే సీమోను తన దళముతో వచ్చి పదాతులను ఎదిరించి పోరాడెను. వారు వెన్నిచ్చి పారిపోయిరి.

83. అశ్వికులు కూడ చెల్లాచెదరై కాలికి బుద్ది చెప్పి అసోటసులోని బేత్-దాగోను మందిరమున చొరబడిరి. ఈ దాగోను, వారు కొలుచు దేవుడు.

84. కాని యోనాతాను నగరమును, దేవాలయమును గూడ తగులబెట్టించెను. కనుక దేవళమున తలదాచుకొన్న వారందరును అగ్గిలో బుగ్గియైరి. అతడు చుట్టు పట్లనున్న నగరములనుగూడ కాల్చివేసి వానిలోని సొత్తును దోచుకొనెను.

85. యుద్ధమునగాని, దేవళమునగాని గతించిన శత్రు సైనికులు మొత్తము ఎనిమిది వేలమంది.

86. అటుతరువాత యోనాతాను అచటి నుండి వెడలిపోయి అష్కేలోను వద్ద శిబిరము పన్నెను. ఆ నగర పౌరులు అతడిని గౌరవ మర్యాదలతో ఆహ్వానించిరి.

87. అచటినుండి యోనాతాను అతని అనుచరులు పెద్దమొత్తము దోపిడి సొమ్ముతో యెరూషలేమునకు తిరిగివచ్చిరి.

88. అలెగ్జాండరు రాజు యోనాతాను విజయమును గూర్చి విని అతనిని ఘనముగా సత్క రించెను.

89. అతడు యోనాతానునకు బంగారు భుజకీర్తిని పంపెను. “రాజ బంధువులు” అను బిరుదము పొందిన వారికేగాని అట్టి ఆభరణము లభింపదు. ఇంకను రాజు అతనికి ఏక్రోనును, దాని పరిసరప్రాంతములను ధారాదత్తము చేసెను.