ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

1 Maccabees chapter 1 in Telugu మక్కబీయులు మొదటి గ్రంధము 1వ అధ్యాయము || Telugu Catholic Bible

 1. ఆ కాలములో మాసెడోనీయుడు ఫిలిప్పు కుమారుడైన అలెగ్జాండరు కిత్తీము ప్రదేశమునుండి దండెత్తివచ్చి పారశీకులకు మాదీయులకు రాజయిన దర్యవేషును జయించి అతని రాజ్యమును స్వాధీనము చేసికొనెను. అలెగ్జాండరు అంతకుముందే గ్రీసుదేశమునకు రాజు.

2. అతడు చాల దండయాత్రలు చేసి చాల బలీయ కోటలను ముట్టడించెను. స్థానిక రాజులనోడించి మట్టుబెట్టెను.

3. నేల నాలుగు చెరగుల వరకు దాడిచేసి, ఎన్నో జాతులను కొల్లగొట్టెను. ఆ రీతిగా ప్రపంచమును జయించినందున అతనికి పొగరెక్కి తనను తాను హెచ్చించుకొనెను.

4. అతడు మహా సైన్యము ప్రోగుజేసికొని దేశములను, రాష్ట్రములను, రాజులను లొంగదీసికొనెను. ఎల్లరును అతనికి కప్పము కట్టిరి.

5. కొద్ది కాలము పిమ్మట అలెగ్జాండరు చక్రవర్తి జబ్బుపడి మంచముపట్టెను. అతడు తాను చనిపోవుట తథ్యమని గ్రహించెను.

6. కనుక తన సైన్యాధిపతులను, చిన్ననాటి నుండి తనతో పెరిగి పెద్దవార యిన రాజవంశజులను పిలిపించెను. తన సామ్రా జ్యమునంతటిని విభజించి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగము నిచ్చెను.

7. అతడు పండ్రెండేండ్లు పరిపాలించిన పిమ్మట మరణించెను.

8. అలెగ్జాండరు మరణానంత రము అతని సైన్యాధిపతులు అధికారము చేపట్టిరి.

9. వారిలో ఒక్కొక్కడు తన రాజ్యమునకు రాజయ్యెను. ఈ రాజుల సంతానము కూడ చాల ఏండ్లు పరిపా లించి లోకమును పెక్కు కడగండ్లపాలు చేసెను.

10. పై సైన్యాధిపతుల తరపున నుండియే పాపపు మొలకలవలె ఆంటియోకసు ఎపిఫానెసు జన్మించెను. అతని తండ్రి సిరియా రాజగు ఆంటియోకసు. అతడు అంతకు ముందు ఎపిఫానెసు గ్రీకుశకము 137లో సిరియాకు రాజయ్యెను. ఒక పర్యాయము రోములో బందీగా ఉండెను.

11. ఆ సమయమున యిస్రాయేలీయులలో కొందరు భ్రష్టులు పెడదారి పట్టించిరి. వారు 'మన మును అన్యజాతి ప్రజలతో ఒప్పందము చేసికొందము, వారితో కలియకపోవుటవలననే మనకు పెక్కు అనర్ధములు వాటిల్లుచున్నవి' అని వాదించిరి.

12. ఆ వాదము చాలమందికి నచ్చెను.

13. వారిలో కొందరు మితిమీరిన ఉత్సాహముతో పోయి, రాజును సందర్శింపగా అతడు అన్యజాతుల సంప్రదాయములను పాటించుటకు వారికి అనుమతినిచ్చెను.

14. కనుక వారు గ్రీకు పట్టణములలోవలె యెరూషలేమున కూడ ఒక వ్యాయామశాలను నిర్మించిరి.

15. వారు తమ సున్నతి గుర్తును మరుగుచేసికొనిరి. పవిత్ర నిబంధనను విడనాడిరి. అన్యజాతుల పిల్లలను పెండ్లి యాడిరి. అపవిత్ర కార్యములెల్ల చేసిరి.

16. ఆంటియోకసు తన పరిపాలనను సుస్థిరము చేసికొనిన పిదప ఐగుప్తును జయింపగోరెను. తాను సిరియా, ఐగుప్తులను రెండిటిని ఏలవలెనని నిశ్చయించుకొనెను.

17. కనుక అతడు ఓడలు, రథములు, గుఱ్ఱములు, ఏనుగులు గల మహాసైన్యముతో పోయి ఐగుప్తును ముట్టడించెను.

18. అతడు ఐగుప్తు రాజైన ప్టోలమీ మీద యుద్ధము ప్రకటించగా ప్టోలమీ గుండె చెదరిపారిపోయెను. అతని సైనికులు చాలమంది ప్రాణములు కోల్పోయిరి.

19. ఆంటియోకసు ఐగుప్తు నందలి కోటలుగల సురక్షిత పట్టణములను ఆక్రమించుకొని ఆ దేశమును కొల్లగొట్టెను.

20. ఆ రాజు ఐగుప్తును ఓడించిన తరువాత, 143వ యేట, మహాసైన్యముతో వచ్చి యిస్రాయేలు దేశముమీద, యెరూషలేము మీదపడెను.

