ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Sirach Chapter 17 in telugu || Telugu Catholic Bible || సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 17వ అధ్యాయము

 1. ప్రభువు మట్టి నుండి నరుని చేసెను. అతడు మరల ఆ మట్టిలోనే కలిసి పోవునట్లు చేసెను.

2. ఆయన నరులకు ఆయుఃప్రమాణమును నిర్ణయించెను. కాని వారికి సృష్టి వస్తువులన్నిటి మీదను అధికారమిచ్చెను.

3. ఆ నరులను తనను పోలినవారినిగా చేసి వారికి తన శక్తి నొసగెను.

4. ప్రతి ప్రాణి నరుని చూచి భయపడునట్లు చేసెను. మృగపక్షి గణములకు అతనిని యజమానుని చేసెను

5. అతనికి పంచేంద్రియముల నొసగెను. ఆరవ ఇంద్రియముగా బుద్దిశక్తినొసగెను. ఏడవదానిగా తెలివినిచ్చెను.  దానితోనే నరుడు తాను పంచేంద్రియములద్వారా గ్రహించిన జ్ఞానమును అర్థము చేసికొనును.

6. ఆయన నరులకు నాలుకలు, కన్నులు, చెవులు దయచేసెను. ఆలోచించుటకు మనస్సునిచ్చెను.

7. తెలివితేటలు, బుద్ధివివరములు ప్రసాదించెను. మంచిచెడ్డలనెరుగు శక్తి నొసగెను.

8. తాను చేసిన సృష్టి మాహాత్మ్యమును గుర్తించుటకు వారి హృదయములలో ఒక వెలుగునిల్పెను.

9. తాను చేసిన మహాకార్యములను గాంచి నరులెల్లవేళల పొంగి పోవునట్లు చేసెను.

10. నరులు ప్రభువుచేసిన మహాకార్యముల నుగ్గడింతురు. ఆయన పవిత్ర నామమును కీర్తింతురు.

11. ఆయన వారికి జ్ఞానమునొసగెను. జీవనదాయకమైన ధర్మశాస్త్రమును దయచేసెను.

12. నరులతో శాశ్వతమైన ఒడంబడిక చేసికొని, తన తీర్పులు వారికి తెలియపరచెను.

13. నరుల నేత్రములు ఆ మహాప్రభువు వైభవమును వీక్షించెను. వారి శ్రవణములు ఆయన మహిమాన్విత వాక్కులను వినెను.

14. ఆయన నరులతో “మీరెట్టి పాపకార్యములు చేయరాదు” అని చెప్పెను. ప్రతివానికి తన పొరుగువానితో మెలగవలసిన తీరును వివరించెను.

15. నరుల చెయిదములను ప్రభువు నిత్యము గమనించుచుండును. ఆయన కన్ను గప్పజాలము.

16. నరులు బాల్యమునుండి చెడువైపునకే మొగెదరు. వారు తమ దుష్టహృదయమును మార్చుకొనరు.

17. ప్రభువు భూమిమీద జాతులన్నిటిని విభజించెను. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరాజును నియమించెను. కాని యిస్రాయేలు సంతతిని మాత్రము తన సొంత ప్రజను చేసికొనెను.

18. యిస్రాయేలు ప్రభువు తొలికుమారుడు. వారికి ఆయన శిక్షణనిచ్చును. వారిని ప్రేమించి నిరంతరము కాపాడుచుండును.

19. నరుల కార్యములను ప్రభువు నిత్యము గమనించుచునే ఉండును. వారి చెయిదములు ఆయనకు పట్టపగలువలె కన్పించును.

20. నరుల పాపములు ఆయనకు కన్పింపకుండ ఉండవు ఆయన వానిని స్పష్టముగా చూచుచుండును.

21. ప్రభువు మంచివాడు, తాను చేసిన ప్రాణులను బాగుగా ఎరిగినవాడు. - ఆయన వానిని కరుణతో చూచునేగాని చేయివిడువడు.

22. నరుడు పేదలకు చేసిన దానధర్మములను , ప్రభువు తన అంగుళీయకమునువలె విలువతో చూచును. నరుడు పేదలపట్ల చూపు కరుణను ప్రభువు తన కంటిపాపనువలె మన్ననతో చూచును

23. ప్రభువు కట్టకడన దుష్టులకు తీర్పు చెప్పి శిక్ష విధించును. వారు తమ చెయిదములకు తగిన ప్రతిఫలమనుభవింతురు.

24. కాని ఆయన పశ్చాత్తాపపడు వారిని తన చెంతకు చేర్చుకొనును. నిరాశ చెందువారికి ఆశ కల్పించును.

25. మీ పాపములను విడనాడి ప్రభువునొద్దకు రండు. ఆయన యెదుట ప్రార్థన చేసి మీ దోషములను తొలగించుకొనుడు.

26. పాపక్రియల నుండి వైదొలగి, మహోన్నతుని వద్దకు మరలిరండు. దుష్టత్వమును పూర్తిగా విడనాడుడు.

27. బ్రతికియున్నవారు మహోన్నతుని కీర్తింపనిచో మృతలోకమున ఆయననెవరు స్తుతింతురు?

28. చనిపోయి తమ ఉనికిని కోల్పోయినవారు దేవుని స్తుతింపలేరు. బ్రతికి ఆరోగ్యముగా ఉన్నవారు మాత్రమే ఆయనను కొనియాడుదురు. 

29. ఆయన మహాకృపతో తన చెంతకు వచ్చు వారినెల్ల క్షమించును.

30. నరునికి ఎల్ల సౌభాగ్యములును సిద్ధింపలేదు. అతడికి అమరత్వము లేదుకదా!

31. సూర్యునికంటెను ప్రకాశవంతమైనదేమి కలదు? కాని ఆ సూర్యునికిగూడ గ్రహణముపట్టును. నరమాత్రులైనవారు చెడుతలంపులనే తలంతురు

32. ప్రభువు ఉన్నతమైన ఆకాశములోని చుక్కలను పరీక్షించును. ఇక నరులలోయనిన వట్టి దుమ్ము, బూడిదయు మాత్రమే.