ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమూవేలు రెండవ గ్రంధము 1వ అధ్యాయము || Catholic Bible in Telugu

 1. సౌలు మరణించెను. దావీదు అమాలెకీయులను తునుమాడి సిక్లాగు నగరమునకు తిరిగివచ్చి అచట రెండుదినములు గడపెను.

2. మూడవనాడు సౌలు పోరాడిన యుద్ధభూమినుండి దూత ఒకడు వచ్చెను. అతడు బట్టలు చించుకొనెను. తలపై దుమ్ముపోసికొనెను. దావీదు ఎదుటకు రాగానే దూత నేలమీదికివంగి దండము పెట్టెను.

3. “నీ వెచటనుండి వచ్చితివి?" అని దావీదు ప్రశ్నించెను. అతడు “నేను యిస్రాయేలీయుల శిబిరమునుండి వచ్చితిని. బ్రతికి బయటపడితిని” అనెను.

4. దావీదు అచటనేమి జరిగినదో చెప్పుమనెను. అతడు “మనవారు యుద్ధము నుండి పారిపోయిరి. చాలమంది కూలిరి. సౌలు, అతని కుమారుడు యోనాతాను మడిసిరి” అని చెప్పెను.

5. “సౌలు, యోనాతాను మడిసిరని నీకెట్లు తెలియును?" అని దావీదు ఆ సైనికుని అడిగెను.

6. అతడు “నేను అపుడు గిల్బోవ కొండమీద నుంటిని. సౌలు తన యీటె మీద ఆనుకొనియుండెను.

7. అంతలోనే శత్రువుల రథములు, రౌతులు అతనిని చుట్టుముట్టెను. సౌలు చుట్టును పరికించి కొండపై నున్న నన్ను చూచి కేకవేసెను. నేను 'చిత్తము ప్రభూ!' అంటిని.

8. అతడు నీవెవ్వరవని నన్నడిగెను. నేను అమాలెకీయుడనని బదులుపలికితిని.

9. అతడు 'నీవు ఇచ్చటికి వచ్చి నన్ను చంపివేయుము. నా బొందిలో ఇంకను ప్రాణమున్నదిగాని నేను మాత్రము సొమ్మసిల్లి పడిపోవుచున్నాను' అనెను.

10. అంతట నేను సౌలు వద్దకుపోయి సొమ్మసిల్లి పడిపోవువాడు ఇక బ్రతుక జాలడుగదా అనుకొని అతనిని సంహరించితిని. అటు పిమ్మట సౌలు ధరించిన కిరీటమును, హస్తకంకణము గైకొని ఏలినవారి వద్దకు తీసికొనివచ్చితిని” అనెను.

11. ఆ మాటలువిని దావీదు బట్టలుచించు కొనెను. అతని కొలువువారును అట్లే చేసిరి.

12. సౌలు, అతని తనయుడగు యోనాతాను, యావే ప్రజలగు యిస్రాయేలీయులు కత్తివాతబడిరని వారందరు సాయంకాలము వరకు వారిని గురించి శోకించి ఉపవాసముండిరి.

13. దావీదు, 'నీవెవడవు' అని ఆ సైనికుని ప్రశ్నించెను. అతడు “నేను అమాలెకీయుడను. నా తండ్రి మీ దేశమున పరదేశిగా బ్రతికెను” అని చెప్పెను.

14. దావీదు అతనితో “నీవు అదరుబెదరు లేక యావే అభిషిక్తుని మీద ఎటుల చేయి చేసి కొంటివి?” అనెను.

15. అంతట అతడు తన సైనికుని ఒకనిని పిలిచి వీనిని వధింపుమనెను. అతడు అమాలెకీయుని మీదపడి వానిని చంపెను.

16. దావీదు “నీ అపరాధమునకు నీవే బాధ్యుడవు. నేను ప్రభువు అభిషిక్తుని చంపితినన్న నీ నోటిమాటలే నీ దోషమునకు సాక్ష్యములు” అని చెప్పెను.

17-18. దావీదు సౌలు, యోనాతానులపై శోకగీతికను రచించెను. యూదా జనులకు నేర్పుటకై ఆ గీతికను 'యాషారు' అను నీతిమంతులగ్రంథమున లిఖించి ఉంచిరి.

19. “యిస్రాయేలు తేజస్సును యూదా కొండలపై మట్టుపెట్టిరి. మహావీరులు కూలిరిగదా!

20. ఈ సుద్దులు గాతున చాటవలదు. అష్కేలోను పురవీధులలో ప్రకటింపవలదు. ఈ వార్తలు విందురేని ఫిలిస్తీయ వనితలు సంతసింతురు. సున్నతిలేని వారి ఆడుపడుచులు ప్రమోదమొందుదురు.

21. ఓ గిల్బోవా కొండలారా! మీపై వాన, మంచు కురియకుండును గాక! ప్రథమఫలార్పణమునకు తగిన పైరుగల పొలము లేకపోవునుగాక! అధర్మ యుద్ధరంగమా! నీవు వీరుల డాలు వమ్ముచేసితివిగదా! తైలముచేత అభిషేకింపబడని వానిదైనట్టు సౌలు బల్లెము పారవేయబడెను.

22. రణమున ఎదుర్కొనిన వారి నెత్తురులు ఒలికింపనిదే, యోధుల క్రొవ్వు భేదింపనిదే, యోనాతాను విల్లు వెనుదిరిగెడిదా? సౌలు ఖడ్గము మొక్కవోయెడిదా?

23. సౌలు యోనాతానులు సుందరమూర్తులు, ప్రియతములు. వారు బ్రతుకునవోలె చావునగూడ విడివడనివారు. డేగకంటె వడిగలవారు. సింగముకంటె తేజుగలవారు.

24. ఓ యిస్రాయేలు కుమార్తెలారా! మీకు రక్తవర్ణపు పట్టుబట్టలు నొసగి, బంగరు సొమ్ములు పెట్టినవాడు మీ సౌలు కొరకు విలపింపుడు!

25. రణరంగమున మహావీరులు కూలిరిగదా!

26. సహోదరుడా యోనాతానూ! నీ చావువలన నేను తీరని వ్యధనొందితిని. నీవు నాకు ఇష్టసఖుడవు, నీవు నాపట్ల చూపిన ప్రేమ వనితల వలపుకంటె గాఢమైనది.

27. మహావీరులు కూలిరిగదా! వారి ఆయుధములు వమ్మైపోయెను గదా!”