21. అతడు పొగరుబోతుతనముతో యెరూషలేము దేవాలయమున ప్రవేశించి అందలి బంగారు పీఠమును, దీప స్తంభమును, దాని పరికరములను స్వాధీనము చేసి కొనెను.

22. సాన్నిధ్యపు రొట్టెలనుంచు బల్లను, దేవాలయమున వాడు పాత్రములను, ధూపకలశములను, తెరలను, కిరీటములను అపహరించెను. దేవాలయ ప్రాంగణమునందలి బంగారు అలంకరణములను ఒలుచుకొనెను.

23. ఆ రీతిగా అతడు గుడిలోని వెండి బంగారములను, విలువైన పాత్రలను, కోశాగారమున భద్రపరచిన నిధులను దోచుకొని,

24. తన దేశమునకు తరలించుకొనిపోయెను. పైపెచ్చు అతడు చాలమంది యిస్రాయేలీయులను వధించి ఆ కార్యము గూర్చి గర్వముగా చెప్పుకొనెను.

25. అపుడు దేశములోని యిస్రాయేలీయులందరు శోకముతో విలపించిరి.

26. రాజులు, నాయకులు బాధతో మూల్గిరి. యువతీయువకులు కృశించిపోయిరి. స్త్రీలు తమ సౌందర్యము కోల్పోయిరి.

27. ప్రతి వరుడును విలాపగీతము పాడెను. ప్రతి వధువును శోకించుచు తన గదిలో కూర్చుండెను.

28. ప్రజల బాధను గాంచి దేశము గడగడవణకెను. యాకోబు సంతతివారు అవమానమున మునిగి ముసుగులు వేసికొనిరి.

29. రెండేండ్లు గడచిన తరువాత రాజు ఒక అధికారిని యూదయాదేశమునకు పంపెను. అతడు గొప్ప సైన్యముతో యెరూషలేమునకు వచ్చెను.

30. ఆ అధికారి మొదట శాంతిని నెలకొల్పువానివలె మాటలాడెను. కాని అతని హృదయము కపటముతో నిండియుండెను. అతడు పౌరుల విశ్వాసము చూర గొనిన పిదప అకస్మాత్తుగా నగరము మీదబడి దానిని ధ్వంసము చేసెను. పురప్రజలను చాలమందిని వధించెను.

31. నగరమును కొల్లగొట్టి కాల్చివేసెను. పట్టణములోని భవనములను, ప్రాకారములను పడగొట్టించెను.

32. ఆ అధికారియు, అతని సైన్యములును స్త్రీలను, పిల్లలను బందీలను చేసిరి. " పశువుల మందలను తోలుకొనిపోయిరి.

33. అటు తరువాత శత్రువులు పట్టణములోని దావీదు నగరము చుట్టు గొప్ప ప్రాకారమును, బురుజులను నిర్మించిరి. ఆ తావును తమ దుర్గముగా చేసికొనిరి.

34. అటుపిమ్మట వారు భ్రష్టులు, దుర్మార్గులైన యూదులను కొందరిని తీసికొనివచ్చి వారికి ఆ దుర్గమున ఆశ్రయము కల్పించిరి.

35. ఆయుధములను, భోజనపదార్థములను కొనివచ్చి అచట భద్రపరచిరి. యెరూషలేమున కొల్ల గొట్టిన సొత్తునుకూడ అందే పదిలపరచిరి. ఈ దుర్గమువలన తరువాత నగరమునకు కలిగిన శ్రమలు అన్ని ఇన్ని కావు.

36. దానివలన పవిత్ర స్థలమునకు ముప్పువచ్చేను. అది యిస్రాయేలు ప్రజలకు నిరంతర శత్రువయ్యెను.

37. నిరపరాధులను దేవాలయము చెంతనే వధించి, దేవాలయమును అమంగళపరచిరి.

38. యెరూషలేము పౌరులు శత్రువులకు వెరచి పారిపోయిరి. నగరమున అన్యజాతివారు నివాసమేర్పరచుకొనిరి. నగరము తన సొంత జనముపట్ల మమకారము చూపజాలదయ్యెను. పౌరులు ఆ నగరమును విడచి వెళ్ళిపోయిరి.

39. దేవాలయము ఎడారివలె నిర్మానుష్యమయ్యెను. ఉత్సవములు శోకదినములు అయ్యెను. విశ్రాంతి దినములు అపహాస్యమునకు గురియయ్యెను. నగర గౌరవము మంటగలసిపోయెను.

40. దానికి పూర్వమెంత కీర్తి ఉండెడిదో ను ఇప్పుడంత అపకీర్తి వాటిల్లెను.  పూర్వపు గౌరవ ప్రతిష్ఠలు అంతరింపగా ఇపుడా నగరమునకు దీనదశ ప్రాప్తించెను.

41. ఆ పిమ్మట ఆంటియోకసు రాజు తన రాజ్యములోని జాతులెల్లను వారివారి సొంత ఆచారములను విడనాడవలెననియు, అందరును కలిసి ఏక జాతిగా జీవింపవలెననియు ఉత్తరువు జారీచేసెను.

42. అన్యజాతుల వారెల్లరును రాజు ఆజ్ఞను శిరసావహించిరి.

43. చాలమంది యిస్రాయేలీయులు కూడ రాజు మతము స్వీకరించి, విగ్రహములకు బలులను అర్పించిరి. విశ్రాంతిదినమును పాటించుట మానుకొనిరి.

44. రాజు యెరూషలేమునకును యూదయా : పట్టణములకును అధికారులను పంపి అన్యజాతుల వారి ఆచారములను పాటింపవలెనని అచటి ప్రజలకు ఆజ్ఞలు జారీ చేయించెను.

45. అతడు దేవాలయమున దహనబలులను, ధాన్య బలులను, ద్రాక్షారస అర్పణమును అర్పింపరాదని కట్టడచేసెను. ఉత్సవములను, విశ్రాంతి దినమును పాటింపరాదని శాసించెను.

46. దేవాలయమును అమంగళము చేయవలెననియు, అందు అర్చనచేయు యాజకులను అగౌరవము చేయవలెననియు చెప్పెను.

47. యూదులు అన్యజాతి దైవములకు దేవాలయములను, పీఠములను నిర్మించి పందులు మొదలైన అపవిత్ర జంతువులను బలిగా అర్పింపవలెనని కోరెను.

48. వారు తమ పిల్లలకు సున్నతి చేయింపరాదనియు, శుద్ధి నియమములను పూర్తిగా విడనాడవలెననియు శాసించెను.

49. ధర్మశాస్త్రమును పాటించుట , మానుకోవలెనని ఆజ్ఞాపించెను.

50. ఈ ఆజ్ఞలను మీరిన వారికి మరణమే శిక్షయని శాసించెను.

51. రాజు తన సామ్రాజ్యమంతటను ఈ శాసనమును ప్రకటన చేయించెను. “ఎవరైన రాజాజ్ఞను మీరినచో వారు మరణశిక్షకు గురియగుదురని” శాసించెను. దానిని అమలు పెట్టించుటకుగాను పర్యవేక్షకులను నియమించెను. అన్యజాతుల దైవములకు బలులర్పింపవలెనని యూదయాలోని పట్టణముల నెల్ల నిర్బంధము చేసెను.

52. చాలమంది యూదులు ధర్మశాస్త్రమును విడనాడిరి. రాజాధికారులకు లొంగి దుష్కార్యములు చేసిరి.

53. కాని భక్తిపరులైన యిస్రాయేలీయులు మాత్రము ఆ అధికారుల కంటబడకుండ ఎక్కడివారక్కడనే దాగుకొనిరి.

54. 145వ సంవత్సరమున, కీస్లేవు నెల పదునైదవ దినమున, ఆంటియోకసు రాజు దేవాలయములోని పీఠముమీద జుగుప్సాకరమైన విగ్రహమును నెలకొ ల్పెను. యూదయాలోని పట్టణములలో విగ్రహములకు పీఠములు నిర్మింపజేసెను.

55. అధికారులు నడివీధులలోను, ఇండ్ల ముందటను విగ్రహములకు సాంబ్రాణి పొగవేయించిరి.

56. ధర్మశాస్త్ర గ్రంథములేవైన కనిపించినచో ముక్కలుగా చీల్చి, కాల్చివేసిరి.

57. ఎవని వద్దనైన ధర్మశాస్త్ర గ్రంథము ఉన్నను, ఎవడైన ధర్మశాస్త్ర నియమములను పాటించినను అతనిని రాజాజ్ఞ ప్రకారము వధించిరి.

58. ఈ రీతిగా ఆ దుర్మార్గపు అధికారులు అధికార గర్వముతో యిస్రాయేలు నగరములలో తమకు చిక్కిన ప్రజలనెల్ల నెలల తరబడి బాధింప జొచ్చిరి. ,

59. ఆ నెల 25వ తారీఖున దేవాలయములోని దహన బలిపీఠము మీద నిర్మించిన కొత్త పీఠముపైని, పై అధికారులు బలులర్పించిరి.

60. తమ బిడ్డలకు సున్నతి చేయించిన తల్లులను రాజాజ్ఞ ప్రకారము వధించిరి.

61. ఆ బిడ్డలనుకూడ చంపి తల్లుల మెడలకు వ్రేలాడగట్టిరి. ఆ తల్లుల కుటుంబములకు చెందినవారిని, ఆ బిడ్డలకు సున్నతిచేసినవారిని మట్టు బెట్టిరి.

62. అయినను యిస్రాయేలీయులలో చాల మంది ధైర్యముతో రాజాజ్ఞను ధిక్కరించి అపవిత్ర భోజనమును ముట్టరైరి.

63. వారట్టి భోజనమునకు ఆశపడి పవిత్రమైన నిబంధనను మీరుటకంటె చచ్చుటయే మేలని భావించిరి. చాలమంది తమ ప్రాణములను కూడ అర్పించిరి.

64. ఆ కాలమున ప్రభువు కోపము యిస్రాయేలీయుల మీద దారుణముగా ప్రజ్వరిల్లెను.